ఒకానొకప్పుడు ఓ రాజ్యంలో ఒక రాజుండేవాడు. ఆయనకు సంగీతం అంటే మక్కువ. మంచి సంగీతంతో కూడిన పాట పాడినవారికి వెయ్యి వరహాలు ఇస్తానని చాటింపు వేయించాడు. ఓ సంగీత విద్వాంసుడు రాజు దగ్గరకు వచ్చి, పాటలు పాడాడు. రాజు సంతోషపడ్డాడు. ఆ ఆనందంలో గాయకునికి 500 వరహాలు ఇస్తున్నట్టు చెప్పాడు. గాయకుడు రెట్టించిన ఉత్సాహంతో మరో పాట పాడాడు.
ఈ సారి రాజు ఓ వజ్రాలహారం ఇస్తానని ప్రకటించాడు. గొంతు సవరించుకొని మరింత ఉత్సాహంతో గాయకుడు మరో పాటందుకున్నాడు. ఈ సారి అర్ధరాజ్యం ఇస్తున్నట్టు ప్రకటించాడు రాజు. పాటలు ముగిసిన తర్వాత గాయకుడు తనకు ప్రకటించిన వరహాలు, వజ్రాలహారం, అర్ధరాజ్యం ఇచ్చేస్తే వెళ్లిపోతానని రాజును కోరుతాడు. అప్పుడు రాజు.. ‘మీరు నాకు శ్రవణానందం కలిగించారు. నేను కూడా మీకు శ్రవణానందం కలిగించాను. ఇక్కడ ఇచ్చేది లేదు. పుచ్చుకునేది లేదు’ అని చెప్పి గాయకుడిని రాజదర్బార్ నుంచి వెలేశాడు.
లోక్సభ ఎన్నికల కోసం కాంగ్రెస్ ప్రకటించిన మ్యానిఫెస్టో చూస్తే పై రాజుగారి కథ గుర్తుకువస్తున్నది. ఎందుకంటే రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో లెక్కకు మించిన హామీలిచ్చింది. ఇప్పుడు సాకులు చెప్తూ ఆ హామీలను తప్పించుకుంటున్నది. కొన్ని హామీలైతే అసలు తాము చేస్తామని చెప్పలేదని కుండబద్దలు కొట్టేసింది. తెలంగాణలో ఇచ్చిన ఆరు గ్యారెంటీలకే దిక్కు లేదంటే, ఇప్పుడు కొత్తగా పంచన్యాయాలు అంటూ లోక్సభ మ్యానిఫెస్టో విడుదల చేసింది. రాష్ట్ర ప్రజలను మోసం చేసినట్టే దేశ ప్రజలకు కూడా పంచన్యాయాల పేరిట పంగనామాలు పెట్టేందుకు కాంగ్రెస్ పార్టీ సిద్ధమైంది.
‘దోచుకో.. దాచుకో..’ అనేది కాంగ్రెస్ పార్టీ నినాదం. అంతే తప్ప, వాళ్లకు మరో ధ్యాస ఉండదు. అందుకే అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన పది రోజుల్లోనే కాంగ్రెస్ మాట మార్చేసింది. రాష్ట్రంలోని ప్రతీ నిరుద్యోగికి ఉద్యోగం వచ్చేవరకు నిరుద్యోగ భృతి ఇస్తామని స్వయంగా రాహుల్గాంధీ, ప్రియాంకగాంధీలే ప్రకటించారు. కానీ, ఎన్నికల్లో గెలిచాక అసలు తాము నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పలేదని ఆన్ రికార్డ్ అసెంబ్లీలో అబద్ధమాడారు. యువ వికాసం అని చెప్పి దాన్ని యువతను మోసం చేసే స్కీంగా మార్చేశారు. ఫిబ్రవరి 1 నుంచి ఉద్యోగాల జాతర అని జాబ్ క్యాలెండర్ ఇచ్చారు. అందులో ఒక్కటి కూడా ఇప్పటివరకు అమలుకు నోచుకోలేదు. అంటే తెలంగాణ నిరుద్యోగులను మోసం చేసినట్టే దేశవ్యాప్తంగా నిరుద్యోగులను మోసం చేసేందుకు కాంగ్రెస్ పార్టీ సన్నద్ధమవుతున్నదని అర్థమవుతున్నది. పైగా గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన ఉద్యోగాలను తాము ఇచ్చామని చెప్పుకొంటున్నారు. మూడు నెలల్లో 30 వేల ఉద్యోగాలు భర్తీ చేశామని డబ్బా కొట్టుకుంటున్నారు. ఆఖరికి తెలంగాణలో టెట్ పరీక్షకు రూ.200 ఉన్న ఫీజును రూ.2000కు పెంచి, దేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే పరీక్ష ఫీజులు ఉండవని డాంబికాలు ప్రకటిస్తున్నారు.
