మన దేశం ప్రపంచంలో తలెత్తుకొని నిలిచేందుకు మన పీవీ నరసింహారావు తీసుకువచ్చిన ఆర్థిక సంస్కరణలు ఎంతో దోహదం చేశాయి. అదే తెలంగాణ నుంచి మరో నాయకుడు దేశం స్థితిగతులు మార్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆయనే కేసీఆర్. పీవీ ఆర్థిక సంస్కరణలకు దోహదం చేస్తే, దేశంలో రాజకీయ సంస్కరణలకు కేసీఆర్ నడుం బిగించారు.
‘తెలంగాణ బిడ్డ ఆవేశపరుడు. అంతర్ముఖ త్వం, తిరుగుబాటుతనం సమపాళ్లలో ఉంటా యి. లౌక్యం తెలియని అమాయకత్వం, ముక్కుసూటితనం, ధర్మాగ్రహం ఇక్కడి మని షి ఆత్మను పట్టిస్తాయి. ఈ మట్టిలోనే అలాంటి తత్వం ఉన్నది. న్యాయమైన పోరాటం ఈ మట్టి నుంచి తప్ప ఇంకో చోట వచ్చే అవకాశం లేదు’ అని దాశరథి రంగాచార్య తెలంగాణ భూమిపుత్రుల గురించి గొప్పగా చెప్తారు. ప్రజాస్వామ్యాన్ని కాలరాచి, అన్ని వ్యవస్థలను గుప్పిట్లో పెట్టుకొని, నియంతృత్వం వైపు దేశా న్ని తీసుకువెళ్తున్న సమయంలో ఈ మట్టి నుం చే ఓ స్వరం ధర్మాగ్రహాన్ని ప్రకటిస్తున్నది. దాశరథి రంగాచార్య ధర్మ పోరాటాన్ని నడిపించిన ఖమ్మం జిల్లానుంచే బీఆర్ఎస్ తొలి బహిరంగ సభ ద్వారా కేసీఆర్ శంఖారావం పూరిస్తుండటం విశేషం. తెలంగాణ సాయుధ పోరాటానికి కేంద్రంగా నిలిచిన జిల్లా ఖమ్మం. తొలి దశ తెలంగాణ ఉద్యమం మొదలైంది కూడా ఇక్కడే.
తమిళనాడుకు చెందిన ప్రముఖ ఆర్థిక నిపుణులు, బీజేపీ అభిమాని ప్రొఫెసర్ వైద్యనాథన్.. ఆ పార్టీకి చెందిన ఒక ఛానల్లో మాట్లాడుతూ.. ప్రధాని మోదీ తన టేబుల్పై పీవీ ఫొటో పెట్టుకొని ఆయన చూపిన మార్గంలో ముందుకువెళ్లాలని సూచించారు. విదేశీ మారకద్రవ్యం నిల్వలు అడుగంటిపోయి, దేశంలో ని బంగారాన్ని విదేశాల్లో తాకట్టు పెట్టిన దశలో ప్రధాని పదవి చేపట్టి ఆర్థికసంస్కరణల ద్వారా దేశాన్ని ప్రగతి పథంలో నిలిపారు పీవీ. ప్రపంచంలో ఐదో పెద్ద ఆర్థికవ్యవస్థగా నేడు భారత్ నిలబడిందంటే దానికి కారణం పీవీ సంస్కరణలే. 1990ల నాటి దేశ పరిస్థితుల వల్ల అప్పు డు ఆర్థిక సంస్కరణలు అవసరమయ్యాయి. ఇప్పుడు అరాచక పరిస్థితులు రాజకీయ సం స్కరణల ఆవశ్యకతను తెలియజేస్తున్నాయి.
