ఈ నెల 15వ తేదీ నుంచి ముఖ్యమంత్రి కేసీఆర్ జైత్రయాత్ర హుస్నాబాద్ నుంచి ప్రారంభం కానున్నది. ఈ తొలివిడత యాత్రలో తెలంగాణ వ్యాప్తంగా అన్నిమూలలూ పర్యటిస్తూ, 40 బహిరంగసభల్లో ప్రసంగిస్తారు. ఆ తర్వాత గజ్వేల్, కామారెడ్డిలలో నామినేషన్ దాఖలు చేస్తారు. నామినేషన్ తర్వాత కామారెడ్డి బహిరంగ సభలో ప్రసంగిస్తారు. దీంతో తొలి విడత జైత్రయాత్ర పూర్తవుతుంది.
దేశవ్యాప్తంగా ప్రధాని, ముఖ్యమంత్రులు, ఇతర పార్టీల నాయకులు కావచ్చు, ప్రతిపక్ష నేతలు కావచ్చు, వారు చేసే ప్రచారాలకు, కేసీఆర్ యాత్రలకు చాలా తేడా ఉన్నది. కేసీఆర్ ఎక్కడ కూడా సాధ్యం కాని వాగ్దానాలు చేయరు. అరచేతిలో వైకుంఠం చూపించి ప్రజలను మభ్యపెట్టరు. ‘చేసేదే చెప్తాం, చెప్పింది చేస్తాం’ అనేది ఆయన విధానం. కేసీఆర్కు తెలంగాణ సమాజం పట్ల, రాష్ర్టాభివృద్ధి పట్ల స్పష్టమైన అవగాహన ఉన్నది. ఆయనకంటూ ఒక విజన్ ఉన్నది. కేసీఆర్ భూమి పుత్రుడు. ఈ సమాజం ఆయనను పెంచి పెద్దచేసింది అనే కృతజ్ఞతాభావన ఆయనలో ఉన్నది. అట్టడుగు సమాజాన్ని చూసిన నాయకుడాయన. ఆయనకు ప్రజల కష్టాలు తెలుసు, కన్నీళ్లు తెలుసు, వారి అవసరాలు తెలుసు, ఆకాంక్షలు తెలుసు. పేదల జీవన విధానాలు అధ్యయనం చేస్తూ, విధాన రచనలు చేయడం కోసం ఆయన అహోరాత్రులు తపస్సు చేస్తుంటారు. ఆయన కొన్నిరోజులు తపస్సు చేశారంటే ఆ తపఃఫలం ప్రజలకు అందుతుంది. 2014, 2018 ఎన్నికల్లో చెప్పని అనేక పథకాలను ఆయన అమలుచేయడాన్ని మనం గమనించవచ్చు. వాగ్దానాలు చేస్తేనే ప్రజలకు మంచి చేయాలనే ఆలోచన ఆయనకుండదు. ఎన్నికల తర్వాత చిత్తశుద్ధితో పాలన సాగిస్తారు. ఈ పాలన వ్యవహారాల్లో భాగంగా సమాజ పరిస్థితులను, ఎప్పటికప్పుడు గమనిస్తుంటారు. ఈ క్రమంలో తన ప్రజలకు ఏం అవసరమో గుర్తించి వాటిని ప్రవేశపెడతారు. వీటిని ప్రకటించడం, ప్రవేశపెట్టడం ఎన్నికలతో సంబంధం లేని పాలనా వ్యవహారం.
పిల్లల కోసం తల్లిదండ్రులు ఏ విధంగా ఆలోచిస్తారో కేసీఆర్ తన సమాజం గురించి అదే విధంగా తపించిపోతుంటారు. హాస్టల్ పిల్లలకు సన్న బియ్యం పెట్టడమైనా, పరిమితి లేకుండా కావలసిన ఆహారం ఇవ్వడమైనా ఇవన్నీ వారిపై ప్రేమతో చేసినవే. గత ప్రభుత్వాలు పిల్లలకు కొలత ప్రకారం ఆహారం ఇచ్చేవి. ఇదెంత దారుణం? అవినీతి వల్ల వారికిచ్చే ఆహారం మరింత తగ్గిపోయేది. పిల్లలకు కడుపు నిండా తిండి పెట్టలేని సిగ్గులేని పాలకులు ప్రజల ముందు తలదించుకోవాలి. గతంలో తాము చేసిన నిర్వాకానికి వీరు పేదలకు ఏమని సమాధానం చెప్తారు? నవజాత శిశువుకు ఏమి కావాలనేది ఒక తల్లికి మాత్రమే తెలిసి ఉంటుంది. ఆ తల్లి హృదయం ఏమిటో కేసీఆర్కు మాత్రమే అర్థం అవుతుంది. గర్భిణికి ఏం కావాలనేది ఆమెకే తెలుస్తుంది. అది తెలుసుకొని అండగా నిలుస్తున్నది కేసీఆర్ ప్రభుత్వండబిడ్డలు తమ కుటుంబానికి మంచినీళ్లు తాగించడానికి మైళ్లకొద్ది నడవాల్సి వచ్చేది.
