తోర్నాల.. సిద్దిపేట జిల్లా ధూళిమిట్ట మండలంలో ఉన్న ఓ చిన్న పల్లె. సుమారు 2,500 జనాభా. దాని పక్కనే అనేక తండాలు. బంగారం వంటి సాగు భూములు.
తోర్నాల, దాని చుట్టు ప్రాంతమంతా ఒకప్పుడు నక్సలైట్ల స్థావరం. దశాబ్దాల పాటు సాయుధ పద ఘట్టనలతో ఆ ఊర్లన్నీ అట్టుడికిపోయాయి. కొందరు చనిపోయారు కూడా. ఆ పల్లెలన్నీ ఇప్పుడిప్పుడే వ్యవసాయానికి మళ్లినయి. మిర్చి, పత్తి, మక్కజొన్న వంటి పంటలు పండించడంలో వాళ్లు సిద్ధహస్తులు. తూర్పున గుడాటిపల్లె రిజర్వాయర్, పశ్చిమాన పెద్ద (మోయతుమ్మెద) వాగు, ఉత్తరాన గుట్టలు, దక్షిణాన జనిగలవాగు ఉన్న తోర్నాల ప్రాంతం భౌగోళిక స్థితి తెలంగాణ వంటిదే. గుట్టమీద ఉన్నట్టుంటుంది. నీళ్లు ఎత్తిపోయడం తప్ప మార్గం లేదు.
మొన్న శ్రీరామనవమికి మా ఊరికి పోయినప్పుడు, తోర్నాలకు చెందిన మిత్రులు కనబడి, పార్టీలకు, కులాలకతీతంగా ఒకే ఒక్క మాట చెప్పారు. ‘పెద్దవాగు మీద ఒక లిఫ్ట్ పెట్టి, చెరువులు నింపితే, మా ప్రాంతం మొత్తం సస్యశ్యామలమవుతుంది. ఐదారు కోట్లు ఖర్చుపెడితే వందల ఎకరాల్లో రెండు పంటలు, మిర్చి, పత్తి వంటి వాణిజ్య పంటలు పండుతయి! ఈ విషయంలో ఇప్పటికే ప్రభుత్వానికి విజ్ఞప్తులు పంపినం. ఒక్కసారి పెద్దసారు దృష్టిలోకి పోతే పనయిపోయినట్టే. ఎందుకంటే ఈ ప్రాంతం గురించి ఆయనకు పూర్తిగా తెలుసు’ అన్నారు వాళ్లు. వారి మాటల్లో ముఖ్యమంత్రి కేసీఆర్పై ధీమా, ఆయన అనుకుంటే పని కచ్చితంగా అయిపోతుందనే నమ్మకం, తమ ప్రాంతం అభివృద్ధి చెందాలనే తపన కనిపించాయి!
నా చిన్నప్పుడు ఒక నాయకుడు నాలుగుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఒకసారి మంత్రిగా కూడా చేశారు. 15-20 ఏళ్ల కాలంలో ఆయన ఈ ప్రాంతానికి చేసిన అభివృద్ధి ఏముందీ అంటే ఏమీ లేదు. అయినా ఊరు ఊరునా పేర్లు గుర్తు పెట్టుకుని, అందర్నీ తియ్యగా పలకరిస్తూ, దండాలు పెడుతూ ఆయన నాలుగు సార్లు గెలువగలిగారు. కానీ ఇప్పుడా పరిస్థితి ఎంతమాత్రం లేదు. నాయకుడు పల్లెకు వెళ్లకముందే ప్రశ్న ఒకటి ఎదురొచ్చి నిలదీస్తుంది. ‘ఉత్త ముచ్చట్లు సరే, ఊరికేమిస్తావో ముందు చెప్పు’ అంటుంది. గత కొన్ని దశాబ్దాలుగా మనం చూసిన రాజకీయాల్లో, నేతలు పర్యటనకు వెళ్లినప్పుడు, వ్యక్తిగత ప్రయోజనాల కోసమే ఎక్కువ వినతులు వచ్చేవి. కింది స్థాయి నేతలూ వాటి కోసమే సిఫారసులు చేసేవారు. కానీ గత నాలుగైదేండ్లుగా పరిస్థితి మారిపోయింది. ‘వ్యక్తిగత లబ్ధి కోసం వస్తున్న దరఖాస్తులు బాగా తగ్గాయి. ఇప్పుడు ఏ ఊరికి వెళ్లినా, రోడ్ల కోసమో, నీళ్ల కోసమో, బడి కోసమో, గుడి కోసమో, కాల్వ కోసమో, కమ్యూనిటీ హాల్ కోసమో అడుగుతున్నారు. ఇది మాకూ మంచిదే. వ్యక్తిగతమైతే ఒకరికి చేస్తే మరొకరికి కోపం, అసూయ. ఎవరి ఆశా పూర్తిగా తీర్చలేం. అదే సామాజిక అభివృద్ధి అయితే పది మందికి మేలు జరుగుతుంది. చేసిన అభివృద్ధి కనిపిస్తుంది కూడా’ అని నిరంతరం ప్రజల్లో, పర్యటనల్లో ఉండే మంత్రి ఒకరు చెప్పారు.
