హైదరాబాద్ : బీఆర్ఎస్ హయాంలో నిర్మించిన డబుల్ బెడ్ రూం ఇండ్ల ( Double-Bedroom Houses ) పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను బీఆర్ఎస్ మాజీ మంత్రి, ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ( Talasani Srinivas Yadav ) తిప్పికొట్టారు. దమ్ముంటే తమతో వస్తే తాము కట్టిన ఇండ్లను, ఉంటున్న ప్రజలను చూపిస్తామని అన్నారు. శుక్రవారం తెలంగాణ భవన్లో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో తలసాని మాట్లాడారు.
హైదరాబాద్ నగరంలో 69 వేల డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను బీఆర్ఎస్ హయాంలోనే పూర్తి చేశామని గుర్తు చేశారు. ఢిల్లీలో ఐఏఎస్,ఐపీఎస్ ఆఫీసర్ల క్వార్టర్స్ ఈ విధంగా లేవని నాటి గవర్నర్ డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను మెచ్చుకున్నారని తెలిపారు. కొల్లూరులో ఒక్క చోటే 16 వేల ఇండ్లను కట్టామని వెల్లడించారు. నాటి డిప్యూటీ ఫ్లోర్ లీడర్, ప్రస్తుత డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను చూపించిన విషయాన్ని చూపించామని వెల్లడించారు.
కేసీఆర్ కట్టించిన డబుల్ బెడ్ రూమ్ యూనిట్ కాస్ట్ రూ. 9.50 లక్షలు కాగా లబ్దిదారుడికి ఉచితంగా అందించామని స్పష్టం చేశారు. ప్రభుత్వం ఇస్తామని అంటున్న ఇందిరమ్మ ఇళ్లకు లబ్దిదారుడు 6 లక్షలు కట్టాలని అంటోందని, అప్లికేషన్ కు మరో 10 వేలు ఇవ్వాలని మేలిక పెట్టారని ఆరోపించారు. ఒక్కో లబ్దిదారుడికి ఎన్ని గజాల్లో నిర్మించి ఇస్తారోనన్న విషయాన్ని ఎక్కడా ప్రస్తావించలేదని ఆరోపించారు. ఉమ్మడి రాష్ట్రంలో అప్లికేషన్ కు 10 వేల రూపాయలు వసూలు చేసి ఇండ్లను ఇవ్వలేదని విమర్శించారు.
పేదవారి భూములను, ఇండ్లను 22 ఏ ద్వారా నిషేదిత జాబితాలో పొందుపరిచిన ఘనత సీఎం రేవంత్ రెడ్డికే దక్కుతుందని ఆరోపించారు. ఏమి తేలియనట్లు 22 ఏపై మీ భూమి మీకే ఇప్పిస్తా అని సీఎం ప్రకటించడం ఆయన ద్వందవైఖరికి నిదర్శనమని పేర్కొన్నారు. ప్రజల భూమి ప్రజలకు ఇవ్వడానికి రేవంత్ రెడ్డి ఎవరని ప్రశ్నించారు. 22 ఏలో ఉన్న భూములను ఎత్తివేసేందుకు 30 నుంచి 40 శాతం కమీషన్లు వసూలు చేస్తున్నారని విమర్శించారు. బాధ్యత గల సీఎం పదవిలో ఉన్న రేవంత్ రెడ్డి క్షుద్ర పూజల గురించి మాట్లాడడం శోచనీయమని అన్నారు.