విపణి మార్పులను స్వీకరించలేని, జాతి అవసరాలను అవగాహన చేసుకోలేని, దశాబ్దాల కిందటి గీటురాళ్లకు వేలాడుతున్న రాజకీయాలు అవసరమా? ప్రజల అవసరాల పట్ల పట్టింపే లేని జఢత్వంలో జోగుతున్న జాతీయపార్టీలతో ఇంకా ఒరిగేదేముంది? అందుకే, బాధితులను గాలికివదిలి, వ్యవస్థలన్నిటినీ గుప్పెడు మంది షావుకారుల చుట్టూతా గిరగిరా చక్కర్లు కొట్టే బొంగరాలుగా తీర్చిదిద్దిన ఘనాపాఠీలను సకలజనులు పక్కకు తప్పించాల్సిన చారిత్రక అవసరం ఏర్పడింది. ఆ దిశగా, దేశంలో దగాపడ్డ వర్గాలన్నీ కేసీఆర్ నాయకత్వంలోని జాతీయపార్టీ వెంట అడుగులు వేస్తాయి.
దేశంలోని 57 శాతం మహిళలు రక్తహీనతతో బాధపడుతున్నారు. దాదాపు 40 శాతం మంది చిన్నారులు తక్కువ బరువు, ఎదుగుదల లోపం వంటి దౌర్భాగ్యస్థితిని అనుభవిస్తున్నారు. ప్రభుత్వ చేయూత కరువై, ఉపాధి ఎండమావిగా మారి, అన్నమో రామచంద్ర అని అలమటించే దీనత్వంలోకి జాతిజనులను నడిపించారు.
ప్రపంచంలో లేని వారసత్వ ప్రత్యేక నైపుణ్యాలు మన దేశంలో ఉన్నాయి. చీర నేసినా, నాగలి చెక్కినా, కొండను చీల్చినా, నగలను మెరిపించినా, ఇలా భారతీయులతో పోటీపడే నిపుణులు ప్రపంచంలో ఉన్నారా? కానీ, పనిచేసే చేవ కలిగిన చేతులకు ఉపాధి కల్పించలేని, ఆధునిక మార్పులను అందివ్వలేని కేంద్ర ప్రభుత్వాలన్నింటి వైఫల్యం వల్లే, ఈ వర్గాలన్నీ నేటికీ దారిద్య్రరేఖను నుదుటి మీది నుంచి చెరిపేసుకోలేకపోతున్నాయి. అంబేద్కర్ నమోచ్ఛరణలో కాంగ్రెస్, బీజేపీ నేతలూ గానగంధర్వులే. కానీ రాసుకున్న రాజ్యాంగానికి ఆత్మ అయిన సామాజిక న్యాయాన్ని జారుడు బండ మీద నిలబెట్టి, అగాధంలోకి తన్నే క్రీడను ఆడుతూనే ఉన్నారు.
ఈ అనాగరిక రాజకీయ క్రీడ పర్యవసానంగానే దేశం వజ్రోత్సవాల మైలురాయికి చేరుకున్నా, మెజారిటీ ప్రజలు పేదరికాన్ని దాటలేకపోతున్నారు. రాజ్యాంగంలోని ఆదేశికసూత్రాలున్న 4వ భాగాన్ని కాంగ్రెస్, బీజేపీలు అక్కరకురాని ఐదో వేలుగా భావించాయి. దానివల్లనే పేదరికాన్ని, వివక్షను రూపుమాపి భిన్న సామాజికవర్గాల మధ్యన అంతరాలను తగ్గించాల్సిన పాలకులు, అగాధాన్ని నిర్మించారు. మెజారిటీ ప్రజానీకం రెండు భుజాల మీద నుంచి వివక్ష, పేదరికాన్ని దింపకుండానే, దేశాన్ని అభివృద్ధి పరుగులు పెట్టించగలమని ప్రగల్భాలు పలికే పరమానందయ్య శిష్యుల చేతిలో జాతీయపార్టీల పగ్గాలున్నాయి.
దాని కారణంగానే కేంద్ర పాలకులు ఎన్ని గొప్పలు చెప్పుకొన్నా, నేటికీ 45 శాతం దేశ జనాభా బహిరంగ మలవిసర్జన దుస్థితిని ఎదుర్కొంటున్నారు. అందువల్లే కదా ‘గ్లోబల్ హంగర్ ఇండెక్స్’లో మొత్తం 116 దేశాల్లో భారతదేశం 101వ స్థానంలో వెలుగుతున్నది! అలాగే ‘వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్’ ప్రకారం మొత్తం 146 దేశాల్లో, మన దేశం 136వ స్థానంలో కుమిలిపోతున్నది! అన్నమూ.. ఆనందమూ కరువైన బతుకుల భారతానికి కాంగ్రెస్, బీజేపీలు కారణం కాదా..? భారత సామాజిక చరిత్రను అధ్యయనం చేయని, రాజ్యాంగస్ఫూర్తిని కాలానుగత మార్పులకు అన్వయించలేని రాజకీయ నాయకత్వం కారణంగానే దేశంలో దుఃఖితులు పెరిగిపోయారు.
