మునుగోడుకు చెందిన ఒక బీజేపీ నాయకునితో మంత్రి కేటీఆర్ సంభాషణ మొన్నంతా చక్కర్లు కొట్టింది. ఆ చక్కర్లకు కారణం బీజేపీ వారే. ఫలితం మాత్రం వారికి కలవరం కలిగించేదే! ఒక పద్ధతీ పాడూ, సిద్ధాంతాలూ, సమర్థతా, ప్రజా సంక్షేమభావనా ఎటూ లేవు… కనీసపు తెలివితేటలు కూడా లేని బీజేపీ గణం, ముఖ్యంగా రాజగోపాల్రెడ్డి స్వయంగా ఆ వీడియోను ప్రచారంలో పెట్టి అభాసుపాలయిన్రు. బీజేపీలోని కొందరు ఆలోచనాపరులు నాకు ఫోన్ చేసి.. ‘మంత్రి ఎంత చక్కగా, హుందాగా మాట్లాడిన్రు, మా తెలివిలేని నాయకుడు ఆ మాటలు బయటపెట్టి సెల్ఫ్గోల్ చేసుకున్నడు, టీఆర్ఎస్ స్థాయి పెంచిండు’ అని అన్నారు! నిజమే కదా?
ఇంతకీ కేటీఆర్ ఏమన్నరు? ‘రండి.. మునుగోడును అభివృద్ధి చేసుకుందాం’ అన్నరు. ఆ బీజేపీ నాయకుడు కూడా పాలనా పద్ధతుల గురించి మాట్లాడిన్రు. టీఆర్ఎస్ సంక్షేమ పథకాలు బాగున్నయి అన్నరు. రైతుబంధు గురించి, కౌలు రైతుల గురించి మాట్లాడిన్రు. కేటీఆర్ వాటికి సమాధానం చెప్పిన్రు. అవసరమైన చోట మార్పులు చేద్దామన్నరు. మరొక ముఖ్య విషయం కూడా అన్నరు. పోనీ రాజగోపాల్ రెడ్డి గారు (‘గారు’ అన్న సంబోధనను గమనించాలి!) ఏమన్నా ఆర్ఎస్ఎస్, బీజేపీ నేపథ్యం ఉన్నవారా? సైద్ధ్దాంతిక నిబద్ధత ఉన్నవారా? మోదీ మీద ప్రేమ ఉన్నవారా? కేవలం వ్యక్తిగత స్వార్థం కోసం, కాంట్రాక్టుల కోసం బీజేపీలో చేరిన్రు’ అన్నరు. అభివృద్ధి చేసుకుందాం, సంక్షేమం పంచుకుందాం, మీ మద్దతు కావాలి’ అని అడిగిన్రు. నేతన్నలకు పని చేసి అడుగుతున్నం. డొల్ల మాటలు చెప్తలేను. నా కోసమో, మీ కోసమో అడుగుతలేను, నియోజకవర్గం బాగు కోసం మీ మద్దతు అడుగుతున్న’ అన్నరు. మీ నియోజకవర్గంలో మిషన్ భగీరథ అయింది, 79 వేల మందికి రైతుబంధు వస్తున్నయి, 43 వేల మందికి పింఛన్లు వస్తున్నయి. ఇదివరకు లేని అభివృద్ధి-సంక్షేమం ఇది’ అన్నరు. మీ ఆశీర్వాదం కావాలె’ అని అభ్యర్థించిన్రు.