రాష్ట్రంలోని ఏ ఊరికి పోయి చూసినా.. ప్రభుత్వం ప్రారంభించిన అభివృద్ధి, సంక్షేమ పథకాలు ఇప్పుడు కండ్లకు కొట్టొచ్చినట్లుగా కనిపిస్తాయి. అందుకు తాజా ఉదాహరణే.. పై ఫొటోలో కనిపిస్తున్న కామారెడ్డి జిల్లా బాన్సువాడ నియోజకవర్గం బీర్కూరు మండలానికి చెందిన తిమ్మాపూర్ గ్రామం. ఆ ఊరికి వెళ్లగానే విశాలమైన రోడ్లు స్వాగతిస్తాయి. ఆ రోడ్డు వెంబడి హాయిగొలిపే హరితహారం మొక్కలు, మిషన్ కాకతీయ చెరువు ద్వారా వచ్చే నీళ్లతో పండుతున్న పచ్చటి పొలాలు చల్లటి గాలితో పలకరిస్తాయి. డబుల్ బెడ్రూం ఇండ్లు, ఆ ఇండ్లకు మిషన్ భగీరథ ద్వారా వచ్చే తాగు నీళ్లు.. ఇలా ఎన్నో పథకాలతో ఆ గ్రామం కళకళలాడుతున్నది. తిమ్మాపూర్ గ్రామ జనాభా 1350 కాగా, గ్రామంలోని అర్హులందరికీ వృద్ధాప్య పింఛన్లు, రైతుబంధు, రైతుబీమా వంటి పథకాలన్నీ సంపూర్ణ స్థాయిలో అందుతున్నాయి. ఇలా ఈ ఒక్క గ్రామంలోనే కాదు, రాష్ట్రవ్యాప్తంగా ప్రతి పల్లె చెంతకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు చేరుకున్నాయి.
ఆయన చెప్పినట్టు గ్రామాలు, పట్టణాలు ఇప్పుడు అభివృద్ధిలో పోటీ పడుతున్నాయి. ‘ఆ ఊరికి ఇచ్చినప్పుడు మా ఊరికి ఎందుకివ్వరు? ఫలానా నేత తన ప్రాంతాన్ని బాగా అభివృద్ధి చేసుకున్నడు. మనోడు పట్టించుకోవట్లే. వాళ్లు తెచ్చుకోగలిగినప్పుడు మనమెందుకు చేసుకోలేం?’.. ఇవీ ఇప్పుడు వినిపిస్తున్న మాటలు. ‘బడ్జెట్లో నా శాఖకు భారీ నిధులే వస్తాయి. కానీ పనుల కోసం నా దగ్గరికి వస్తున్న దరఖాస్తులు నిధుల కంటే ఐదింతలు ఉంటున్నాయి. ఆమోదం కోసం ఎమ్మెల్యేల ఒత్తిడిని తట్టుకోవడం తరం కావడం లేదు’ అని ఒక కీలక శాఖను నిర్వహిస్తున్న మంత్రి ఒకరు నవ్వుతూనే తన కష్టాన్ని చెప్పుకొన్నారు.
‘అన్నా.. చెన్నూరు ప్రాంతం గోదావరి పక్కనే ఉంటది. కానీ ఆ ఊరి పొలాలకు నీళ్లందవు.ఒక ఎత్తిపోతల పథకం కావాలని వాళ్లు ఎన్నో ఏండ్ల నుంచి అడుగుతున్నరు. కాకా వెంకటస్వామి హామీ ఇచ్చారు. వివేక్ హామీ ఇచ్చారు. పెద్దపెద్ద నాయకులు ఎందరో వచ్చారు. పోయారు. కాంగ్రెస్ రాజ్యమేలింది. టీడీపీ రాజ్యమేలింది. కానీ ఎత్తిపోతలు మాత్రం రాలేదు. ప్రజల కష్టాన్ని నేను చెప్పగానే, ముఖ్యమంత్రి కేసీఆర్ ఏకంగా రూ.1,658 కోట్లతో ఎత్తిపోతల పథకానికి అనుమతిచ్చారు. నా హయాంలో ఇది జరగడమంటే, మన జన్మకు ఇంతకంటే సార్థకత ఏముంటుంది?’ అని చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్ పట్టలేని ఆనందంతో చెప్తుంటే అభివృద్ధి కోసం ఆయన పడ్డ పరితాపం అర్థమైంది.
