‘మాజీ ప్రధాని పీవీ నరసింహారావు అంత్యక్రియలు ఢిల్లీలో నిర్వహించడానికి కాంగ్రెస్ పెద్దలు అంగీకరించలేదు. కనీసం ఆయనకు ఘాట్ ఏర్పాటుచేయడానికి ఢిల్లీలో గజం జాగ ఇవ్వకుండా అవమానించింది కాంగ్రెస్ కాదా?’ అని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు అసెంబ్లీలో ఆవేదన వ్యక్తం చేశారు.ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ సీనియర్ నేత, ఎమ్మెల్సీ టీ జీవన్రెడ్డి స్పందిస్తూ ‘పీవీ అంత్యక్రియలు హైదరాబాద్లో నిర్వహించాలని ఆయన కుటుంబసభ్యులే కోరారు. దీంట్లో కాంగ్రెస్ తప్పేమీ లేదు’ అని సమర్థించుకోజూశారు. పీవీ అంత్యక్రియల విషయంలో హరీశ్రావు ఆరోపణ వాస్తవమా? లేక జీవన్రెడ్డి వాదన నిజమా?. ఇందులో ఏది నిజం? ఏది అబద్ధం? వాస్తవాన్ని నిగ్గుతేల్చే వ్యాసం ఇది. పీవీ నరసింహారావు రాజకీయ ప్రస్థానంపై ఈ వ్యాసకర్త రాసిన ‘వేయిపడగల మేధావి’ పుస్తకంలో అప్పటి ఉదంతాన్ని వివరించారు.
అంత్యక్రియలపై… అసలేం జరిగింది?
ఆ రోజు డిసెంబర్ 23, 2004. ఢిల్లీ ఎయిమ్స్లో చికిత్స పొందుతూ పీవీ నరసింహారావు తుదిశ్వాస విడిచారు. పీవీ మరణవార్త తెలియగానే అనంతపురం పర్యటనలో ఉన్న సీఎం వైఎస్ రాజశేఖర్రెడ్డి హుటాహుటిన ఢిల్లీకి బయల్దేరారు. పీవీ పార్థివదేహానికి నివాళులర్పించడానికి వచ్చిన ప్రధాని మన్మోహన్ సింగ్, హోంమంత్రి శివరాజ్ పాటిల్, గులాంనబీ ఆజాద్, అంత్యక్రియలు ఎక్కడ నిర్వహించాలని అనుకుంటున్నారని పీవీ కుమారుడు ప్రభాకర్రావును ఆరా తీశారు. నాన్న చివరి కోరిక మేరకు ఢిల్లీలోనే నిర్వహిస్తామని ఆయన చెప్పారు. ఇక్కడి కంటే హైదరాబాద్లో అయితే బెటర్… ఇక్కడి (ఢిల్లీ) వరకు ఎవరు వస్తారు, అక్కడికైతే అందరూ వస్తారని వారు సూచించారు.
‘ఇది నా ఒక్కడి నిర్ణయం కాదు, మా కుటుంబమంతా ఢిల్లీలోనే నిర్వహించాలి’ అని అంటున్నారని ప్రభాకర్రావు గుర్తుచేశారు. అక్కడి నుంచి వెళ్లిపోయిన కాంగ్రెస్ పెద్దలు సీఎం వైఎస్ ఎక్కడ ఉన్నారని ఆరా తీశారు. అనంతపురం నుంచి ఢిల్లీకి వస్తున్నట్టు సమాచారం ఇచ్చారు. ‘త్వరగా వచ్చేయండి… పీవీ అంత్యక్రియలు హైదరాబాద్లో జరిగేలా వారి కుటుంబసభ్యులను ఒప్పించాలి’ అని ప్రభాకర్రావుతో జరిగిన సంభాషణను వారు వివరించారు.
