పొరుగు దేశం శ్రీలంక పరిణామాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ప్రభుత్వ వ్యతిరేక నిరసనోద్యమం హింసాత్మకంగా మారి దేశవ్యాప్తంగా విస్తరించింది.పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలు, నింగినంటిన పెట్రోల్, డీజిల్ ధరలు, ఆహార పదార్థాల కొరత తదితరాలు దీనికంతటికీ కారణంగా కనిపిస్తున్నది. సరిగ్గా మన దేశంలో మోదీ పాలనలోనూ ఇవే సమస్యలతో భారతీయులు సతమతమవుతున్నారు. నానాటికీ దేశాన్ని అప్పుల కుప్పగా మారుస్తున్న మోదీ హయాంలో మన దేశం కూడా శ్రీలంక తరహా దుస్థితికి చేరుకోబోతున్నదా అనే భయాందోళనలు అలుముకోవటం సహజమే.
దేశాన్ని అప్పుల ఊబిలో దించి దివాళా దిశగా తీసుకుపోతున్న నరేంద్ర మోదీ, ఈ వేల కోట్ల అప్పులతో ఉత్పాదక ప్రాజెక్టులు, దీర్ఘకాలిక ప్రయోజనాలను నెరవేర్చే ప్రాజెక్టులేవీ నిర్మించలేదు. ఐదు లక్షల కోట్లతో 18 మెగా ప్రాజెక్టులు చేపడతామన్నారు. బుల్లెట్ రైళ్లు, నదుల అనుసంధానం లాంటి వాటిని ఘనంగా చెప్పుకొన్నా అవేవీ వాస్తవ రూపం దాల్చలేదు. ప్రభుత్వ రోజూవారీ ఖర్చుల కోసమే లక్షల కోట్ల అప్పులు తేవాల్సి రావటం దేశ ఆర్థిక దుస్థితికి, మోదీ పాలనా వైఫల్యానికి నిదర్శనం.
గత నెల 3న శ్రీలంకలో అధిక ధరలు, నిత్యావసర సరకుల కొరతతో ప్రారంభమైన ప్రజాందోళనలు.. రాజకీయ సంక్షోభంగా రూపుదాల్చాయి. నెలరోజులుగా శ్రీలంక పాలకుల వైఫల్యానికి నిరసనగా సాగుతున్న ఈ ఆందోళనలు హింసాత్మకంగా మారటంతోపాటు దేశవ్యాప్తంగా విస్తరించాయి. అధ్యక్షుడు రాజపక్స గద్దెదిగినా, ప్రధాని గోటబయ కూడా దిగిపోవాల్సిందేనని నిరసనకారులు ఉద్యమిస్తున్నారు. అధ్యక్షుడు రాజపక్స ఇంటిముందు ఆందోళనకారులపై ప్రభుత్వ మద్దతుదారులు దాడి చేయటంతో దేశవ్యాప్తంగా హింస చెలరేగింది. హిం సాకాండలో ఒక అధికార పార్టీ ఎంపీతో పాటు 8 మంది చనిపోయారు. వందలాదిగా గాయపడ్డారు. నిరసనకారులు 31 మంది రాజకీయ నేతల ఇండ్లను అగ్నికి ఆహుతి చేయటం అక్కడి సంక్షోభ పరిస్థితికి అద్దం పడుతున్నది.
శ్రీలంక రాజకీయ, ఆర్థిక సంక్షోభం ఉన్న పళంగా రాత్రి కి రాత్రి వచ్చిపడింది కాదు. గత కొన్నేండ్లుగా అధికార ఎస్ఎల్పీపీ పార్టీ, అధ్యక్షుడు రాజపక్స అనుసరించిన ఆర్థిక, రాజకీయ విధానాలు శ్రీలంకను చిన్నాభిన్నం చేశా యి. దేశ ఆర్థిక, ఆహారభద్రత పట్ల కనీస స్పృహలేకుండా వ్యవహరించిన విధానాల కారణంగా శ్రీలంక పీకల్లోతు ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది. మున్నెన్నడూ లేని స్థాయిలో ద్రవ్యోల్బణం 21.5 శాతానికి చేరింది. అధికా రం నిలుపుకోవటం కోసం అనుసరించిన ఆర్థిక విధానాలు దేశాన్ని అప్పుల్లో ముంచాయి. 2009లో ప్రపంచబ్యాంకు నుంచి 260 కోట్ల డాలర్ల రుణం తీసుకొని మటాలా రాజపక్స అంతర్జాతీయ విమానాశ్రయం, హంబంటోటా పోర్టు, కొలంబో పోర్టుసిటీ లాంటి అనుత్పాదక భారీ ప్రాజెక్టులపై ప్రభుత్వం ఖర్చు చేసింది. ఈ అప్పు అలా ఉండగానే తిరిగి 2016లో మరో 150 కోట్ల డాలర్ల అప్పు చేసింది. దీనికి తోడు కరోనా కారణంగా టూరిజం దారుణంగా దెబ్బతిని శ్రీలంక ఆర్థిక వ్యవస్థను కుప్పకూల్చింది.
