రాష్ట్ర రాజకీయాలనే కాదు, దేశ రాజకీయాలను మలుపు తిప్పే చారిత్రాత్మక సన్నివేశానికి నేడు మునుగోడు కేంద్రంగా మారింది. ప్రజల నిత్యావసరాలైన కూడు, గూడు, ఉద్యోగం వంటివి ఎజెండాలోనే లేకుండా చేసి, తన మతపిచ్చి రాజకీయాలతో రావణకాష్టాన్ని రగిలిస్తున్న బీజేపీ, దేశాన్ని ఆర్థికంగా, సామాజికంగా అధోగతి పాలు చేస్తున్నది. బీజేపీ దుర్మార్గ పాలన నుంచి ప్రజల్ని విముక్తి చేసే గొప్ప మార్పుకు మునుగోడు నుంచే నాంది పలికే అవకాశం అక్కడి ఓటర్ల ముంగిట నిలిచింది.
మత పిచ్చి రాజకీయాలతో ఉత్తర భారతదేశంలో పాగా వేయగలిగిన బీజేపీకి, దక్షిణాన కర్ణాటకలో తప్ప ఇంకెక్కడా అవకాశం చిక్కలేదు. దక్షిణాది ప్రజల రాజకీయ చైతన్యం ముంగిట బీజేపీ మతం పాచిక పారుతలేదు. మరీ ముఖ్యంగా సకల జనులకూ అభివృద్ధి సంక్షేమ ఫలాలను అందిస్తూ పురోగమిస్తున్న తెలంగాణలో బీజేపీ మంత్రం తంత్రం పనిచేస్తలేవు. రాష్ర్టాన్ని అన్నపూర్ణగా తీర్చిదిద్దుతున్న ముఖ్యమంత్రి కేసీఆర్ పట్ల తెలంగాణ ప్రజలలో అమితమైన అభిమానం ఉన్నది. ఆ అభిమానాన్ని దెబ్బతీయడం బీజేపీ తరం కావడం లేదు. అయినా ఆ పార్టీ తన కుటిల యత్నాలను కొనసాగిస్తూనే ఉన్నది. అందులో భాగంగా వచ్చిందే మునుగోడు ఉప ఎన్నిక.
తెలంగాణ ఉద్యమ కాలంలో, పదవికి రాజీనామా చేయాలని జనం ఎంత డిమాండ్ చేసినా సరే ససేమిరా అన్న రాజగోపాల్ రెడ్డి ఎవరూ కోరకుండానే హఠాత్తుగా ఇప్పుడు ఎందుకు రాజీనామా చేసినట్టు? రాష్ట్రంలో ఉన్న ఒక ప్రతిపక్ష పార్టీ నుంచి ఇంకో ప్రతిపక్ష పార్టీకి పోయి ఇదంతా మునుగోడు అభివృద్ధి కోసమేనని చెబితే నమ్మడానికి మునుగోడు ప్రజలు పిచ్చివాళ్లు కాదు కదా? ఈ రాజీనామా వెనుక అసలు మతలబు ఏంది?
నియోజకవర్గం పనుల కన్నా తన వ్యాపా రం, కాంట్రాక్టులతోనే ఎక్కువకాలం గడిపే రాజగోపాల్రెడ్డికి బీజేపీ బంపర్ ఆఫర్ ఇచ్చింది. తమ పార్టీలో చేరితే రూ.18 వేల కోట్ల కాంట్రాక్ట్ ఇస్తామన్నది. ఆయన వెంటనే కాషాయంలో మునకేసిండు. మునుగోడుకు ఉపఎన్నిక తెచ్చిండు. ఇదంతా మునుగోడు అభివృద్ధికోసమే అనే బూటకపు వాదన తెర మీదికి తెచ్చి, జనం కండ్లళ్ల మట్టి గొట్టాలని చూస్తున్నడు. ఈ నేపథ్యంలో, ఒక్కసారి ము నుగోడు ప్రజలు అనుభవించిన కష్టాలు ఎటువంటియో, ఆ కష్టాలు తీర్చి, కన్నీరు తుడిచిన చేతులెవరివో యాది చేసుకోవాల్సిన అవసరం ఉంది. సమైక్య పాలకుల నిర్వాకం వల్ల ఫ్లోరోసిస్ వ్యాధిగ్రస్థుల ప్రాంతంగా మునుగోడు ప్రపంచ ప్రసిద్ధి పొందింది. మట్టిలో, నీటిలో, పండేపంటలో, తాగే కల్లులో, తల్లిపాలలో సైతం ఫ్లోరిన్ విషం నిండిపోయింది. ఆ నీళ్ళు తాగిన మునుగోడు ప్రజల బొక్కలల్ల మూ లుగు చచ్చిపోయింది. శరీరం కట్టెచరుసుక పోయి జీవచ్ఛవాలైన పరిస్థితి దాపురించింది.
