హైదరాబాద్, జూలై 26 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర స్వయం సమృద్ధిని పకనబెట్టి కాంగ్రెస్ సరార్ అనాలోచితంగా అడుగులు వేస్తున్నది. మెట్రో విస్తరణ, మూసీ పునరుజ్జీవం లాంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్టులు మొదలుకొని అత్యంత కీలకమైన విద్య, వైద్య రంగాల వరకు అవసరం ఏదైనా విదేశీ రుణాల కోసం చేతులు చాపుతున్నది. సంక్షేమం, అభివృద్ధి పేరిట అంతర్జాతీయ సంస్థల ముందు మోకరిల్లుతూ తెలంగాణ సార్వభౌమత్వానికే ముప్పు కలిగిస్తున్నది. ప్రపంచ బ్యాంకు, ఆసియా అభివృద్ధి బ్యాంకు లాంటి సంస్థలు ఇచ్చే ప్రతి రూపాయి వెనుక కఠిన షరతులు, ప్రజలపై పన్నుల భారం, రాయితీల్లో కోత లాంటివి దాగి ఉంటాయనే చేదు నిజాన్ని విస్మరిస్తున్నది. అభివృద్ధి ముసుగులో అంతర్జాతీయ సంస్థల నుంచి ఏకంగా రూ.53 వేల కోట్లకుపైగా రుణాలను స్వీకరించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసి, భవిష్యత్తు తరాల మెడకు ఉరితాడు బిగించబోతున్నది.
అంతర్జాతీయ రుణ సంస్థలు విధించే కఠిన నిబంధనలతో రాష్ట్ర ప్రజలకు జరిగే నష్టాన్ని దృష్టిలో పెట్టుకుని గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం వాటిని దూరం పెట్టగా.. ప్రస్తుత కాంగ్రెస్ సర్కార్ మాత్రం విదేశీ అప్పులకు తలుపులు బార్లా తెరిచింది. అభివృద్ధి ప్రాజెక్టుల పేరిట అంతర్జాతీయ సంస్థల నుంచి వేల కోట్ల రూపాయల రుణాలను సేకరిస్తూ రాష్ట్రాన్ని విదేశీ అప్పుల ఊబిలోకి నెడుతున్నది. రాష్ట్ర విభజనకు ముందు 2000 సంవత్సరంలో నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కఠిన షరతులతో ప్రపంచ బ్యాంకు నుంచి అప్పు తెచ్చి విద్యుత్తు చార్జీలు పెంచడం, దాన్ని నిరసిస్తూ హైదరాబాద్లోని బషీర్బాగ్లో ఆందోళనకు దిగిన ప్రజలపై పోలీసులు కాల్పులు జరుపడం తెలిసిందే.
ఆ కాల్పుల్లో ముగ్గురు నిరసనకారులు ప్రాణాలు కోల్పోవడంతో టీడీపీ ప్రభుత్వం కుప్పకూలింది. దీంతో ఆ తర్వాత వచ్చిన వైఎస్ రాజశేఖర్రెడ్డి ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక కేసీఆర్ ప్రభుత్వం అంతర్జాతీయ రుణ సంస్థలను దూరం పెట్టాయి. వడ్డీ రేట్లు కాస్త ఎకువగా ఉన్నప్పటికీ గ్రామీణ విద్యుదీకరణ సంస్థ (ఆర్ఈసీ) లాంటి దేశీయ సంస్థల నుంచే రుణాలు తీసుకునేందుకు మొగ్గుచూపాయి. ఇప్పుడు అంతర్జాతీయ సంస్థల నుంచి కఠిన షరతులతో సర్కార్ తెచ్చే అప్పుల వల్ల తెలంగాణలో మళ్లీ బషీర్బాగ్ లాంటి విషాదాలు వస్తాయని ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
ప్రస్తుతం హైదరాబాద్లో మెట్రో రైల్ విస్తరణ ప్రాజెక్టుపై సీఎం రేవంత్రెడ్డికి, కేంద్ర మంత్రి కిషన్రెడ్డికి మధ్య నడుస్తున్న మాటల యుద్ధంతో కొన్ని కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. మెట్రో ప్రాజెక్టుకు రావాల్సిన రూ.13,600 కోట్ల రుణాన్ని కేంద్ర ప్రభుత్వం అడ్డుకుంటున్నదని సీఎం రేవంత్రెడ్డి ఆరోపించడంతో ఆ రుణాన్ని జపాన్ సంస్థ ‘జైకా’ (జేఐసీఏ) ఇస్తున్నదని, ఈ వ్యవహారంలో ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ (ఐఆర్ఎఫ్సీ) కేవలం మధ్యవర్తి మాత్రమేనని అధికారులు స్పష్టం చేశారు. దీనిపై కేంద్ర మంత్రి కిషన్రెడ్డి కౌంటర్ ఇస్తూ.. మూసీ నది పునరుజ్జీవ ప్రాజెక్టు కోసం ఆసియా అభివృద్ధి బ్యాంక్ (ఏడీబీ) నుంచి కేంద్ర ప్రభుత్వం రూ.4,100 కోట్ల అప్పు ఇప్పించడంతోపాటు తెలంగాణకు మరో రూ.11,000 కోట్ల వడ్డీరహిత రుణాలను అందించిందని గుర్తుచేశారు.
