కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అంబానీ, అదానీ లాంటి కార్పొరేట్లకు దేశ సంపదను దోచి పెడుతున్నది. కోట్ల రూపాయలు వెచ్చించి ప్రజా ప్రతినిధులను కొనుగోలు చేసి బీజేపీయేతర ప్రభుత్వాలను పడగొడుతున్నది. చట్ట సభల్లో వ్యాపారుల ప్రాతినిధ్యాన్ని ప్రోత్సహించి ప్రజా వ్యతిరేక చట్టాలు తీసుకు వస్తున్నది. ఈ నేపథ్యంలో న్యాయస్థానాలు, ప్రజలు ధన, నేరమయ రాజకీయాలకు వ్యతిరేకంగా తీర్పు ఇస్తేనే ప్రజాస్వామ్యంలో మార్పులు వస్తాయి. రాజ్యాంగ సంస్థలను కాపాడుకోవచ్చు. దేశంలో అవినీతి పాలనను అంతం చేయవచ్చు.
అత్యధిక లాభాలను ఆర్జిస్తున్న ప్రభుత్వ రంగ సంస్థలను అప్పనంగా కార్పొరేట్ సంస్థలకు తెగనమ్మి దేశాన్ని అప్పుల పాలు చేయడంలో మోదీ ప్రథమ స్థానాన్ని ఆక్రమించారు. ఇప్పటికే బొగ్గు గనులు, ఓడ రేవులు, ఉక్కు పరిశ్రమలు, ఎల్ఐసీ లాంటి వాటిని కార్పొరేట్ దిగ్గజాలకు కట్టబెట్టి దేశాన్ని భ్రష్టు పట్టించారు. తన కార్పొరేట్ మిత్రులు అదానీ, అంబానీలను ప్రపంచ కుబేరులుగా తీర్చిదిద్దడంలో ప్రధాని మోదీ పాత్ర అమోఘమైనది. ఫోర్బ్స్ జాబితా ప్రకారం అదానీ ఆస్తుల విలువ సుమారు రూ.12 లక్షల కోట్లు కాగా, ముకేశ్ అంబానీ ఆస్తుల విలువ సుమారు రూ.8 లక్షల కోట్లు. స్వాతంత్య్ర వజ్రోత్సవాలను అట్టహాసంగా ప్రారంభించిన నరేంద్ర మోదీ దేశ ప్రజల మేలు కోసం చేసిన ఘన కార్యాలు మాత్రం ఒక్కటీ కూడా లేకపోవడం దారుణం. నల్ల డబ్బును వెనక్కి తీసుకొస్తానని చెప్పి పెద్ద నోట్లు రద్దు చేశారు. అది ఎవరికి ఉపయోగపడిందో ఇప్పటికీ మోదీకే తెలియదు. విదేశాల్లోని నల్ల డబ్బును తీసుకురాకపోగా, ఇప్పుడు అది రెండింతలైంది. సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన మోదీ ప్రభుత్వం ఇప్పటిదాకా ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిందో స్పష్టం చేయాలి.
బీజేపీలో చేరితే పునీతులే
ప్రతిపక్షాలు లేని ప్రభుత్వాలను కోరుకుంటున్న నరేంద్ర మోదీ, ఎనిమిది రాష్ర్టాల్లో బీజేపీయేతర ప్రభుత్వాలను కూలదోసి బీజేపీ లేదా దాని మిత్ర పక్షాల ప్రభుత్వాలను ఏర్పాటు చేశారు. ఇది ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగించే చర్య. తమకు లొంగని రాష్ట్ర ప్రభుత్వాల నాయకులపైన ఈడీ, ఐటీ, సీబీఐ దాడులు జరిపి వారిని భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. ఆ విధంగా వారిని తమ పార్టీలో చేర్చుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. వేరే పార్టీలో అవినీతిపరులుగా ఉన్నవారు బీజేపీలో చేరగానే ఎలా పునీతులవుతారో కమలం పార్టీ నాయకులే చెప్పాలి. ఇలా రాజ్యాంగ వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న బీజేపీ ప్రభుత్వం దేశాన్ని భ్రష్టు పట్టిస్తున్నది. ఈ నేపథ్యంలో ప్రజా ప్రాతినిధ్య చట్టాన్ని బలోపేతం చేయాల్సిన అవసరం ఉన్నది. ఎమ్మెల్యేలను, ఎంపీలను కోట్ల రూపాయలు పెట్టి కొనుగోలు చేయడం, వారికి పెద్ద కాంట్రాక్టులు అప్పజెప్పడం బీజేపీ పెద్దలకు అలవాటుగా మారింది. ప్రజల మధ్య మత విద్వేషాలను రెచ్చగొట్టి అధికారాన్ని నిలుపుకొని దేశమంతటా హిందుత్వ భావజాలం వ్యాప్తి చేసే వరకు బీజేపీ నేతలకు నిద్ర పట్టదని వారి విధానాలు స్పష్టం చేస్తున్నాయి. అవినీతి తారా స్థాయికి చేరుకున్నది.
