2024 సార్వత్రిక ఎన్నికలను పరిశీలించేందుకు భూటాన్, మంగోలియా, ఆస్ట్రేలియా, మడగాస్కర్, రష్యా, నేపాల్, శ్రీలంక, మాల్దీవులు, నమీబియా తదితర 23 దేశాలకు చెందిన విదేశీ ప్రతినిధులు దేశంలో పర్యటిస్తున్న నేపథ్యంలో ఎలక్షన్ కమిషన్ (ఈసీ) ఎన్నికలు నిర్వహిస్తున్న తీరుపై తీవ్రమైన విమర్శలు వస్తున్నాయి. బీజేపీ చేస్తున్న విద్వేష ప్రసంగాలపై చర్యలు తీసుకునేందుకు ఈసీ నిరాకరించడం, ఎన్నికలు ముగిసిన వెంటనే పోలింగ్ వివరాలను వెల్లడించకపోవడం వంటి కారణాల వల్ల ఎలక్షన్ కమిషన్ పక్షపాత వైఖరితో వ్యవహరిస్తున్నదని ఇటు రాజకీయపార్టీలు, అటు పౌర సమాజం నుంచి ఆరోపణలు వినవస్తున్నాయి. అంతేకాదు, ఓటు ట్యాంపరింగ్ జరిగిందనే అనుమానాలకు ఈ ఆరోపణలు తావిస్తున్నాయి.
Election Commission | కేంద్ర ప్రభుత్వ ఆహ్వానం మేరకు ఎన్నికలను పరిశీలించేందుకు మన దేశానికి వచ్చిన విదేశీ ప్రతినిధుల నుంచి ఈసీ ధ్రువీకరణను కోరడంపై రాజకీయ విశ్లేషకులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. కమిషన్పై ప్రజలకు విశ్వాసం సన్నగిల్లడం, అక్రమాలు జరుగుతున్నాయనే ఆరోపణలు పెరుగుతుండటం వల్లనే కేంద్రం విదేశీ ప్రతినిధులను ఆహ్వానించిందని విశ్లేషకులు అంటున్నారు. ఎన్నికల్లో పారదర్శకతను పెంపొందించే లక్ష్యంతో విదేశీ పరిశీలకులను ఆహ్వానించినట్టు ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్కుమార్ చెప్తున్నారు. ఎన్నికల నిర్వహణలో ఉన్నత ప్రమాణాల పట్ల భారత నిబద్ధతను ఇది చాటుతున్నదని ఆయన పేర్కొన్నారు. ‘మన సువ్యవస్థిత పారదర్శక ఎన్నికల విధానాలకు అనుగుణంగానే ఇదంతా జరుగుతున్నది. ఎలాంటి దాపరికాలు లేనటువంటి పటిష్ఠమైన పద్ధతిలోనే మేం పని చేస్తున్నాం’ అని రాజీవ్ కుమార్ అన్నారు.
దశాబ్దాలుగా నిర్మించిన న్యాయమైన ఎన్నికల ప్రక్రియను ఎన్నికల కమిషన్ నాశనం చేస్తున్నదని టీఎంసీ చట్టసభ సభ్యు డు సాకేత్ గోఖలే ఇటీవల ‘ఎక్స్’లో ఆరోపించారు. సార్వత్రిక ఎన్నికలు ప్రారంభమైన ఏప్రిల్ 19కి కొన్ని వారాల ముందు ఎలాంటి కారణం లేకుండానే ఎలక్షన్ కమిషనర్లలో ఒకరు తన పదవికి రాజీనామా చేశారు. మరొకరు పదవీ విరమణ పొం దారు. ఈ పరిణామాల అనంతరం మోదీ ప్రభుత్వం తక్షణమే స్పందించింది. రోజుల వ్యవధిలోనే ఆ ఖాళీలను భర్తీచేసింది. అయితే ఈ చర్య సుప్రీంకోర్టు పరిశీలనలోకి వచ్చే అవకాశాలున్నాయి. 2019లో బీజేపీ రెండోసారి అధికారంలోకి వచ్చిన నాటినుంచి ఎన్నికల కమిషన్ స్వతంత్రత ప్రశ్నార్థకమవుతున్నదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
అధికార పార్టీ పట్ల స్వతంత్ర సంస్థ ఈసీ పక్షపాత ధోరణితో వ్యవహరిస్తున్నదని అనేక సందర్భాల్లో రాజకీయపార్టీలు, పౌర సమాజం ఎత్తిచూపాయి. ఎన్నికల ప్రచారంలో భాగంగా ముస్లింలకు వ్యతిరేకంగా విద్వేషపూరిత ప్రసంగాలు చేసినందుకు, ప్రతిపక్ష కాం గ్రెస్ మ్యానిఫెస్టో గురించి తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేసినందుకుగానూ మోదీ ఇటీవల అంతర్జాతీయంగా విమర్శలను ఎదుర్కొన్నారు. ఎన్నికల నియమ, నిబంధనలను ఉల్లంఘించారని తీవ్రమైన విమర్శలు వచ్చిన కొద్దిరోజుల తర్వాత ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకున్నట్టు విమర్శకులు గుర్తించారు. అది కూడా మోదీకి బదులుగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు ఈసీ లేఖ పంపింది.