అసలు ఎన్నికల ప్రచారం అంటే తాము చేసినవాటిని గుర్తుచేసి తమకు ఓటేయాలనడగడం. ప్రత్యర్థిని కూడా ఓటు అభ్యర్థించడం, మద్దతు పలకాలని కోరడం. అది సహజ ప్రజాస్వామిక లక్షణం. కేటీఆర్ చేసింది అదే. ఆయన ఏమన్నా ప్రలోభపెట్టారా? ఆశ చూపారా? తాము అభివృద్ధి చేస్తున్నామని, ప్రజల ప్రగతి కోసం తమకు సాయం చేయమని అడిగారు. ‘అభివృద్ధి జరుగుతున్న మాట వాస్తవమేనని’ సదరు బీజేపీ నాయకుడు కూడా అంగీకరించారు. కేటీఆర్ అమిత్ షా లెక్క బెదిరించలే. మర్మ గర్భంగా కేసులు పెడుతామనలే. వ్యవస్థలను ప్రయోగిస్తమని హుంకరించలే. కనీసం ఆ నాయకుడికి వ్యక్తిగత ప్రలోభం కూడా చూపలే! ఎంత సొగసైన మాట, ఎంత నిబద్ధమైన తీరు! కాబట్టే ఆ వీడియోపై బీజేపీ వాళ్ల దుష్ప్రచారం దూదిపింజలా ఎగిరిపోయింది.
కేటీఆర్ను దేశ, విదేశాల్లోని యువత ఒక ఆధునిక నాయకుడిగా, సాంకేతికత, విజ్ఞానం ప్రోది చేసుకున్న ‘పోస్టర్ బోయ్’గా అభిమానిస్తరు. అది ఎటూ వాస్తవమే గానీ, ఆయనను లోతుగా గమనిస్తే ఇంకా ఎన్నో తెలుస్తయి. కేవలం అందంగా కనిపించడమో, హుందాగా వినిపించడమో మాత్రమే అయితే ఆయన గురించి ఈ వ్యాసం అవసరపడి ఉండేది కాదు.
కేటీఆర్ మాట తడుముకోకుండా అనర్గళంగా మాట్లాడటానికి ఒక నేపథ్యం ఉన్నది. ఆ నేపథ్యం పేరే తెలంగాణ… ఆ నేపథ్యం పేరే మొక్కవోని నిబద్ధత. నిదురలో లేపి అడిగినా తెలంగాణకు ఏం కావాల్నో, ఏం చేసినమో, ఇంకేం చేయగలమో చెప్పగలరు కేటీఆర్. ప్రభుత్వం తెస్తున్న ప్రతి పథకం, విధానం, బ్లూప్రింట్ పట్ల ఆయనకు లోతైన అవగాహన ఉంటుంది. గతంలో కేసీఆర్ స్వయంగా చెప్పినట్టు ముఖ్యమంత్రుల బిడ్డలు అయితే వారికి సహజంగా కొంత అవకాశం ఉంటుంది. కానీ స్వయం ప్రకాశం లేనపుడు వారసత్వం కూడా ఏమీ చేయలేదు. మనం ఎందరో ప్రధానులు, ముఖ్యమంత్రుల బిడ్డలను చూసినం, వాళ్ల వైఫల్యాలనూ ఎరుగుదుము. అంతిమంగా నేను చెప్పొచ్చేదేమంటే, కేటీఆర్ అనే నవీన యువకుడికి సకల పార్శ్వాలూ తెలుసు, సర్వ వ్యవహారాలూ తెలుసు. అన్నిటికీ మించి నిలువెల్లా తెలంగాణతనం ఉండటం కారణంగా పండిత పామరులకు ప్రియుడవుతున్నరు ఆయన!