సమైక్య రాష్ర్టాన్ని పాలించిన ఏ పార్టీ జెండా పట్టినా ఇంట్ల మంచినీళ్ళ కుండ మాత్రం నిండలేదు. దుశ్చర్ల సత్యనారాయణ నడుం బిగించి, నల్లగొండ వాసులు తాగేందుకు కృష్ణాజలాలు ఇయ్యాలె అనే డిమాండ్తో జలసాధన పోరాటం చేపట్టిన్రు. ఎన్నికల్లో వందలకొద్దీ నామినేషన్లు వేయించి దేశం దృష్టిని ఆకర్షించే ప్రయత్నం చేసిన్రు. చివరికి బొక్కలు వంకర పోయిన అంశాల స్వామిని ఢిల్లీకి తీస్కపోయి, ఆనాటి ప్రధాని అటల్ బిహారీ వాజపేయీ టేబుల్ మీద పండుకోబెట్టిన్రు. మాకు కృష్ణా నీళ్ళిచ్చి ఆదుకో మహాప్రభో అనివేడుకున్నరు. కానీ ఫలితం దక్కలేదు. ఆనాడు ఉన్నదీ ఇదే కర్కోటక బీజేపీ ప్రభుత్వం. తెలంగాణ సాధించుకున్నాంక, ముఖ్యమంత్రి కేసీఆర్ మిషన్ భగీరథ పథకాన్ని మునుగోడు నియోజకవర్గం నుంచే ప్రారంభించి చౌటుప్పల్లో పైలాన్ను తన చేతులమీదుగా ఆవిష్కరించిండు. మిషన్ భగీరథతో మునుగోడు నియోజకవర్గంలో ఫ్లోరైడ్ పీడ శాశ్వతంగా విరుగడైపోయింది. తెలంగాణలో ఫ్లోరోసిస్ వ్యాధి అంతమయిందనీ, కొత్త కేసులేవీ లేవని కేంద్రప్రభుత్వం పార్లమెంటు వేదికగా చెప్పింది. మిషన్ భగీరథకు కేంద్ర ప్రభుత్వం రూ.19 వేల కోట్ల ఆర్థిక సాయం చేయాలని నీతి ఆయోగ్ సూచించింది. కానీ ఆ సూచనను ఇదే కర్కోటక బీజేపీ ప్రభుత్వం బేఖాతరు చేసింది. కానీ తన స్వార్థ రాజకీయ ప్రయోజనం కోసం కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి రూ.18 వేల కోట్ల కాంట్రాక్టును కట్నంగా ఇచ్చింది. అందుకే ద్రోహం చేసిన బీజేపీని తిరస్కరించి, దాహం తీర్చిన టీ ఆర్ఎస్కే పట్టం కట్టాల్సిన అవసరం ఉంది.
మునుగోడు ప్రాంత సాగునీటి అవసరాలు తీర్చడానికి టీఆర్ఎస్ ప్రభుత్వం డిండి ఎత్తిపోతల పథకాన్ని రూపొందించి అందులో భాగంగా, మునుగోడు కోసం ప్రత్యేకంగా శివన్నగూడెం-కిష్టరాయనిపల్లి రిజర్వాయర్ల నిర్మాణం చేపట్టింది. ఒక్కొక్కటి 12 టీఎంసీల సామర్థ్యం కలిగిన ఈ రిజర్వాయర్లు, నాగార్జున సాగర్ తర్వాత జిల్ల్లాలో అతిపెద్ద రిజర్వాయర్లు. వీటి నిర్మాణ పనులు 60 శాతం పూర్తయినయి. మునుగోడును సస్యశ్యామలం చేసే ఈ ప్రాజెక్టు పనులను అడ్డుకోవడానికి సాగుతున్న కుట్రల వెనుక కూడా రాజగోపాల్ రెడ్డే ఉన్నడన్నది బహిరంగ రహస్యం.
కృష్ణా జలాల్లో మన రాష్ర్టానికి రావాల్సిన న్యాయమైన వాటాను బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ తేల్చవలసి ఉన్నది. ఆ పని చెయ్యమని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ట్రిబ్యునల్కు సూచించాలె. కానీ గా చిన్న పనిగూడ బీజేపీ ప్రభుత్వం చేస్తలేదు. అదే జరిగితే కృష్ణా నికరజలాల్లో మునుగోడుకు వాటా వస్తది. మునుగోడు పచ్చని పంటలతో తులతూగుతది. కృష్ణాలో మన నీళ్ళ వాటా తేల్చని బీజేపీకి మునుగోడులో ఓట్లడిగే హక్కు లేదు. ప్రజాస్వామ్యంలో ఓటు అంటే ప్రాణంతో సమానం అంటడు ప్రజాకవి కాళోజీ. ముఖ్యమంత్రి కేసీఆర్ అండదండలతో అభివృద్ధికి బంగారు బాటలు నిర్మించుకునే దిశగా మునుగోడు ప్రజలు తీర్పునివ్వాలి.
– డి. అభిజ్ఞ