‘యువశక్తిని నిర్లక్ష ్యం చేసిన సమాజమేదైనా అంధకారంలోకి దిగజారిపోక తప్పదు’ అని స్వామి వివేకానందుడు హెచ్చరించారు. ఆయన హెచ్చరికలను ఏ మాత్రం పట్టించుకోకుండా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అర్థం లేని ప్రచార పటాటోపంలో మునిగితేలుతున్నది. తనలోని ‘గురివింద గింజ’ నైజాన్ని దాచిపెట్టుకోగలనని భ్రమ పడుతున్నది.
ఉద్రేకాల ఊబిలోకి యువతరాన్ని నెట్టేసి, మాటల గారడితో గద్దెనెక్కిన మోదీ ఈ ఎనిమిదేండ్లలో యువశక్తిని నిర్వీర్యం చేసే పాలనా విధానాలను ఆచరణలో పెట్టడం అత్యంత ఖండనీయం. ఆధిపత్యం, ఆక్రమణ వాదం అనే మానసిక రుగ్మతలకు చిక్కిన మోదీకి దేశానికి అవుతున్న గాయాలను కూడా గమనించే తీరిక లేకుండాపోయింది.
సృజనాత్మకత, ఉత్సాహం, శక్తి కలిగి ఉండి దేశానికి అద్భుత ఫలితాలు ఇవ్వగలిగిన యువజనం ఉత్తగా కాలం వెళ్లదీస్తున్నది. ఇది నూటికి నూరు శాతం మోదీ పాలనా వైఫల్యంతోనే. సంపద సృష్టిం చి జాతి బరువు, బాధ్యతలను మోయాల్సిన భుజా లే నేడు నిరుద్యోగ భారతాన్ని ఎత్తుకుంటున్నాయి. 2011 జనాభా లెక్కల ప్రకారం పనిచేసే వయస్సులో (15 నుంచి 59 ఏండ్ల వరకు) ఉన్నవారి జనాభా, దేశ జనాభాలో సగం కంటే ఎక్కువ. అభివృద్ధి చెందిన ఆర్థికవ్యవస్థల కంటే, పొరుగు దేశమైన చైనా కన్నా భారత్లో యువత ఎక్కువ. ఈ పనిచేసే చేతులకు ఉపాధి కల్పించి ఉంటే జాతి ప్రగతికి సృష్టికర్తలుగా యువత మారేది. కానీ కేంద్ర ప్రభుత్వ చర్యల వల్ల దేశంలో నిరుద్యోగిత రేటు 8 శాతానికి పెరిగింది. ఈ నిరుద్యోగిత రేటు భారతదేశంలో గడిచిన నాలుగు దశాబ్దాల్లో నమోదైన దానికంటే చాలా ఎక్కువ. ‘1991 నాటి ఆర్థిక సంక్షోభ సమయంలో కూడా ఇంత నిరుద్యోగిత నమోదు కాలేదని’ ప్రపంచ బ్యాంకు మాజీ ముఖ్య ఆర్థికవేత్త కౌశిక్ బసు అనడం గమనార్హం.
మోదీ సర్కార్ కొలువుదీరిన తొలినాళ్లలో రూపొందించి, ప్రకటించిన ‘2014 జాతీయ యువజన విధానం’లో యువశక్తి సామర్థ్యాల గుర్తింపు, సమగ్రాభివృద్ధి, ఉపాధి, సామాజిక న్యాయం లక్ష్యాలుగా కేంద్రం కార్యాచరణను వివరించింది. స్టార్టప్ ఇండియా, స్టాండప్ ఇండియా, స్కిల్ ఇండియా, మేకిన్ ఇండియా అంటూ ప్రచార ఆర్భాటాలతో పథకాలను ఊరూరా ఊదరగొట్టిన తర్వాత కూడా ఇటీవల కేంద్రప్రభుత్వం రూపొందించిన ‘2021 నూతన జాతీయ యువజన విధానం’ ముసాయిదా ప్రతిలో తిరిగి అవే లక్ష్యాలను ప్రకటించారు. నిజానికి భారతదేశంలో ఏటా దాదాపు కోటి ఉద్యోగాల అవసరమున్నదని మార్కెట్ అంచనాల నిపుణుల అధ్యయనంలో వెల్లడైంది. ఏ దేశంలోనైనా కొత్త ఉద్యోగాల కల్పన అంకుర సంస్థలతోనే ఎక్కువగా అందుబాటులోకి వస్తుంది. దురదృష్టవశాత్తు ఉపాధి కల్పన పట్ల పట్టింపులేని రాజకీయ నాయకత్వం చేతిలో దేశ పాలనా పగ్గాలుండటం అంకుర సంస్థలకు అనుమతులు, నిధులు, పేటెంట్, ప్రోత్సాహాలు ఎండమావి కలగానే మిగిలాయి. దేశంలో సుమారు 2 లక్షల 46 వేలకు పైగా దరఖాస్తులు పేటెంట్ కోసం కేంద్రం వద్ద పెండింగ్లో ఉన్నాయి. అలాగే ట్రేడ్ మార్క్ కోసం వచ్చిన మరో 5 లక్షల 32 వేలకు పైగా దరఖాస్తులను పెండింగ్లో పడేశారు. దీనివల్లనే అనేక మంది ఉత్సాహవంతులు అంకుర సంస్థలను విదేశాల్లో ప్రారంభించడానికి ఇష్టపడుతున్నారు.
