మన దేశంలో ద్రవ్యోల్బణం పెరుగుదల ప్రభావం పేదరికంపై పెద్దగా ఉండదని-ఐక్యరాజ్యసమితి అభివృద్ధి సంస్థ శెలవిచ్చిందని, మన ఆర్థికమంత్రి నిర్మలాసీతారామన్ చెప్పుకొంటున్నారు. దీనికి నిర్దిష్ట వర్గాలకు ‘జరుగుతున్న’ రాయితీల బదిలీని కారణంగా ఆమె పేర్కొన్నారు. ఈ రాయితీల వలన మన దేశంలోని జన సామాన్యం ధరల పెరుగుదల ఒత్తిడిని తట్టుకోగలుగుతున్నారని వివరించారు. అంటే, దేశంలో ధరలు పెరుగుతున్నది నిజమే కానీ, ఆ పెరుగుతున్న ధరలను తట్టుకోగల స్థాయిలో మన ప్రభుత్వం ప్రజలకు సాయాన్ని అందిస్తోందన్నది ఆమె వ్యాఖ్యల సారాంశం.
ఇసుకలో తలదూర్చిన ఉష్ట్రపక్షిలా తన చుట్టూ ఉన్న వినాశకర, విధ్వంసక వాస్తవాన్ని చూసేందుకు బీజేపీ తిరస్కరిస్తోంది. వాస్తవంలో ఆర్థిక జీవితమే, రాజకీయాలపై అంతిమంగా పై చేయి కలిగి ఉంటుందనే, కనీస ఇంగితాన్ని విస్మరిస్తోంది. రాజకీయ ప్రత్యర్థులను వేధించటం… ఆశ్రిత పెట్టుబడిదారులకు దేశ సంపదను అప్పనంగా కట్టబెట్టడమే విధానంగా సాగుతున్న ఈ పాలన-ప్రజల కడగండ్లు ఒక పరిమితి మించి పెరిగిపోయిన మరుక్షణం-పేకమేడలా కూలిపోక తప్పదన్నది నిజం!
ఇది నిజమా.? వాస్తవాలను పరిశీలిస్తే, నిజానిజాలను తరచిచూస్తే… నిర్మలా సీతారామన్ చెబుతున్న దానికి పూర్తిగా భిన్నమైన పరిస్థితి కనపడుతుంది. స్థూలంగా, సంస్కరణల కాలంలో యావత్తూ, మరీ ముఖ్యంగా 2014లో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత- జన సామాన్యానికి అందించే అనేక రాయితీలు, సబ్సిడీలపై కోత పడుతోంది. ఈ సబ్సిడీల తాలూకు కోతలను ప్రధానంగా-ఆహారం, ఇంధనం, ఎరువుల విషయంలో గమనించవచ్చు. ఈ మూడు కీలక అంశాలపైనా, గత అనేక సంవత్సరాలుగా వేటు పడుతూనే ఉంది. నిన్నమొన్నటి, 2024 ఆర్థిక సంవత్సర బడ్జెట్లో కూడా ఈ మూడు అంశాలకు సంబంధించి భారీ కోతలు పడ్డాయి. ఫలితంగానే నేడు దేశంలో-చౌక ధరలకు ఆహారాన్నందించే ప్రజా పంపిణీ వ్యవస్థ నిర్వీర్యమైపోతోంది. డీజిల్, పెట్రోల్ ధరలు-పన్నుల భారం తడిసి మోపెడై, జన సామాన్యానికి భరించలేనివిగా మారిపోతున్నాయి. ఇక, వ్యవసాయంలో ఒక కీలక ఉత్పాదకంగా-ఎరువుల ధర నేడు రైతాంగానికి అలవిమాలిన భారంగా పరిణమిస్తోంది.
మరోప్రక్కన, గ్రామీణ పేదలకు ఉపాధిని కల్పించే జాతీయ ఉపాధి హామీ పథకం మెల్లమెల్లగా నీరుకార్చివేయబడుతోంది. ఈ పథకం కింద లభించే వేతనం, జాతీయ కనీస వేతనం స్థాయి కంటే తక్కువ స్థాయిలో ఉంది. అలాగే, పథకం కింద 100 రోజుల పనిదినాలు చట్ట ప్రకారం కూలీలకు హామీ చేయబడగా, వాస్తవంలో 2023లో కేవలం 42-43 పనిదినాలు మాత్రమే కూలీలకు ఉపాధి లభించింది.
