Telangana | నైజాం రాష్ట్రం (తెలంగాణ) భారతదేశంలో విలీనమైనప్పటి నుంచి ఈ ప్రాంతం మీద గత 75 ఏండ్లుగా అప్రతిహతంగా సాగుతున్న అన్యాయాలకు ఆద్యుడు జవహర్లాల్ నెహ్రూ! అసలు దేశంలో ఈ ప్రాంత కలయికే అబద్ధాల మీద జరిగింది. నిజాం మీద ఒకవైపు సాయుధ పోరాటం, ఇంకోవైపు రజాకార్ల ఒత్తిడి ఉన్నప్పుడు నిజాంకు కేఎం మున్షీ అనే పెద్దమనిషితో నెహ్రూ ఒక వర్తమానం పంపాడు. మున్షీ.. భారతీయ విద్యాభవన్ స్థాపకుడు, రచయిత, స్వాతంత్య్ర పోరాటయోధుడు, అందరూ గౌరవించే న్యాయవాది.
నిజాంకు నెహ్రూ పంపిన వార్త ఏమిటంటే.. హైదరాబాద్ రాష్ర్టాన్ని భారతదేశంలో విలీనం చేస్తే, నిజాం తన రాష్ర్టాన్ని తానే స్వతంత్రతతో పాలించుకోవచ్చని, ఈ వ్యతిరేకుల నుంచి భారతదేశం ఆయనను కాపాడుతుందని. అయితే ఈ మాట వినటానికి బాగుంటుంది. కానీ, ఆ వెనుక సర్దార్ పటేల్తో నెహ్రూ చెప్పిన మాట సరిగ్గా దీనికి వ్యతిరేకం. నిజాం రాజు కలవటానికి ఒప్పందం మీద సంతకం చేయగానే భారత సైన్యంతో నిజాం రాష్ర్టాన్ని ఆక్రమించమని పటేల్కు చెప్పారు నెహ్రూ. అంతేకాదు, కేఎం మున్షీని నిజాంకు కనపడకుండా ఆ సమయానికి వెళ్లిపోమని చెప్పాడు. తర్వాత చరిత్ర తెలిసిందే! సుసంపన్న దేశంగా వెలిగిన నిజాం రాష్ర్టాన్ని మిలిటరీ ఆక్రమించి, నిజాంను రాజ్ప్రముఖ్గా మార్చి, 1953 దాకా మిలిటరీ పాలనలో చేయని అకృత్యం లేదు. రజాకార్లు 3,000 మందిని చంపితే, సైన్యం దాడుల్లో 30,000 మంది హైదరాబాదీలు చనిపోయినట్టు అంచనా.
1952లో ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికలు జరిగి తెలంగాణ ప్రాంతం కొద్దిగా ఊపిరి తీసుకునేసరికి అన్యాయం చేయటానికి నెహ్రూకు ఇంకో అవకాశం కలసివచ్చింది. భావసారూప్యత, భాషా సారూప్యత లేని ఆంధ్ర ప్రాంతాన్ని తెలంగాణతో కలిపి రెండో ఘోరమైన అన్యాయం చేశాడు. అమాయకురాలు, అమిత భాగ్యవంతురాలైన ముక్కు పచ్చలారని పిల్లని, అడుక్కుతింటున్న ఒక అల్లరి పిల్లాడికి ఇచ్చి పెళ్లి చేస్తున్నానని ప్రకటన చేసి మరీ తెలంగాణకు తీరని అన్యాయం చేశాడు నెహ్రూ ఆంధ్రా లాబీకి లొంగి!
మొదటిసారి నెహ్రూ చేసిన అన్యాయం నాలుగేండ్లయితే, రెండోసారి చేసిన ఘోరం 44 ఏండ్లు అనుభవించింది తెలంగాణ. నెహ్రూ వారసులు ఒక్కొక్కళ్లు చేసిన అన్యాయాలు తక్కువేం లేవు. పుష్కరకాలం భరించి, ఇక తాళలేక 1969లో ప్రపంచంలోనే అతి సుదీర్ఘ ఉద్యమం 9 నుంచి 10 నెలలు చేస్తే.. దానికి కాంగ్రెస్ ముఖ్యమంత్రి బ్రహ్మానందరెడ్డి.. విశ్వవిద్యాలయంలో ఉన్నత చదువులు చదువుతున్న 369 మంది ప్రాణాలు ప్యారడైజు రోడ్డు మీద హరించి, వారి రక్తం ఏరులై పారితే దానితో ఇందిరాగాంధీకి తర్పణాలర్పించారు. నెహ్రూ కూతురు ఇందిరాగాంధీ ఏమీ తక్కువ తినలేదు.
