దేశ రైతాంగం మరోసారి రోడ్డెక్కింది. అన్నదాత ఆగ్రహం ఢిల్లీని చుట్టుముట్టి ఉక్కిరిబిక్కిరి చేస్తున్నది. ట్రాక్టర్లపై తరలివచ్చిన రైతన్నలపై పోలీసులు లాఠీలతో విరుచుకుపడుతూ, బాష్పవాయుగోళాలు విసురుతుండటం మనం చూస్తూనే ఉన్నాం. రైతులు ఎప్పటిలాగే సర్వసన్నద్ధంగా వచ్చారు. తిండీతిప్పలే కాదు, బాష్పవాయు గోళాలను ఎదుర్కొనేందుకు అవసరమైన సరంజామా తెచ్చుకున్నారు. అటు సర్కారు మాత్రం రైతులను ఎలాగైనా లొంగదీసుకొని వెనక్కి పంపాలని శతధా ప్రయత్నిస్తున్నది. ఓ వైపు చర్చలంటూనే.. మరోవైపు నిర్బంధాన్ని తీవ్రతరం చేస్తుండటం మోదీ ప్రభుత్వ ఆలోచనాధోరణిని స్పష్టం చేస్తున్నది.
రైతులు తమ వ్యవసాయ దిగుబడులకు గిట్టుబాటు ధర కోరుకోవడం ఎంతైనా సమంజసమే. కానీ, పంట దిగుబడుల మార్కెట్లో కొనుగోలుదార్లదే పైచేయి. వారిలో కారుచౌకగా వ్యవసాయ ఉత్పత్తులను ఎగరేసుకుపోవాలని చూసే కార్పొరేట్లూ ఉంటారు.
రైతులు గతంలో ఏడాదికిపైగా జరిపిన చరిత్రాత్మక పోరాటం ఈ సందర్భంగా మనకు గుర్తుకు రాకమానదు. మూడు వ్యవసాయ నల్లచట్టాలకు వ్యతిరేకంగా అప్పట్లో కర్షకలోకం జరిపిన ఆ అవిశ్రాంత పోరాటాన్ని అణచివేసేందుకు ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర సర్కార్ సామ, దాన, దండ, భేదోపాయాలను ఉపయోగించింది. అయినా ఆందోళన అదుపులోకి రాకపోవడంతో దిగివచ్చింది. ప్రధాని మోదీ స్వయంగా కెమెరా ముందుకొచ్చి వివాదాస్పద చట్టాలను ఉపసంహరించుకుంటున్నట్టు ప్రకటించారు.
అంతేకాకుండా క్షమాపణలు కూడా చెప్పారు. రైతుల డిమాండ్లు అన్నిటినీ పరిశీలించి, పరిష్కరిస్తామని హామీ కూడా ఇచ్చారు. ఆ డిమాండ్లలో కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించాలనేది ముఖ్యమైనది. రైతాంగాన్ని కార్పొరేట్ ప్రపంచానికి కట్టుబానిసలను చేసే నల్లచట్టాలు ఉపసంహరించుకోవడం గొప్ప విజయమే. కానీ, కనీస మద్దతు ధర అంతకన్నా ముఖ్యమైన జీవన్మరణ సమస్య రైతులకు.
కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించేందుకు కేంద్రం సంసిద్ధంగా లేదనేది తెలిసిందే. ఇప్పుడు రైతులు ఢిల్లీపై సమరభేరి మోగించడానికి రుణమాఫీ, రైతులు, రైతుకూలీలకు పింఛన్లు, ఢిల్లీ ఆందోళన మృతుల కుటుంబాలకు పరిహారం, ఉద్యోగం, 2020 విద్యుత్తు బిల్లు ఉపసంహరణ, వ్యవసాయానికి ఉపాధిహామీ పనులను రెట్టింపు చేయడం, మిరప, పసుపుపై జాతీయ కమిషన్ల ఏర్పాటు వంటి పలు ఇతర డిమాండ్లతో పాటు కనీస మద్దతు ధర కూడా ఓ ముఖ్య కారణం.
ఎందుకంటే, రైతులు తమ వ్యవసాయ దిగుబడులకు గిట్టుబాటు ధర కోరుకోవడం ఎంతైనా సమంజసమే. కానీ, పంట దిగుబడుల మార్కెట్లో కొనుగోలుదార్లదే పైచేయి. వారిలో కారుచౌకగా వ్యవసాయ ఉత్పత్తులను ఎగరేసుకుపోవాలని చూసే కార్పొరేట్లూ ఉంటారు. ఈ మార్కెట్లోకి సరుకు తెచ్చే రైతుకు కొనుగోలుదారు ఇచ్చిన ధరను పుచ్చుకొని ఇంటికి పోవడం మినహా గత్యంతరం ఉండదు. ఎన్నో ఆటుపోట్లను తట్టుకొని పంటను పండించే రైతుకు చివరి ఘట్టంలో అరిగోస పెట్టే అతిపెద్ద సమస్య ఇదే. ఈ అంశంపై ఆర్థికవేత్తల మధ్య ఏకాభిప్రాయం లేకపోవడం గమనార్హం.
కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పిస్తే కేంద్రం హీనపక్షం రూ.10 లక్షల కోట్లు కేటాయించాల్సి ఉంటుందనేది వ్యతిరేకులు ముందుకు తెస్తున్న వాదన. ఇది మొన్నటి తాత్కాలిక బడ్జెట్లో మౌలికరంగానికి కేంద్రం కేటాయించిన రూ.11 లక్షల కోట్లకు దగ్గరగా ఉంది. పైగా మద్దతు ధర ఎటూ వస్తుంది కనుక పనికిమాలిన పంటలు రైతులు పండిస్తారనేది వీరు సన్నాయినొక్కులు నొక్కుతున్నారు. ధర మార్కెట్ అవసరాలను బట్టి ఉండాలని, పంటలు కూడా డిమాండ్ను బట్టే వేయాలని వారంటున్నారు. రైతులకు ధర కన్నా ఆదాయం సమకూర్చడం మంచిదని మరికొందరు ఆర్థికవేత్తల మాట. ఈ ఆదాయం ఏ రూపంలో ఉండాలి? అంటే కేంద్రం అనుసరిస్తున్న కిసాన్ సమ్మాన్ తరహాలో రైతుకింత అని లేదా తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతుబంధు తరహాలో ఎకరానికి, కారుకు ఇంత అని పెట్టుబడి సాయం అందించాలనేది ఈ వర్గం ఆర్థికవేత్తల అభిప్రాయం. దీనిద్వారా రైతుకు పెట్టుబడి భరోసా లభిస్తుంది. ఏ పంట వేయాలనేది తన విజ్ఞత మీద, అంటే మార్కెట్ డిమాండ్పై ఆధారపడి ఉంటుంది.
అయితే మద్దతు ధర లేకపోతే రైతుకు మార్కెట్ ఆటుపోట్ల నుంచి రక్షణ ఉండదనేది తెలిసిందే. రైతు ఎన్నో సమస్యలను ఎదుర్కొని పంట పండిస్తాడు. పండిన పంటను కాపాడుకోవడమూ పెద్ద సమస్యే. పంట చేతికందే సమయంలో ప్రకృతి ప్రకోపిస్తే అంతే సంగతులు. ఇలా అష్ట దిగ్బంధనంలో వ్యవసాయం సాగించే రైతుకు పెట్టుబడి సాయంతో పాటుగా మద్దతు ధర అండదండలు కావాల్సిందే. ఢిల్లీని చుట్టుముట్టిన రైతులు ఇదే అంటున్నారు.
వ్యవసాయం ద్వితీయ ఆదాయవనరుగా ఉన్నవారి మాటేమో గానీ వ్యవసాయమే జీవనోపాధిగా ఉన్న రైతులకు మాత్రం తప్పనిసరిగా మద్దతు ధర ఉండాల్సిందే. తక్కువ ధరకు పంటను కొనుగోలు చేయాలనుకునే కొనుగోలుదార్లకు, ముఖ్యంగా కార్పొరేట్లకు ఇది కంటగింపుగా ఉంటుంది. బడా వ్యాపారులకు కొమ్ముకాసే కేంద్ర సర్కారు సహజంగానే మద్దతు ధర డిమాండ్ను ఒప్పుకోకపోవడంలో వింతేమీ లేదు. అందుకే రైతుల ఆందోళనను అన్నిరకాలుగా అణచివేయాలని చూస్తున్నది. ఓవైపు చర్చల ప్రక్రియను కొనసాగిస్తున్నట్టు కనిపిస్తూనే మరోవైపు మూకుమ్మడిగా రైతులను అరెస్టు చేసి స్టేడియాలు సహా ఇతర ప్రాంతాల్లో నిర్బంధించాలని చూస్తున్నది. కానీ, ఢిల్లీలోని ఆప్ సర్కారు అందుకు సహకరించకపోవడంతో అది కుదరలేదనేది వేరే సంగతి.
శ్రమదమాదులకోర్చి పండించిన పంటకు కనీస మద్దతు ధరను రైతులు కోరుకోవడం ఏ రకంగా చూసినా సబబే. మార్కెట్ మాయాజాలాన్ని ఎదుర్కోవడంలో ఇదొక్కటే సరైన రక్షణ కల్పిస్తుందని వారి గట్టి నమ్మకం. ఎన్నో రాయితీలు పొందే పారిశ్రామికవేత్తల ఉత్పత్తులకు గరిష్ఠ ధరలుంటాయి. ఎన్నో సమస్యలతో పోరాడుతూ మన ఆకలి తీరుస్తున్న రైతులకు కనీస మద్దతు ధర కల్పించడం ఎంతైనా అవసరం. అందుకు చిత్తశుద్ధితో, నిండుమనసుతో కేంద్రం వారితో చర్చలు జరిపి న్యాయమైన డిమాండ్లు పరిష్కరిస్తే రైతుకు, దేశానికి మేలు జరుగుతుంది.
తుమ్మలపల్లి రఘురాములు
91827 77750