‘ధరణి’ పోర్టల్లో అక్రమాలు జరుగుతున్నాయని నిరాధార ఆరోపణలు చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం.. ఆ పోర్టల్ స్థానంలో ‘భూ భారతి’ని తీసుకొచ్చింది. అయితే, దానిని అమలు చేయలేక ఆపసోపాలు పడుతోంది. అధికారం చేపట్టి రెండున్నరేళ్లు దాటినా దానిని పూర్తిస్థాయిలో నిర్వహించలేకపోతోంది. దీంతో రైతులు ఏళ్లతరబడి భూ సమస్యలతో సతమతమవుతున్నారు. అయితే, రైతుల సమస్యలను పరిష్కరించలేకపోతున్న రేవంత్రెడ్డి సర్కార్.. ఇప్పుడు భూభారతి ఆపరేటర్ల(బీబీవో)ను తొలగించాలని నిర్ణయించింది. ఇందుకు ఇటీవల ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేసింది. భద్రాద్రి జిల్లా వ్యాప్తంగా కలెక్టరేట్తోపాటు 23 మండలాల్లో ఆపరేటర్లు పనిచేస్తున్నారు. ప్రభుత్వ తాజా నిర్ణయంతో ఇప్పుడు ఆపరేటర్లు రోడ్డున పడ్డారు. తమను యథావిధిగా కొనసాగించాలని లేదా ప్రత్యామ్నాయ ఉపాధి కల్పించాలని వారు వేడుకుంటున్నారు.
-అశ్వారావుపేట, ఆగస్టు 6
వ్యవసాయ భూములకు భద్రత, భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం సాకుతో కాంగ్రెస్ ప్రభుత్వం భూ భారతి పోర్టల్ను తీసుకొచ్చింది. గత కేసీఆర్ ప్రభుత్వం తీసుకొచ్చిన ‘ధరణి’ పోర్టల్లో అన్ని అక్రమాలు జరుగుతున్నాయని కుంటి సాకులు చెప్పి దానిని రద్దు చేసింది. అప్పటి వరకు ధరణి పోర్టల్లో భూ లావాదేవీలన్నీ సాఫీగా సాగినప్పటికీ దానిని రద్దు చేసి భూ భారతి పోర్టల్ తీసుకొచ్చింది. దీని అమల్లో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటూనే ధరణి పోర్టల్ను సుమారు రెండేళ్లు వినియోగించుకుంది. రైతులకు పారదర్శకంగా మెరుగైన సేవలు అందించాలనే లక్ష్యంతో గత కేసీఆర్ ప్రభుత్వం 2018లో ల్యాండ్ రికార్డ్స్ అప్డేషన్ ప్రోగ్రామ్(ఎల్ఆర్యూపీ) కింద ఫీల్డ్ టెక్నికల్ స్టాఫ్(ఎఫ్టీఎస్)ను తాత్కాలిక పద్ధతిలో నియమించింది. తర్వాత 2020లో ‘ధరణి’ పోర్టల్ను తీసుకొచ్చి.. వీరినే ఆపరేటర్లుగా కొనసాగించింది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ‘భూభారతి’ తీసుకొచ్చినా.. ధరణి ఆపరేటర్లనే భూ భారతి ఆపరేటర్లుగా కొనసాగించింది. కానీ, అకస్మాత్తుగా మూడు రోజుల క్రితం భూభారతి ఆపరేటర్లను తొలగించాలని నిర్ణయించింది. అనుకున్నదే తడవుగా ఉత్తర్వులు జారీ చేసింది. కాంగ్రెస్ సర్కార్ చర్య ఫలితంగా ఆపరేటర్ల భవిష్యత్ అగమ్యగోచరంగా తయారైంది.
జిల్లావ్యాప్తంగా 23 మండలాల్లో 25 ఆపరేటర్ పోస్టులు మంజూరయ్యాయి. వీరిలో కలెక్టరేట్లో ఇద్దరు, 23 మండలాల్లో మరో 21 మంది ఆపరేటర్లు పనిచేస్తున్నారు. అశ్వారావుపేట, చర్ల మండలాల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో కేవలం రిజిస్ట్రేషన్లకు అవకాశం ఉన్న ఐదు(అశ్వారావుపేట, పాల్వంచ, సుజాతనగర్, అశ్వాపురం, బూర్గంపహాడ్) మండలాల్లోనే ఆపరేటర్లను కొనసాగించాలని ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. కానీ, ఇప్పటికే అక్కడ పనిచేస్తున్న ఆపరేటర్లను మాత్రమే కొనసాగించాలని స్పష్టంగా పేర్కొనలేదు. లేదంటే, తొలగించిన 21 మందిలో ఎవరైనా ఓ ఐదుగురిని ఆ ఐదు స్థానాల్లో విధుల్లోకి తీసుకోవాలా? అనే విషయంపై కూడా స్పష్టత లేదు. దీంతో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. గత్యంతరంలేక ఆపరేటర్లు పోరుబాట పట్టారు. దశలవారీగా ఆందోళన నిర్వహిస్తున్నారు.