కింది స్థాయి నుంచి ప్రలోభమే
దేశంలో కుంభకోణాలు పెరిగిపోయాయి. నేర చరిత్ర గలిగిన ప్రజాప్రతినిధులపై దాదాపు 5907 కేసులు వివిధ స్థాయిల్లో పెండింగ్లో ఉన్నాయని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. కొన్ని కేసుల్లో నేరారోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తులు చనిపోయినా విచారణ సాగుతూనే ఉంది. కోర్టులు వెంటనే చర్యలు తీసుకున్నట్లయితే మరల ఇలాంటి తప్పు లు మరొకరు చేయకుండా ఉంటారు. 1964లో చేసిన చట్టం ప్రకారం సహకార సంఘాల్లో ప్రధాన పదవుల్లో ఉన్నవారు, వారి సంబంధీకులు ఇతరులతో వ్యాపార సంబంధాలు పెట్టుకుంటే వారిని పదవుల నుంచి తొలగిస్తారు. కానీ ఇప్పుడేమో ఏకంగా పంచాయతీ సర్పంచులు, సభ్యులకే కాంట్రాక్టులు ఇస్తున్నారు.
డబ్బులతో ఎన్నికలు, డబ్బుల కోసం రాజకీయాలు
ఒకప్పుడు చట్టసభల్లో వ్యాపారులు అతి తక్కువ సంఖ్యలో ఉండేవారు. కానీ ఇటీవల వారి సంఖ్య పెరగడం దేశానికి ప్రమాదంగా పరిణమించింది. చట్ట సభకు వ్యాపారి అయినా ఎన్నిక కావాలి లేదంటే ఎన్నికైన రాజకీయ నాయకుడు పదవి పూర్తయ్యే లోగా బడా వ్యాపారిగా మారాలన్న విధంగా పరిస్థితి తయారైంది. అందుకే ఇప్పుడు ఎన్నికలంటే వందల కోట్ల వ్యవహారంగా మారింది. ఇటీవల ఒక ఉప ఎన్నిక సందర్భంగా ఒక రాజకీయ నాయకుడు బీజేపీలో చేరడం వల్లే ఆయనకు వేల కోట్ల రూపాయల కాంట్రాక్టు లభించిందని అంటున్నారు. ఇలాంటి నాయకులు నెలలో ఒకటి రెండు సార్లు నియోజకవర్గాలకు వెళ్లి అవసరాలు ఉన్నవారికి ఊహించని రీతిలో డబ్బులు వెదజల్లుతుంటారు. కానీ వారు వేల కోట్ల రూపాయల ప్రజా సంపదను కొల్లగొట్టి పేలాలు మాత్రమే తమకు పంచి పెడుతున్నారని అమాయక ప్రజలు అర్థం చేసుకునే పరిస్థితి లేదు. నిత్యం ప్రజల్లో లేకున్నా, అడపా దడపా వారికి డబ్బులు వెదజల్లడం, ఎన్నికల్లో కోట్లు కుమ్మరిస్తే సరిపోతుందనే భావన రాజకీయ నాయకుల్లో పెరిగిపోయింది. దీంతో సామాన్యులు ఎన్నికల్లో గెలిచి, ప్రజానుకూల విధానాలు చేసే అవకాశం లేకుండా పోయింది. అందుకే పార్లమెంటులో రైతు, ప్రజా వ్యతిరేక, కార్పొరేట్ అనుకూల బిల్లులు ఏకపక్షంగా ఆమోదం పొందుతున్నాయి.
ఈ నేపథ్యంలో దేశం బాగు పడాలంటే ప్రజాప్రతినిధులపై ఎప్పటికప్పుడు నిఘా, సమీక్ష ఉండాలి. వారిలో బాధ్యతను పెంపొందించాలి. ప్రజలు కూడా డబ్బులు వెదజల్లే ప్రజాప్రతినిధులకు వచ్చే ఎన్నికల్లో ఓటేయకుండా ఉంటేనే ప్రజాస్వామ్యం పరిఢవిల్లుతుంది. న్యాయస్థానాలు, ప్రజలు ధన, నేరమయ రాజకీయాలకు వ్యతిరేకంగా తీర్పు ఇస్తేనే ప్రజాస్వామ్యంలో మార్పులు వస్తాయి. రాజ్యాంగ సంస్థలను కాపాడుకోవచ్చు. దేశంలో అవినీతి పాలనను అంతం చేయవచ్చు.
(వ్యాసకర్త: సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులు)
చాడ వెంకటరెడ్డి