వృథాగా పోతున్న గోదావరి జలాలను ఒడిసి పట్టేందుకు 31 ఏండ్ల కిందట పీవీ నరసింహారావు చేసిన అద్భుతమైన ఆలోచనకు ప్రతిరూపమే శ్రీరాంసాగర్ ప్రాజెక్టు. 1993 జూన్ 30న నిజామాబాద్ జిల్లాలో ప్రధాని హోదాలో పీవీ పర్యటించారు. ఎస్సారెస్పీ ప్రాజెక్టును సందర్శించి ముప్కాల్ సమీపంలో వరద కాలువకు శంకుస్థాపన చేశారు. గోదావరిలో పారే వరద నీటిని ప్రత్యేక కాలువ ద్వారా ఉమ్మడి కరీంనగర్, వరంగల్, నల్లగొండ జిల్లాలకు సాగు నీరు అందించాలనే లక్ష్యంతో పీవీ దీని నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. అయితే ఈ ప్రాజెక్టుతో సంబంధమే లేని ఇందిరాగాంధీ పేరును దీనికి పెట్టి పీవీకి మరోసారి కాంగ్రెస్ అన్యాయం చేయడం శోచనీయం.
ఒక్కసారి చరిత్రలోకి తొంగిచూస్తే.. 1983లో శ్రీరాంసాగర్కు భారీగా వరదలు వచ్చాయి. ఆ నీరంతా వృథాగా సముద్రంలో కలిసిపోయాయి. ఇలా వరదలు వచ్చిన ప్రతిసారి ప్రాజెక్టు గేట్లు ఎత్తి జలాలను దిగువకు వదిలేసేవారు. వృథాగా పోతున్న నీటిని వినియోగించుకోవాలనే లక్ష్యంతో వరద కాలువను నిర్మించాలనే ఆలోచన పురుడుపోసుకున్నది. అనుకున్నదే తడవుగా నిజామాబాద్ జిల్లా ముప్కాల్ సమీపంలో వరద కాలువ నిర్మాణానికి పీవీ శంకుస్థాపన చేశారు.
అయితే నాటి సమైక్య (కాంగ్రెస్, టీడీపీ) పాలకుల వివక్ష, నిర్లక్ష్యం కారణంగా ఎస్సారెస్పీ వరద కాలువ నిర్మాణంలో తీవ్రంగా జాప్యం జరిగింది. ఏడేండ్లలోనే పూర్తవ్వాల్సిన వరద కాలువ.. పీవీ ప్రధాని పీఠం దిగే సమయానికి కూడా పూర్తవలేదు. 2010 వరకు ట్రయల్ రన్ జరగలేదంటేనే.. వలస పాలకుల వివక్షను అర్థం చేసుకోవచ్చు. దీనికి తోడు ఎస్సారెస్పీ ఎగువన మహారాష్ట్ర ఇబ్బడిముబ్బడిగా కట్టిన అక్రమ ప్రాజెక్టుల మూలంగా చుక్కనీరు వచ్చే పరిస్థితి లేదు. నీటి లభ్యత కొరవడిన నేపథ్యంలో అసలు లక్ష్యానికే గండిపడే దుస్థితి దాపురించింది. దీంతో కాలక్రమేణా లోయర్ మానేరు డ్యాంకు మాత్రమే నీటిని నింపేందుకు వరద కాలువను ప్రధాన వనరుగా పాలకులు మార్చేశారు. ఫలితంగా తెలంగాణ రైతాంగం సంక్షేమాన్ని కోరుతూ పీవీ కన్న కలలన్నీ కల్లలయ్యాయి.
దశాబ్దాల పోరాట ఫలితంగా సీమాంధ్ర పాలకుల ఉక్కు సంకెళ్లను తెంచుకున్న తెలంగాణ రాష్ర్టానికి తొలి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన కేసీఆర్ వరద కాలువకు తిరిగి జీవం పోశారు. కాళేశ్వరం, ఎస్సారెస్పీ పునర్జీవ పథకం ద్వారా పీవీ కలలను సఫలం చేశారు. ఏటా బోసిపోతున్న పోచంపాడు ప్రాజెక్టుకు కొత్త కాంతులు తీసుకురావాలనే ఆశయంతో కేసీఆర్ సంకల్పించిన పునర్జీవ పథకం మూలంగా.. నేడు వరద కాలువ నిండుగా కనిపిస్తున్నది. కాళేశ్వరం నుంచి మిడ్మానేరు, మల్లన్న సాగర్, కొండపోచమ్మ, హల్దివాగు ద్వారా నిజాంసాగర్ ప్రాజెక్టుకు నీళ్లు పంపి తద్వారా ఎస్సారెస్పీకి నీటిని మళ్లించాలని తొలుత తెలంగాణ ప్రభుత్వం భావించింది. అయితే అందులో ఉన్న సంక్లిష్టతల కారణంగా ఆ నిర్ణయాన్ని మార్చుకున్నది. నీటిపారుదల రంగ నిపుణులతో సంప్రదించాక వరద కాలువ 102వ కిలోమీటరు వరకు కాళేశ్వరం జలాలను తరలించి.. అక్కడి నుంచి రివర్స్ పంపింగ్ చేయాలనే నిశ్చయానికి వచ్చింది కేసీఆర్ సర్కార్. అలా ఎస్సారెస్పీ పునర్జీవ పథకంతో గోదావరి జలాలను ఎదురెక్కించి వరద కాలువను నింపి మూడు కాలాలు నిండు కుండలా ఉండేలా మార్చేశారు కేసీఆర్. ఈ విధంగా కేసీఆర్ హయాంలో పీవీ స్వప్నం సాకారమైంది.
పీవీకి దేశ అత్యున్నత పురస్కారం భారతరత్న వరించిన నేపథ్యంలో వరద కాలువ నిర్మాణాన్ని ఆకాంక్షించిన ఆయన పేరునే దీనికి పెట్టాలని స్థానిక రైతుల నుంచి డిమాండ్ పెరుగుతున్నది. ఇందిరమ్మ పేరును ఇతర నిర్మాణాలకు పెట్టి.. వరద కాలువకు పీవీ పేరును పెట్టేలా చారిత్రక నిర్ణయాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకోవాలని రైతులు, మేధావులు, పీవీ అభిమానులు కోరుతున్నారు. నెహ్రూ, ఇందిరా, రాజీవ్గాంధీలకే పరిమితమైన ‘గుర్తింపు’ తెలంగాణ బిడ్డ పీవీకి కూడా దక్కాలనేది సగటు తెలంగాణ పౌరుడి అభిలాష.
(వ్యాజూపల్లి రమేశ్ రావుసకర్త: నమస్తే తెలంగాణ బ్యూరో చీఫ్, ఉమ్మడి నిజామాబాద్ జిల్లా)
-జూపల్లి రమేశ్ రావు
94925 70992