వాస్తవానికి మానవహక్కులు, న్యాయం భావనలే భారత రాజ్యాంగానికి జీవం. కానీ ఈ సారాంశాన్ని అర్థం చేసుకోవడంలో, ఆచరించటంలో కాంగ్రెస్, బీజేపీ విఫలమయ్యాయి. దాని కారణంగానే వ్యవసాయంలో పనిలేక, పరిశ్రమల్లో ఉపాధి దొరకక, కులవృత్తులు కునారిల్లి అణగారిన వర్గాలు చిరుద్యోగులు, నిరుద్యోగులుగానో బతుకీడుస్తున్నారు. దీనికితోడు ప్రభుత్వరంగంలో 1994 నాటికి 41.76 లక్షల ఉద్యోగాలుంటే, 2021 నాటికి కేంద్ర సిబ్బందిని 34.5 లక్షలకు కుదించారు. వీటిలోనూ దాదాపు 14 లక్షలకుపైగా ఖాళీలు భర్తీచేయకుండా రిజర్వేషన్లకు గండికొట్టారు.
పైగా కీలక ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేటుపరం చేస్తున్న కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, మహిళ, దివ్యాంగుల హక్కులను హత్య చేస్తున్నది. ఈ ప్రభుత్వానికి ఎస్సీ, ఎస్టీల డిమాండ్లు పట్టవు, తమ జనాభాను లెక్కించాలన్న బీసీల డిమాండ్లు తలకెక్కవు, మైనారిటీలపై కంటగింపు వెరసి బీజేపీ బాధిత జన నిలయంగా దేశం మారిపోయింది. అయితే ఈ బాధితులకు భరోసాగా నిలబడి, దేశం నలుమూలలా కదలిక తేవడంలో బీఎస్పీ, ఆర్జేడీ, సమాజ్వాదీ, డీఎంకే లాంటి పార్టీలు విఫలమయ్యాయి.
దేశవ్యాప్తంగా ఉన్న బాధిత జనానికి ఇపుడొక దారిదీపం కావాలి. రాష్ట్రంలో అణగారిన వర్గాల అభివృద్ధి కోసం దాదాపు 400 సంక్షేమ పథకాలు అమలుచేయడమే కాదు, ఏకంగా రాష్ట్ర పరిపాలనా కేంద్రానికి అంబేద్కర్ పేరు పెట్టిన కేసీఆర్ కాకుండా మరెవరున్నారు? దేశంలోని రైతాంగంతో పాటు వివిధ బాధిత వర్గాల ప్రజారాశులు సైతం కేసీఆర్ నాయకత్వంలోని జాతీయపార్టీని బలపరచడం ఖాయం. ఇప్పటికే భ్రమాజనిత, ప్రతీఘాతుక అభివృద్ధి నమూనా కారణంగా రూపాయి పతనం, ఆర్థిక వ్యవస్థ నాశనం దిశగా దేశం సాగుతున్నది. వీటన్నింటిని చూస్తూ ప్రగతిశీల సమాజం మౌనంగా ఉండలేదు. అందుకే ప్రజా శ్రేణులన్నీ ఒక్కటిగా బైలెల్లి, గులాబీ జెండాను అందుకొని తీరుతాయి. ఇప్పుడు ఇక్కట్లలో ఉన్న భారతదేశానికి నిలబడతాయో, కుమ్ములాడుకొని కూలబడిపోతాయో తెలియని కూటములకంటే, నడిపించే నికార్సైన నేత కావాలి.
ఆ నాయకుడే కేసీఆర్. దేశానికి కాలం వాగ్దానం చేసిన కేసీఆర్కు సకలజనులు సంఘీభావంగా నిలబడతారు. ఈ విజయదశమి రేపటి మన విజయానికి శంఖారావం పూరిస్తున్నది. సరిగ్గా టీఆర్ఎస్ ఆవిర్భవానికి కారణభూతమైన, 2001కి ముందు తెలంగాణలో కొలువుదీరిన భౌతిక పరిస్థితులే నేడు దేశంలో నెలకొన్నాయి. నాటి సర్కార్ తీరుగనే మోదీ ప్రభుత్వ విధానాలున్నాయి. రాష్ర్టాల పట్ల వివక్ష, నిలదీసినవారి మీద అణచివేత, అన్నిరంగాల్లో సంక్షోభం దేశాన్ని వేధిస్తున్నది. ఆ చారిత్రక సందర్భంలో పిడికిలెత్తిన కేసీఆర్ తెలంగాణకు తొవ్వ చూపినట్లే, రేపు భారతావనికి ప్రగతి చరిత్రను అందించి తీరుతాడు. దేశం నలుచెరుగులా కేసీఆర్ నాయకత్వం వర్ధిల్లాలనే నినాదం మార్మోగి తీరుతుంది.
(వ్యాసకర్త: రాష్ట్ర బీసీ కమిషన్ మాజీ సభ్యులు)
-డాక్టర్ ఆంజనేయగౌడ్
98853 52242