కొత్తగా ఏర్పాటైన తెలంగాణ ఏడాదిన్నరలోపే 2015లో దేశంలోనే అతిపెద్ద ఇంక్యుబేటర్ సెంటర్ టీ-హబ్ను నిర్మించినప్పుడు.. రతన్టాటా దానిని ప్రారంభిస్తూ ‘నవ భారతానికి నాంది’ అని ప్రకటించారు. నిజంగానే దేశంలో స్టార్టప్లకు ముఖచిత్రంగా టీ-హబ్ వెలుగొందింది. వేలాదిమంది ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు, యువతీ యువకులకు ఆలంబనగా నిలిచింది. ఒక వినూత్నమైన ఆలోచనతో వస్తే చాలు.. ప్రోత్సాహం, పెట్టుబడి, మార్కెట్.. అన్నీ అందించింది. నేడు తెలంగాణ వయస్సు 8 ఏండ్లు. తాను స్థాపించిన రికార్డును తానే అధిగమిస్తూ.. ప్రపంచంలోనే అతిపెద్ద ఇన్నోవేషన్ క్యాంపస్గా టీ-హబ్ 2ను ఆవిష్కరించింది. తొలిదశ టీ-హబ్కు ఇది ఐదింతలు పెద్దది.
తెలంగాణ ఆవిర్భవించే నాటికి దేశంలో ఐటీ పరిశ్రమకు కేంద్రాలుగా బెంగళూరు, చెన్నై, ఢిల్లీ తదితర నగరాలు ఉన్నాయి. వాటితో పోటీ పడటం, పెట్టుబడులను ఆకర్షించటం మామూలు విషయం కాదు. కానీ, ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలో తెలంగాణ ప్రభుత్వం సాహసోపేతమైన నిర్ణయాలను తీసుకుంది. వీటిలో అతి ముఖ్యమైనది పారిశ్రామిక విధానం. 15 రోజుల్లో అనుమతి, స్వీయ ధ్రువీకరణ వంటి వినూత్నమైన అంశాలతో ఉన్న టీఎస్-ఐపాస్ యావత్ దేశాన్ని తెలంగాణ వైపు తల తిప్పి చూసేలా చేసింది. టీఎస్-ఐపాస్ ఆవిష్కరణ సభలోనే ఐటీసీ గ్రూపు సంస్థల అప్పటి చైర్మన్ వై సీ దేవేశ్వర్ రూ.8,000 కోట్ల పెట్టుబడి పెడుతామని ప్రకటించారు. ఈ విధంగా తెలంగాణ పారిశ్రామిక ప్రగతి ప్రస్థానం గొప్ప ముందంజతో ప్రారంభమైంది. ఐటీ రంగానికి ఉన్న భవిష్యత్తు, దాని ద్వారా లభించనున్న ఉద్యోగావకాశాలు, ఆదాయం వంటి వాటిని దృష్టిలో పెట్టుకొని రాష్ట్రప్రభుత్వం ఐటీకి అగ్రతాంబూలం ఇచ్చింది. నిరంతర విద్యుత్తు, నైపుణ్యవంతమైన మానవ వనరులు, మౌలిక సదుపాయాలు, శాంతిభద్రతలు, ప్రభుత్వ ప్రోత్సాహం తోడయ్యాయి. ఐటీ మంత్రిగా కేటీఆర్ చూపే చొరవ, విదేశీ పర్యటనలు, పారిశ్రామికవేత్తలను సూదంటురాయిలా ఆకర్షించే ఆయన ప్రసంగాలు.. కొత్త రాష్ట్రం తెలంగాణను ఐటీ ప్రపంచంలో రైజింగ్స్టార్గా నిలబెట్టాయి. మైక్రోసాఫ్ట్, గూగుల్, యాపిల్ వంటి అనేక దిగ్గజ కంపెనీలు అమెరికా తర్వాత ప్రపంచంలోనే తమ అతిపెద్ద కార్యక్షేత్రంగా హైదరాబాద్ను ఎంచుకున్నాయి.
ఐటీని రాజధానికే పరిమితం చేయకుండా.. రాష్ట్రంలోని పలు పట్టణాలు, నగరాలకూ విస్తరింపజేసే వ్యూహాలను రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది. ఐటీ టవర్లను నిర్మించింది. ప్రస్తుతం ప్రారంభమైన టీహబ్-2 కార్యకలాపాలనూ రాష్ట్రమంతటా తీసుకువెళ్లటానికి వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, మహబూబ్నగర్, ఖమ్మంలలో ఐదు ప్రాంతీయ కేంద్రాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఎనిమిదేండ్ల తెలంగాణ సాధించిన అద్భుతమైన విజయాల్లో ఐటీ ప్రగతి ఒకటి. సీఎం కేసీఆర్ ఆలోచనలు ఎంత లోతుగా, ఎంత విస్తారంగా ఉంటాయో, అమలవుతున్న కొద్దీ అవి ఎటువంటి బ్రహ్మాండమైన ఫలితాలనిస్తా యో తెలుసుకోవటానికి ఈ సక్సెస్స్టోరీ ఒక కేస్ స్టడీ వంటిది.