‘తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి ఏమైంది? ఉద్యమంలో చెప్పిందేమిటి.. ఇప్పుడు జరుగుతున్నదేమిటి? ఉద్యమ విలువలను పట్టించుకోవడం లేదు’.. అంటూ కొందరు విపక్ష నేతలు, సోకాల్డ్ మేధావులు వేస్తున్న ప్రశ్నలు వింటుంటే నవ్వొస్తున్నది. ఒక్కమాటలో చెప్పాలంటే ఇప్పుడు తెలంగాణలో వికాస ఉద్యమం నడుస్తున్నది. అది కూడా తెలంగాణ ఉద్యమం సాగినట్టే సాగుతున్నది. తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ ఎలాగైతే వివిధ సందర్భాలకు తగినట్టు ఉద్యమ రూపాలను అందించి ప్రజలను కార్యోన్ముఖుల్ని చేశారో, ఇప్పుడు ముఖ్యమంత్రిగా కూడా అలాగే ముందుండి నడిపిస్తున్నారు. ఉద్యమంతో తెలంగాణ మొదలై, స్వరాష్ట్ర సాధనతో ముగిసినట్టే… ఇప్పుడు ప్రగతి సూచికలు కూడా ఒకదాని తర్వాత మరొకటిగా ఉద్యమంగా మొదలై లక్ష్యాన్ని చేరుకుంటున్నాయి.
తెలంగాణ ఏర్పడ్డాక ఈ ఎనిమిదేండ్లలో రాజకీయ పునరేకీకరణ ఉద్యమం, వ్యవసాయ ఉద్యమం, సాగునీటి ఉద్యమం, తాగునీటి ఉద్యమం, విద్యుత్తు ఉద్యమం, గ్రామీణాభివృద్ధి ఉద్యమం, పారిశ్రామిక ఉద్యమం, భూ సంస్కరణల ఉద్యమం, పరిపాలన వ్యవస్థ పునర్వ్యవస్థీకరణ ఉద్యమం, గ్రామీణాభివృద్ధి ఉద్యమం, హరిత ఉద్యమం, ఉద్యోగ ఉద్యమం ఇలా ఎన్నో! ఇప్పుడు దళిత ఉద్యమం నడుస్తున్నది. విద్యా ఉద్యమం, వైద్య ఉద్యమం, పంట మార్పిడి ఉద్య మం ఆరంభమవుతున్నాయి. ఇక ఉద్యమం ఆగిందెక్కడ! ఉద్యమ లక్ష్యాలను మరిచిందెక్కడ? ఉద్యమ విలువలను విడనాడిందెక్కడ?! కేసీఆర్ విపక్షంలో ఉన్నా, అధికారంలో ఉన్నా జరిగేది ఉద్యమమే. ఇప్పుడు జరుగుతున్నది ‘సంపద పెంచు.. పేదలకు పంచు’ అనే సంక్షేమ ఉద్యమం!
అది తెలంగాణ ఉద్యమమైనా, వికాస ఉద్యమమైనా కేసీఆర్ కార్యాచరణ ప్రధానంగా ఐదు దశల్లో ఉంటుంది.
1. అంశంపై నిపుణులతో సాకల్య సమీక్ష
2. చేయాల్సిన సంస్కరణల ఖరారు
3. యంత్రాంగం సన్నద్ధత- పరిశీలన- ఉద్దీపన
4. లక్ష్యాల నిర్ధారణ- వనరుల కేటాయింపు- బాధ్యతల అప్పగింత
5. లక్ష్య పరిపూర్తికి గడువు (డెడ్లైన్)
అన్నీ ఒకేసారి తలకెత్తుకుని, దేనికీ పూర్తి కేటాయింపులు చేయని పాత మోడల్కు భిన్నంగా, కేసీఆర్ ఒకదాని తర్వాత మరొకటి ఎంచుకుంటారు. ఎంచుకున్నదాన్ని క్రమపద్ధతిలో పూర్తిచేస్తారు. సమస్యను కేసీఆర్ స్వీకరించే తీరు విభిన్నంగా ఉంటుంది. పైపై పూతల కంటే, మూలం నుంచి పకడ్బందీగా పరిష్కరించేందుకే ఆయన ప్రాధాన్యం ఇస్తారు. దీనివల్ల కొంత కాలహరణం జరుగుతున్నట్టు అనిపిస్తుంది. కానీ దానికి వెరవకుండా కేసీఆర్ కేవలం అంతిమ లక్ష్యంపైనే దృష్టిపెట్టి పనిచేస్తారు. రాజకీయ లాభం కన్నా, సమస్యకు శాశ్వత పరిష్కారమే ఆయనకు ముఖ్యం. సమస్యను కేసీఆర్ అన్వేషించే తీరు విభిన్నంగా ఉంటుంది. యుద్ధంలో ముప్పేట దాడితో శత్రువును ఉక్కిరిబిక్కిరి చేసినట్టు, సమస్యను ఒకేసారి అన్నివైపుల నుంచీ ముట్టడించి తుదముట్టిస్తారాయన.
