భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ మన దేశాన్ని సుమారు అరవై ఏండ్లకు పైగా పాలించింది. ప్రస్తుతం దేశాన్ని తన గుప్పెట్లో పెట్టుకున్న భారతీయ జనతా పార్టీ (బీజేపీ) పదేండ్లు వరుసగా తన ఆధిపత్యం చెలాయించి, మూడోసారి కూడా తామే అధికారంలోకి వస్తున్నామంటూ ప్రజలకు తప్పుడు సంకేతాలిస్తూ వారిని తప్పుదోవ పట్టిస్తున్నది. ఈ రెండు జాతీయపార్టీల వైఖరి నన్ను ఒకింత ఆశ్చర్యానికి గురిచేస్తున్నది.
ఈ పార్టీలు వేర్వేరు అయినప్పటికీ ఆ పార్టీలు అవలంబించే విధానం, వాటి ప్రధాన సిద్ధాంతం మాత్రం ఒక్కటే. దేశంలోని పేద ప్రజల పొట్ట కొట్టి కార్పొరేట్ గద్దలకు దోచిపెట్టడమే. అందుకే స్వాతంత్య్రం వచ్చి 75 ఏండ్లు పూర్తయినా దేశంలో ఇంకా పేదరికాన్ని పూర్తిగా నిర్మూలించలేకపోయాయి. పేదలకు మూడు పూటలా తినడానికి తిండి దొరకడం లేదనే వాస్తవం మన దేశ పరిస్థితిని చెప్పకనే చెప్తున్నది. 2023 ప్రపంచ ఆకలి సూచీ ప్రకారం.. 125 దేశాలున్న జాబితాలో మన దేశం 111వ స్థానంలో ఉండటమే దానికి తాజా ఉదాహరణ.
Lok Sabha Elections | వారసత్వంగా తండ్రి నుంచి వచ్చిన ఆస్తిపాస్తుల వలె.. ‘ నువ్వు, లేదంటే నేను’ అన్నట్టు కాంగ్రెస్, బీజేపీ దేశంలో అధికారాన్ని పంచుకుంటున్నాయి. ఫలితంగా దేశంలోని పేద ప్రజలు ఇంకా పేదరికాన్ని అనుభవిస్తుంటే సంపన్నులు మాత్రం కోట్లకు మెట్లు కడుతూనే ఉన్నారు. దేశ జనాభాలో 3 శాతం మంది మాత్రమే నిరుపేదలున్నారని చెప్పే కేంద్ర ప్రభుత్వం కోట్లాది మంది నిరుపేదలకు రేషన్ సరుకులు ఫ్రీగా ఇవ్వడం దేన్ని సూచిస్తున్నది. వీరందరూ ఒక్క పూట కూడా తిండికి నోచుకోక తీవ్రమైన పేదరికంలో బతుకీడుస్తుండటం మన దేశ దారిద్య్రాన్ని తెలుపుతున్నది. అయినా మన దేశ ఏలికలకు చీమ కుట్టినట్టు కూడా లేకపోవడం బాధాకరం. 2 జీ స్పెక్ట్రం, బోఫోర్స్, కామన్వెల్త్, బొగ్గు వంటి ఎన్నో స్కామ్లు చేసిన కాంగ్రెస్ పార్టీతో ప్రజలు విసిగి వేసారిపోయారు. తద్వారా స్కాంగ్రెస్గా పేరొందిన కాంగ్రెస్ పార్టీ 2014లో దేశంలో అధికారాన్ని కోల్పోయింది. అప్పటినుంచి మొదలు ఇప్పటివరకు ప్రజా సమస్యల పట్ల కాంగ్రెస్ పార్టీ గట్టిగా పోరాడింది లేదు. ‘ఉన్నవా బసవన్నా’ అంటే.. ‘ఉన్నా’…, ‘తిన్నవా బసవన్న’ అంటే ‘తిన్నా’ అన్నట్టు వ్యవహరిస్తున్నది.
