దాదాపు 2000 నుంచి రాష్ట్ర రాజకీయాలను విద్యుత్తు అంశం శాసిస్తున్నది. తెలంగాణ ఆవిర్భావానికి, తెలంగాణ ఉద్యమానికి, ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు ఓటమికి, వైఎస్సార్ విజయానికి, తెలంగాణ ఏర్పడిన తర్వాత కేసీఆర్ రెండవసారి విజయం సాధించడానికి, అధికారపక్షం బీఆర్ఎస్కు ఇప్పుడు సానుకూల వాతావరణం ఉండటానికి విద్యుత్తు అంశమే కీలకం. మరోసారి విద్యుత్తు అంశం అధికార, విపక్షాల మధ్య మంటలు పుట్టిస్తున్నది.
ఒకసారి అసెంబ్లీ జరుగుతుండగా తన చాంబర్లో జర్నలిస్టులు అందరితో తెలంగాణ గురించి తన అభిప్రాయాలు కేసీఆర్ వెల్లడించారు. అప్పుడు కేసీఆర్, బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, చంద్రమోహన్రెడ్డి, తుమ్మల నాగేశ్వర్రావు ఒకటిగా ఉండేవారు. పార్టీలో జరుగుతున్న పరిణామాలు తెలంగాణ ఉద్యమం గురించి కేసీఆర్ తన అభిప్రాయాలు వెల్లడిస్తే కొన్ని పత్రికలు కేసీఆర్ తెలంగాణ ఉద్యమం ప్రారంభించబోతున్నారని రాస్తే, కొన్ని టీడీపీలో చీలిక అని అసంతృప్తి అంశానికి ప్రాధాన్యం ఇచ్చాయి.
పాతిక, యాభై మంది కుర్రాళ్ల మధ్య అమెరికాలో మాట్లాడితే ఏమవుతుంది అనుకున్నారో ఏమో గానీ.. ఇక్కడ ఆ మాటలు రాజకీయ వివాదాన్ని సృష్టిస్తున్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో విద్యుత్తు ఉద్యమానికి, బషీర్బాగ్లో కాల్పులకు 23 ఏండ్లు నిండాయి. వ్యవసాయానికి విద్యుత్తు చార్జీలు పెంచాలని 2000, మే చివరలో ప్రతిపాదనలు వచ్చాయి. వీటికి వ్యతిరేకంగా రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాలు ఊపందుకున్నాయి. ఆగస్టు 28న బషీర్బాగ్ వద్ద ఉద్యమ ఆందోళనకారులపై కాల్పులు జరిగాయి. విద్యుత్తు చార్జీలు పెంచితే తెలంగాణ రైతుకు గోచి కూడా మిగలదని అప్పటి డిప్యూటీ స్పీకర్ కల్వకుంట్ల చంద్రశేఖర్రావు అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబుకు లేఖ రాశారు. అనంతరం టీఆర్ఎస్ ఏర్పాటు చేశారు. 23 ఏండ్ల కిందట వరుసగా జరిగిన ఘటనలు ఇవి. నాటి సంఘటనలకు ప్రత్యక్ష సాక్షులుగా ఉండి వార్తలు రాసిన జర్నలిస్టులు ఈ కాలాన్ని తమ జీవితంలో ఎప్పుడూ మరిచిపోరు. ఈ మధ్యనే జరిగాయేమో అన్నట్టుగా కండ్లముందు కదలాడుతున్నాయి నాటి ఘటనలు.
తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి అమెరికాలో తానా సభకు వెళ్లినప్పుడు ఒక యువకుడు వ్యవసాయానికి 24 గంటల విద్యుత్తు గురించి ప్రశ్నించినప్పుడు.. ‘తెలంగాణలో మెజారిటీ రైతులకు మూడు ఎకరాలే ఉందని, ఒక ఎకరం తడవడానికి గంట చాలు’నని సమాధానమిచ్చిన వీడియో విస్తృతంగా వైరలయింది. రేవంత్ మాటలను ఎడిట్ చేశారని కొందరు, కాంగ్రెస్ డీఎన్ఏలోనే 24 గంటల విద్యుత్ ఉందని, 24 గంటలు ఇస్తామని మరికొందరు కాంగ్రెస్లో ఎవరికి తోచినట్టు వాళ్లు ప్రకటిస్తున్నారు. విద్యుత్తు తెలంగాణలో సున్నితమైన అంశం. రాష్ట్రవ్యాప్తంగా భారత రాష్ట్ర సమితి ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టింది.
