హైదరాబాద్, ఆగస్టు 14: ప్రభుత్వరంగ సంస్థ ఎన్ఎండీసీ ప్రోత్సాహకర ఆర్థిక ఫలితాలను ప్రకటించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికానికిగాను రూ.2,005.71 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని గడించింది. కిందటేడాది ఇదే త్రైమాసికంలో నమోదైన రూ.1,967.46 కోట్ల లాభంతో పోలిస్తే రెండు శాతం వృద్ధిని నమోదు చేసుకున్నది.
ఖనిజ అమ్మకాలు భారీగా పెరుగడం వల్లనే లాభాల్లో వృద్ధి నమోదైందని కంపెనీ వర్గాలు వెల్లడించాయి. ఏప్రిల్-జూన్ మధ్యకాలానికిగాను కంపెనీ ఆదాయం కూడా రూ.7,038.97 కోట్ల నుంచి 1.5 శాతం వృద్ధితో రూ.7,142.54 కోట్లకు చేరుకున్నట్టు బీఎస్ఈకి సమాచారం అందించింది.
దీంట్లో ఇనుప ఖనిజ విక్రయాలతో రూ.6,802 కోట్ల ఆదాయం సమకూరగా, మిగతా ఆదాయం ఇతర మార్గాల ద్వారా లభించినట్టు కంపెనీ సీఎండీ అమితవ ముఖర్జీ తెలిపారు. 2030 నాటికి 100 మిలియన్ టన్నుల ఖనిజ ఉత్పత్తి లక్ష్యంగా పెట్టుకున్నట్టు చెప్పారు. మరోవైపు, కర్ణాటకలో సంస్థ ఏర్పాటు చేయతలపెట్టిన 3 మిలియన్ టన్నుల స్టీల్ ప్లాంట్ కోసం రూ.639.61 కోట్ల నిధులను కర్ణాటక ఇండస్ట్రియల్ ఏరియా డెవలప్మెంట్ బోర్డుకు చెల్లించింది.