సార్వత్రిక ఎన్నికలకు దాదాపు రెండేండ్ల సమయం ఉన్నది. తెలంగాణ నుంచి కేసీఆర్, ఆంధ్రప్రదేశ్ నుంచి జగన్, తమిళనాడు నుంచి స్టాలిన్, కేరళ నుంచి పినరయి విజయన్, కర్ణాటకలో బసవరాజ్ బొమ్మై ఉత్తరాది రాష్ర్టాల కంటే మెరుగైన పాలన అందిస్తున్నారన్నది వాస్తవం. అయితే ఈసారి జరుగుతున్న చర్చలు కొంత భిన్నంగా సాగుతున్నాయి. దేశంలో ప్రధానిని మార్చాల్సిన అవసరాన్ని గురించి రకరకాల అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
గత ఎనిమిదేండ్లుగా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పాలనలో ప్రజల బతుకు దినదిన గండంగా మారింది. కాబట్టే బీజేపీ పాలన నుంచి ప్రజలు విముక్తి కోరుకుంటున్నారు. మరెవరు ప్రధాని కావాలని ప్రజల్ని అడిగితే మాత్రం.. మూడుసార్లు ఒంటిచేత్తో ముఖ్యమంత్రి అయిన ఉక్కు మహిళ మమతా బెనర్జీ, మరాఠా యోధుడు శరద్పవార్తో పాటు ఉద్యమ నాయకుడు, రాజనీతిజ్ఞుడు, కేసీఆర్ పేరు చెప్తున్నారు.
ప్రధాని మోదీ తన ఎనిమిదేండ్లలో కోట్ల మంది ప్రజలకు ఉపయోగపడే పనులు ఒక్కటైనా చేయలేదు. కాగా ధనవంతులు ఇంకా ధనవంతులుగా, పేదలు నిరుపేదలుగా మారిన చర్యల వల్ల సామాజిక, ఆర్థిక అంతరాలు మరింత పెరిగాయి. కొత్తగా ఉపాధి అవకాశాలు కల్పించకపోగా ప్రభుత్వరంగ సంస్థలను ఒక్కొక్కటిగా ప్రైవేటీకరించి కోట్ల మందిని రోడ్డుకీడుస్తున్నారు. ఫెడరలిజానికి తూట్లు పొడిచి, కేంద్ర, రాష్ట్ర సంబంధాలను సవతి పోరులుగా మార్చుతున్నారు. బీజేపీయేతర రాష్ట్రాలపై చూపుతున్న వివక్ష పరాకాష్ఠకు చేరుకున్నది. బీజేపీయేతర ప్రభుత్వాలు డబ్భు ఏండ్ల పాలనలో 55 లక్షల కోట్ల అప్పులు చేస్తే, బీజేపీ గత ఎనిమిదేండ్లలో ఎనభై లక్షల కోట్ల అప్పుజేసి దేశ అప్పును 135 లక్షల కోట్లకు చేర్చింది. ఈ 135 లక్షల కోట్ల అప్పుతో ఈ ప్రభుత్వాలు దేశానికి ఏం చేసినట్లు? 20 మంది పారిశ్రామికవేత్తలు లక్షల కోట్లకు అధిపతులైతే, కోట్ల మంది జనం అన్నమో రామచంద్ర అని అంగలార్చే పరిస్థితులున్నాయి.
దేశానికి అన్నం పెట్టే రైతన్నల ఆగ్రహాన్ని చవిచూడటమే కాకుండా, వారిని బీజేపీ సర్కార్ అధఃపాతాళానికి తొక్కడం వాస్తవం.ఇంతకీ ప్రధాని పదవికి కావాల్సిన అర్హతలేమిటి? ప్రజల సెంటిమెంట్ను రెచ్చగొట్టి, మతాలు, దేవుడు, దేశభక్తి పేరు మీద మనిషితనాన్ని మాయం చేసైనా సరే ఓట్లు పొంది ప్రధాని కావడమే అర్హతనా.. రాజనీతిశాస్త్రం నుంచి నీతిని, శాస్త్రీయతను దూరం చేసి పచ్చి రాజకీయాలుగా మార్చడమే నాయకుడికి అర్హతనా? గుజరాత్ మోడల్ పేరుతో నడిపిన రాజకీయాల్లో ఉన్న మానవీయ మోడలేమిటి? ఇందులో ఎవరేవిధంగా లాభపడ్డారు? ఇంతకీ ఈ మోడల్ అంటే ఏమిటి? దేశాన్నంతా దోచి కొద్దిమంది చేతుల్లో సంపదంతా కేంద్రీకృతమయ్యేట్లు చేయడమా? ఈ ఎనిమిదేండ్లలో సామాన్య మానవుడికి ఉపయోగపడే ఏ ఒక్క పథక రచనైనా జరిగిందా? కులాలు, మతాలు, సెటిల్మెంట్లు, సరిహద్దు తగాదాలు, కేంద్ర, రాష్ట్ర సంబంధాలను విచ్ఛిన్నం చేస్తూ కాలం గడపడమేనా? ఇదేనా గుజరాత్ మోడల్!
