ప్రస్తుతం దేశంలో బీజేపీ పాలన వల్ల అన్ని వర్గాలు రోడ్డున పడ్డాయి. ఆర్థిక వ్యవస్థ చితికిపోయింది. డాలర్తో రూపాయి మారకం విలువ రూ.80కి దిగజారింది. బీజేపీ విద్వేష రాజకీయాల వల్ల దేశం వర్గాలుగా విడిపోయే పరిస్థితి వచ్చింది. ఇలాంటి పరిస్థితుల్లో సెక్యులర్, సోషలిస్ట్, అంబేడ్కరిజం, మండల్ నమూనా ప్రజాస్వామిక పరిపాలన కావాలి. ఇందుకోసం బహుజన సమాజ్వాదీ పార్టీ (బీఎస్పీ) తన రాజకీయ వ్యూహాలపై పునరాలోచన చేయాలి. ప్రగతి శీల శక్తులతో కలిసి బీజేపీని ఓడించడంపై దృష్టి పెట్టాలి.
బీఎస్పీ అధినేత్రి మాయావతి ఆ పార్టీ వ్యవస్థాపకుడు కాన్షీరాంలాగా దేశమంతా తిరిగి బీజేపీ వ్యతిరేక శక్తులను, ప్రజాస్వామ్య, సెక్యులర్ శక్తులను, అంబేద్కరిస్టులను ఏకం చేయాల్సిన ఆవశ్యకత ఎంతో ఉంది. అయితే ఒకప్పుడు జాతీయ రాజకీయాల్లో క్రియాశీలంగా ఉన్న బీఎస్పీ నేడు అంత చురుకైన పాత్ర పోషించడం లేదు. మాయావతి తన తర్వాత రెండో స్థాయి నాయకులను తయారు చేయకపోవడమే ఇందుకు కారణం. సైద్ధాంతికంగా ఆ పార్టీకి ఎవరు మిత్రులో, ఎవరు శత్రువులో తెలియనట్లుగా ఉంది.
బీఎస్పీ ఒక్కటే బహుజనుల పార్టీ అని చాలా మంది అనుకొంటున్నారు. కానీ బీఎస్పీ పార్టీ లక్ష్యం కేంద్రం, రాష్ర్టాలలో బహుజనులు అధికారం చేపట్టడమే. అలా చూస్తే బీసీలు నాయకత్వం వహిస్తున్న పార్టీలను, ప్రభుత్వాలనూ పరిగణనలోనికి తీసుకోవాలి. తమిళనాడు సీఎం స్టాలిన్ బీసీ వర్గానికి చెందిన నేత. బీహార్ సీఎం నితీశ్కుమార్ కూడా బీసీనే. ఉత్తర ప్రదేశ్లో బీజేపీని గట్టిగా ఎదుర్కొంటున్న అఖిలేష్ యాదవ్ కూడా బీసీనే. బహుజన రాజకీయాలకు సరైన అర్థం ఏమిటంటే… దేశ జనాభాలో ఆర్థికంగా, రాజకీయంగా ఎవరికి దక్కాల్సిన వాటా వారికి దక్కాలని.
కానీ పార్టీ వ్యవస్థాపకుడు కాన్షీరాం ఆలోచన విధానం నేడు బీఎస్పీలో కొరవడింది. ఆ పార్టీ యూపీలో బీజేపీతో లోపాయికారీ ఒప్పందం చేసుకున్నదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో 122 స్థానాల్లో ఎస్పీ ఓటమికి బీఎస్పీనే కారణమనే ఆరోపణలు ఉన్నాయి. 122 స్థానాల్లో బీజేపీ చెప్పిన అభ్యర్థులకే ఆ పార్టీ బీ ఫారాలు ఇచ్చిందని గుసగుసలు వినిపిస్తున్నాయి. సమాజ్ వాదీ నేత అఖిలేష్ యాదవ్ మాయావతిని మేనత్త అని సంబోధిస్తారు. పొత్తులు పెట్టుకోవడానికి స్నేహ హస్తం చాచారు. కానీ తమ శత్రువు ఎస్పీనే అని మాయవతి ప్రకటించారు. బహుజనులకు అధికారం కావాలని కృషి చేస్తున్న రెండు పార్టీలు ఇలా శత్రువులుగా ఉంటే బహుజన సమాజ నిర్మాణం ఎలా జరుగుతుంది? ఈ రెండు పార్టీలు కలిస్తే దేశానికి పట్టిన బీజేపీ గ్రహణం పోతుంది. ఇరు పార్టీలు కలిసి గత యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఉంటే అధికారంలో భాగస్వామ్యం అయ్యేవి. కానీ వేర్వేరుగా పోటీ చడం వల్ల ఫలితం కాస్తా రెండు పిల్లుల కొట్లాట కోతి తీర్చినట్లు అయ్యింది.