సెక్యూరిటీ బాండ్ల వేలంతోపాటు కేంద్రం నుంచి, ప్రభుత్వ ప్రైవేట్ బ్యాంకుల నుంచి ఇప్పటికే భారీగా అప్పులు తెస్తున్న రేవంత్రెడ్డి సర్కార్.. ఇప్పుడు తాను ప్రతిష్టాత్మకమైనవిగా చెప్పుకొంటున్న అన్ని ప్రాజెక్టుల కోసం అంతర్జాతీయ రుణ సంస్థలపైనే ఆధారపడుతున్నది. హైదరాబాద్ మెట్రో రైల్ వ్యవస్థ టేకోవర్ కోసం రూ.13,600 కోట్లు, మెట్రో ఫేజ్-2ఏ ప్రాజెక్టు కోసం రూ.11,700 కోట్ల రుణాలు ఇవ్వాలని ‘జైకా’ను కోరింది. మెట్రో ఫేజ్-2బీ ప్రాజెక్టు కోసం జైకాతోపాటు ఏడీబీ, న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ (ఎన్డీబీ) నుంచి రూ.9,398 కోట్ల రుణాల సేకరణకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది.
యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ సూల్స్ కోసం ఏడీబీ నుంచి రూ.4,049 కోట్లు, విద్యా మౌలిక వసతుల కోసం ఏఐఐబీ నుంచి రూ.4,903 కోట్ల విదేశీ రుణాల సమీకరణకు కేంద్రం పచ్చజెండా ఊపింది. రాష్ట్రంలో వైద్య రంగం అభివృద్ధి కోసమంటూ రూ.4,000 కోట్ల రుణాలు ఇచ్చేందుకు ప్రపంచ బ్యాంకు ప్రాథమికంగా అంగీకరించగా.. అటవీశాఖ ఆ ధునీకరణకు రూ.1,270 కోట్ల రుణాలు ఇవ్వాలని కాంగ్రెస్ సర్కార్ ‘జైకా’ను కోరింది.
అంతర్జాతీయ సంస్థలు కేవలం 4% వడ్డీకే రుణాలు ఇస్తున్నాయని సీఎం రేవంత్రెడ్డి సంబురపడుతున్నప్పటికీ ఆ రుణాల వెనుక ఉండే కఠిన నిబంధనలు, పర్యవేక్షణ విధానాలు ప్రభుత్వ స్వతంత్ర నిర్ణయాధికారాలను దెబ్బతీస్తాయని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. రాష్ట్ర విధాన నిర్ణయాల నియంత్రణ విదేశీ సంస్థల చేతుల్లోకి వెళ్తే తెలంగాణ భవిష్యత్తు ప్రమాదంలో పడుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అంతర్జాతీయ రుణాలు పొందేందుకు కేంద్రం సహకరించడం లేదని సీఎం రేవంత్రెడ్డి విమర్శిస్తున్నప్పటికీ ఆ రుణాలన్నింటికీ కేంద్ర ప్రభుత్వ సార్వభౌమ గ్యారెంటీ తప్పనిసరి. గత ఏడాది కాలంలో కేంద్రం ఇలాంటి రూ.15,000 కోట్ల విదేశీ రుణాలకు అనుమతులు ఇచ్చింది.