కన్నపిల్లలు ఫ్లోరోసిస్ బారినపడి వికలాంగులుగా మారిపోతే, కన్నవారికి జీవితమంతా కడుపుకోత కాదా? కలుషిత జలాలు తాగి రోగాల పాలైన పిల్లలను పట్టుకొని దవాఖానల చుట్టూ తిరిగిన తల్లిదండ్రులు అనేకమంది. కేసీఆర్ పట్టుదలగా మిషన్ భగీరథ పూర్తిచేసి ఇంటింటికీ మంచినీరు అందించి దేశానికే ఆదర్శంగా నిలిచారు. రైతన్నలు ఎరువులు, విత్తనాలడిగితే లాఠీదెబ్బలు తినిపించిన ఘనత గత పాలకులది. కానీ, కేసీఆర్ రైతుల కోసం అనేక పథకాలు ప్రవేశపెట్టి వ్యవసాయాన్ని పండుగగా మార్చారు. ఈ విధంగా చెప్తూ పోతే కేసీఆర్ ఏం చేశారనేది ఎంతైనా చెప్పవచ్చు. కేసీఆర్ తన యాత్ర పొడుగునా తాను చేసిందే చెప్తారు. కేసీఆర్ ఏం చేశారనేది ప్రజలకు తెలుసు. కేసీఆర్ లేకపోతే తెలంగాణ రాష్ట్రం రాకపోయేదని తెలుసు. తెలంగాణ రాష్ట్రంలో ఈ అభివృద్ధి కేసీఆర్ వల్లనే జరిగిందనేది తెలుసు. నీళ్లయినా, కరెంటైనా, సంక్షేమ పథకాలైనా, సమాజ అభివృద్ధి అయినా, వ్యవసాయ అభివృద్ధి అయినా, పారిశ్రామిక ప్రగతి అయినా కేసీఆర్ వల్లనే సాధ్యమనేది ప్రజలకు తెలుసు.
కేసీఆర్ వ్యక్తిత్వం మహోన్నతమైనది. ఆయన ముందు మిగతా పార్టీల నాయకులు అంగుష్ఠ మాత్రులుగా కనిపిస్తారు. కేసీఆర్కు నైతిక విలువలపై మక్కువ. కానీ, ఇతర పార్టీల నాయకులకు ఏ విలువలూ లేవు. పార్టీ టికెట్లు అమ్ముకునే బాపతు నాయకులు ప్రజలకు ఏం చేస్తారు? తెల్లారితే ఢిల్లీ పెద్దల పాదాల ముందు మోకరిల్లే నాయకులు తెలంగాణ ప్రజల తరపున మాట్లాడగలరా? కాంగ్రెస్ నాయకులకు పదవుల కోసం తన్నుకోవడమే తెలుసు. కానీ, తెలంగాణ ప్రజల ప్రయోజనాల కోసం పోరాడటం రాదు. ఇది ఉద్యమ సమయంలోనే వెల్లడైంది. అందుకే వారిని తెలంగాణ ప్రజలు చెత్తబుట్టలో వేశారు. వారికి తెలంగాణలో భవిష్యత్తు లేదని తేల్చివేశారు. ఆ విషయం వారికి అర్థమైనట్టు లేదు. లేదా అర్థమైనా తప్పనిసరై నాటకాలు ఆడుతున్నారు. వారికి ఒకరినొకరు ఓడించుకోవడం తప్ప ప్రజలను మెప్పించడం రాదు. ఆ కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రజలకు ఏమని చెప్పుకొంటూ తిరుగుతారు? తెలంగాణ ఉద్యమంలో రాజీనామాలు చేయకుండా పదవులు పట్టుకొని వేళ్లాడామని, అందువల్ల తమను ఓడించారని, ఇప్పుడు క్షమించి మళ్లీ అవకాశం ఇవ్వమని అడుగుతారా? కనీసం తప్పు తెలుసుకొని క్షమాపణ కోరే సంస్కారం, ఔన్నత్యం వారికి ఉన్నదా? 