అలాగే, తగిన గిట్టుబాటు ధర లేక రైతాంగ ఆదాయాలు ఇప్పటికీ బొటాబొటిగానే ఉన్నాయి. ఈ క్రమంలోనే, ప్రస్తుతం పంజాబ్, హర్యానాలలో గోధుమల సేకరణలో-రైతులకిచ్చే కనీస మద్దతు ధరను సుమారు రూ.32 మేర తగ్గించివేయటం గమనార్హం. స్థూలంగా నేడు గ్రామీణ ప్రాంతాలలో ఒక తీవ్ర సంక్షోభ పరిస్థితి నెలకొని ఉన్నది. దీనికి అదనంగా నేడు దేశంలో పెరిగిపోతోన్న నిత్యావసరాల పరిస్థితి, గోరుచుట్టుపై రోకటి పోటులా మారింది. ఫలితంగానే నేడు గ్రామీణ ప్రజలు కూడా ఆహారేతర వినియోగాన్ని భారీగా తగ్గించుకుంటున్నారు. నిజానికి, పలు రకాల ఆహార పదార్థాల వినియోగాన్ని కూడా వారు తగ్గించుకుంటున్నారు. వరుసగా గత ఆరు త్రైమాసికాలుగా ఎఫ్ఎంసీజీ కంపెనీల (బిస్కెట్లు మొదలుకొని, సబ్బులు, శాంపుల వరకూ వివిధ నిత్యావసరాలను అమ్మే కంపెనీలు) అమ్మకాల స్థాయి గ్రామీణ ప్రాంతాలలో పడిపోతోంది. దీనంతటి ఫలితంగానే ‘అంతర్జాతీయ క్షుద్బాధ (ఆకలి) సూచిపై’ భారతదేశపు ర్యాంకు దిగజారిపోతోంది.
నిర్మలా సీతారామన్ చెబుతున్నట్టుగా-ధరల పెరుగుదలను తట్టుకోగలిగే విధంగా, ప్రజలకు రాయితీలేవీ అందకపోగా… నిజానికి వాటిపై కోతలు పడుతుండటం నేటి నిజం. కొవిడ్-లాక్డౌన్ల కాలంలో-దేశంలోని జనా లు పని చేసుకునే, ఆదాయాలను పొందగలిగే మార్గాలన్నీ మూసుకుపోయినప్పుడు కూడా, మోదీ ప్రభుత్వం ప్రజానీకంలోని కొద్దిపాటి మందికి-నెలకు కేవలం 500 రూపాయల మేర, కొద్ది నెలల కాలం పాటు మాత్రమే బదిలీ చేసింది. నిజానికి, ఆ కాలంలో ప్రజల కనీస అవసరాలు తీరేందుకు-నెలకు సుమారు గా 5000 రూపాయల మేరనైనా బదిలీ చేయాలని-కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ మొదలుకొని అజీం ప్రేమ్ జీ విశ్వవిద్యాల యం వరకూ అనేక మంది ఇచ్చిన సలహాల ను ప్రభుత్వం పెడచెవిన పెట్టింది. దీని ఫలితంగానే నాడు 2021 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికం (ఏప్రిల్-జూన్ 2020)లో దేశ స్థూల జాతీయోత్పత్తి-ప్రపంచ దేశాలలోనే అత్యధిక స్థాయిలో 27 శాతం మేర దిగజారింది. ఇది వాస్తవం..!!
కాగా, ఇక ఇప్పుడు ప్రపంచమంతా ద్రవ్యోల్బణం పెరుగుతున్న కాలంలో-మన దేశం నాడు కొవిడ్ కాలంలో భారీ ఉద్దీపనలను ఇవ్వకపోవటమే సరైన విధానంగా రుజువైందంటూ మన పాలకులు నిన్నటివరకూ డబ్బా కొట్టుకున్నారు. అయితే ఇప్పుడు ఐక్యరాజ్య సమితి అభివృద్ధి సంస్థ నివేదిక పేరిట- దేశం లో జనానికి ద్రవ్యోల్బణం దెబ్బ తగలలేదనీ… దానికి కారణం తాము వారికి రాయితీలు ఇస్తుండటమేనని నిర్మలా సీతారామన్ గారి ప్రభుత్వం చెప్పుకోవటం, అవకాశవాదం తాలూకు పరాకాష్ఠ.