ఈ ఎనిమిదేండ్లలో కేసీఆర్ తెలంగాణను దేశంలో అగ్రగామిగా నిలిపారు. ప్రపంచం దృష్టిని ఆకర్షించే రాష్ట్రంగా తీర్చిదిద్దడంలో నూటికి నూరుపాళ్ళు విజయం సాధించారు. కాళేశ్వరం ప్రాజెక్టును అనతికాలంలోనే పూర్తిచేసి తెలంగాణను ‘జలనిధి’ రాష్ట్రంగా తీర్చిదిద్దారు. దండుగన్న వ్యవసాయాన్ని పండుగగా మార్చారు. నెర్రెలు వారిన తెలంగాణ నేలలను కాళేశ్వరం జలాలతో తడిపి రైతన్నల కంటి తడిని తుడిచారు. కరెంటు కోసం రాత్రింబవళ్లు మోటార్ల దగ్గర వేచిచూసే స్థితి నుంచి ఒక్క నిమిషం కూడా కరెంటుకోతలేని స్థితిని తీసుకువచ్చారు. మనిషి జీవించడానికి కనీస అవసరాలైన మంచి గాలి, నీరు, ఆహారం, ఇల్లు, చదువు, వైద్యం అందించడంలో దేశానికే ఉదాహరణగా నిలిచారు. హరితహారంతో తెలంగాణను ప్రాణవాయువు నిధిగా మార్చారు.
కాళేశ్వరం అనుబంధ ప్రాజెక్టులతో మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ పథకాలతో తాగునీటి, సాగునీటికి కొరత లేకుండా చేశారు. కోట్ల మందికి ఆదెరువయ్యారు. రైతుబంధు, కల్యాణలక్ష్మి, షాదీముబారక్, వివిధ కులవృత్తుల వారికి సంబంధిత ఆదాయమార్గాలు పెంచి తెలంగాణను ‘ధనికరాష్ట్రం’గా మార్చారు. వరి పండించడంలో దేశంలో ప్రథమ రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దారు. ప్రపంచ దేశాలు తెలంగాణలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకొస్తున్నాయంటే దానికి ముఖ్య కారణం కేసీఆర్. సాంఘిక సంక్షేమ ఇంగ్లిషు మాధ్యమ విద్యాలయాలతో పాటు ప్రభుత్వ బడుల్లో ఇంగ్లిషు మాధ్యమాన్ని ప్రవేశపెట్టి బహుజనుల విద్యా దాహాన్ని తీర్చుతున్నారు. ప్రభుత్వ వైద్య దవాఖానలను అన్ని వసతులతో తీర్చిదిద్దడమే కాకుండా, ఎయిమ్స్ తరహాలో నాలుగు అంతర్జాతీయ స్థాయి దవాఖానలను తెలంగాణలో నిర్మిస్తున్నారు.
దేశానికి ప్రధాని కావడానికి ఇంతకన్నా గొప్ప అర్హతలేముంటాయి? దేశమంతా తెలంగాణ దిక్కు చూస్తున్నది. తెలంగాణ మోడల్ను దేశమంతటికీ విస్తరించాలనే డిమాండ్ వ్యక్తమవుతున్నది. కేసీఆర్ ప్రభుత్వ పాలనలో తెలంగాణ ప్రజల వలె దేశ ప్రజలు సంతోషంగా ఉంటే దేశానికి ఇంకేం కావాలి? పలు సంక్షేమ పథకాల విష యంలో దేశానికి ఆదర్శంగా నిలిచిన కేసీఆర్ ప్రధాని పదవికి అర్హుడు కాక మరేమవుతారు? ప్రజల ఆకలి దప్పులు, అవసరాలు తీర్చే నాయకత్వం కంటే ప్రధాని పదవికి వేరే అర్హతలేముంటాయి? సాంకేతిక కారణాలు, మెజారిటీ, జాతీయపార్టీల తాత్వికతల రీత్యా ఏమైనా ఇబ్బందులుంటాయేమో కానీ కేసీఆర్ ప్రధాని పదవికి అన్నివిధాలా అర్హులే. ఏదేమైనా వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో కేసీఆర్ నాయకత్వం, దక్షిణాది నాయకత్వ పాత్ర, ప్రాంతీయ పార్టీల పాత్ర గణనీయంగా ఉంటుందనడంలో సందేహం లేదు.
-డాక్టర్ కాలువ మల్లయ్య