70 ఏండ్ల పాలనలో మేం మంచినీళ్లు కూడా ఇవ్వలేదు, మంచినీళ్లు ఇచ్చిన కేసీఆర్ను ఓడించి మమ్ముల్ని గెలిపించండని ప్రచారం చేసుకుంటారా? తెలంగాణ వాటా నీళ్లు మేం సాధించలేకపోయాం, బీడువడ్డ పొలాలకు నీళ్లు ఇవ్వలేకపోయాం, ఇప్పుడు తెలంగాణను దేశానికే ధాన్యాగారంగా మార్చిన కేసీఆర్ను ఓడించి మాకు అధికారం ఇప్పించండని ప్రజల్ని అడుగుతారా? రైతులను లాఠీలతో కొట్టించాం కనుక ఓటెయ్యమని అడుగుతారా? గురుకులాలు, వైద్య కళాశాలలు పెట్టిన కేసీఆర్ను ఓడించమని అడుగుతారా? కొద్దికాలంలోనే దేశానికి, ప్రపంచానికి తెలంగాణ వైద్యులు సేవలు చేస్తారు కనుక, తెలంగాణ పేరు ప్రఖ్యాతులు పొందుతుంది కనుక కేసీఆర్ను గద్దె దింపండని ప్రజలను కోరుతారా? తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని కాంగ్రెస్ అధిష్ఠానం పాదాల చెంత పెడతాం కనుక మాకు ఓటేయండని ప్రజలకు చెప్పుకొంటారా? కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజలకు చెప్పుకునేదేముంది? కరెంటు మూడు గంటలే ఇస్తాం, అర్ధరాత్రి, అపరాత్రి లేకుండా రైతులు పాములు కరిచి చావాలని తమ మ్యానిఫెస్టోలో రాసుకుంటారా? కాంగ్రెస్ నాయకులకు తెలంగాణ బడ్జెట్ అంటే ఏమిటో తెలియదు. ప్రజల సంక్షేమం కోసం ఎంత ఖర్చుపెట్టాలో తెలియదు. ‘నా చిన్ని బొజ్జకు శ్రీరామ రక్ష’ అంటూ తమ ఆస్తులు పెంచుకోవడం ఒక్కటే కాంగ్రెస్ నాయకులకు తెలుసు. ఆ విషయం ప్రజలకూ తెలుసు. కాంగ్రెస్ నాయకులు ప్రజల చేత తిరస్కృతులు, చరిత్రహీనులు. ఇతర రాష్ర్టాల్లో వారి పాలన చూస్తుంటే, ఇక వారు మారలేరని తెలిసిపోతున్నది. వారికి ప్రజలంటే గిట్టదు, తమ ప్రయోజనాలు తప్ప వేరే ఆలోచన వారికి ఉండదు. అందువల్ల కాంగ్రెస్ నాయకుల ప్రచారమంటే అపహాస్యంగా ఉన్నది.
బీజేపీ నాయకులకు రాష్ట్రంలో స్థానం లేదని, తెలంగాణ ప్రజలు ఇప్పటికే తేల్చేశారు. ఆ విషయం ఆ పార్టీ నాయకులకు కూడా అర్థమైంది. కేసీఆర్ను తిట్టడం ద్వారా లబ్ధి పొందాలనే బాపతు మనుషులను తెలంగాణ ప్రజలు అసహ్యించుకుంటారు. పైగా దక్షిణాది రాష్ర్టాల్లో బీజేపీకి పునాది లేదు. ఇక్కడి ప్రజల లౌకిక సంస్కృతి ఆ పార్టీకి సరిపడదు. విద్వేష రాజకీయాల వల్ల ఉత్తరాది ప్రజలు అభివృద్ధి చెందడం లేదు. శాంతియుత పరిస్థితుల వల్ల తెలంగాణ అభివృద్ధి చెందింది. ప్రజలు కలసిమెలసి ఉంటూ ప్రగతిబాటలో నడవాలనేది కేసీఆర్ ఆకాంక్ష. ఇదే సరైన విధానమని ఇప్పటికే రుజువైంది. పెద్ద నోట్లు రద్దుచేయడం, హఠాత్తుగా లాక్డౌన్ ప్రకటించడం వల్ల ప్రజలు ఎంత ఇబ్బందిపడ్డారో తెలిసిందే. తన పరిపాలన ద్వారా ప్రజలను మెప్పించడం బీజేపీకి సాధ్యం కాదు.
