హైదరాబాద్, ఆగస్టు 18 (నమస్తే తెలంగాణ) : ప్రభుత్వ, ప్రైవేట్ మెడికల్ డెంటల్ కాలేజీల్లో 2026-27 విద్యా సంవత్సరానికి కన్వీనర్ కోటా కింద ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియను కాళోజీ వర్సిటీ పున:ప్రారంభించింది. అభ్యర్థుల నుంచి వచ్చిన పలు అభ్యర్థనలను పరిగణనలోకి తీసుకుని ఆన్లైన్ రిజిస్ట్రేషన్కు మరో అవకాశం కల్పించినట్టు వర్సిటీ రిజిస్ట్రార్ తెలిపారు.
నీట్ యూజీ-2026 నిర్ణీత కటాఫ్ స్కోర్ లేదా అంతకంటే ఎక్కువ మార్కులు సాధించి అర్హత పొందిన అభ్యర్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు. ఆన్లైన్ రిజిస్ట్రేషన్, సర్టిఫికెట్ల అప్లోడ్ ప్రక్రియ మంగళవారం మధ్యాహ్నం 2 గంటల నుంచి ఈ నెల 20న సాయంత్రం 6 గంటల వరకు కొనసాగుతుందని అధికారులు తెలిపారు. ఇప్పటికే తమ దరఖాస్తులు సమర్పించిన అభ్యర్థులు మళ్లీ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన అవసరం లేదని వర్సిటీ స్పష్టంచేసింది. https://tsmedadm.tsche.in వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని అధికారులు సూచించారు.