ప్రపంచ గతిని మార్చగల శక్తి ఒక్క ‘ఓటు’కే ఉన్నది. అలాంటి ఆయుధాన్ని వృథా చేసుకోవడం, లేదా ప్రలోభాలకు గురై అమ్ముకోవడం వంటివి చేయడం రాజ్యాంగ విరుద్ధం. ఒక వ్యక్తి అస్తిత్వాన్ని గుర్తించి, వ్యవస్థ మార్పునకు నాంది పలుకుతుంది ఓటు. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం తమ వంతు కర్తవ్యంతో ఉన్నత నాయకులను ఎన్నుకొనే విధానం ఎన్నిక. కాబట్టి ప్రతి పౌరుడు తమ ఓటును వినియోగం చేసుకొని సరైన నాయకుడిని ఎన్నుకున్నప్పుడే రాజ్యాంగ రచయిత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఆశయాలు, ఆయన కన్న కలలు నెరవేరుతాయి. పురుషులతో పాటు మహిళలకూ సమాన ఓటు హక్కును కల్పించిన మహానేత అంబేద్కర్. 18 ఏండ్లు నిండిన యువతీ, యువకులంతా తమ ఓటు హక్కును వినియోగించుకునేలా చేసిన మహనీయుడు అంబేద్కర్.
డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం కారణంగా దేశంలోని అతివలు ఆత్మగౌరవంతో బతుకుతున్నారు. మహిళలు చదువుకొని తమకెవ్వరూ సాటిరారని నిరూపిస్తున్నారు. ఉద్యోగాలు చేసుకుంటూ ఉపాధి పొందుతున్నారు. రాజకీయాల్లో రాణిస్తూ ఔరా అనిపిస్తున్నారు. ఒక్క మహిళలే కాదు కార్మికులు, ఉద్యోగులకు రోజుకు ఎనిమిది గంటల పని హక్కు కల్పించిన కార్మిక పక్షపాతి అంబేద్కర్. బాలకార్మిక వ్యవస్థ నిర్మూలన కోసం ఆయన తపించారు. ఐదేండ్ల నుంచి పద్నాలుగేండ్ల లోపు ఉన్న పిల్లలకు ఉచిత విద్యాహక్కు కల్పించిన భారత ఆణిముత్యం అంబేద్కర్. బానిసలుగా బతుకుతున్న అంటరానివాళ్ల విముక్తి కోసం ఎస్సీ, ఎస్టీ, బీసీలకు రిజర్వేషన్లు కల్పించిన ఆరాధ్యుడు అంబేద్కర్. ఆయన ఎస్సీ ఎస్టీలకు చట్టసభల్లో రిజర్వేషన్లు కలిపించిన గొప్ప వ్యక్తి. రిజర్వ్ బ్యాంకు ద్యారా ప్రతీ భారతీయుడికి ఆర్థిక హక్కులతో పాటు ఎన్నో హక్కులను ప్రసాదించిన మహనీయుడు. ఆయన రాసిన రాజ్యాంగం ద్వారా హక్కులు పొందిన ప్రతి ఒక్కరికీ అంబేద్కరే నాయకుడు అనడంలో అతిశయోక్తి లేదు. ఈ దేశంలోని కొందరికే అంబేద్కర్ అని ముద్రవేశారు. కానీ అంబేద్కర్ అందరివాడు. దేశ ప్రజల ఆశాదీపం. రాజ్యాంగం ద్వారా ఓటు హక్కు కల్పించిన మహనీయుడు.
ఓటు వేయండి; ప్రజాస్వామ్యాన్ని కాపాడండి: ఓటు హక్కును నైతికంగా వినియోగించుకున్నప్పుడే మనం అంబేద్కర్ను గౌరవించుకున్నవాళ్లమవుతాం. ఆయన తత్వశాస్త్రం, భావజాలాన్ని వాస్తవికంగా అనువదించాలనుకుంటే, ఓటు హక్కును నైతికంగా, న్యాయంగా వినియోగించుకోవాలి. అదే మన ప్రధాన కర్తవ్యం కావాలి. ఓటు హక్కును వినియోగించుకోవడం ద్వారా మన రాజ్యాంగ హక్కులను పరిరక్షించుకున్నవారమవుతాం. దేశ ప్రగతికి భరోసా ఇచ్చినవాళ్లమవుతాం. ఓటును వినియోగించడం దేశ పౌరసత్వానికి చాలా అవసరమని, చారిత్రాత్మకంగా అణగారిన వర్గాలకు ఓటు రాజకీయ విద్యగా ఉపయోగపడుతుందని అంబేద్కర్ భావించేవారు. ప్రజాస్వామ్య పౌరసత్వ అత్యంత ప్రాథమిక అంశాల్లో ఒకటిగా ఓటు హక్కు ఉందని అంబేద్కర్ తెలిపారు. ఏ ప్రజాస్వామ్య దేశంలోనైనా ప్రజలే నిర్ణేతలు. వారి మనోభావాలను ప్రకటించేందుకు ప్రజల చేతిలో ఉన్న ఏకైక పదునైన ఆయుధం ఓటు. అంతిమంగా భారత రాజ్యాంగం మనకు కల్పించిన హక్కు ఓటు వేయడం.