మరోప్రక్కన స్వయానా మన ప్రధానమంత్రి మోదీ గారే-సంక్షేమ పథకాలపై, ‘ఉచితాలు’ ప్రమాదకరమంటూ, ‘పన్ను చెల్లింపుదారుల’ పేరిట దాడికి దిగటం తెలిసిందే. అంటే ఒకప్రక్క ఆచరణలో ప్రతి సంక్షేమ పథకం మీద కోతలు పెడుతూ, మరోప్రక్కన ప్రజలు తినే తిండి మీద కూడా జీఎస్టీ భారాన్ని మోపుతున్న ఈ ప్రభుత్వం వాస్తవాలను వక్రీకరించి… నిజాలను మసిపూసి మారేడుకాయ చేస్తూ కాలం గడుపుతోంది.
అయితే నేడు వెలువడుతోన్న అనేక గణాంకాలు, వెలుగులోకి వస్తోన్న సర్వేలు… ఆ మాటకొస్తే నిత్య జీవితంలో జనం అనుభవాలు భిన్నమైన వాస్తవాన్ని ఆవిష్కరిస్తున్నాయి. ‘ప్రైస్ వాటర్ కూపర్స్’ సంస్థ చేసిన ఒక సర్వే ప్రకారం, మన దేశంలోని 65 శాతం మంది జనాభా-తప్పనిసరి కాని అనేక అవసరాలపై నేడు కోతలు విధించుకుంటున్నారు. కడుపు కట్టుకొని కాలం ఈడుస్తున్నారు. తమ ఆర్థిక పరిస్థితి ఆందోళనకరంగా ఉందంటూ అంతర్జాతీయంగా సర్వేలో పాల్గొన్న 50 శాతం మంది జవాబు ఇవ్వగా… భారతదేశంలో మాత్రం ఈ ఆందోళన వెలిబుచ్చినవారి సంఖ్య 74 శాతంగా ఉండటం వాస్తవ పరిస్థితికి అద్దం పడుతోంది.
కాకులను కొట్టి గద్దలకు వేసే ధనికుల, కార్పొరేట్ల అనుకూల తమ ఆర్థిక విధానాలను మార్చుకోకుండా, ఈ విధానాల ఫలితంగా చితికిపోతున్న జనసామాన్యం బ్రతుకు వాస్తవాలను – అందమైన అబద్ధపు మాటల పరదాల చాటున దాచి పెట్టాలనే-బీజేపీ ప్రభుత్వ తీరు, మన ఆర్థిక స్థితికి మరింత నష్టమే చేస్తుంది.
ఇసుకలో తలదూర్చిన ఉష్ట్రపక్షిలా తన చుట్టూ ఉన్న వినాశకర, విధ్వంసక వాస్తవాన్ని చూసేందుకు బీజేపీ తిరస్కరిస్తోంది. వాస్తవంలో ఆర్థిక జీవితమే, రాజకీయాలపై అంతిమంగా పై చేయి కలిగి ఉంటుందనే, కనీస ఇంగితాన్ని విస్మరిస్తోంది. రాజకీయ ప్రత్యర్థులను వేధించటం… ఆశ్రిత పెట్టుబడిదారులకు దేశ సంపదను అప్పనంగా కట్టబెట్టడమే విధానంగా సాగుతున్న ఈ పాలన-ప్రజల కడగండ్లు ఒక పరిమితి మించి పెరిగిపోయిన మరుక్షణం-పేకమేడలా కూలిపోక తప్పదన్నది నిజం! ఈ నిజా న్ని చూడలేని పాలకులెందరో గతంలో చరిత్ర గర్భంలో కలిసిపోయారు. నిన్నగాక మొన్న రాత్రికి రాత్రే నిట్ట నిలువునా పేకమేడలా కదిలిపోయిన శ్రీలంక నేత రాజపక్సే ప్రభుత్వం దుస్థి తి, సమకాలీనంగా మన కండ్ల ముందే కనపడుతోంది! బహుపరాక్… ప్రజలతోనూ… సత్యంతోనూ చెలగాటం ప్రమాదకరం!
డి.పాపారావు
98661 79615