హైదరాబాద్, ఆగస్టు 18 (నమస్తే తెలంగాణ) : టెట్ పరీక్షకు హాజరయ్యే ఇన్ సర్వీస్ టీచర్స్కు కొత్త చిక్కు వచ్చిపడింది. సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్(సీ టెట్) పరీక్ష తెల్లారే టీజీ టెట్(ఇన్ సర్వీస్) పరీక్షలు ప్రారంభంకానున్నాయి. దీంతో రెండు పరీక్షలకు హాజరయ్యే వారికి టెన్షన్ పట్టుకున్నది. సెప్టెంబర్ 6న సీటెట్ ఎగ్జామ్ను జాతీయంగా నిర్వహించనున్నారు. టీజీ టెట్ పరీక్షలను సెప్టెంబర్ 7 నుంచి 11 వరకు నిర్వహించనున్నారు.
సీటెట్ పరీక్ష తెల్లవారే టీజీ టెట్ పరీక్షలు ప్రారంభంకానున్నాయి. కొందరు అటు సీటెట్, టీజీ టెట్ రెండు పరీక్షలు రాసేవారున్నారు. రెండు పరీక్షలకు మధ్య ఒక రోజు వ్యవధి మాత్రమే ఉండటంతో సదరు అభ్యర్థుల్లో కలవరం మొదలయ్యింది. తెలంగాణ వారికి విజయవాడ, ఏపీలోని పలు పట్టణాల్లో సెంటర్లు కేటాయిస్తున్నారు. ఇలా సెంటర్లు దూరంగా పడితే ఇబ్బందులు పడా ల్సి వస్తుందని కొందరు టీచర్లంటున్నారు. టీజీ టెట్ పరీక్షల షెడ్యూల్ మార్చాలని కోరుతున్నారు.