సకల వ్యవస్థలను భ్రష్టు పట్టిస్తున్నారు. బీజేపీయేతర ప్రభుత్వాలను కూలుస్తున్నారు. ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తూ ప్రభుత్వాలను ఏర్పాటుచేస్తున్నారు. అలా సాధ్యం కాని రాష్ర్టా ల్లో ప్రభుత్వాలపై కక్షసాధింపు చర్యలకు దిగుతున్నారు. మన రాష్ట్రంలో స్వయంగా గవర్నర్ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెడుతున్నారు. ఓ ఛానల్ ఇంటర్వ్యూలో ఆవిడ బాహాటంగానే మా పార్టీ అంటూ బీజేపీ గురించి చెప్పుకొచ్చారు. తమిళనాడు గవర్నర్కు తమిళనాడు అనే పేరు నచ్చటం లేదట. తన పేరున వెలువడిన ఆహ్వానపత్రంలో రాష్ట్రం పేరు మార్చారు. అంబేద్కర్, పెరియార్ల పేర్లు పలకటానికి ఇష్టపడక ఆ పేర్లున్న పేరాను గవర్నర్ ప్రసంగంలో ఆయన వదిలేశారు. తెలంగాణ, తమిళనాడు, కేరళ, ఢిల్లీ, బెంగాల్, జార్ఖండ్.. బీజేపీయేతర పార్టీలు అధికారంలో ఉన్న ప్రతి చోట గవర్నర్లు బీజేపీ ప్రతినిధుల్లా వ్యవహరిస్తున్నారు. మాట వింటే సరి, లేదంటే సీబీఐ, ఈడీ తదితర వ్యవస్థలను రంగంలోకి దింపుతున్నారు. మనకెందుకు.. మన ప్రభుత్వం బాగుంటే చాలని ఏ రాష్ర్టానికి ఆ రాష్ట్రం ఈ అరాచకాలను భరిస్తూ ఉంటే ఏ రాష్ట్ర ప్రభుత్వమూ మిగలదు. దేశంలో ఎక్కడో ఒకచోట నుంచి ధిక్కారస్వరం వినిపించాల్సిందే. ఆ మహత్తర చారిత్రక బాధ్యతను తెలంగాణ స్వీకరించింది. తెలంగాణ బిడ్డడు తిరుగుబాటు బావుటాను ఎగురవేస్తూ, ప్రజాస్వామ్య పరిరక్షణకు బయల్దేరాడు.
ఆర్థిక సంస్కరణలు చేపట్టిన పీవీ వ్యక్తిగతం గా పొందిన ప్రయోజనమంటూ ఏమీ లేదు. చివరికి కోర్టు కేసులకు న్యాయవాది ఫీజుల కోసం ఇంటిని అమ్ముకున్నారు. వ్యక్తిగత ప్రయోజనాలు ఆశించి పీవీ ఆర్థిక సంస్కరణ లు తీసుకురాలేదు. దేశం సంక్షోభం నుంచి గట్టెక్కాలంటే అంతకుమించి మార్గం లేదని తీసుకువచ్చారు. పీవీ తెలంగాణలోని ఒక కుగ్రామం నుంచి రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. కేసీఆర్ సైతం ఒక గ్రామం నుంచే రాజకీయ జీవితం మొదలుపెట్టారు. ఇద్దరూ పలు భాషల్లో చక్క గా మాట్లాడగలరు. సంస్కరణలకు స్వాగతం పలికే తత్వంగలవారు. కడుపు నకనకలాడుతుంటే బుర్రకు చదువేం అబ్బుతుందని ఉమ్మడి ఏపీ విద్యాశాఖ మంత్రిగా ఉన్నప్పుడు పీవీ గురుకులాలకు శ్రీకారం చుట్టారు. అవి ఎంతోమంది జీవితాలను తీర్చిదిద్దాయి. నాటి గురుకులాల తరహాలోనే నేటి దళితబంధు ఒక విప్లవాత్మక పథకం. రాజకీయంగా లాభమా? నష్టమా? అనే కోణంలో కాకుండా.. ఇంకెన్ని తరాల వాళ్లు వివక్ష అనుభవించాలి, వారికీ అభివృద్ధి ఫలాలు అందాలనే కోణంలో దళితబంధు అమలు చేస్తున్నారు. ఇప్పుడు బీజేపీ విధానాలపై బీఆర్ఎస్ రూపంలో కేసీఆర్ ధ్వజమెత్తింది కూడా రాజకీయ ప్రయోజనాల లెక్కల కోసం కాదు. బీజేపీ విధానాలు ఇలానే కొనసాగితే దేశ ఐక్యత ప్రమాదంలో పడుతుంది. మతం పేరుతో రాజకీయాలు బీజేపీకి ప్రయోజనం కలిగించవచ్చు కానీ దేశానికి తీరని నష్టం. మత ప్రాతిపదికన ఏర్పడిన పాకిస్థాన్లో ఇప్పు డు తిండికి కూడా కరువే. గోధుమ పిండి కోసం కొట్టుకుంటున్నారు. ఆ దేశం అంతర్యుద్ధం వైపు అడుగులు వేస్తున్నదా? ఉంటుం దా? ముక్కలవుతుందా? అనే సందేహాలు వినిపిస్తున్నాయి. మత రాజకీయాల వల్ల దేశం ఎటు వెళ్తుంది అనేందుకు పాకిస్థాన్ మన కళ్ళ ముందు కనిపిస్తున్న సత్యం. మనం అదే దారిలో వెళ్దామా? వెలుగుల వైపు పయనిద్దామా? అని దేశమే నిర్ణయించుకోవాలి.
(వ్యాసకర్త: సీనియర్ జర్నలిస్ట్)
-బుద్దా మురళి
98499 98087