వ్యవసాయరంగాన్నే తీసుకుందాం. గత ప్రభుత్వాలు రైతు ఆత్మహత్యలకు పరిష్కారాన్ని 50 వేల పరిహారంలోనో, రుణమాఫీలోనో, చౌక అప్పుల్లోనో వెతుక్కున్నాయి. చంద్రబాబు వంటి కొందరైతే రైతులు వ్యవసాయాన్ని వదిలేయడమే పరిష్కారంగా ప్రతిపాదించారు. కానీ రైతు ఆత్మహత్యకు అసలు కారణం.. అప్పులు. అప్పులకు కారణం సాగు నష్టాలు. సాగు నష్టాలకు కారణం వ్యవసాయం దైవాధీనం కావడం, దిగుబడి తగినంత రాకపోవడం, కల్తీ విత్తనాలు. అందుకు కారణం కరెంటు, నీళ్లు, భూగర్భ జలాలు లేకపోవడం, ప్రభుత్వ మద్దతు లోపించడం! తెలంగాణ రాగానే కేసీఆర్ ఈ మూల కారణాలకు జవాబు వెతికే ప్రయత్నం చేశారు. ఒకవైపు కాళేశ్వరాన్ని రీ డిజైన్ చేశారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఎత్తిపోతల పథకాన్ని మూడున్నరేండ్లలోపు పూర్తిచేసే ముందే తెలంగాణలో ఉన్న చెరువులన్నింటినీ మిషన్ కాకతీయతో సిద్ధం చేసి ఉంచారు. వాగులపై వందలాది చెక్డ్యాములు నిర్మింపజేశారు. పూర్తయిన కాళేశ్వరంతో చెరువుల్ని, కాలువల్ని, చెక్డ్యాముల్ని నింపడం ప్రారంభించారు. దీనికి సమాంతరంగా పాలమూరు ప్రాంతంలో సగంలో ఆగిన ప్రాజెక్టులన్నింటినీ యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేశారు. దీంతో తెలంగాణలో ఒక్కసారిగా ఊట ఉబికివచ్చింది. అలా పెరిగిన భూగర్భ జలాన్ని వాడుకోవడానికి 24 గంటల నిరంతర కరెంటును అందుబాటులోకి తెచ్చారు. అటు కల్తీ విత్తనాలను అరికట్టి, ఇటు రైతుబంధుతో పెట్టుబడి సాయాన్ని, బీమాతో భరోసాను ఇవ్వడంతో వ్యవసాయం ఒక్కసారిగా కళకళలాడటం మొదలైంది. ఇదొక ఉదాహరణ మాత్రమే! హైదరాబాద్కు పరిశ్రమల్ని ఆకర్షించేందుకు, శాంతిభద్రతల్ని పెంపొందించడం, టీఎస్ ఐపాస్తో అనుమతుల్ని సరళీకరించడం, మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడం, కరెంటు, నీళ్లను సమృద్ధిగా అందుబాటులోకి తేవడం, పారిశ్రామిక వేత్తలను సంప్రదించడం ఇలా అన్నింటినీ ఏకకాలంలో అమలుపరిచారు.