ఈ పంగనామాల ఎపిసోడ్ ఇంతటితో ఆగిపోలేదు. ఇది ఆరంభం మాత్రమే. ఎందెందు వెదికినా అందందు కలదన్నట్టు.. కాంగ్రెస్ పార్టీ అన్నింటిలోనూ పంగనామాలు పెట్టింది, పచ్చి మోసాలు చేసింది. అధికారంలోకి రాగానే మహిళలకు నెలకు రూ.2500 ఇస్తామన్నది. ఇప్పటివరకు దానికి అతీగతీ లేదు. కానీ.. కొత్తగా ప్రకటించిన లోక్సభ ఎన్నికల మ్యానిఫెస్టోలో దేశమంతటా మహిళలకు ఏడాదికి లక్ష రూపాయలు ఇస్తామని ప్రకటించింది. అంటే ఒక్కో మహిళకు నెలకు రూ.8000కు పైగా రావాలి. ఈ లెక్కన మన రాష్ట్రంలోని మహిళలకు నెలకు రూ.10,500 రావాలి. కానీ ఇప్పటికీ రూ.2500కే దిక్కులేదు. అలాంటప్పుడు ఇంకా రూ.8000 ఇస్తారంటే ప్రజలు ఎలా నమ్మాలి?
వృద్ధులు, దివ్యాంగులు, ఒంటరిమహిళల పింఛన్ రూ.4000కు పెంచుతామని ప్రగల్భాలు పలికిన కాంగ్రెస్, గెలిచి గద్దెనెక్కాక పాత పింఛన్ వస్తే చాలనుకునే పరిస్థితికి తీసుకొచ్చింది. రైతులనైతే నిండా ముంచారు. ఏటా ఎకరానికి రూ.15,000 రైతుభరోసా పేరుతో ఇస్తామన్నారు. కానీ, గత ప్రభుత్వం ఇచ్చిన రూ.10,000 రైతుబంధు డబ్బులు కూడా ఇంకా ఖాతాల్లో జమకాని దుస్థితి. అడిగితే స్వయంగా మంత్రులే చెప్పుతో కొడతామనే దాకా పోయింది. రైతు రుణమాఫీది మరో గోస. ఎన్నికల నాటికి అప్పు కట్టేసిన రైతులు వెళ్లి వెంటనే తెచ్చుకోవాలని డిసెంబర్ 9న మాఫీ చేస్తామని రేవంత్రెడ్డి చెప్పారు. ఆయన ముఖ్యమంత్రి అయి నాలుగు నెలలవుతోంది. ఇప్పటికీ రుణమాఫీ దిశగా ఒక్క అడుగు కూడా పడలేదు. అసెంబ్లీ ఎన్నికల ముందు రేవంత్రెడ్డి చెప్పినట్టుగానే ఇప్పుడు దేశమంతటికి ఖర్గే, రాహుల్గాంధీ ఇదే రుణమాఫీ హామీ ఇచ్చారు. ఇది అమలయ్యేదేనా అనేది తెలుసుకోవడానికి మన రాష్ట్రమే మంచి ఉదాహరణ.
అంతేకాదు, పంటలకు మద్దతు ధర ఇస్తామని, వరికి రూ.500 బోనస్ ఇస్తామని ఆనాడు కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. మద్దతు ధర సంగతి దేవుడెరుగు.. బోనస్ గురించి అడిగితే ఆ మాట తాము అననే లేదని దాటవేస్తున్నారు. మళ్లీ లోక్సభ ఎన్నికల మ్యానిఫెస్టోలోనూ మద్దతు ధరకు చట్టబద్ధత కల్పిస్తామని, స్వామినాథన్ కమిటీ సిఫారసులు అమలుచేస్తామని చెప్తుండటం గమనార్హం. వడగండ్ల వానతో పంటలు దెబ్బతిన్నా, నీళ్లు లేక పంటలు ఎండుతున్నా.. ముఖ్యమంత్రి గానీ, మంత్రులు గానీ రైతుల పొలాలకు వెళ్లి పరామర్శించటం లేదు. కనీసం, వారికి నష్టపరిహారం ప్రకటించలేదు. అడిగితే రైతుల మీద, రైతుల ఆత్మహత్యల మీద ముఖ్యమంత్రి వెటకారాలు చేస్తున్నారు. ఇలాంటి పార్టీ దేశంలో ఉన్న రైతులకు ఇస్తున్న హామీలను ఎలా విశ్వసిస్తాం?