ఎన్నికలకు ముందు సెంటర్ ఫర్ ది స్టడీ ఆఫ్ డెవలపింగ్ సొసైటీస్ నిర్వహించిన సర్వేను ప్రస్తావిస్తూ… 2019-2024 ఎన్నికల మధ్యకాలంలో ఎలక్షన్ కమిషన్పై ప్రజల్లో విశ్వాసం సన్నగిల్లిందని రాజకీయ విశ్లేషకురాలు ఆరతీ జెరాత్ పేర్కొన్నారు. విభజన ప్రసంగాలపై చర్యలు తీసుకోకపోవడం, ఓటింగ్ శాతాలకు సంబంధించి న డాటా విడుదలలో ఎన్నికల కమిషన్ వైఫల్యాలపై ఆమె స్పందించారు. ఉద్వేగభరితమైన ప్రసంగాలు మీడియాలో ముఖ్యాంశాలు గా రావడం, ఎన్నికల కమిషన్ స్పందించకపోవడం లాంటి చర్యలు విదేశీ ప్రతినిధులు కూడా కాపాడలేని విధంగా ఎలక్షన్ కమిషన్ విశ్వసనీయతను దెబ్బతీశాయని తెలిపారు.
ఎన్నికల కమిషన్ పాత్ర పూర్తిగా దిగజారిందని ఎంపీ, సీనియర్ విపక్ష నేత డెరెక్ ఓ బ్రయన్ ఆరోపించారు. ప్రస్తుత ఎన్నికల తొలి రెండు దశల తుది ఓటింగ్ శాతాల విడుదలలో ఎన్నికల కమిషన్ సరైన వివరణ లేకుండానే రోజులకొద్దీ జాప్యం చేయడం ఓటర్ల మదిలో తీవ్రమైన అనుమానాలకు తావిస్తున్నది. జాప్యానికి గల కారణాలను తెలపాలని, వివరణ ఇవ్వాలని కోరుతూ డెరెక్ ఓ బ్రయన్ ఈసీకి లేఖ రాశారు. ‘ఇటువంటి అనుమానాలను నివృత్తి చేయడంలో కమిషన్ వైఫల్యం ఎన్నికల ప్రక్రియపై ప్రజల విశ్వాసాన్ని దెబ్బతీస్తుంది’ అని ఆ లేఖలో పేర్కొన్నారు.
మోదీ చేస్తున్న ముస్లిం వ్యతిరేక ప్రసంగాల పట్ల చర్యలు తీసుకోకుండా ఉండటమే కమిషన్ వైఫల్యానికి నిదర్శనమని రచయిత, కాంగ్రెస్ మాజీ అధికార ప్రతినిధి సంజయ్ ఝా పేరొన్నారు. ‘ఎన్నికలలో పోటీ చేయకుండా మోదీని కమిషన్ నిషేధించి, ఇకపై ప్రచారం చేయకుండా ఆపాల్సింది’ అని ఆయన అభిప్రాయపడ్డారు. ఎన్నికల సంఘం సభ్యులకు స్వతంత్ర ప్రతిపత్తిని కల్పించేందుకు వారిని ఎంపిక చేసే వ్యవస్థను కొత్త ప్రభుత్వం ఏర్పాటుచేయాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు. రాజకీయ జోక్యం కారణంగా ఎన్నికల వ్యవస్థలు అవకతవకలకు గురవుతాయని పాకిస్థాన్ను ఝా ఉదహరించారు. ‘పాక్ ఉదాహరణ ప్రతి దేశానికి గుణపాఠం లాంటిది. ప్రత్యేకించి రాజకీయ జోక్యం తగ్గకపోతే ఎన్నికలు అవకతవకలకు గురవుతాయి’ అని ఆయన పేర్కొన్నారు.
దక్షిణాసియాలోని వివిధ దేశాల ఎన్నికల సంస్థలు కూడా రాజకీయ పక్షపాత వైఖరికి సంబంధించిన ఆరోపణలను ఎదుర్కొంటున్నాయి. ఎన్నికల సంఘంపై విశ్వాసం లేకపోవడంతో బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ ఈ ఏడాది జరిగిన ఎన్నికలను బహిష్కరించింది. పాకిస్థాన్లో ఫిబ్రవరిలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో విస్తృతంగా ఓట్లు తారుమారు చేశారన్న ఆరోపణలపై ఆ దేశ ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీనామా చేయాలని జైలులో ఉన్న మాజీ ప్రధాని ఇమ్రాన్ఖాన్ పదేపదే డిమాండ్ చేశారు. పాకిస్థాన్, బంగ్లాదేశ్ కూడా విదేశీ ప్రతినిధులను తమ ఎన్నికలను పరిశీలించేందుకు అనుమతించాయి. అయితే మన దేశంలోనూ రకరకాల ఆరోపణలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో ఈసీ ఏ రకమైన చర్యలు తీసుకుంటుందో చూడాల్సి ఉన్నది.
కైసర్ అంద్రాబీ