గుజరాత్ ముఖ్యమంత్రిగా 2014కు ముందు ఆకాశానికి నిచ్చెనలు వేసిన నరేంద్ర మోదీ దేశ ప్రజలకు గాల్లో మేడలు కట్టి చూపెట్టారు. విదేశాల్లో ఉన్న నల్లధనాన్ని వెనక్కి తెచ్చి దేశంలోని ప్రతి ఒక్కరి ఖాతాలో రూ.15 లక్షలు జమ చేస్తానని హామీ ఇచ్చారు. ఆయన మాటలు నమ్మిన దేశ ప్రజలు బీజేపీకి అధికారాన్ని కట్టబెట్టారు. రూ.15 లక్షలేమో కానీ, రూ.15 వేలు కూడా ప్రజల ఖాతాల్లో జమచేయలేకపోయారు ప్రధాని మోదీ. ప్రజా సమస్యలను గాలికి వదిలేసిన మోదీ విదేశీ ప్రయాణాలకు మొగ్గు చూపెట్టారు. పూటకు రెండు, మూడు డ్రెస్లు మారుస్తూ, పూటపూటకో ఫొటోషూట్లో పాల్గొంటూ దేశ ప్రయోజనాలను గాలికి వదిలేశారు. పెద్ద నోట్ల రద్దు నుంచి మొదలు జీఎస్టీ అమలు, రైతు వ్యతిరేక నల్ల చట్టాలను అమలుచేస్తూ కార్పొరేట్లకు కొమ్ముకాశారు. దీంతో దేశంలోని రైతాంగం ఢిల్లీ వేదికగా పెద్ద ఎత్తున నిరసనలు తెలిపింది. ధర్నాలు చేసింది, రాస్తారోకోలు చేసింది. ఈ క్రమంలో ఎందరో రైతులు తమ ప్రాణాలను వదులుకున్నారు. ఇంత జరిగినా ఎక్కడో మూలన నక్కినక్కి కూర్చున్న కాంగ్రెస్ రైతు మరణాల పట్ల కనీసం సానుభూతి కూడా ప్రకటించకపోవడం హేయనీయం.
జరగాల్సిన ఘోరం జరిగిన తర్వాత తేరుకున్న మోదీ సర్కారు వ్యవసాయ నల్ల చట్టాలను వెనక్కి తీసుకుంటున్నట్టు ప్రకటించింది. రైతులు తమ నిరసనలను విరమించుకుంటే గానీ దేశం ఊపిరి పీల్చుకోలేదు.గతం గతః… అనే సూక్తిని గుర్తుపెట్టుకున్నట్టున్నాయి ఈ జాతీయ పార్టీలు. అందుకే ఎన్నికలు సమీపిస్తున్నాయంటే చాలు కండలు తిరిగిన యోధుడిలా ప్రజల ముందుకు వస్తున్నది కాంగ్రెస్ పార్టీ. ప్రజలను మభ్యపెట్టి ఓట్లు కొల్లగొట్టడానికి, తద్వారా కోట్ల కుంభకోణాలు చేసేందుకు స్కాంగ్రెస్ పార్టీ సిద్ధం కావడం సిగ్గుచేటు. ఇక బీజేపీ మూడోసారి కూడా తామే అధికారంలోకి వస్తున్నామంటూ ప్రజలను మభ్యపెడుతున్నది. ప్రజలను, యువతను రెచ్చగొట్టడానికి ఆ పార్టీకి ఉన్న ఆయుధం ఏమిటో అందరికీ తెలిసిందే. మత ప్రాతిపదికన ఓట్లు రాబట్టుకోవడానికి మతాల మధ్య చిచ్చు పెట్టే ఆ పార్టీ వేయని పాచికలు లేవు. అందులో భాగంగానే జరగబోయే పార్లమెంటు ఎన్నికల ముంగిట ‘అయోధ్య’ రాముడిని వాడుకుంటున్నది.
దేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు తీర్పుతో దేశంలోని కోట్లాది మంది కలలుగన్న రామమందిర నిర్మాణానికి పునాది పడింది. 500 ఏండ్ల స్వప్నాన్ని సాకారం చేసే బాధ్యతను శ్రీరామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు (ఎస్ఆర్జేటీకే) చేతికి సర్వోన్నత న్యాయస్థానం అప్పగించింది. ఇది స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన ఓ ట్రస్టు. కానీ, దీని కార్యక్రమాలు ప్రధాని నరేంద్ర మోదీ, ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ కనుసన్నల్లోనే జరుగుతుండటమే అభ్యంతరకరం.
పైగా దీని చైర్మన్ నృపేంద్ర మిశ్రా గతంలో ప్రధాని ప్రిన్సిపల్ సెక్రెటరీగా విధులు నిర్వర్తించారు. అదీ కాకుండా ట్రస్టుకు జనరల్ సెక్రెటరీగా వీహెచ్పీ ఉపాధ్యక్షుడు చంపత్ రాయ్ ఉన్నారు. దీంతో అక్కడి పనులన్నీ ప్రధాని మోదీ, ఆర్ఎస్ఎస్ కనుసన్నల్లోనే జరుగుతున్నాయి.