కాంగ్రెస్ పెద్దల అభిప్రాయం వైఎస్కు కాంగ్రెస్ అధిష్ఠానం ఆదేశంగా అర్థమైంది. ఆ మరుక్షణం వైఎస్ కేంద్రమంత్రి వెంకటస్వామికి ఫోన్ చేసి పీవీ కుమారుడు ప్రభాకర్రావుతో మాట్లాడించమని కోరారు. అంత్యక్రియల నిర్వహణపై పార్టీ పెద్దలకు చెప్పిందే ఆయన వైఎస్కూ చెప్పారు. ‘ప్రభాకర్ తొందరపడవద్దు నేను కాసేపట్లో ఢిల్లీకి వస్తున్నా, వచ్చాక మాట్లాడుకుందాం’ అని వైఎస్ అన్నారు. సాయంత్రం 7 గంటలకు ఢిల్లీకి చేరుకున్న వైఎస్ నేరుగా పీవీ ఇంటికి వచ్చారు. ప్రభాకర్రావును పక్కకు తీసుకెళ్లి అంత్యక్రియల ప్రస్తావన మళ్లీ తీసుకువచ్చారు. ఢిల్లీలోనే అంత్యక్రియలు జరగాలనే తమ తండ్రి చివరి కోరిక అని ఆయన మరోసారి గుర్తుచేశారు.
‘ఇదిగో ప్రభాకర్, ఇక్కడికి ఎవరొస్తారు, హైదరాబాద్లో అయితే నాన్న అభిమానులు, మనవాళ్లంతా (కార్యకర్తలు, నాయకులు) వస్తారు. అక్కడ మన ప్రభుత్వం ఉంది. అంత్యక్రియలు చరిత్రలో నిలిచిపోయేలా నిర్వహిద్దాం, నా మాట విను’ అని అన్నారు. అయినా ప్రభాకర్రావు ఏ మాత్రం మెత్తబడలేదు. దీంతో అక్కడినుంచి వైఎస్ వెళ్లిపోయారు. అదేరోజు రాత్రి రాష్ర్టానికి చెందిన కేంద్రమంత్రులు, ఎంపీలను తన ఇంట్లో జరిగే సమావేశానికి రావాల్సిందిగా హోంమంత్రి శివరాజ్ పాటిల్ ఆహ్వానించారు. రాత్రి పది, పదిన్నర గంటలకల్లా వైఎస్తో పాటు కేంద్ర మంత్రులు, రాష్ర్టానికి చెందిన ఎంపీలంతా శివరాజ్ పాటిల్ ఇంటికి చేరుకున్నారు.
ఒక మాజీ ప్రధానికి అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించడం అనేది ప్రొటోకాల్. ఏ పార్టీ ప్రభుత్వం అయినా దానిని పాటించాల్సిందే. పీవీ పట్ల కాంగ్రెస్ పార్టీకి అపారమైన గౌరవమే ఉంటే ఆయన జయంతి, వర్ధంతిని అధికారికంగా ఎందుకు నిర్వహించలేదన్నది ప్రశ్న.
అప్పుడు కాంగ్రెస్కుమిత్రపక్షంగా ఉన్న టీఆర్ఎస్కు కూడా ఆహ్వానం అందడంతో హన్మకొండ ఎంపీ బోయినపల్లి వినోద్కుమార్ కూడా ఆ సమావేశానికి హాజరయ్యారు. అప్పుడు ఢిల్లీలో ఎముకలు కొరికే చలి. అయినప్పటికీ పార్టీ అగ్రనేతల నుంచి పిలుపు కావడంతో అందరూ హాజరయ్యారు. అగ్రనేతలు ప్రణబ్ ముఖర్జీ, గులాంనబీ ఆజాద్, అహ్మద్ పటేల్ కూడా రాగానే.. ‘ఇక మొదలుపెట్టండని’ శివరాజ్ పాటిల్ సూచించారు. ‘అంత్యక్రియలు ఢిల్లీలో కాకుండా హైదరాబాద్లో నిర్వహించడం సమంజసంగా ఉంటుంది’ అని వైఎస్ చర్చ ప్రారంభించారు.
