‘గతంలో రూపాయికి తిండి దొరికేది, అందుకే నాణెంపై ధాన్యం బొమ్మ ఉండేది. ఇప్పుడు రూపాయికి ఏమీ రాదు, అందుకే బొటనవేలు బొమ్మ వేశారు, ఆకలేస్తే నోట్లో పెట్టుకొమ్మని’ -సోషల్ మీడియాలో వైరలైన ఈ వీడియో భారతదేశ పరిస్థితికి అద్దం పడుతుంది. గతానికీ ప్రస్తుతానికీ వ్యత్యాసం, నేడు రూపాయితో పాటు దిగజారిన జీవనం గురించి స్పష్టంగా చెప్తుంది 13 సెకన్ల ఆ వీడియో!
రూపాయి అనగానే… మీకు ఓటుకు నోటు గుర్తురావడం న్యాయమే. గతంలో చంద్రబాబు-రేవంత్రెడ్డి; ఇప్పుడు ముఠాధిపతులుగా మారిన మఠాధిపతులు నోట్ల కట్టల ప్రలోభం పెట్టి తెలంగాణ రక్షకుడు, భావి దేశ నిర్మాత కేసీఆర్ చేతిలో చావుదెబ్బ తినడం దేశమంతా కనులు విప్పార్చి చూసింది. చెల్లనికాసు లాంటి బీజేపీ తమ దుష్టరాజకీయానికి Threatగా మారిన కేసీఆర్ను సహించలేకపోతున్నది. ఎనిమిదేండ్ల పాలనలో తొమ్మిది ప్రభుత్వాలను పడగొట్టిన బీజేపీ పప్పులు తెలంగాణలో ఉడకలేదు. అందుకే నెంబర్ టూ, నెంబర్ వన్లు తేలు కుట్టిన దొంగల్లా కిమ్మనడం లేదు.
ఆర్ఎస్ఎస్ అంతర్గత సర్వేలోనే టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డికి దాదాపు లక్ష ఓట్లు రానున్నాయని, తన సమీప ప్రత్యర్థిపై 40 వేల ఓట్ల మెజారిటీతో గెలుపొందనున్నారని వెల్లడైంది. ఓటమి తప్పదని తెలిసే టీఆర్ఎస్ కార్యకర్తలపై భౌతికదాడులకు బీజేపీ తెగబడుతున్నదని దీనిద్వారా స్పష్టమవుతున్నది. మునుగోడులో ఓవైపు ఈ విధంగా విధ్వంసకాండకు పాల్పడుతూ, మరోవైపు ఓటర్లను డబ్బుతో కొనుగోలు చేయటానికి ప్రయత్నిస్తున్నది. దీన్ని మునుగోడు ఓటర్లు తిప్పికొట్టాలి. మన ఇంటిపార్టీ అయిన టీఆర్ఎస్ను ప్రత్యర్థులకు దిమ్మతిరిగే మెజార్టీతో గెలిపించాలి.
రూపాయి అనగానే… మొన్న కేటీఆర్ బయటపెట్టిన రాజ్గోపాల్రెడ్డి సుశీ ఇన్ఫ్రా కంపెనీ నుంచి నిస్సిగ్గుగా కోట్లాది రూపాయలను మునుగోడు ఓటర్లను కొనడానికి బ్యాంక్ ట్రాన్స్ఫర్లు చేయడం కూడా మీకు గుర్తుకువచ్చింది కదా? చెల్లని మనుషులు ఎన్ని వేల రూపాయలు ఇచ్చినా ఏమి ప్రయోజనం ప్రజలారా? రైతుబంధు, రైతుబీమా, కల్యాణలక్ష్మి, షాదీముబారక్, దళితబంధు, ఆసరా పింఛన్ల రూపంలో కేసీఆర్ ఏడాది పొడుగునా మిమ్మల్ని ఆదుకుంటూ ఉంటే… పాపపు సొమ్ము మీకిచ్చి ఓట్లు దండుకోవాలనుకుంటున్నది బీజేపీ. అచ్చంగా అలాంటి పాపపు సొమ్మునే 100 కోట్ల మొత్తంగా ఈ వ్యాస రచయితల్లో ఒకరైన రోహిత్రెడ్డికి ఇవ్వజూపి లోబరచుకోవాలని చూసింది. కేసీఆర్ రాజకీయ మానస పుత్రుల ముందు వాళ్ళ ఆటలు సాగుతాయా!