పార్లమెంటులోనే ప్రధాని మోదీ తెలంగాణను అనేకసార్లు అవమానించారు. ప్రతి రాష్ర్టానికి ఒక జాతీయ ప్రాజెక్టును ఆమోదించాలి. కానీ, కాళేశ్వరం ప్రాజెక్టుకు ఆ గుర్తింపు రాలేదు. కనీసం పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు కూడా ఇవ్వడం లేదు. బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ అడిగితే మొండిచేయి చూపించారు. 70 ఏండ్ల నుంచి తెలంగాణను పీడించుకొని తిన్న చరిత్ర కాంగ్రెస్ది అయితే, తొమ్మిదేండ్లుగా తెలంగాణను అవమానిస్తూ, నిధులు ఇవ్వకుండా ఇక్కట్ల పాలుచేస్తున్న చరిత్ర బీజేపీది. కాంగ్రెస్, బీజేపీల దౌర్భాగ్య పాలన తెలుసు కనుకనే కేసీఆర్కు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. ఈ నెల 15 నుంచి కేసీఆర్ దర్శనం కోసం ప్రజలు తరలివస్తారు. కేసీఆర్ ప్రసంగాలు వింటారు. తమ ఇంటికి, ఊరికి పోయిన తర్వాత కేసీఆర్ మాటలపై చర్చించుకుంటారు. కేసీఆర్ను నమ్మవచ్చు. కేసీఆర్ అధికారంలోఉంటే హాయిగా నిద్రపోవచ్చు. ఏ సమస్యలూ ఉండవు. ఒకేరోజు అన్ని సమస్యలు పరిష్కారం కావు. ఆసరా పింఛన్లు, రైతు బంధు, కల్యాణలక్ష్మి మొదలైన పథకాలు అర్హులైన వారందరికీ అందుతున్నాయి. డబుల్ బెడ్రూం ఇండ్లు ఇప్పటికే లక్షల మందికి వచ్చాయి. ఇంకా వస్తాయి. ఇవన్నీ ఒక్క రోజులోనే సాధ్యం కావని ప్రజలకు తెలుసు. కేంద్రం నిధులు ఇవ్వకున్నా, కేసీఆర్ పొదుపుగా అందరికీ సమకూర్చగలుగుతారు.
కొంచెం ముందువెనుకా కేసీఆర్ అందరికీ అన్నీ సమకూరుస్తున్నారు. ప్రజల సంక్షేమం కోసం పొదుపుగా, తెలివిగా ప్రజాధనాన్ని ఉపయోగించే కేసీఆర్ వంటి నాయకుడు దేశంలో మరొకరు లేరు.
రాష్ర్టాన్ని ఆదర్శంగా తీర్చిదిద్ది దేశాన్ని వృద్ధి చేయడానికి నడుం బిగించిన మహానాయకుడు కేసీఆర్. అటువంటి నాయకుడిని తెలంగాణ సమాజం వదులుకోదు. కేసీఆర్కే ఓటు వేయాలని ప్రజలు ఇప్పటికే నిర్ణయానికి వచ్చారు. వారి దృష్టిలో కేసీఆర్ తప్ప మరో నాయకుడు లేడు. కేసీఆర్ తాను సాధించిన ప్రగతిని చూపించి ప్రజల మధ్యకు యాత్ర చేస్తున్నారు. ఇటువంటి నాయకుడు మరొకరు లేరు, ఉండరు. 2014లో పోలింగ్ ముగిసిన మరుసటి రోజు నుంచే, ఇంకా ఫలితాలు వెలువడకముందే, కేసీఆర్ మేధావులను పిలిచి పలు రంగాలలో అభివృద్ధి పథకాల గురించి చర్చలు మొదలుపెట్టారు. ఈసారి కూడా ప్రచారం ముగిసేవరకు కేసీఆర్ ఎన్నికల మీద దృష్టిపెడతారు. మరుసటిరోజు నుంచి ప్రజల సంక్షేమం కోసం ఆయన మళ్లీ తపస్సు ప్రారంభిస్తారు. తెలంగాణను, దేశాన్ని ఏ విధంగా తీర్చిదిద్దాలనేది ఆయన తపన. ఈ విషయం ప్రజలకూ తెలుసు. అందుకే, కేసీఆర్ దిగ్విజయ యాత్ర కోసం ఎదురుచూస్తున్నారు.
(వ్యాసకర్త: డైరెక్టర్, టీ-కేసీఆర్ సెంటర్)
-గోసుల శ్రీనివాస్ యాదవ్
98498 16817