తెలంగాణ వికాస ఉద్యమం విజయవంతం కావడానికి ప్రధాన కారణం.. కేసీఆర్ దార్శనికత. ముందస్తు కసరత్తంతా ఆయన చేసి, ఇక అందర్నీ ఉరికించడం మొదలుపెడతరు. ఇందులో కీలకమైనది మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులు నిరంతరం ప్రజల్లో ఉండటం. ఉండాల్సి రావడం! చిన్న జిల్లాలు, కొత్త మండలాల కారణంగా అధికారులు ప్రజలకు మరింత జవాబుదారీ కాగా, ముఖ్యమంత్రి నిరంతరం ఇచ్చే కార్యాచరణతో మంత్రులు, ఎమ్మెల్యేలు ఊర్లకు వెళ్లక తప్పనిస్థితి. ఈ పరిస్థితిని ప్రజలు పూర్తిగా సద్వినియోగం చేసుకున్నారు. తెలంగాణ అభివృద్ధే అందరి సమస్యల పరిష్కారానికి ఏకైక ఔషధమన్న కేసీఆర్ విధానం ఇప్పుడు ప్రజలకూ అబ్బింది. ఊరు అభివృద్ధి చెందితే, తామంతా అభివృద్ధి చెందినట్టే అన్న ఊరుమ్మడి స్పృహ ఇప్పుడు ప్రతి పల్లెలోనూ కనిపిస్తున్నది. గ్రామం అభివృద్ధి చెందితే, ఉపాధి దొరుకుతుంది, ఆస్తుల విలువ పెరుగుతుంది. రవాణా, ఇతర మౌలిక సదుపాయాలూ మెరుగుపడతాయి అన్న ఆలోచనా ధోరణి, ప్రజలను తెలంగాణ వికాస ఉద్యమంలో యాక్టివ్ పార్టిసిపెంట్స్గా చేస్తున్నది. అభివృద్ధి కోసం డిమాండ్లే కాదు; అభివృద్ధి చేయని విపక్ష ఎమ్మెల్యేలను నిలదీస్తున్న సందర్భాలూ కనిపిస్తున్నాయి.
కేసీఆర్ ఒక పథకం ప్రకటించగానే, ముందస్తు ఎన్నికల కోసమే అని ఉలిక్కిపడి, పాదయాత్రలకు దిగే విపక్ష నేతలకు ఇప్పుడు ప్రశ్నించడానికి పెద్దగా అంశాలు లేవు. ఒకటి మొదలుపెట్టగానే విమర్శలు, ఒకటి చేస్తే మరొకటి ఎందుకు చేయలేదనే ప్రశ్నలు వేసే వారి నోళ్లు ఇప్పుడు క్రమంగా మూత పడుతున్నాయి. వికాస ఉద్యమంతో ఇప్పుడు తెలంగాణ పతార పెరిగింది. ప్రభుత్వం నుంచి ప్రతి ఒక్కరికీ ఎంతో కొంత సాయం అందింది. అందరి ఆస్తుల విలువలూ అధికమయ్యాయి. ప్రజల కొనుగోలు శక్తి పెరిగింది. అయితే తెలంగాణ వికాస ఉద్యమం అంటే ఇంతే కాదు; తెలంగాణ అభివృద్ధికి కంటకులుగా మారిన వారి మనసు మార్చడము, లేదంటే ఏరి పారేయడం కూడా వికాస ఉద్యమంలో భాగమే. ఇక ఇప్పుడదే జరగాల్సి ఉంది. జరుగుతుంది!
చివరాఖరు..
మా ఊరు ధూళిమిట్టలో మండలాఫీసుకు మంచి వసతి కావాలంటే ఇల్లు కిరాయికి దొరకలేదు. అదేమని ఆరా తీస్తే ఊరిప్పుడు ఫుల్లుగా నిండిపోయి ఉంది. 800 కడప ఉన్న ఊర్లో ఏ ఇల్లూ ఖాళీగా లేదు. ఊరి బడిలో పనిచేసే కొందరు టీచర్లు 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న లింగాపురానికి వెళ్లి రెంట్కు ఉంటున్నారు. ధూళిమిట్టలో గత మూడేండ్లలో వంద పైచిలుకు కొత్త ఇండ్లు నిర్మాణమయ్యాయి. ఇంకా అవుతున్నాయి. పాడుబడ్డ వాడలన్నీ కొత్త ఇండ్లతో కళకళలాడుతున్నాయి. యువకులు మళ్లీ గ్రామానికి చేరుకుంటున్నారు. పరిశీలిస్తే అన్ని ఊర్లలోనూ అదే పరిస్థితి అని తేలింది. గ్రామాల్లో జనాభా 15-30 శాతం వరకు పెరిగిందని ఒక సామాజిక నిపుణుడు చెప్పారు. ఊరు నవ జీవంతో వెలిగిపోవడం కంటే.. అభివృద్ధికి పెద్ద సూచిక ఏముంటుంది! ఏ పాలనకైనా ఇంతకంటే సాఫల్యత ఏముంటుంది!!
-తిగుళ్ల కృష్ణమూర్తి ,kruthi1972@gmail.com