వైఎస్ ప్రతిపాదనపై ఎవరూ నోరు మెదపలేదు. వారి మౌనం అంగీకారంగా వైఎస్ భావించారు. పార్టీ అధిష్ఠానం ఒక నిర్ణయానికి వచ్చే ఎంపీలతో ‘మమ’ అనిపించడానికే ఈ సమావేశం ఏర్పాటు చేసినట్టు అక్కడికి వచ్చినవారికి అర్థమైంది. పీవీ కుటుంబసభ్యుల నిర్ణయాన్ని పక్కనపెట్టి కాంగ్రెస్ పెద్దలు ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవడం ఏంటని ఎంపీ వినోద్కుమార్ ఆశ్చర్యానికి గురయ్యారు. పీవీ కుటుంబం తరపున ఆ సమావేశానికి వచ్చిన కరీంనగర్ జిల్లాకు చెందిన కర్ణాటక హైకోర్టు చీఫ్ జస్టిస్ ఎర్రబాటి భాస్కర్రావు కూడా కాంగ్రెస్ పెద్దల మనసులో ఏముందో అర్థం కావడంతో మౌనంగా ఉండిపోయారు.
‘మేము (పీవీ కుటుంబ సభ్యులం) 30 మంది ఉన్నాం, హైదరాబాద్ వెళ్లడానికి ఒక చార్టర్ ఏర్పాటు చేయండి’ అని భాస్కర్రావు అడిగారు. ‘అదేమంత పని.. అలాగే చేద్దాం’ అని శివరాజ్ పాటిల్ అన్నారు. అంత్యక్రియలు హైదరాబాద్లో జరిగేలా ఒప్పించడం అవుతుందా? కాదా? అని శివరాజ్ పాటిల్ ఎంత టెన్షన్ పడ్డారో? ఆ ఒత్తిడికి కారణం ఎవరు?
గాంధీభవన్ ట్రస్టుకు చైర్మన్ కూడా అయిన పీవీ భౌతికకాయాన్ని చూడటానికి గాంధీభవన్ కూడా నోచుకోలేకపోయింది. ప్రజల సందర్శనార్థం పీవీ భౌతికకాయాన్ని గాంధీభవన్లో ఉంచుతామని ఢిల్లీలో శివరాజ్ పాటిల్, వైఎస్ రాజశేఖర్రెడ్డి ప్రకటించినప్పటికీ, గాంధీభవన్కు పీవీ భౌతికకాయాన్ని తరలించడానికి అనుకోని అవాంతరాలు అడ్డువచ్చాయి. పీవీ మరణం తర్వాత కాంగ్రెస్ ఆయనను అవమానించిన తీరు ఎందరినో కలచివేసింది. ఒక పథకం ప్రకారమే ఢిల్లీలో పీవీ అంత్యక్రియలు జరగనీయలేదన్నది పీవీ కుటుంబసభ్యుల ఆరోపణ. దీని వెనుక పెద్ద హైడ్రామానే నడిచినట్టు వారు భావిస్తున్నారు.
పీవీని కేంద్ర, రాష్ట్ర పభుత్వాలు అగౌరవపరచలేదని, అధికార లాంఛనాలతోనే అంత్యక్రియలు నిర్వహించామని కాంగ్రెస్ నేతలు వాదించారు. ఒక మాజీ ప్రధానికి అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించడం అనేది ప్రొటోకాల్. ఏ పార్టీ ప్రభుత్వం అయినా దానిని పాటించాల్సిందే. పీవీ పట్ల కాంగ్రెస్ పార్టీకి అపారమైన గౌరవమే ఉంటే ఆయన జయంతి, వర్ధంతిని అధికారికంగా ఎందుకు నిర్వహించలేదన్నది ప్రశ్న.
పీవీ మరణించిన తర్వాత దశాబ్దకాలం పాటు కేంద్రంలో, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోనే ఉండి కూడా అన్ని పార్టీలు పీవీకి భారతరత్న ఇవ్వాలని డిమాండ్ చేసినా పట్టించుకోకపోవడమూ మరో తప్పిదం. ఇప్పటివరకు భారతరత్న పొందినవారి కంటే పీవీకి ఉన్న యోగ్యతలు ఎక్కువే కానీ తక్కువేమీ కాదన్నది జగమెరిగిన సత్యం. ఇక్కడ ఒక్కటి మాత్రం నిజం. పీవీ పట్ల కాంగ్రెస్ వ్యవహరించిన తీరు, చేసిన తప్పులు ఆ పార్టీకి చరిత్రలో ఎప్పటికీ మాయని మచ్చగానే మిగిలిపోతాయి.
వెల్జాల చంద్రశేఖర్
98499 98092