రూపాయి అనగానే… మాకు గుర్తొచ్చినవి రెండు: 18 లక్షల కోట్ల దోపిడీ, 18 వేల కోట్ల కాంట్రాక్టు. ఈ దేశ ప్రజలు చెమటోడ్చి సృష్టించే సంపదను నెంబర్ 1, నెంబర్ 2 అనే ఇద్దరు గుజరాతీలు మరో ఇద్దరు గుజరాతీలకు రాసిచ్చేసిన ధనం ఆ మొదటి 18 లక్షల కోట్లు. మునుగోడులో నిలబడ్డ రాజగోపాల్రెడ్డికి రాసిచ్చిన కాంట్రాక్టు విలువ ఆ రెండో 18 వేల కోట్లు. రూపాయి అనగానే… మరిన్ని గుర్తొస్తున్నాయి. ఫిరాయింపుల కోసం డబ్బు; రాజకీయ ప్రత్యర్థులను జైళ్లల్లో కుక్కడానికి డబ్బు; బెయిల్ మీదున్న నాయకులను జైల్లోకి పోకుండా కాపాడేందుకు డబ్బు; జైల్లోకి పోవాల్సినవాళ్లను పోకుండా ఉంచినందుకు డబ్బు ఇట్లా ప్రతీ బేరానికి లెక్కగట్టి నోట్లకట్టలతో శాసించాలన్నది బీజేపీ ప్రకటిత విధానం! తెలంగాణలో నలుగురు ఎమ్మెల్యేలకు వందేసి కోట్ల చొప్పున ఇవ్వజూపడమే వారి బరితెగింపునకు నిదర్శనం.
ప్రజలను పీడించి శ్రమ సంపద రూపంలోనూ, ట్యాక్స్ల రూపంలోనూ దండుకున్న ప్రజా ధనాన్ని వెదజల్లితే అధికారం అందుతుందనుకునే అహంకారం దేశ భవిష్యత్తును చీకటిలోకి నెట్టివేస్తున్నది. తొమ్మిది రాష్ట్ర ప్రభుత్వాల్ని కూల్చిన ఘనత బీజేపీది. దేశవ్యాప్తంగా 267 మంది ఎమ్మెల్యేలను డబ్బులు పోసి కొన్న చరిత్ర. ఇది ఎనిమిదేండ్ల చరిత్ర మాత్రమే కాదు. ఇండిపెండెంట్ ఇండియాలో ఇది ఆల్ టైమ్ వరస్ట్ రికార్డు కూడా!
దేశం మొత్తమ్మీద ఎంపీలు, ఎమ్మెల్యేలు కలిపితే 4800 ఉంటారు. అందులో 2500 మందిని ‘సంపాదిస్తే’ అన్నిచోట్లా అధికారం ఖాయం. అదిరించో, బెదిరించో గెలిచే సీట్లు పోను ఇక కొనుక్కోవాల్సినవి ఓ వెయ్యో, పదిహేనువందలో ఉన్నాయనుకోండి అవన్నీ కొనేయడమే వారి ‘ప్రాజెక్టు’. మొన్న ఆడియోలలో విన్నరు కదా ఈ పరిభాష! ఓటర్లను కొనడం కన్నా ఎమ్మెల్యేలను టోకున కొనేయడం; ఒక్కో రాష్ర్టాన్నీ కబళించడం కన్నా ఒకేసారి మింగేసే ఎత్తుగడ వారి అజెండా. ఒకటే దేశం ఒకటే పార్టీ అని వారంటున్నది అందుకే.
నెల రోజుల్లో కేసీఆర్ ప్రభుత్వాన్ని పతనం చేస్తాం; ఢిల్లీలో ఆప్ ప్రభుత్వాన్ని కూడా కూల్చేస్తామన్నరు మొన్న అడ్డంగా దొరికి, ఇపుడు చం చల్ గూడ జైల్లో చిప్పకూడు తింటున్న బీజేపీ బ్రోకర్లు. ఇంత బరితెగింపును సహిద్దామా? అమిత్ షాకు ప్రభుత్వాలను కూల్చడం, ఈడీ, ఈసీలను ప్రయోగించడం, బెదిరించడం, ఎదురుతిరిగితే.. ఎంతో ఘనమైన మన దేశం, ప్రపంచపు పెద్ద ప్రజాస్వామ్యం పాతాళానికి పడిపోవడం.. చూస్తూ ఉందామా?
