Expressway : కాన్పూర్-లక్నో ఎక్స్ప్రెస్ వేపై టోల్ కలెక్షన్ రద్దు చేస్తున్నట్లు ‘ద నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్హెచ్ఏఐ)’ ప్రకటించింది. అయితే, ఇది తాత్కాలికమే. ఈ రహదారి పునరుద్ధరణ పనులు పూర్తయ్యేంతవరకు మాత్రమే టోల్ కలెక్షన్ తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ఎన్హెచ్ఏఐ బుధవారం వెల్లడించింది. ఈ రహదారి ఇటీవలే అందుబాటులోకి వచ్చింది. కొద్ది రోజుల క్రితమే ఈ ఎక్స్ప్రెస్ వేపై వాహనాల రాకపోకలు ప్రారంభమయ్యాయి. ఇది ప్రారంభించిన కొద్ది రోజులకే రహదారిపై పగుళ్లు ఏర్పడ్డాయి.
అనేక చోట్ల రోడ్లు ధ్వంసమయ్యాయి. దీంతో ఈ రోడ్డు నాణ్యతపై సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో ఎన్హెచ్ఏఐ స్పందించింది. రోడ్డుకు మరమ్మతులు, నష్ట నివారణ చర్యలు ప్రారంభించింది. రోడ్డు ధ్వంసమైన చోట ట్రాఫిక్ మళ్లించింది. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసింది. వాహనాల రాకపోకల విషయంలో ఎలాంటి ఇబ్బందీ లేదని తెలిపింది. జాతీయ రహదారుల నిర్మాణం, నిర్వహణ విషయంలో అత్యున్నతమైన నాణ్యత, భద్రత, జవాబుదారీతనానికి ఎన్హెచ్ఏఐ కట్టుబడి ఉందని సంస్థ వివరించింది. వాహనదారులకు కలిగిన అసౌకర్యం దృష్ట్యా ఈ మార్గంలో వెళ్లే వాహనాలపై టోల్ ఫీజు వసూలు రద్దు చేస్తున్నామని తెలిపింది. ఇది తాత్కాలికమేనని, రహదారి పునరుద్ధరణ పనులు పూర్తయ్యే వరకు ఈ నిర్ణయం అమలులో ఉంటుందని వెల్లడించింది. ఎక్స్ప్రెస్ వే పగుళ్లు, రోడ్లు ధ్వంసానికి కారణమైన సంస్థ, ఇండిపెండెంట్ ఇంజనీర్, ఇతర అధికారులపై చర్యలు తీసుకుంటామని ఎన్హెచ్ఏఐ హెచ్చరించింది.
ప్రస్తుతం రహదారి మరమ్మతు పనులు సాగుతున్నాయని, త్వరలోనే పనులు నాణ్యతతో పూర్తి చేసి, రోడ్డు అందుబాటులోకి తెస్తామని తెలిపింది. ఇదే సమయంలో టోల్ ఫీజు రద్దు వల్ల కలిగే నష్టాన్ని సంబంధిత నిర్మాణ సంస్థ నుంచి వసూలు చేస్తామని స్పష్టం చేసింది. ఈ ఎక్స్ప్రెస్ వేపై ప్రయాణించాలంటే ఒక వైపు ప్రయాణానికి రూ.295 చెల్లించాలి. ఒకవేళ 24 గంటల్లో తిరుగు ప్రయాణమైతే రెండు ట్రిప్పులకు కలిపి రూ.415 చెల్లించాల్సి ఉంటుంది. అదే హైవేపై అయితే టోల్ ఫీ ఒకవైపు రూ.95 మాత్రమే.