నయా అయోధ్య నిర్మాణంలో భాగంగా పలు మౌలిక వసతుల ప్రాజెక్టులను మోదీ సర్కార్ చేపట్టింది. ఈ క్రమంలో రామ జన్మభూమి రియల్ ఎస్టేట్కు అడ్డాగా మార్చింది. ముఖ్యంగా గుజరాత్కు చెందిన బడా వ్యాపారులు అయోధ్యలో తిష్ట వేశారు. చిన్నచిన్న పనుల నుంచి పెద్దపెద్ద ప్రాజెక్టుల వరకు అన్నీ వారి చేతుల్లోనే ఉన్నాయి. చివరికి సరయూ నదిలో తిరిగే తెడ్డు పడవలు మాయమై, వాటి స్థానంలో క్రూయిజ్ బోట్లు దర్శనమిస్తుండటం గమనార్హం. ‘అయోధ్య రాముడి’ పేరు చెప్పుకొని మళ్లా అధికారంలోకి రావాలని చూస్తున్న బీజేపీ ‘అయోధ్య’ను పేద ప్రజలకు అందనంతగా మారుస్తున్నది. ఆధ్యాత్మిక నగరిగా అయోధ్యను తీర్చిదిద్దుతామని గొప్పలకు పోతున్న బీజేపీ ప్రభుత్వం రూ.1000 కోట్లతో మాస్టర్ ప్లాన్ వేసింది. దేశంలోని ప్రతి హిందువుకు రాముడు ఆరాధ్యదైవం. మతాలకతీతంగా రాముడిని కొలిచేవారు మన దేశంలో ఉన్నారు. ఆయన త్యాగాలను అన్ని మతాల వారు స్మరిస్తారు. రాముని జీవితం ప్రతీ యువకునికి స్ఫూర్తి. పేదలు, బీదలే రాముడి అసలైన భక్తులు.
కానీ, వారికి అయోధ్యలో నేడు స్థానం లేకుండా పోయింది. రామ మందిరంలో బాలరాముడి ప్రతిష్ఠాపన కార్యక్రమంలోనూ సామాన్యులకు స్థానం దక్కలేదు. వేల మంది సెలబ్రిటీల మధ్య ఆ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగిన విషయం దేశంలోని ప్రతీ పేదబిడ్డకు తెలుసు. దీంతో భవిష్యత్తులోనూ సామాన్య ప్రజలకు అయోధ్యలో చోటు దక్కుతుందా అనే ప్రశ్న ఉత్పన్నమవుతున్నది. అయోధ్య అభివృద్ధి పేరిట చేస్తున్న కార్యక్రమాల కారణంగా రాముడు సాధారణ భక్తులకు దూరమవుతాడో? సాధారణ భక్తులే రాముడికి దూరమవుతారో? కాలమే సమాధానం చెప్పాలి. నయా అయోధ్యను తీర్చిదిద్దుతున్న బీజేపీ.. రామ జన్మభూమికి భక్తులను రప్పించే బాధ్యతను కూడా భుజాలకెత్తుకున్నది. భవిష్యత్తులో ఏటా 5 కోట్ల మంది అయోధ్యను సందర్శించే అవకాశం ఉందనేది ఓ అంచనా. అందుకు బీజేపీ అంతర్గతంగా ప్రణాళికలు రచించింది. ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎంపీలు భక్తులను అయోధ్యకు తరలిస్తున్నారు.
బీజేపీ మళ్లీ అధికారంలోకి రావాలన్నదే మోదీజీ వ్యూహం. దేశాన్ని అరవై ఏండ్లు కాంగ్రెస్ పాలిస్తే ఇంకో అరవై ఏండ్లు పాలించాలనే యోచనలో బీజేపీ ఉన్నది. అందుకోసం మతాల పేరిట రెచ్చగొట్టడానికైనా, దేశం లో విద్వేషాలను విరజిమ్మడానికైనా బీజేపీ వెనుకాడటం లేదు. అందుకు దేశంలోని జమ్మూకశ్మీర్ అల్లర్లు తాజా ఉదాహరణ! రాష్ట్రంలో భైంసా అల్లర్లు కూడా అందుకు నిదర్శనం. కాబట్టి కాంగ్రెస్, బీజేపీ విధానాలను రాష్ట్ర ప్రజలు ఎండగట్టాలి. ప్రాంతీయ పార్టీల అభ్యర్థులను ఎంపీలుగా గెలిపించి చట్టసభలకు పంపండి. అప్పుడే దేశంలోని పేద ప్రజల సమస్యలు పరిష్కారమవుతాయి. దేశం అభివృద్ధి దిశగా దూసుకుపోతుంది. దేశం పట్ల కానీ, దేశ సమస్యల పట్ల గానీ అవగాహన, అంకితభావం లేని నాయకులను చట్టసభలకు పంపితే మన దేశం ఇంకా వెనుకబడిపోతుందనడంలో కించిత్ అనుమానం అవసరం లేదు.
(వ్యాసకర్త: కరీంనగర్ మాజీ మేయర్)
-సర్దార్ రవీందర్ సింగ్