విద్యుత్తు ఉద్యమం జరిగినప్పుడు కాంగ్రెస్ పోరాడిందని, బాబుకు అండగా కేసీఆర్ నిలిచారని కాంగ్రెస్ ఆరోపణ. కరెంటు చార్జీలు పెంచినందుకు డిప్యూటీ స్పీకర్గా ఉంటూ ముఖ్యమంత్రికి లేఖ రాయడం ద్వారా కేసీఆర్ తెలంగాణ ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. తెలంగాణకు సంబంధించి ఉద్యమానికి కారణాలేమిటో పార్టీలోని సీనియర్ల ద్వారానైనా తెలుసుకొని కాంగ్రెస్ నాయకులు సమాధానం చెప్తే బాగుండేది.
మహానాడులో కలకలం
ఏటా మే 27 నుంచి 3 రోజుల పాటు మహానాడు జరుగుతుంది. 2000 సంవత్సరం మేలో విజయవాడలో మహానాడు ప్రతినిధుల సభ జరుగుతున్నది. ఒకవైపు ఉపన్యాసాలు జరుగుతుండగానే కింద ప్రతినిధులు గుస గుస. మన పని అయిపోయినట్టేనని నిట్టూర్పులు. వ్యవసాయానికి విద్యుత్తు చార్జీలు పెంచాలనే ప్రతిపాదనలు తనకు అసలు తెలియనట్టు, తనకు సంబంధమే లేనట్టు చంద్రబాబు డ్రామా క్రియేట్ చేశారు. మహానాడు అజెండా విషయం పక్కనపెట్టి ఈ అంశం గురించి చంద్రబాబు ప్రకటించారు. అప్పటికప్పుడు హైదరాబాద్ నుంచి విద్యుత్తు శాఖ ఉన్నతాధికారులను అన్ని వివరాలతో హెలికాప్టర్లో విజయవాడ రమ్మని ఆదేశించారు. తనకు తెలియకుండానే జరిగినట్టు డ్రామా క్రియేట్ చేసినా ఆ ప్రతిపాదనల్లో ఏ మాత్రం మార్పులు చేయలేదు.
కాంగ్రెస్ పార్టీ 90 మంది శాసనసభ్యులతో బలమైన ప్రతిపక్షంగా ఉండటంతో సీఎల్పీ నాయకుడిగా వైఎస్, సురవరం సుధాకర్ రెడ్డి (సీపీఐ), బీవీ రాఘవులు(సీపీఎం), ఇతర వామపక్ష సంస్థలు పెద్ద ఎత్తున ఆందోళన జరిపాయి. ఉద్యమకారులు చలో అసెంబ్లీకి పిలుపు ఇచ్చారు. అసెంబ్లీకి అన్ని వైపులా భారీగా పోలీసులు కాపలా ఉన్నారు. బషీర్బాగ్ వద్ద ఆందోళనకారులపై జరిపిన పోలీసు కాల్పులను చంద్రబాబు సమర్థించుకున్నారు. ఆ వెంటనే జరిగిన విలేకరుల సమావేశంలో తీవ్రవాదులు అసెంబ్లీ ముట్టడికి వస్తే కాల్పులు జరిపినట్టు పేర్కొన్నారు. 1997 నుంచి 2000 వరకు తీవ్రమైన వర్షాభావ పరిస్థితులు ఏర్పడ్డాయి. తెలంగాణలో కరువు విలయతాండవం చేసింది. దాంతో ఆ మూడేండ్ల కాలంలోనే వేలమంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. వ్యవసాయం భారంగా మారింది. రైతులు బతుకలేని రోజులవి. ఇలాంటి పరిస్థితిలో ప్రపంచ బ్యాంకు ఒత్తిడిమేరకు చంద్రబాబు వ్యవసాయానికి విద్యుత్తు చార్జీలు పెంచాలని నిర్ణయించారు.
ఆ సమయంలో డిప్యూటీ స్పీకర్గా అధికారపక్షంలో ఉంటూనే విద్యుత్తు చార్జీల పెంపుదల ప్రతిపాదన ఉపసంహరించుకోవాలని కేసీఆర్ అప్పటి సీఎం చంద్రబాబుకు లేఖ రాశారు. నిజానికి ఈ లేఖ ద్వారా తెలంగాణ ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. ఆగస్టు 28న బషీర్బాగ్లో ఆందోళనకారులపై కాల్పులు జరిపితే విష్ణువర్ధన్రెడ్డి, రామకృష్ణ, బాలస్వామి అనే ముగ్గురు మరణించారు. అది జరిగిన వారంలోపే, అంటే సెప్టెంబర్ మొదటివారంలో కేసీఆర్ లేఖ రాశారు. కేసీఆర్ లేఖకు, తెలంగాణ రైతుల గురించి అందులో చేసిన వాదనకు చంద్రబాబు పెద్దగా ప్రాధాన్యం ఇవ్వలేదు. మాజీ మంత్రి గోపాలకృష్ణారెడ్డి, రాజ్యసభ సభ్యుడు వైస్రాయ్ ప్రభాకర్రెడ్డి సెప్టెంబర్ 9న కేసీఆర్ను కలిసి నచ్చజెప్పడానికి ప్రయత్నిస్తే తెలంగాణ అంశంపై వెనక్కి తగ్గేదిలేదని కేసీఆర్ తేల్చిచెప్పారు.
