Telangana | రాష్ట్ర రైతాంగం దీనావస్థలో ఉన్నది. పరాయి పాలనలోని పరిస్థితులే పునరావృతం అవుతుండటంతో రైతన్నలు దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. ‘మార్పు’ పేరిట అధికారంలోకి వచ్చిన కొత్త ప్రభుత్వం రైతుల బతుకుల్లో నిజంగానే మార్పు తీసుకొచ్చింది. నిన్నమొన్నటి వరకు కాలు మీద కాలేసుకొని దర్జాగా బతికిన కర్షకులు నేడు కన్నీళ్లు కారుస్తున్నారు. కాంగ్రెస్ పాలనలో రైతులకు మళ్లీ కష్టాలు మొదలయ్యాయి. ఉమ్మడి పాలనలో ఆగమైన మన తెలంగాణ ఎవుసం స్వరాష్ట్రం సిద్ధించాక వెలుగులీనింది. స్వయంగా కాడి పట్టి ఎవుసం చేసిన కేసీఆర్ రైతుల తలరాతనే మార్చేశారు. వ్యవసాయరంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకువ చ్చి సాగును బాగు చేశారు.
‘మిషన్ కాకతీయ’తో చెరువులను పునరుద్ధరించి, కాళేశ్వరం జలాలను గ్రామాలకు మళ్లించి భూగర్భ జలాలను పెంచారు. ఆయన చేసిన అనితర కృషి వల్లనే బీడు భూముల్లోనూ బంగారం పండింది. రాష్ట్ర ప్రభుత్వ ఆదాయంలో 18.2 శాతం రాబడి సాగు ద్వారా లభించింది. కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం పెట్టుబడి సాయాన్ని నేరుగా రైతుల ఖాతాల్లోనే జమ చేసింది. కానీ, ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ సర్కార్ రైతు బంధు ఆపేసి అన్నదాతలను అరిగోస పెడుతున్నది. రైతుభరోసా పేరిట పెట్టుబడి సాయాన్ని పెంచుతామని మాట ఇచ్చిన కాంగ్రెస్ నాయకులు రానురాను రైతుబంధును ఎత్తివేసే ప్రయత్నాలను ముమ్మరం చేస్తున్నారు.
రాష్ర్టాభివృద్ధికి వ్యవసాయం గీటురాయి. అది నిజమని నమ్మిన కేసీఆర్ ఆ రంగాన్ని బాగుచేసేందుకు పూనుకున్నా రు. అందుకోసం ప్రత్యేక పాలసీని రూపొందించారు. అందుకే ఉమ్మడి పాలనలో బియ్యానికి నోచుకోని తెలంగాణ.. నేడు ధాన్యం ఉత్పత్తిలో పంజాబ్ తర్వాత దేశంలో రెండో స్థానంలో నిలిచింది. మేలు రకం వంగడాలు, సమగ్ర సస్యరక్షణ, మెరుగైన యాజమాన్య పద్ధతుల ద్వారా తక్కువ పెట్టుబడితో ఎక్కువ దిగుబడి సాధించే సాయికి రాష్ర్టాన్ని తీసుకువచ్చారు. మెరుగైన మార్కెటింగ్ విధానాలతో వ్యవసాయ ఉత్పత్తులకు లాభసాటి ధరలు దక్కేలా చేసింది నాటి బీఆర్ఎస్ సర్కార్.
కానీ, యాసంగి పంటలు ఎండిపోయి రైతులు విలపిస్తున్నా నేటి కాంగ్రెస్ సర్కార్ పట్టించుకోవడం లేదు. నీటి వనరులను సక్రమంగా, సరైన సమయానికి వాడుకోవడంలో కాంగ్రెస్ విఫలమైంది. అందుకే నీళ్లు అందుబాటులో ఉన్నా పంటలు ఎండిపోయాయి. ప్రాజెక్టుల నుంచి సకాలంలో నీటిని విడుదల చేయకపోవడంతో మొన్నటివరకు మత్తళ్లు దుంకిన చెరువులు సైతం నెర్రెలుబారాయి. దీంతో వందల ఫీట్ల లోతుల్లోకి బోర్లు వేసినా ప్రయోజనం ఉండటం లేదు. భూగర్భ జలాలు అడుగంటిపోవడమే దానికి ప్రధాన కారణం.
మూలిగే నక్కపై తాటికాయ పడ్డ చందాన అకాల వర్షాలు అన్నదాతలను ఆక్రందనలు పెట్టిస్తున్నాయి. అకాల వర్షాల పట్ల జాగ్రత్తగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసినప్పటికీ పాలకులు నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తున్నారు. ధాన్యం కొనుగోళ్లలో జాప్యం జరుగుతున్నది. ఓ వైపు వాన ముప్పు, మరోవైపు ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా ఆరుగాలం శ్రమించి పండించిన పంటను అమ్ముకునేందుకు రైతులు అగచాట్లు పడుతున్నారు. పుట్ల కొద్దీ వడ్లను పండించినా గత ప్రభుత్వం చివరి గింజ వరకు కొనుగోలు చేసింది. కానీ, ప్రస్తుత ప్రభుత్వం కాడి ఎత్తివేస్తు న్నది. గోదాముల్లేవంటే వరిధాన్యాన్ని కల్లాల నుంచి సేక రించలేకపోతున్నది. రైతులు వడ్ల కుప్పలకాన్నే బిక్కు బిక్కు మంటూ బతుకుతున్నారు.
కౌలు రైతుల పరిస్థితి కడు దయనీయంగా మారింది. పంటలు ఎండిపోవడంతో పెట్టుబడులు కూడా చేతికొచ్చే పరిస్థితి లేదు. దీంతో 20 లక్షల మందికి పైగా కౌలు రైతులు నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. ఎకరానికి రూ.15 వేల నుంచి రూ.25 వేల వరకు భూ యజమానులకు ముందస్తుగానే చెల్లించిన కౌలు రైతులు.. పెట్టుబడుల సంగతి పక్కనపెడితే, కౌలుకు చెల్లించిన మొత్తం అయినా తిరిగొచ్చే పరిస్థితి లేకపోవడంతో లబోదిబోమంటున్నారు. కౌలు రైతులకు కూడా రైతుభరోసా ఇస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ సర్కార్ ఇప్పుడు వారిని కనీసం గుర్తించడం లేదు. ఇప్పటికే అనేక మంది రైతులు, కౌలురైతులు తనువు చాలించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికైనా మేల్కోవాలి. కాడి వదిలేయకముందే కర్షకులను కాపాడుకోవాలి. పంట నష్టపోయిన రైతులకు ఎకరానికి రూ.25 వేల చొప్పున నష్ట పరిహారం చెల్లించాలి. దాంతో పాటు యాసంగి ధాన్యానికి కనీస మద్దతు ధరతో పాటు కాంగ్రెస్ పార్టీ మ్యానిఫెస్టోలో ప్రకటించినట్టుగా రూ.500 బోనస్ ఇచ్చి ఆదుకోవాలి.
-మోటె చిరంజీవి
99491 94327