న్యూఢిల్లీ, ఆగస్టు 14: టోకు ధరల సూచీ కూడా రివ్వున ఎగిసింది. చమురు, ఆహార పదార్థాల ధరలు స్వల్పంగా తగ్గినప్పటికీ జూలై నెలకుగాను టోకు ధరల సూచీ ఆధారిత ద్రవ్యోల్బణం 9.78 శాతంగా నమోదైంది. జూన్ నెలలో నమోదైన 9.87 శాతం కంటే స్వల్పంగా తగ్గినప్పటికీ కిందటేడాదితో పోలిస్తే మాత్రం భారీగా పెరిగింది. గత తొమ్మిది నెలలుగా పెరుగుతూ వచ్చిన టోకు ధరల సూచీ మాత్రం తొలిసారిగా స్వల్పంగా తగ్గడం విశేషం. అయినప్పటికీ గరిష్ఠ స్థాయిలోనే కదలాడుతుండటం సామాన్యుడిని కలవరానికి గురి చేస్తున్నది. చమురు, విద్యుత్, ప్రాథమిక వస్తువులు, తయారీ ప్రొడక్ట్ల ధరల సూచీ తగ్గుముఖం పట్టడం వల్లనే టోకు ధరల సూచీ తగ్గిందని కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ తాజాగా వెల్లడించింది. మినరల్స్, ఆహార పదార్థాలు, తయారీ, ఆహారేతర ఉత్పత్తులు, కెమికల్స్ ధరలు తగ్గడం కూడా మరో కారణమని పేర్కొంది.
హోల్సేల్ చమురు, పవర్ ధరల సూచీ 27.41 శాతం నుంచి 20 శాతానికి తగ్గగా.. ఆహార పదార్థాలు స్వల్పంగా తగ్గి 5.44 శాతానికి పరిమితమైంది. కానీ తయారీ ఉత్పత్తుల ధరల సూచీ మాత్రం 7.48 శాతం నుంచి 8.29 శాతానికి ఎగబాకినట్లు తన నెల సమీక్షలో వాణిజ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది.ఈ వారం మొదట్లో రిటైల్ ధరల సూచీ గణాంకాలు విడుదలయ్యాయి. జూలై నెలకుగాను 4.45 శాతంగా నమోదైంది. ఆహార పదార్థాల గరిష్ఠ ధరల కారణంగా జూన్లో 4.38 శాతంగా ఉన్న రిటైల్ ధరల సూచీ ఆ మరుసటి నెలలో భారీగా పెరిగింది. ధరల సూచీ గరిష్ఠ స్థాయికి చేరుకుంటున్నదన్న ముందస్తు అంచనాతో రిజర్వు బ్యాంక్ తన పరపతి సమీక్షలో కీలక వడ్డీరేట్లను యథాతథంగా ఉంచింది. అలాగే ద్రవ్యోల్బణాన్ని 5 శాతంగా అంచనావేసింది. ప్రపంచవ్యాప్తంగా ధరలు పెరిగినప్పటికీ, దేశీయంగా ధరల సూచీ మాత్రం తగ్గుముఖం పట్టిందని బార్క్లేస్ తన రీసర్చ్ నోట్లో వెల్లడించింది.
చమురు ధరలు గరిష్ఠస్థాయిలోనే కదలాడుతున్నాయి. పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు ప్రారంభమైన ఫిబ్రవరి నుంచి ఇప్పటి వరకు క్రూడాయిల్ ధరలు 100 డాలర్ల స్థాయిలోనే కదలాడాయి. ప్రస్తుతం 70-80 డాలర్ల స్థాయిలో ఉన్నప్పటికీ ఇది కూడా గరిష్ఠ స్థాయేనని విశ్లేషకులు వెల్లడించారు.
జూలైలో టోకుధరల సూచీ ఆధారిత ద్రవ్యోల్బణం స్వల్పంగా మాత్రమే తగ్గింది. ఇది పూర్తిగా ఇంధనం, విద్యుత్ విభాగం కారణంగానే జరిగింది. అదే సమయంలో జూన్తో పోలిస్తే మిగిలిన అన్ని విభాగాల ధరల సూచీ మరింత పెరిగింది. ఇది ఆందోళన కలిగిస్తున్నది. ప్రస్తుత నెలలో ధరల సూచీ 9.5 శాతం కంటే తక్కువగా నమోదు అయ్యే అవకాశం ఉన్నది. అయినప్పటికీ, ఈ ఏడాది చివరినాటికి ద్రవ్యోల్బణం అధికంగా ఉండే అవకాశాలు మెండుగావున్నాయి. 2026-27 ఆర్థిక సంవత్సరంలో సగటున 8.5 శాతంగా ఉంటుందని అంచనా.
– రాహుల్ అగర్వాల్, ఇక్రా ప్రధాన ఆర్థికవేత్త