మరోవైపు తెలంగాణ అంశంపై కేసీఆర్ విస్తృతంగా చర్చలు జరిపారు. విద్యుత్తు ఉద్యమం దాదాపు మూడు నెలల పాటు రాష్ట్రవ్యాప్తంగా జరిగినా చంద్రబాబు వెనక్కి తగ్గలేదు. తనను విడిగా కలిసిన నాయకులతో కూడా చంద్రబాబు ఒకేమాట చెప్పారు. ప్రపంచబ్యాంకు ఆదేశాలు రావడం, వారిచ్చే రుణంపై ఆధారపడి ఉండడం వల్ల చార్జీలు పెంచాల్సి వచ్చిందని సమర్థించుకునేవారు. ఆ నిర్ణయానికి చంద్రబాబు కట్టుబడి ఉన్నారు కూడా.
తెలంగాణలో రైతుల ఆత్మహత్యల గురించి చెప్పినా బాబులో ఎలాంటి స్పందన లేకపోవడంతో పార్టీ వీడి తెలంగాణ కోసం ఉద్యమించడమే మార్గమని కేసీఆర్ భావించారు. సెప్టెంబర్ మొదటివారంలో బాబుకు లేఖ రాసిన కేసీఆర్ దాదాపు ఆరునెలల పాటు తెలంగాణపై విస్తృతంగా చర్చలు జరిపి తెలంగాణ సాధ్యమవుతుందని చెప్పి 2001లో టీఆర్ఎస్ ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారు. డిప్యూటీ స్పీకర్గా ఉన్నా పెద్దగా శాసనసభకు హాజరు అయ్యేవారు కాదు. తెలంగాణకు సంబంధించి గ్రౌండ్వర్క్లో ఉండేవారు.
ఒకసారి అసెంబ్లీ జరుగుతుండగా తన చాంబర్లో జర్నలిస్టులు అందరితో తెలంగాణ గురించి తన అభిప్రాయాలు కేసీఆర్ వెల్లడించారు. అప్పుడు కేసీఆర్, బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, చంద్రమోహన్రెడ్డి, తుమ్మల నాగేశ్వర్రావు ఒకటిగా ఉండేవారు. పార్టీలో జరుగుతున్న పరిణామాలు తెలంగాణ ఉద్యమం గురించి కేసీఆర్ తన అభిప్రాయాలు వెల్లడిస్తే కొన్ని పత్రికలు కేసీఆర్ తెలంగాణ ఉద్యమం ప్రారంభించబోతున్నారని రాస్తే, కొన్ని టీడీపీలో చీలిక అని అసంతృప్తి అంశానికి ప్రాధాన్యం ఇచ్చాయి.
2004లో ఉచిత విద్యుత్తు అంశం ప్రాధాన్యాంశంగా నిలిచింది. చంద్రబాబు ఎన్నికల్లో ఓడిపోగానే కొద్ది రోజులకే పార్టీ సమీక్షలో మేం తీసుకువచ్చిన సంస్కరణల వల్లనే ఉచిత విద్యుత్తు ఇస్తున్నారని, 2009లో గెలిస్తే తామూ ఉచిత విద్యుత్తు ఇస్తామని ప్రకటించారు. ఉచిత విద్యుత్తు ఇస్తే కరెంటు తీగలు బట్టలు ఆరేసుకోవడానికి పనికివస్తాయని ఆ రోజుల్లో టీడీపీ చేసిన ప్రచారం టీడీపీ వర్గీయుల్లో బలంగా నాటుకున్నది. తానా సభలో రైతులకు మూడు గంటల విద్యుత్తు గురించి రేవంత్రెడ్డి మాట్లాడిన మాటలు విన్న అక్కడున్న యువతకు తెలంగాణలో వ్యవసాయం, ఉచిత విద్యుత్తు గురించి, విద్యుత్తు ఉద్యమం గురించి తెలిసి ఉండకపోవచ్చు. కానీ తెలంగాణలో రాజకీయం చేసేవారికి తెలంగాణలో రైతులు, వ్యవసాయం, రైతుల గురించి తెలిసి ఉండాలి.
విద్యుత్తు అంటే తక్కువగా అంచనా వేయవద్దు. తమకు తిరుగులేదని భావించిన చంద్రబాబును ఇంటికి పంపింది అది. టీఆర్ఎస్ను రెండోసారి అధికారంలోకి తీసుకువచ్చింది అదే.
(వ్యాసకర్త: సీనియర్ జర్నలిస్టు)
బుద్దా మురళి
98499 98087