నీతి, నిజాయితీ, నమ్మకం, బాధ్యతలున్న నాయకుడిని గెలిపించి చట్టసభల్లోకి పంపిస్తే ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడం కోసం ఆ వ్యక్తి కృషిచేస్తారు. మౌలిక వసతులు కల్పించడం కోసం, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బాధ్యతగా పనిచేస్తారని అంబేద్కర్ అన్నారు. అందుకే ఓటు హక్కును భారత రాజ్యాంగంలో పొందుపరిచారు. అదే ఇప్పుడు భారతీయుల చేతిలో ఉన్న బ్రహ్మాస్త్రం. ‘ఓటు హక్కు’ను నేటి రాజకీయ నాయకులు తమ స్వార్థ ప్రయోజనాల కోసం ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారు. వారిని ప్రలోభాలకు గురిచేస్తూ ప్రజాస్వామ్యాన్ని భ్రష్టు పట్టిస్తున్నారు. అందుకే ఓటరు మహాశయులారా అలాంటివారిని తరిమికొట్టి మన ప్రాంతాభివృద్ధి కోసం పాటుపడదాం. నిజమైన, నికార్సయిన నాయకున్నే ఎన్నుకుందాం.
ప్రజాస్వామ్యం ప్రజల కోసం ఏర్పడిన ప్రజా యంత్రాంగం. ప్రజాస్వామ్యం మనగలిగే దేశంలో ప్రజలు హాయిగా, స్వేచ్ఛగా జీవించగలుగుతారు. భావ వ్యక్తీకరణకు ప్రజలకు లభించిన వరం ప్రజాస్వామ్యం. అది ప్రజలకు గొంతునిచ్చి, అరాచకాలపై పోరాడే హక్కునిస్తుంది. ఇప్పటికీ సౌదీ అరేబియా, వాటికన్ సిటీ మయన్మార్ వంటి కొన్ని దేశాల్లో ప్రజాస్వామ్యం ఏర్పడలేదు. మరికొన్ని మత ఛాందసవాద దేశాల్లో ప్రజాస్వామ్యం ఉన్నా పరమత సహనం సున్నా. అందుకే ప్రజాస్వామ్యం లేని ప్రజల జీవితం దుర్భరంగా ఉంటుందనడంలో సందేహం లేదు. ‘ప్రజల చేత, ప్రజల కొరకు, ప్రజ లే ఎన్నుకొనే చట్టబద్ధమైన విధానమే ప్రజాస్వా మ్యం’ అని అమెరికా మాజీ అధ్యక్షుడు అబ్రహం లింకన్ నిర్వచించారు. ప్రజలు కనికరించి ఓటు వేస్తే నాయకులు, పాలకులవుతారు. పటిష్టమైన ప్రజాస్వామ్యం, ప్రజల ఆకాంక్షలకు ప్రతిరూపం. ప్రజాస్వామ్య పునాదులు బలంగా లేని దేశాల్లో ‘ప్రజాస్వామ్యం’ అనేది ‘నేతి బీరకాయలోని నెయ్యి’ చందమే. ఏ దేశంలోనైనా ప్రజాస్వామ్యం మనుగడ సాగించాలంటే ఆయా దేశాల ప్రజ లు చైతన్యవంతులై, విద్యావంతులై ప్రజాస్వామ్య స్ఫూర్తి కలిగి ఉండాలి. అంబేద్కర్ కల్పించిన ఆయుధం ఓ టు. ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టి ప్రజల కు సుపరిపాలన అందించటంలో అ త్యంత కీలకం ఓటు. కానీ ఆ ఓటు నో టుకు లొంగిపోతే ప్రజలను బానిసత్వంలోకి తీసుకెళ్లే పరిస్థితి దాపురిస్తుం ది. అందుకే ఆలోచించి ఓటు వేద్దాం. మెరుగైన సమాజాన్ని నిర్మిద్దాం. భావితరాలకు బంగరు బాటను నిర్మిద్దాం.
-ఆలేటి రమేష్ , 99487 98982