‘మనసా, వాచా, కర్మేణ’ అన్నది త్రికరణం. అంటే మనసు తోటి, మాట తోటి, ప్రవర్తన తోటి అని అర్థం. మనసులో ఒకటి అనుకుని ఇంకొకటి మాట్లాడటం, ఒకటి మాట్లాడి ఇంకొక తీరుగా చెయ్యటమన్నది మోసం, పాలన కాదు. మరి ప్రజాస్వామ్యం అంటే ప్రజల కోసం, ప్రజల చేత ఎన్నుకోబడ్డ నాయకుల పాలన అని అర్థం. మరి ఏరు దాటాక బోడి మల్లన్నలే వీళ్లంతా! వారి మాటలు నమ్మి ప్రజలు వారిని ఎన్నుకుంటే ఏమవుతుంది? ఇండియాకు, తెలంగాణకు ఏమైందో,అదే అవుతుంది.
తెలంగాణను 1948లో భారత్లో విలీనం చేయడమే మోసం ద్వారా జరిగింది. నిజామునే పరిపాలకుడిగా ఉంచుతామని కేఎం మున్షీ ద్వారా కబురు పెట్టిన నెహ్రూ, నిజాం సంతకం చేసి విలీనం ప్రకటించగానే సైనిక చర్యతో తెలంగాణను స్వాధీనం చేసుకోవటం, భారత మిలిటరీ తెలంగాణలో చేసిన అకృత్యాలు.. ఆ తర్వాత తెలంగాణ తొలి, మలి దశ ఉద్యమాల్లో వందలాది ఉద్యమకారుల మరణాలకు కారణం కావడం..2004 ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రం ప్రకటిస్తామని ప్రమాణం చేయడం, 2009లో రాష్ట్ర ప్రకటన చేసి వెనక్కి తీసుకోవటం…ఇలా కాంగ్రెస్ పార్టీ తెలంగాణకు చేసిన మోసాలు ఎన్నో. మరి ఇన్ని మోసాలు చేసిన కాంగ్రెస్ పార్టీ, దాదాపు 55 ఏండ్ల పాలనలో మూడు తరాల తెలంగాణ వారికి కలిగిన నష్టం, పడ్డ కష్టం- 1200 మంది యువత ప్రాణత్యాగం – వీటన్నిటికీ ఎంత ఖరీదు కట్టాలి? ఇదే పార్టీ ఇప్పుడేమంటుందో చూద్దాం!
వంద తిట్లు తిట్టిన శిశుపాలుడు శ్రీ కృష్ణుడిని సహాయమడిగినట్టుగా ఉంది కాంగ్రెస్ పార్టీ చేవెళ్ల ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్! ఎందుకంటే కృష్ణుడు శిశుపాలుడి తల్లికి మాట ఇచ్చాడు, తనని తిట్టినా వంద తిట్ల దాకా భరిస్తానని! మరి మనం కూడా 55 ఏండ్లు భరించాం కదా! ఇన్ని దశాబ్దాలలో రాని బ్రహ్మాండమైన ఆలోచనలు, వేరే కాంగ్రెస్ పాలిత రాష్ర్టాల్లో ఎక్కడా లేని పథకాలు తెలంగాణలో ఎందుకు ప్రకటించినట్టు? ఇవన్నీ ఏరు దాటించే ఓడలేనా? చూద్దాం!
పైన చెప్పిన మీ అద్భుత పథకాలన్నీ ఒక ఎత్తయితే, మీ పార్టీకి తెలివి చెప్పిన ఒక అద్భుత వ్యక్తి ఒక్కరూ ఒక ఎత్తు. వారే దళిత కుటుంబంలో పుట్టి స్కూలులో మంచి నీళ్లు కూడా తాగకుండా నిషేధానికి గురైనా, కష్టపడి చదువుకొని, న్యాయ, ఆర్థిక శాస్ర్తాల్లో డాక్టరేట్ పట్టా పొంది, నెహ్రూ కోరిక మేరకు రాజ్యాంగం రాసిన బాబా సాహెబ్ అంబేద్కర్!
డాక్టర్ అంబేద్కర్కు ప్లానింగ్ కమిషన్ అధ్యక్షుడిగా స్థానం ఇస్తే దేశం ఇంకా బాగుపడేది కదా! ఆయన కోరుకున్నదీ అదే! ఒక గొప్ప దార్శనికుడు, మేధావి తెలివితేటలతో దేశంలోని అన్ని రంగాలు బాగుపడేవి! దళితుల అభ్యున్నతి, రక్షణ కోసం మరిన్ని చర్యలు తీసుకోమని అంబేద్కర్ కోరితే మీ పార్టీ అధికారంలో ఉన్న కేంద్ర ప్రభుత్వం తీసుకోలేదు. హిందూ కోడ్ బిల్లు విషయంలో మీ పార్టీ యూ టర్న్ తీసుకుంది. దీంతో మీకు సలహాలిచ్చిన అంబేద్కర్కు అవమానాలే ఎదురయ్యాయి. మనసు నొచ్చుకొని ఆయన కేంద్ర న్యాయ శాఖ మంత్రి పదవికి రాజీనామా చేశారు.
మరి అకస్మాత్తుగా ఈ వర్గాల మీద కాంగ్రెస్ పార్టీకి ఇంత ప్రేమ ఎందుకు పుట్టుకొచ్చిందో ప్రజలు అర్థం చేసుకోవాలి. ప్రపంచంలో మోసాలు చేసేవాళ్లు ఉండటం చాలా సహజం. ఎన్నికలవేళ ప్రజలు ఈ పార్టీ గతాన్ని గుర్తు పెట్టుకోవాలి. ప్రస్తుతం వారు ప్రకటించిన పథకాల్లో ఒక్కటైనా వారి పాలనలోని రాష్ర్టాల్లో ఉందా? ఉంటే ఎలా నడుస్తున్నది కనుక్కోవాలి. మాటలు ఉన్నట్టు చేతలు లేనివాళ్ల ఆలోచనలు అర్థం చేసుకొని ఓటు హక్కు సక్రమంగా వినియోగించుకోవాలి.
-కనకదుర్గ దంటు
89772 43484