మార్పు రాగం అందుకున్న కాంగ్రెస్, బద్ధ శత్రువు అంటూనే చేతిలో చెయ్యేసి హస్తం పార్టీతో అక్రమ సంబంధం పెట్టుకున్న బీజేపీ ఎన్నికల వేళ ఒకటయ్యాయి. కొందరు రాజకీయ నిరుద్యోగులు, కుహనా మేధావులు ఆ పార్టీలకు జతకలిశారు. వారంతా కలిసి అబద్ధాలే ఎజెండాగా నీతి లేని పోరాటం చేశారు. వాళ్ల మాయమాటలను నమ్మిన ప్రజలు ఓట్లేసి అందలం ఎక్కించారు. అయితే, వారి అసలు బుద్ధి ఇప్పుడు బయటపడింది. కొత్త ప్రభుత్వం కొలువై వంద రోజులు కూడా గడవకముందే ‘నిండా మునిగినం’ అని ప్రజలు బాధపడుతున్నారు. ‘ఓటేసి మోసపోయినం, గోసపడుతున్నం’ అని పశ్చాత్తాపపడుతున్నారు.
మార్పు మంత్రం జపించిన నాటి కుహనా మేధావులు ఇప్పుడెందుకు ప్రశ్నించడం లేదు. సర్వరోగ నివారిణి జిందా తిలిస్మాత్ అన్నట్టు.. ‘అన్నిటికీ గడువు డిసెంబర్ తొమ్మిదో తారీఖు’ అని నాటి పీసీసీ అధ్యక్షుడు, నేటి ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి స్వయంగా చెప్పారు. తొమ్మిదో తారీఖు ప్రజల జీవితాలను మార్చేస్తుందని ఢంకా బజాయించారు. ఆయనతో పాటు ఈ కుహనా మేధావులు కూడా రాష్ట్రమంతా ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చారు. వాళ్ల ఆశలు, కోరికలు ఫలించాయి. అధికారంలోకి వచ్చారు. అయితే నాడు కేసీఆర్పై, బీఆర్ఎస్ ప్రభుత్వంపై కోటిన్నొక్క అబద్ధాలు చెప్పి, ప్రజల మనసులో విషం నింపిన కుహనా మేధావులు నేడు ఎందుకో రేవంత్ సర్కార్ను ప్రశ్నించడం లేదు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీయడం లేదు. ‘మీరు చెప్పిన డిసెంబర్ తొమ్మిదో తారీఖు దాటి మూడు నెలలు గడిచిపాయే’ అని ఒక్కరూ సీఎం రేవంత్రెడ్డికి గుర్తు చేయడం లేదు. కాంగ్రెస్ పాలనలో ప్రజలు ఆగమాగం అయితుండ్రు, గగ్గోలు పెడుతుండ్రు అని ఎవరూ చెప్పడం లేదు. రైతు భరోసా ఏమైంది, కనీసం రైతుబంధు అయినా సరిగ్గా ఇవ్వడం లేదు, అడిగితే చెప్పుతో కొడ్తానని మంత్రులే అంటున్నారు అని ఒక్కరూ అడగటం లేదెందుకు? హస్తం సర్కార్ను ప్రశ్నించే దమ్ము ఈ కుహనా మేధావులకు లేదా? ప్రజల నేటి కష్టాలకు కుహనా మేధావులే కారణం. వారి మాయమాటలు నమ్మి మోసపోయిన ప్రజలు నేడు నిస్సహాయ స్థితిలో ఉన్నారు. ఎవరికీ చెప్పుకోలేక, ఎవరినీ అడగలేక వేదన పడుతున్నారు. అదానీ, మోదీ ద్వయం దేశానికి ప్రమాదకరమని రాహుల్గాంధీ చెప్తుంటే.. రేవంత్రెడ్డి అదానీకి స్వాగతం పలుకుతున్నారు. అయినా ఈ మేధావులు ప్రశ్నించడం లేదు.
ఏం ఆశించి అబద్ధాల పునాదులపై కాంగ్రెస్ను గద్దెనెక్కించారో ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. లేదంటే ప్రజాగ్రహం చవిచూడాల్సి ఉంటుంది. కుహనా మేధావుల మోసాలను గుర్తు చేసుకుంటూ రాబోయే రోజుల్లో ప్రతి గ్రామం అట్టుడికిపోతుంది. ప్రజల ఆగ్రహజ్వాలల్లో వారంతా సమిధలు కాకతప్పదు.
మరోవైపు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తీసుకొస్తున్న మార్పులను చూసి ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు. కేసీఆర్ను కించపరుస్తూ ఆయన ప్రయోగిస్తున్న పదజాలం గురించి తెలంగాణ ప్రజలు చర్చించుకుంటున్నారు. అబద్ధాలతోనే సర్కార్ను కూడా రేవంత్రెడ్డి నెట్టుకొస్తుండటం విడ్డూరం. తెలంగాణ తల్లి విగ్రహాన్ని కేసీఆర్ రూపొందించలేదనే విషయం అందరికీ తెలిసిందే. ఉద్యమ సమయంలో కవులు, కళాకారుల ఆలోచనల మేరకు రూపొందించినదే తెలంగాణ తల్లి విగ్రహం. తెలంగాణ ఆడబిడ్డలు నగలు వేసుకోకూడదా? ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులు మాత్రమే నగలు ధరించాలా? మన చరిత్రను భవిష్యత్తు తరాలకు తెలిపేలా ఉన్న రాష్ట్ర ముద్రను తొలగిస్తామనడం హేయమైన చర్య. మన మూలాలను మరిచిపోవడం సరికాదు. వీటిపై మేధావి వర్గం స్పందించాలి.
గతంలో కేసీఆర్ను, ఆయన కుటుంబ సభ్యులను కొంతమంది కావాలనే అవహేళన చేశారు. కేసీఆర్పై కోపంతో తెలంగాణను అవమానించారు. ‘గడీల పాలన, దొరల పాలన’ అంటూ ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. అయినప్పటికీ కేసీఆర్ ఎవరినీ నిందించలేదు. కక్షసాధింపులకు దిగలేదు. పంటి బిగువున బాధను భరిస్తూ ముందుకుసాగారు కేసీఆర్. అయితే నేడు పరిస్థితులు మారిపోయాయి. ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రిని, కాంగ్రెస్ను ప్రశ్నించినవారిపై కేసులు పెడుతున్నారు. బెదిరిస్తున్నారు. దాడులు చేస్తున్నారు. ఇదేనా మార్పు?
మార్పు.. మార్పు అని నాడు ప్రచారం చేసినవాళ్లంతా నేడు పదవుల కోసం పాకులాడుతున్నారు. పాలకుల పంచన చేరి భజన చేస్తున్నారు. ప్రజలు ఇబ్బందులు పడుతున్నా వారికి పట్టడం లేదు. ప్రజల జీవితాలతో చెలగాటమాడుతున్న కుహనా మేధావులను ప్రజలే నిలువరించాలి. లేకపోతే ఆదర్శ తెలంగాణ ఆగమైపోతుంది. తెలంగాణ బిడ్డలారా తెలంగాణ ఉద్యమాన్ని ఆదర్శంగా తీసుకుని మరో ఉద్యమానికి సిద్ధం కావాల్సిన తరుణం వచ్చింది. ప్రజలు, మేధావులు తరలిరావాలి.. తెలంగాణను కాపాడుకోవాలి.
-గోగుల రవీందర్రెడ్డి
95022 52229