ఇదంతా రాసింది పొగడ్త కోసం కాదు. పొగడ్తల వల్ల వారికీ, నాకూ, మీకూ ఒరిగేదేమీ లేదు. భవిష్యత్తులో బీఆర్ఎస్ రూపంలో కేసీఆర్, కేటీఆర్ ఈ దేశానికి, రాష్ర్టానికి ఏం చేయగలరని ఒక సంకేతం ఇవ్వడం కోసమే! ఫిరాయింపుల విషయం కూడా కొంచెం చర్చించుకోవాల్సి ఉన్నది. శల్యుడిని తమవైపు తిప్పుకొని శ్రీకృష్ణుడిని కూడా తమ పెరట్లో కట్టేసుకోవాలనుకున్న కౌరవుల అధర్మ బుద్ధికీ, కర్ణుడిని తమ శిబిరంలో చేర్చుకోవాలనుకున్న శ్రీ కృష్ణుడి ఆలోచనకు తేడా ఉన్నది! ఫిరాయింపులు స్థూలంగా తప్పేమీ కావు అని సామాన్య ప్రజలు కూడా అనుకుంటరు. కాబట్టి వాటికి పెద్ద విలువ లేదు. అయితే ఎందుకు ఫిరాయిస్తున్నరనేది ముఖ్యం. ఏం సాధించడానికి, ఎవరిని బలోపేతం చేయడానికనేది ముఖ్యం. ఈ దేశ ప్రజలను దివాలా తీయించిన బీజేపీ పక్షంలోకి ఎవరు పోయినా అది దేశం పట్ల ద్రోహమే. మరో మాట లేదు. ‘ఈ దేశాన్ని సమగ్రంగా అర్థం చేసుకోవడంలో అంబేద్కర్ను మించినవారు లేరు’ అన్నరు కేటీఆర్ అసెంబ్లీ వేదికగా. ఈ దేశాన్ని సమూలంగా నాశనం చేయడంలో బీజేపీని మించినవారు లేరన్నది కూడా అంతే వాస్తవం. అంబేద్కర్ పేరును తెలంగాణ నూతన సచివాలయానికి సమున్నతంగా, సగర్వంగా పెట్టడమే కాదు, ఆయన దార్శనికతను పుణికిపుచ్చుకొని పరిపాలన చేయాలన్న తపన అణువణువునా నింపుకొన్న టీఆర్ఎస్ పార్టీని బలోపేతం చేయడం మునుగోడుకు మాత్రమే కాదు, రేపు దేశమంతటికీ తక్షణావసరం.
బీజేపీ పాలనలో ఈసీ, ఈడీ జేబు సంస్థలుగా మారుతయి, రేపిస్టులు విచ్చలవిడిగా తిరుగుతరు, రూపాయి పాతాళం కంటే కిందకు పడిపోతది. బాయికాడ మీటర్లు పెట్టి రైతులను గోస పెడుతరు, ఉద్యోగాలు రావు, పేదరికం పెరుగుతది, గవర్నర్లు రెచ్చిపోతరు, కార్మికులు విలవిలలాడుతరు. ఆర్థిక సంక్షోభంతో మధ్య తరగతి జీవనం అతలాకుతలమైతది. ఒక్క వ్యక్తి స్వార్థం కోసం మునుగోడు ఎన్నిక వచ్చినట్టే.. ఒక్క వ్యక్తిని మహనీయుడిగా, శాస్త్రజ్ఞుడిగా, విశ్వగురువుగా నిలిపే అన్యాయపు ఆత్రుతలో అన్ని విలువల వలువలు ఒలిచివేస్తున్నది బీజేపీ. మహాత్ముడిని భౌతికంగా నిర్మూలించినవాళ్లు దేశ ప్రజల గుండెల నుంచి కూడా ఆయన స్ఫూర్తిని తొలగించాలని చూస్తున్నరు. కేంద్ర ఆర్థికమంత్రి మాటల గురించి రాయడానికి నా స్థాయి నన్ను అనుమతించడం లేదు. సర్వభ్రష్ట బీజేపీని మునుగోడు నుంచి, హస్తిన నుంచి తరిమేయడం ఒక్కటే మన అన్ని కష్టాలకు పరిష్కారం. అందుకోసం ఎవరినైనా కలుద్దాం, కలుపుకొందాం. కేటీఆర్ చేసింది అదే. లక్ష్యం స్పష్టంగా ఉన్నది, హృదయానికి దగ్గరగా ఉన్నది, మనసు నిండా తపన ఉన్నది. మరి మార్గం ఏమంత పెద్ద విషయం కాదు.
Go, rock KTR!
(కేటీఆర్… వెళ్లండి… ప్రభంజనం సృష్టించండి!) మునుగోడు గెలవాల్సిందే… దేశం చూడాల్సిందే!
-శ్రీశైల్ రెడ్డి పంజుగుల , 90309 97371