తమ పార్టీలో లేని నాయకులను, అంబేద్కరిస్టులను, కాన్షీరాం భావజాలాన్ని అనుసరించే వాళ్లను బహుజన్ సమాజ్వాదీ పార్టీ నాయకత్వం రాజకీయ శత్రువులుగా చూడడం సరైన పద్ధతి కాదు. నాడు దళిత, బహుజనుల నాయకులైన అంబేద్కర్, జగ్జీవన్రామ్ కలిసి సాగలేదు. తదుపరి కాన్షీరాం, రామ్విలాస్ పాశ్వాన్ కలిసి లేరు. ఓబీసీ నాయకులు ములాయం సింగ్ యాదవ్, లాలూ ప్రసాద్ యాదవ్, నితీశ్ కుమార్, శరద్ యాదవ్, కరుణానిధి ఒకే రాజకీయ వేదిక కింద పని చేయలేదు. అయినా వీరంతా తమ తమ పరిధుల్లో, రాజకీయ స్థానాల్లో బీసీలు, దళిత వర్గాల అభివృద్ధి, చైతన్యం కోసం పోరాటం చేశారు.
ప్రస్తుతం దేశంలో ఫాసిస్టు బీజేపీకి వ్యతిరేకంగా అఖిలేష్ యాదవ్, తేజస్వీ యాదవ్, ఉద్ధవ్ ఠాక్రే, కేసీఆర్, స్టాలిన్ మొదలైన అగ్ర నాయకులు గళమెత్తుతున్నారు. తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అప్పుడప్పుడూ బీజేపీపై నిప్పులు చెరిగి ఊరుకుంటున్నారు. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రైతు సమస్యలు, ఉచిత విద్యుత్తు, సమాఖ్య స్ఫూర్తి, బడుగుల సంక్షేమం తదితర సమస్యలకు పరిష్కారాలు సూచిస్తూ దక్షిణాది నుంచి బలమైన నేతగా ఎదుగుతున్నారు. జాతీయ పార్టీ స్థాపించి దేశ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించాలని ఆయన భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో బీఎస్పీ అధినాయకురాలు మాయావతి బీజేపీకి వ్యతిరేకంగా దేశవ్యాప్త ఉద్యమానికి నాయకత్వం వహిస్తే ఉత్తరాది నుంచి ఆమె ప్రధాని అభ్యర్థి రేసులో ఉంటారు.
తెలంగాణలో పరిస్థితిని పరిశీలిస్తే చైతన్యవంతమైన దళిత, బహుజన వర్గాలు రాజకీయంగా, సామాజికంగా ఒక్కటిగా లేవు. అయితే అవసరాన్ని బట్టి తెలంగాణలో బీఎస్పీ పార్టీ పొత్తులు పెట్టుకుని రాజకీయంగా బలపడాలి. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినా అందులో తాము భాగస్వామ్యం అయ్యేలా ప్రణాళికలు రూపొందించుకోవాలి. తమ అజెండా అమలయ్యేలా పట్టుబట్టాలి.
(వ్యాసకర్త : బీరయ్య యాదవ్, 91777 57440, జాతీయ ప్రధాన కార్యదర్శి, బీసీ సంక్షేమ సంఘం)