ప్రజారంజక పాలన అనేది ఒక గొప్ప బాధ్యతతో కూడిన నైపుణ్యం. అందులో ఆరితేరితేనే ప్రజలిచ్చిన అధికార పీఠానికి సార్థ్ధకత చేకూర్చిన వారవుతారు. మంచి పాలకుడిగా ప్రజలను మెప్పించగలుగుతారు. లేకపోతే ఆ ప్రజలే అధికార పీఠం నుంచి పడదోస్తారు. పాలకులు ప్రజారంజక పాలన అందిస్తూ శ్రేయోరాజ్యాన్ని నిర్మించాలి. కానీ నేటి పాలకులు తమకిష్టమైన వాళ్లు ఎన్ని తప్పులు, ఎంత అవినీతి చేసినా చూసీచూడనట్టుగా ఉంటున్నారు. అదే గిట్టనివారు చిన్న తప్పుచేసినా పెద్ద రాద్ధాంతం చేస్తున్నారు. కక్ష ధోరణిని ప్రదర్శిస్తున్నారు.
ప్రజాపాలన అంటే? కల్లబొల్లి మాటలు చెప్పడం, ఆచరణ కాని హామీలు ఇవ్వడం, అరచేతిలో స్వర్గం చూపడం కానే కాదు. పారదర్శకమైన పాలన అందించడం. అవినీతికి పాల్పడకపోవడం, బంధుప్రీతి చూపకపోవడం. అలాంటి సచ్ఛీలత కలిగిన పాలకులనే ప్రజలు కోరుకుంటారు. లేకపోతే ఎంతటి సమర్థ పాలకుడైనా ప్రజావ్యతిరేక హోరులో కొట్టుకపోక తప్పదు.
సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ దేశంలోని రాజకీయ పార్టీ లు రెండు కూటములుగా ఏర్పడ్డాయి. ఎన్డీయే కూటమిలో 38 పార్టీలు, ప్రతిపక్షాలతో కూడిన ఇండియా కూటమిలో 26 పార్టీలు చేరాయి. జూలై 20 నుంచి మొదలైన పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ఆగస్టు 11 వరకు జరుగనున్నాయి. 17 రోజులపాటు కొనసాగే సమావేశాల్లో ఏడు పాత బిల్లులతో పాటు 21 కొత్త బిల్లుల జాబితాను కేంద్ర ప్రభుత్వం సిద్ధం చేసినట్టు తెలుస్తున్నది. ఈ బిల్లులతో పాటు అనేక ప్రజా సమస్యలపై అస్త్రశస్ర్తాలతో పార్లమెంటులో ఒకరినొకరు నిలదీసుకునేందుకు ఎన్డీయే, ఇండియా కూటములు సిద్ధమయ్యాయి. అలాగే రాబోయే ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని వ్యూహప్రతివ్యూహాల్లో రెండు కూటములు తలమునకలయ్యాయి.
ప్రధానంగా మణిపూర్ మారణకాండ, ఢిల్లీ ఆర్డినెన్స్, ఉమ్మడి పౌరస్మృతి (యూసీసీ), ధరల పెరుగుదల, ద్రవ్యోల్బణం, మహిళా రిజర్వేషన్ బిల్లు, దర్యాప్తు సంస్థల దుర్వినియోగం, రైల్వే భద్రత, అతివృష్టి- అనావృష్టి, సరిహద్దుల్లోని పరిస్థితులు వంటి అనేక అం శాలు చర్చకు వచ్చేలా చూడాలని ఇండియా కూటమి డిమాండ్ చేస్తున్నది. అయితే అధికారదర్పంతో ఎదురుతిరిగి ఇండియా కూటమిని ఇరకాటంలో పెట్టడానికి పాలకపక్షం సిద్ధమైంది. అంతేకాకుండా గత రాజకీయ కూటముల విఫల చరిత్రను ఏకరువు పెట్టడంతోపాటు తామే ఈ దేశానికి సమర్థ్ధవంతమైన పాలన అందించగలమని డప్పు కొట్టుకునేందుకు ఎన్డీయే కూటమి శతవిధాలా ప్రయత్నిస్తున్నది. రెండు కూటములు తమ తమ రాజకీయ ఎత్తులు జిత్తులతో విలువైన సభాకాలాన్ని వృథా చేస్తున్నాయి.
75 ఏండ్ల స్వాతంత్య్ర అమృతోత్సవాలు జరుపుకొన్నాం. కానీ దేశంలోని వ్యవస్థలను బాగుచేసుకోలేకపోతున్నాం. సమానత్వం, ప్రజాస్వామ్యం, మత సామరస్యం, మహిళా స్వేచ్ఛ, ఆర్థిక పురోగతి వంటి అంశాల్లో దేశం దిగజారి పోతుండటం ఆందోళనకరం. కూటముల కోట్లాటలతోనే పార్లమెంట్ సమావేశాలు ముగిసిపోతున్నాయి. ప్రజా సమస్యలపై చర్చలు ఎవరికీ పట్టడం లేదు. నాటి స్వాతంత్య్ర సమరయోధుల ధన, మాన, ప్రాణ త్యాగాలకు ఇచ్చే గౌరవం ఇదేనా?
రాజకీయాలకతీతంగా ప్రజా సమస్యలే అజెండాగా పార్లమెంటులో చర్చలు జరుగాలి. ప్రజారంజక చట్టాలు రావాలి. అవి క్షేత్రస్థాయిలో అమలు జరిగి సమ్మిళిత అభివృద్ధి సాధించాలి. కులాలు, మతాలు, ప్రాంతాలు, వివక్ష, భావోద్వేగాలు, ఆత్మగౌరవాల్ని రెచ్చగొట్టే ఓటు బ్యాంకు రాజకీయాలు ఏ కూటమికైనా మంచిది కాదు. నాటి సమరయోధుల త్యాగాల స్ఫూర్తితో నేటి రాజకీయ నాయకులు, సమాజం ముందుకుసాగాలి. ప్రజలు, నేటి ప్రజాప్రతినిధులు దీని గురించి ఆలోచించాలి.
మేకిరి దామోదర్
95736 66650