కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత భారతదేశం అనేక సవాళ్లను ఎదుర్కొంటున్నది. సమాజ మనుగడకు ప్రశ్నార్థకంగా మారిన విద్వేషాన్ని పెంచిపోషిస్తూ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నది. మనుషులను మనుషులుగా చూడలేని బీజేపీ.. హిందుత్వం, దేశభక్తిని తమ పేటెంట్ హక్కులుగా భావించడం సిగ్గుచేటు.
ప్రపంచంలోనే ప్రత్యేక గుర్తింపు కలిగిన ప్రజాస్వామిక, సామ్యవాద, లౌకిక భారతం విచ్ఛిన్నకర శక్తులకు ఊతం ఇచ్చే వారి చేతిలో బందీ అయింది. అందుకే చరిత్ర వక్రీకరణ జరుగుతున్నది. దేశ స్వాతంత్య్ర పోరాటంలో పరాయి పాలకులకు వత్తాసు పలికిన వారు నేడు స్వాతంత్య్ర సమరయోధులుగా కీర్తించబడుతున్నారు. స్వతంత్ర లౌకిక భారత నిర్మాణం కోసం స్వాతంత్య్ర పోరాటంలో ఎన్నో త్యాగాలు చేసిన షాహిద్ భగత్సింగ్, సుభాష్ చంద్రబోస్, గాంధీజీ, నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్లతోపాటు తెలంగాణలో చాకలి ఐలమ్మ, కుమ్రం భీం తదితరులను సైతం హిందుత్వ వాదులుగా నేటి తరానికి ఆర్ఎస్ఎస్, బీజేపీ వాటి అనుబంధ సం ఘాలు పాఠాలుగా చెప్తున్నాయి. దీన్ని నిలువరించాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. దేశ సమైక్యత కోసం, ప్రజాస్వామిక భారతం కోసం ప్రజాస్వామికవాదులు గొంతుక తెరవాల్సిన సమయం ఆసన్నమైంది.
స్వాతంత్య్ర పోరాటంలో, స్వతంత్ర భారత నిర్మాణంలో భాగస్వామిగా ఉన్న కాంగ్రెస్ పార్టీ నేడు గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నది. దేశ రాజకీయాలను ప్రభావితం చేసే దశ నుంచి ఉనికి కోసం పాకులాడుతున్న కాంగ్రెస్కు ఒంటరిగా బీజేపీని ఎదుర్కొనే శక్తి సన్నగిల్లింది. ఈ తరుణంలో దేశానికి కేసీఆర్ లాంటి శక్తులు అవసరం. దేశంలో ప్రాంతీయ పార్టీల బలం పెరిగింది. దేశ సమైక్యత కోసం ఆలోచించే వారి సంఖ్య కూడా పెరిగింది. దక్షిణాది రాష్ట్రాల్లో అతి ముఖ్యమైన తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు బీజేపీపై తిరుగుబాటు బావుటా ఎగురవేశారు. తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు ముఖ్యంగా రైతుల కోసం ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు ఆదర్శనీయమైనవి. దేశంలో సంపదను సృష్టించే వనరులున్నా, వాటిని వినియోగించుకోకుండా వ్యవసాయాధారిత భారతదేశంలో వ్యవసాయాన్ని ఎందుకు బలహీనపరుస్తున్నారనే ఆవేదన ముఖ్యమంత్రి కేసీఆర్లో బలం గా ఉన్నది. అందుకే దేశంలో విచ్ఛినకర శక్తులకు ఊతం ఇస్తున్న బీజేపీ విముక్తితోనే దేశ సమైక్యత సాధ్యమని కేసీఆర్ నమ్ముతున్నారు. బీజేపీ మతం పేరుతో పాలన చేస్తూ, ప్రజాస్వామిక దేశంలో నియంతృత్వ పాలనకు పునాది వేస్తున్నది. అలాంటి బీజేపీని ఎదుర్కొనే బలమైన శక్తి అవసరం ఉన్నది. ఆ శక్తి కేసీఆర్ రూపంలో దేశానికి దొరకటం మనమందరం స్వాగతించాలి. బీజేపీ చేతిలో బందీ అయిన లౌకిక భారతాన్ని విముక్తి చేసేందుకు ముందుకు వచ్చిన కేసీఆర్ను ప్రజాస్వామిక వాదులు బలపర్చాలి. కేసీఆర్ దేశ రాజకీయాల్లో విజయవంతం కావడంతో పాటు దేశ్కీ నేతగా కీర్తించబడటం ఖాయం.
( వ్యాసకర్త : సీపీ నాయుడు , 85199 91515, ఎస్ఎఫ్ఐ, డీవైఎఫ్ఐ ఉమ్మడి ఏపీ మాజీ ఉపాధ్యక్షుడు)