ఇదిలా ఉంటే, తొలగించిన ఆపరేటర్ల స్థానంలో జూనియర్ అసిస్టెంట్లకు బాధ్యతలు అప్పగించాలని కాంగ్రెస్ ప్రభుత్వం తన ఉత్తర్వుల్లో పేర్కొంది. భద్రాద్రి జిల్లాలోని 23 మండలాల్లో ఐదుగురు ఆపరేటర్లు కొనసాగితే మిగతా 18 మండలాల్లో జూనియర్ అసిస్టెంట్లు బాధ్యతలు తీసుకోనున్నారు. వీరికి ప్రభుత్వం ప్రత్యేకంగా శిక్షణ కూడా ఇచ్చేందుకు స్పష్టమైన సూచనలు చేసింది. వీరు భూ రికార్డుల నిర్వహణ, రిజిస్ట్రేషన్లు, ఫిర్యాదుల పరిష్కారం, సాదాబైనామా, 22-ఏ, పౌర సేవలు, డేటా నిర్వహణ, ఎన్నికల విధులు, ప్రజాపాలన కార్యక్రమాలు, పోర్టల్, ఎస్ఐఆర్ ఎంట్రీ, గ్రీవెన్స్ వంటి కీలక సేవలు అందించాల్సి ఉంటుంది.
భూ భారతి ఆపరేటర్లకు కాంగ్రెస్ ప్రభుత్వం 15 నెలల వేతనాలను పెండింగ్ పెట్టింది. 2025 ఏప్రిల్ నుంచి 2026 మార్చి వరకు 11 నెలల వేతనాలను చెల్లించలేదు. ఈ బిల్లులు ఫైనాన్స్ శాఖలో పెండింగ్లో ఉన్నాయి. మరో 4 నెలల బిల్లులు రెన్యూవల్ లేకపోవడంతో టోకెన్ జనరేట్ కాక సీసీఎల్ఏ కార్యాలయంలో పెండింగ్లో ఉన్నాయి. మొత్తం 15 నెలల వేతనం చెల్లించాలి. ఈ ఆపరేటర్ల వివరాలు ఇప్పటివరకు ఐఎఫ్ఎంఐఎస్ పోర్టల్లో నమోదు చేయలేదు. గతంలో భూరికార్డుల ప్రక్షాళన కోసం అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ ఆపరేటర్లను ఎఫ్టీఎస్ ఉద్యోగులుగా సమాచార సాంకేతిక (ఐటీ) శాఖ ద్వారా నియమించింది.
ఆ తరువాత వీరే ధరణి ఆపరేటర్లుగా, భూభారతి ఆపరేటర్లుగా కొనసాగుతున్నారు. పోర్టల్ నిర్వహణ, భూ సంబంధిత సేవలు అందించడంలో వీరు కీలకంగా ఉన్నారు. గత ప్రభుత్వం వీరి వేతనాలను టీజీటీఎస్ అనుబంధ సంస్థలైన రామ్ ఇన్ఫో, ఓటీఎస్ఐ ఏజెన్సీల ద్వారా చెల్లించింది. ఇప్పుడు వీరి వివరాలను ఐఎఫ్ఎంఐఎస్ పోర్టల్లో ఇప్పటివరకు నమోదు చేయలేదన్న కారణంతో ప్రతి నెలా ఒకటో తేదీన వేతనాలు అందడం లేదు. అసలు 15 నెలలు నుంచీ వేతనాలు జమ చేయడం లేదు.
గత ఎనిమిదేళ్లుగా సేవలందిస్తున్న తమను యథావిధిగా కొనసాగించాలి. లేదా ప్రత్యామ్నాయ ఉపాధి కల్పించాలి. భూ సంబంధిత సేవలను అంకితభావంతో అందించాం. ప్రభుత్వం తీసుకున్న ఈ ఆకస్మిక నిర్ణయంతో మాలాంటి ఆపరేటర్లపై ఆధారపడిన వందల కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. వారి కుటుంబాల భవిష్యత్ను దృష్టిలో పెట్టుకొని ఆపరేటర్లకు న్యాయం చేయాలి.
-కే.భగత్, భూ భారతి ఆపరేటర్ల సంఘం జిల్లా అధ్యక్షుడు, కొత్తగూడెం