భారతదేశ ఉన్నతే ప్రపంచ ఉన్నతి’ అంటరు ప్రపంచ చరిత్రకారుడు డాక్టర్ డేవిడ్ ఫ్రాలే. కానీ మోదీ పాలన భారత్కు అంతర్జాతీయంగా తలవంపులు తెస్తున్నది. అన్ని ఇండికేటర్స్లో భారత్ ప్రభ మసిబారిపోతున్నది. పది, పన్నెండు బీజేపీయేతర రాష్ర్టాలు మాత్రమే దేశ నిర్మాణం చేస్తున్నాయి. తెలంగాణది అందులో ప్రముఖ స్థానం. పనికిరాని గుజరాత్ మాడల్ స్థానే అద్భుత విజయాలు సాధించిన తెలంగాణ మాడల్ను దేశవ్యాప్తం చేయాలన్న కేసీఆర్ లక్ష్యానికి రూపమే భారత్ రాష్ట్ర సమితి. ఇది భరించలేని బీజేపీ కేసీఆర్ను కట్టడి చేయాలని చూస్తున్నది. అందులో భాగమే తెలంగాణలో ఎమ్మెల్యేల కొనుగోలు కేంద్రాల ఏర్పాటు! అయితే… ఇక్కడే బొక్కబోర్లా పడింది బీజేపీ.
చార్లీ చాప్లిన్ ‘ది సర్కస్’ అని ఒక సినిమా తీసిన్రు. గుర్రానికి మందేయడానికి దాని నోట్లో పొడుగాటి గొట్టం పెట్టి, అందులో ట్యాబ్లెట్ వుంచి చాప్లిన్ ఊదాలి. ఈలోపు గుర్రమే ముందు ఊదటంతో, గోలీ చాప్లిన్ గొంతులో ఇరుక్కుంటది… ‘the horse blew it first’ అంటడు వగరుస్తూ! అట్లా ఘోరంగా, ఘోష యాత్రలో దుర్యోధనుడిలా గర్వభంగం జరిగింది అమిత్ షాకు. ఆయనను నడిపిస్తున్న నెంబర్ 1కు, వీళ్ల సైద్ధాంతిక పాఠశాల ఆర్ఎస్ఎస్కు! మొదటిసారి వేడి పాలల్లో మూతిపెట్టిన పిల్లి ఆ తర్వాత మరిక ధైర్యం చేయదు. ఆ గుణపాఠం అయితే నేర్పినం మొన్న!
బీజేపీ మీద పట్టరాని కోపం వస్తున్నా… తెలంగాణకు మద్దతు విపరీతంగా పెరుగుతున్నందుకు చాలా ఆనందం! వందల ఫోన్లు వస్తున్నై, టీఆర్ఎస్ కానివారు, ఆంధ్రా నుంచి మిత్రులు కూడా… సీఎం కేసీఆర్కు, ఆ నలుగురు ఎమ్మెల్యేలకు అభినందనలు అంటూ! భవిష్యత్తు బీఆర్ఎస్దే! అందుకు నాంది మునుగోడు నుంచే జరగాలి. ఎందుకంటే… బీజేపీ ఆటలు తెలంగాణలో సాగితే ఏం జరుగుతుందో మొన్న ఒక ఆంధ్రా మిత్రుడు రాసిం డు. అవును మీరు చదివింది నిజమే, ఆంధ్ర మి త్రుడే. ఆయన ఏమంటారంటే… తెలంగాణ యూనిఫికేషన్తో నడుస్తున్న రాష్ట్రం. సెటిలర్లు-స్థానికులు, హిందువులు-ముస్లింలు అనే తేడా ఇక్కడ లేదు. అందరికీ సమానావకాశాలు, స హ పరిస్థితులు ఉన్నాయిక్కడ. కలుపుకొనిపోవడంలోనే గెలుపు ఉన్నదని కేసీఆర్ భావించడం, అందరినీ అక్కునచేర్చుకోవడం కారణం! అదే బీజేపీ ఎంటరైతే మాత్రం దారుణమే.
ఢిల్లీలో నెత్తినెక్కినందుకే దేశం నానా అవస్థలు పడుతున్నది. అసమర్థత విలయతాండవం చేస్తున్నది. ఇప్పుడు కొత్తగా బీజేపీకి తెలంగాణలో చోటు పెట్టాల్నా? పెడితే ఎట్లుంటదో, బీజేపీ కన్నుపడిన పాపానికి ఏపీ, కర్ణాటక ఎలాంటి శాపాలు ఎదుర్కొంటున్నవో తెలుసా? ఒక్క సెటిలర్లే కాదు, తెలంగాణలో ఉన్న ప్రతీ ఒక్కరూ కళ్లు తెరవాల్సిన క్షణం ఇది! మతం పేరుతో రెచ్చగొట్టడం, సొంత అజెండాతో చిచ్చు పెట్టడం, ఉచ్చు విసరడం లాంటి లుచ్ఛా రాజకీయం మాత్రమే తెలుసు బీజేపీకి. గ్రోత్, డెవలప్మెంట్, ఇన్ఫ్రా క్రియేషన్, కొత్త ప్రాజెక్టులు, పాథ్ బ్రేకింగ్ డెసిషన్లు లాంటివేవీ బీజేపీకి బొత్తిగా తెలియదు. తెలంగాణలో ఉప ఎన్నికలే ఎగ్జాంపుల్. తెలంగాణలో రాజకీయంగా బలపడాలంటే పాజిటివ్ ఇమేజ్ సృష్టించుకోవచ్చుగా! ఏదైనా ప్రాజెక్టు ఇవ్వడమో, ప్రిస్టేజియస్ సంస్థను ఏర్పాటుచేయడమో చేసి… ఇదిగో మీ కోసం ఇది చేశాం, మమ్మల్ని గెలిపిస్తే ఇంకా చేస్తామని ఓట్లు అడగొచ్చుగా? లేదు, అలా అడగరు. అలా అడగాలంటే దమ్ము కావాలి. ఆలోచన కావాలి. సామర్థ్యం ఉండాలి. బీజేపీకి ఇవన్నీ శూన్యం. ఉన్నదల్లా మత విద్వేష రాజకీయం. అందుకే వరస ఉప ఎన్నికలు, రెచ్చగొట్టే పోలిటిక్స్!