ఒక వైపు కరోనా పరిస్థితులు, ఆర్థిక ఇక్కట్లు ఇలా ఉం టే, ఇదే సమయంలో దేశంలో సంపూర్ణ సేంద్రియ వ్యవసాయం అమలు చేయటానికి పూనుకోవటం ఆహారోత్పత్తిని దారుణంగా దెబ్బతీసింది. పండ్లు, కూరగాయలు, ఆహారధాన్యాల ఉత్పత్తి ఏకంగా 30 శాతం పడిపోయింది. దీంతో దేశంలో ఆహార పదార్థాల కొరత తీవ్రస్థాయికి చేరింది. నిత్యావసర సరకులైన పప్పు, ఉప్పు, బియ్యం కోసం, పెట్రోలు, డీజిల్ కోసం కిలోమీటర్ల మేర లైన్లు కట్టాల్సిన దుస్థితి ఏర్పడింది. శ్రీలంక ప్రస్తుత సంక్షోభానికి రాజపక్స కుటుంబ పరివార బంధుప్రీతి రాజకీయాలే కారణం. ఏకంగా అధ్యక్షుడు రాజపక్స సోదరుడు గోటబయా దేశ ప్రధాని కాగా, వీరి కుటుంబం నుంచే మరో ముగ్గురు ప్రభుత్వంలో కీలక పదవులు చేపట్టారు. ఈ విధంగా రాజపక్స కుటుంబం దేశాన్ని గుప్పిటపెట్టుకొని రాజకీయ సంక్షోభానికి కారణం కావటమే గాక, దేశాన్ని ఆర్థికంగా దివాలా తీయించింది. వీరి బాధ్యతారహిత పాలనా విధానాల ఫలితమే నేటి శ్రీలంక దుస్థితి.
మన దేశంలో ఉన్న పరిస్థితిని ఒకసారి గమనిస్తే.. వారసత్వ (కాంగ్రెస్) కుటుంబ పాలన అంతం చేసి, అవినీతిరహిత భారతాన్ని నిర్మిస్తామని చెప్పి అధికారం చేపట్టిన నరేంద్రమోదీ చెప్పిందేదీ చేయలేకపోయారు. అవినీతి ఆవగింజంత కూడా తగ్గలేదు. నిరుద్యోగం రూపుమాపుతామని, అచ్చేదిన్ ఆయేగీ అనీ, కనిష్ఠ ప్రభుత్వం-గరిష్ఠ పాలన అనే అందమైన నినాదాలతో రెండోసారి అధికారం చేపట్టారు. ఈ ఎనిమిదేండ్లలో మోదీ ప్రజలకు ఇచ్చిన వాగ్దానమేదీ నెరవేర్చలేదు. దేశ సంపదకు, సౌభాగ్యానికీ మూలమైన ప్రభుత్వరంగ సంస్థలను అన్నింటినీ కారుచవకగా అమ్మేస్తున్నారు.
ప్రైవేటు బ్యాంకులను జాతీయం చేయటం ఒక విప్లవాత్మక చర్యగా చెప్పుకొన్న చోటనే, ఆ బ్యాంకులను ప్రైవేటుపరం చేస్తున్నారు. మోదీ అమ్మకానికి పెట్టిన వాటిలో పోర్టులు, ఓడరేవులు, విమానాశ్రయాలు, రైల్వేలు, చివరికి వ్యూహాత్మక ప్రాధాన్యం గల రక్షణరంగ ఉత్పత్తులు కూడా ఉన్నాయి. రైతులు, కార్మికులు ఒకరేమిటి సకల వర్గాల ప్రయోజనాలకు భంగకరంగా చట్ట సవరణలు చేసి ఆయా వర్గాల ప్రజలను కార్పొరేటు శక్తులకు బలిచేస్తున్నారు.
చేసిన వాగ్దానాలు నెరవేర్చకపోవటం వరకే పరిమితమైతే, మోదీ పాలనా వైఫల్యంగా సరిపెట్టవచ్చు. కానీ దేశ సార్వభౌమాధికారానికి భంగకరంగా పరిణమించే విధం గా దేశాన్ని అప్పుల ఊబిలోకి నెడుతున్నారు. దేశ స్వాతంత్య్రానంతరం.. మోదీ అధికారం చేపట్టిన 2014 దాకా భారతదేశం చేసిన అప్పు రూ.55,87,149 కోట్లు అయి తే, మోదీ అధికారం చేపట్టిన తర్వాత ఈ ఎనిమిదేండ్లలో చేసిన అప్పు రూ.80,00,744 కోట్లు. మోదీకి ముందు 67 ఏండ్లలో సగటున ఏడాదికి చేసిన అప్పు రూ.83వేల కోట్లు అయితే, ఈ ఎనిమిదేండ్లలో మోదీ ప్రభుత్వం ప్రతి నెలా చేసిన అప్పు రూ.83వేల కోట్లు కావటం గమనార్హం.
ఈ నేపథ్యంలోంచే.. గతంలో ఎన్నడూ లేని స్థాయిలో ద్రవ్యోల్బణం 7.5 శాతానికి చేరుకున్నది. ఫలితంగా నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిపోయి సామాన్యుడు చితికిపోతున్నా పట్టింపు లేకుండా నీరో చక్రవర్తిలా మోదీ వ్యవహరిస్తున్నారు. ఇంధన ధరలపై సుంకాలు పెంచి ప్రజలపై భారం మోపుతున్నారు. ఈ పరిస్థితుల్లోంచి ప్రజలు ఆందోళనబాటన నడువక తప్పని పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఈ నిత్య సంకట, సంఘర్షణ స్థితులు దేశాన్ని ఎటువైపు తీసుకెళ్తాయి? భారత్ కూడా శ్రీలంకలా తయారవుతుం దా? అనే ఆందోళనలు నెలకొని ఉన్నాయి.
– ఎడిటోరియల్ డెస్క్