సెకనుకు రూ.3.5 లక్షలు,
నిమిషానికి రూ.2.1 కోట్లు,
గంటకు రూ.126 కోట్లు,
రోజుకు రూ.3,024 కోట్లు,
నెలకు రూ.90,720 కోట్లు,
ఏడాదికి రూ.10.88 లక్షల కోట్లు,
గడిచిన ఎనిమిదిన్నరేండ్లలో రూ.92 లక్షల కోట్లు… ఏమిటీ లెక్కలన్నీ?..
మన దేశానికి ఎగమతుల రూపంలో వచ్చిన ఆదాయమో, లాభాలో అనుకుంటే మీరు కచ్చితంగా పొరపాటు పడ్డట్టే. ఎందుకంటే ఇది బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ఎనిమిదిన్నరేండ్లలో చేసిన అప్పు. 2014-15లో భారతదేశం అప్పు రూ.62,78,553 కోట్లు ఉండగా ఇప్పుడది 2022-23 ఆర్థిక సంవత్సరానికి రూ.147.19 లక్షల కోట్లకు పెరిగింది. మరి ఇప్పుడు ఎందుకు ఈ లెక్కలనేగా మీ సందేహం. తాజాగా బుధవారం పెరిగిన గ్యాస్ ధరలను చూస్తే ఈ లెక్కలను గుర్తు చేయాల్సి వచ్చింది. అంటే దేశంలో ప్రతీ భారతీయుని నెత్తిన సగటున రూ.ఒక లక్షకు పైగా తలసరి అప్పు ఉందన్న మాట. మరి ఇంత భారీ స్థాయిలో అప్పులు చేస్తున్న భారతదేశంలో నిత్యావసర ధరలెందుకు మండుతున్నాయో ప్రజలకు అర్థంగాక జట్టు పీక్కుంటున్నారు.
బీజేపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి వంట గ్యాస్ ధరలు పెరుగుతున్నాయి. ఒకసారి ఆ పెరుగుదలను పరిశీలిద్దాం. 2014లో సిలిండర్ ధర రూ.414 ఉండేది. ఆ వెంటనే 2015లో రూ.606కు పెరిగింది. 2016లో రూ.747కు పెరిగింది. ఇది 2021లో రూ.819కి, 2022లో రూ.1150కి పెరిగిపోయి.. తాజాగా 2023 మార్చి1న హైదరాబాద్ నగరం సహా దేశంలోని వివిధ ప్రాంతాల్లో రూ.1170 దాటి 1200లకు చేరువ అవుతున్నది. దీనిపై దేశవ్యాప్తంగా నిరసన ఉంది. ఒకవైపు ఎడతెరిపి లేకుండా పెట్రోల్, డీజిల్ ధరలు పెంచి, మరోవైపు గ్యాస్ ధరలు పెంచడం సామాన్యులకు ఇబ్బందులు తెచ్చి పెడుతోంది. గతేడాది జూలై నుంచి కాస్తంత స్థిరంగా ఉన్నట్టు కనిపించినా ఎవరూ ఊహించని విధంగా కేంద్రం మళ్లీ షాకిచ్చింది. దీంతో వంటింట్లో గ్యాస్ మంటలు మరోమారు చెలరేగాయి.
అంతకంతకూ పెరుగుతున్న దేశ అప్పుతోపాటు తలసరి అప్పు, నిత్యావసర ధరలు కూడా అమాంతం పెరిగిపోతున్నాయి. ఇప్పటికే జీఎస్టీతో చాలా సరుకుల ధరలు పెరిగి కునారిల్లుతున్న దేశ జనాభాపై గ్యాస్ భారం కూడా పెరిగిపోవటం ఆందోళన కలిగిస్తున్నది. దాదాపుగా డొమెస్టిక్ సిలిండర్ మీద ఉన్న సబ్సిడీని ఎత్తేసినట్టే. కాగా గడిచిన ఎనిమిదేండ్లుగా కేంద్ర బడ్జెట్లోనూ పెట్రోల్, గ్యాస్ సబ్సిడీలకు కేంద్రం మంగళం పాడింది. 2019లో లోక్సభ ఎన్నికల ముందు గ్యాస్ సబ్సిడీ సుమారు రూ.34 వేల కోట్లు ఉండగా, ఎన్నికల్లో అధికారం చేజిక్కించుకున్న తర్వాత బీజేపీ ప్రభుత్వం ఆ సబ్సిడీని ప్రస్తుతంరూ.5 వేల కోట్లకు కుదించింది.
గ్యాస్ కనెక్షన్ లేని నిరుపేద కుటుంబాలకు ఉచితంగా వంటగ్యాస్ను పంపిణీ చేయటం కోసం 2016 మే 1న ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకాన్ని ప్రారంభించి తొలి విడతగా దేశంలోని 1,47,43,862 మందికి గ్యాస్ పంపిణీ చేశారు. ఆ తర్వాత రెండో విడతను 10 ఆగస్టు 2021న ఉత్తరప్రదేశ్లోని మహోబా జిల్లాలో వర్చువల్గా ప్రధాని మోదీ ప్రారంభించారు. కేంద్రం విడుదల చేసిన నివేదిక ప్రకారం మొత్తం 8.03 కోట్ల మందికి ఉజ్వల గ్యాస్ పంపిణీ చేయగా అందులో అగ్రభాగం బీజేపీ పాలిత రాష్ర్టాలకు ఇచ్చినట్టు విపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఒక్క యూపీకే 1,47,74,500 గ్యాస్ కనెక్షన్లు, మధ్యప్రదేశ్కు 71,79,224, జమ్మూకశ్మీర్కు 12,03,246, మహారాష్ట్రకు 44,37,624, అస్సాంకు 34,93,730 గ్యాస్ కనెక్షన్లు ఇచ్చారు. బీజేపీయేతర పార్టీలు అధికారంలో ఉన్న రాష్ర్టాలకు వీటి దరిదాపుల్లో కూడా ఇవ్వలేదు. ఉదాహరణకు తెలంగాణకు కేవలం 10,75,202 కనెక్షన్లు మాత్రమే ఇచ్చారు. మరోవైపు, కేంద్ర ప్రభుత్వం గ్యాస్ ధరలు అంతకంతకూ పెంచుకుంటూ పోతుండటంతో చాలా మంది పేద, మధ్య తరగతి ప్రజలు గ్యాస్ కనెక్షన్ ఉన్నా రీఫిల్ చేసుకోలేని పరిస్థితులు కనిపిస్తున్నాయి. రానురాను గ్యాస్ వినియోగం కూడా చాలా వరకూ తగ్గిపోయే సూచనలున్నాయి. నిత్యావసర ధరలు పెరుగుతుండటం, ఆదాయ వనరులు తగ్గుతుండటంతో పేద, మధ్యతరగతి ప్రజల కష్టాలు పెరిగిపోతున్నాయి. ఇక కూలి పనులు చేసుకునే వారి పరిస్థితి మరింత దారుణం. ఈ నేపథ్యంలోనే గ్యాస్ ధరల పెంపుపై దేశవ్యాప్తంగా నిరసనలకు ప్రజలు పిలుపునిస్తున్నారు.
(వ్యాసకర్త: ఫ్రీలాన్స్ జర్నలిస్టు)
-వనం నాగయ్య
94418 77695