‘నిండిన కుండలోనే, నీళ్లన్నీ గుమ్మరిస్తున్న’ బుద్ధిమంతుల చేతుల్లో దేశ యువత భవితవ్యం చిక్కుకున్నది. పకోడీలు అమ్ముకోవడం, టీ దుకాణాలు నిర్వహించడం కూడా ఉపాధిలో భాగమేన ని నమ్మిస్తున్న ఈ పాలకులు భారత్లో ఏటా వివిధ కళాశాలల నుంచి ఉత్పత్తి అవుతున్న ‘15 లక్షల ఇంజినీర్లు’, 3 లక్షల 20 వేలకు పైగా ఎంబీఏ తదితర, ఇతర నైపుణ్య పట్టభద్రులకు భద్రమైన భవిష్యత్ను సమకూర్చగలరంటే నమ్మేదెవరు?
కేంద్ర ప్రభుత్వం విభాగాల్లో దాదాపు 16 లక్షల ఖాళీల భర్తీకి కార్యాచరణే లేదు. దానికి తోడు ఏటా పదవీ విరమణ ద్వారా ఏర్పడుతున్న ఉద్యోగ ఖాళీల భర్తీని పట్టించుకునే నాథుడే లేడు. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఇటీవల ప్రధాని మోదీ 10 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని ప్రకటించడాన్ని దేశంలోని నిరుద్యోగులు నమ్మగలరా..? పైగా కీలకమైన రక్షణరంగంలో ‘అగ్నిపథ్’ వంటి అశాస్త్రీయ భర్తీ విధానాన్ని కేంద్రం తెరమీదకు తీసుకురావడం యువతను ఆగ్రహానికి గురిచేసింది.
తెలంగాణ మాత్రం భిన్నంగా
కొలువులకు కొత్త తొవ్వను వెతుకున్నది. లోతైన పాలనా చూపు, భవిత పట్ల బాధ్యత తీసుకునే చొరవ,
సమగ్రాభివృద్ధి పట్ల నిబద్ధత కలిగిన ముఖ్యమంత్రి కేసీఆర్ మార్గదర్శకత్వంలో ఉద్యోగాల భర్తీకి ఎదురైన అడ్డంకులను ఓపికగా అధిగమించడంలో తెలంగాణ ప్రభుత్వం
విజయవంతమైంది.
ప్రభుత్వరంగ సంస్థల విభజన, జోన్ల పునర్విభజన, ఉద్యోగుల బదిలీలు తదితర అనేక పాలనాపర సమస్యలను దాటి ఇప్పటికే దాదాపు లక్షా 32 వేలకు పైగా ఉద్యోగాలను భర్తీ చేసింది. మరో 80 వేలకు పైగా ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి పాలన, ఆర్థికపరమైన అనుమతులు మంజూరు చేసి, నోటిఫికేషన్లను విడతలుగా వెలువరిస్తున్నది. కానీ ఖాళీ చేతులు, వెక్కిరింతలు, బెదిరింపులు, దండయాత్ర లు తప్ప కేంద్ర పాలకులకు యువత భవిష్యత్తుపై పట్టింపే లేదు. ఇప్పుడు దేశ యువజనమే కాషాయ పార్టీ కుట్రలను పసిగట్టింది. పదునెక్కిన తెలంగాణ యువతరం బీజేపీ వికృత వ్యూహాలను విసిరేయలేదా? ఆ దిశగా కేటీఆర్ నిలదీసినట్లే, బీజేపీ కేంద్ర పాలకులు ఉపాధి కల్పనలో వెలగబెట్టిన వైఫల్యాన్ని యువత నిగ్గదీయడం ఖాయం.
(వ్యాసకర్త: రాష్ట్ర బీసీ కమిషన్ మాజీ సభ్యులు)
డాక్టర్ ఆంజనేయగౌడ్
98853 52242