ఒక్క తెలంగాణకే కాదు, మొత్తం దేశానికే శత్రువు బీజేపీ. బ్రిటిషర్లు కోహినూరుతో సహా మన సంపద అంతా ఇంగ్లండ్కు పట్టుకుపోయినట్టు, ఇండియాలో ఏ మూల ఏ మంచి ప్రాజెక్టున్నా గుజరాత్కు తన్నుకుపోతున్నది ఈ బీజేపీ. హైదరాబాద్ మీద ఇలాంటి ఆర్థిక దండయాత్ర మొదలైపోయింది. ఇలాంటి దాడి ఆపాలంటే బీజేపీని అడ్డుకోవాలి.
ఇపుడు చెప్పు మునుగోడూ నువ్వెందుకు ఓటు వేయాలి బీజేపీకి? మన ఎమ్యెల్యేలు ఎందుకు ఫిరాయించాలి బీజేపీలోకి? మునుగోడు ప్రజలందరూ కలిసి తెలంగాణలోకి బీజేపీ రాకుండా నవంబర్ 3న ప్రజాతీర్పు జారీ చేయాలి! ఆ అవకాశం మునుగోడుకు రావడం గొప్ప విషయం. మనందరమూ సద్వినియోగం చేసుకుందాం.
‘కేబినేట్లో అమ్మకాల మంత్రి, పార్టీలో కొనుగోలు కమిటీ. ఇదీ గుజరాత్ మోడల్’ అంటూ మొన్నొక మిత్రుడు అన్నరు. ఈ బరితెగింపు సహించవద్దు మిత్రులారా. ఖబడ్దార్ బీజేపీ, మీ ఆటలిక్కడ సాగవు. కూకటివేళ్లతో మిమ్మల్ని పెకిలిస్తామని మనందరం హెచ్చరించాలి. వీరికి ఎన్నడూ మరవని పాఠం నేర్పాలి మునుగోడులో!
బీజేపీ వారు మీ చెవులలో పెట్టడమే కాకుండా పువ్వుగుర్తులు చేయిపై కూడా వేస్తున్నారు. కేసీఆర్ మీ మోముపై చిరునవ్వులు పూయిస్తున్నారు. మీరు గుండెనిండుగా తెలంగాణ బిడ్డను ఆశీర్వదించాలె. మీరిచ్చిన దన్నుతో భారతదేశమంతా మన పాలన సాకారం కావాలె. మునుగోడుతో పాటు, తెలంగాణతో పాటు దేశ ప్రజలందరికీ పొలాల్లో నీళ్ళు పారాలె, కండ్లల్లో కాదు. నూకలు తినమని ఎకసెక్కాలు ఆడినవాళ్లకు నూకలు చెల్లు చేయాలి ఈ గడ్డ నుంచే. ఈ యజ్ఞంలో మనందరం గొప్ప కష్టాలు, నష్టాలు పడాల్సిన పనిలేదు. వల్లకాని త్యాగాలు చేయాల్సిన అవసరం లేదు. ఓటు ఆయుధానికి పనిచెప్పాలి. కత్తిని మన నాయకుని చేతికి ఇచ్చి మన కోసం కదనరంగానికి పంపాలి. ఎందుకంటే మన నాయకునికి రాజకీయాలు వ్యాపారం కాదు, గేమూ కాదు. అదొక టాస్క్!
వీరునికి వీరగంధం పూయాల్సిన సందర్భం- నవంబర్ 3.కదులుదాం, పదండి… బీజేపీని బంగాళాఖాతంలో విసిరేయడానికి.
జై తెలంగాణ! జై భారత్!
-పైలట్ రోహిత్రెడ్డి (తాండూరు ఎమ్మెల్యే)
శ్రీశైల్రెడ్డి పంజుగుల