రైతుల విషయంలో పూటకో మాట మాట్లాడుతుండటంతో రైతుల్లో భరోసా లేకుండా పోయింది. వారికి గుండెధైర్యాన్ని ఇచ్చేవారు లేక కాంగ్రెస్ సర్కారు వచ్చిన ఈ నాలుగు నెలల్లో 200కు పైగా రైతులు ప్రాణాలు తీసుకున్నారు. ఇంత జరిగినా కాంగ్రెస్ సర్కారుకు కనికరం లేదు.
ఆరు గ్యారెంటీల్లో ఒక్కటంటే ఒక్క హామీ కూడా పరిపూర్ణంగా అమలైంది లేదు. ఎన్నికల ముందు ప్రతీ ఇంటికి రూ.500కే గ్యాస్ సిలిండర్, ప్రతీ ఇంటికి 200 యూనిట్ల ఉచిత కరెంటు ఇస్తామని చెప్పారు. ఆ తర్వాత రేషన్ కార్డు ఉంటేనే ఇస్తామని మాట మార్చారు. చివరికి రేషన్కార్డు ఉన్నవాళ్లలో సగం మందికి కూడా ఇవేవీ రావడం లేదు. 90 లక్షలకు పైగా రేషన్ కార్డులుంటే 40 లక్షల మందికి మాత్రమే 200 యూనిట్ల ఉచిత కరెంటు ఇస్తున్నారు. రూ.500 సిలిండర్ అందుకుంటున్న వారి సంఖ్యలో అందులో సగం కూడా లేదు. ఒక పథకం అందుకుంటే మరో పథకంలో లబ్ధిదారులుగా లేకుండా జాగ్రత్త పడుతున్నట్టు స్పష్టంగా కనిపిస్తున్నది.
చివరగా అత్యంత దారుణమైన విషయం ఏమంటే.. సామాజిక న్యాయం చేస్తామని కొత్త మ్యానిఫెస్టోలో పెట్టారు. కానీ, దళితబిడ్డ అయిన ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కను సాక్షాత్తు గుడిలో కింద కూర్చోబెట్టి అవమానించారు. మరో దళిత నాయకుడు బక్క జడ్సన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీలో బహుజన బిడ్డలకు గౌరవం లేదని అనేకమంది నాయకులు బాహాటంగానే చెప్తున్నారు. అలాంటి పార్టీ సామాజిక న్యాయం చేస్తామని చెప్పడం… నేతి బీరకాయలో నెయ్యి మాదిరిగానే ఉన్నది. ఇక్కడ మరో విషయం ఏమంటే.. పదేండ్లలో కార్పొరేట్లకు తప్ప, కామన్ మ్యాన్కు పైసా పనిచెయ్యని నరేంద్ర మోదీ 100 లక్షల కోట్ల అప్పు తెచ్చారు. మరి కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు కావాలంటే వాళ్లు ఎన్ని లక్షల కోట్ల అప్పు తీసుకురావాలి? ఇందులోని మోసాన్ని ప్రజలు అర్థం చేసుకోవాలి. ఇలా.. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలు, ఇప్పుడు లోక్సభ ఎన్నికల మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీలను పోల్చిచూస్తే మోసం తప్ప మరేం కనిపించడం లేదు. అలవిగాని హామీలు ఇచ్చి ప్రజలను మభ్యపెట్టడం, అధికారం చేజిక్కిన తర్వాత నట్టేట ముంచడం కాంగ్రెస్కు అలవాటే. తరాలు మారినా కాంగ్రెస్ బుద్ధి మాత్రం మారడం లేదు.
(వ్యాసకర్త: కన్వీనర్, బీఆర్ఎస్ సోషల్ మీడియా విభాగం)
– వై.సతీష్రెడ్డి 96414 66666