తెలంగాణకు జరిగిన అన్యాయాల మీద వేసిన కమిటీలను తొక్కిపెట్టింది. లలిత్ భార్గవ్ కమిటీల్లాంటివి 1957 నుంచి తెలంగాణకు జరిగిన అన్యాయాలు, అగ్రిమెంట్ల ఉల్లంఘన విశదంగా వివరించినా, ఆవిడ లెక్కచేయలేదు. కంటి తుడుపుకి చెన్నారెడ్డిని ముఖ్యమంత్రిని చేసినా, ఆంధ్రా కుటిల రాజకీయ నాయకులు ఆయననీ పాలన చేయనీయకుండా టర్మ్ కాకుండానే దింపించేశారు. ఇక తర్వాత తెలుగుదేశం పాలన తెలంగాణ దోపిడీకే పనికివచ్చింది.
రెండెకరాల ఆసామి లక్ష కోట్ల రూపాయలు సంపాయించుకున్నాడు. అంతేకాదు, తెలంగాణ వారినే తెలంగాణకు వ్యతిరేకంగా తీర్చిదిద్దాడు. వారందరిలో బాబు పాఠాలు బాగా నేర్చుకున్నవాడు ప్రస్తుత ముఖ్యమంత్రి. సోనియాగాంధీ కాలంలో 1200 మంది బలిదానాలు ఆయనకు కనపడవు. ఆవిడ వారసులు రాహుల్, ప్రియాంక చెప్పిన అబద్ధాలు పదేపదే చెప్పి అధికారంలోకి వచ్చాడు. ఇదివరకటి కాంగ్రెస్ పాలనలోని అన్యాయాలు గుర్తులేని వారికీ, తెలియనివారికీ ఈయన పాలనలో తెలంగాణ పట్ల కాంగ్రెస్ ఎటువంటి మోసాలు చేస్తుందో తెలియదు కదా! మరి అసెంబ్లీ ఎలక్షన్లలో ఆయన మాటలు నమ్మి బోర్లా పడ్డాం.
మరి ఈ పథకాలన్నీ పార్లమెంట్ ఎన్నికలకు ముడిపెట్టి ‘ఆగస్టులో ఇస్తాం, సెప్టెంబర్లో ఇస్తాం’ అంటే మళ్లీ మాయల ఫకీరుని నమ్మి బోర్లాపడదామా? 1948 నుంచి ప్రతి విషయంలో మోసం చేస్తున్న కాంగ్రెస్ పార్టీకి ఒక్క సీటు కూడా రాకుండా చేసి బుద్ధి చెబుదామా? ఇంత వెంటవెంటనే మోసపోయేటంత తెలివి తక్కువదా తెలంగాణ? ఆలోచించండి. కాంగ్రెస్ అసెంబ్లీ ఎన్నికలను గెలిచినప్పుడు రాష్ట్ర ఖజానాలో సిద్ధంగా ఉన్న రూ.7,700 కోట్ల రైతుబంధు నిధులను గెలిచినా కూడా పెట్టుబడి సాయంగా రైతులకు ఇవ్వనివాడు ఇప్పుడేమైనా ఇస్తాడా? మోదీ అబద్ధాలు, చంద్రబాబు మోసాలు కలిపి మనిషిని చేస్తే రేవంత్రెడ్డి అవుతాడు. మళ్లీ ఆయనను నమ్ముతారా? ఆలోచించండి!
ఇక బడాభాయ్ ప్రధానమంత్రి. ప్రతి భారతీయుడికీ రూ.15 లక్షలు ఇస్తానని 2014లో చెప్పిన బలి చక్రవర్తి సామాన్యుల సర్వస్వాన్ని అదానీ, అంబానీలకు సమర్పిస్తున్నారు. కాంగ్రెస్ గెలిస్తే ప్రజల 45 శాతం ఆస్తులు తీసేసుకుంటుందని ప్రచారం చేస్తున్నారు. కేంద్రంలో కాంగ్రెస్ ఎలాగూ గెలిచేది లేదు, కానీ మోదీ గెలిస్తే మాత్రం 45+50 కలిపి ప్రజల 95 శాతం ఆస్తి అదానీ, అంబానీ లాంటి ఇతర గుజరాతీ వ్యాపారస్థుల చేతుల్లోకి వెళ్లడం మాత్రం ఖాయం.
అంతేకాదు, అమూల్ పాలు, అదానీ మాలు తప్ప దేశంలో ఇంకే కంపెనీకి చెందిన వస్తువులు అమ్ముకునేందుకు కుదరదు. ఒకవేళ బీజేపీ మూడోసారి గెలిచిందంటే ఒక్క తెలంగాణ కాదు, అన్ని రాష్ర్టాలు దివాలా తీస్తాయి. గత పదేండ్లలో పెరిగిన ధరల శాతం 68. ఇక మోదీ చేతిలో మళ్లీ దేశాన్ని పెడితే శ్రీలంక గతే భారత్కు పడుతుంది. ఇప్పుడు తెలంగాణ కట్టిన పన్నులతో నాలుగైదు ఉత్తరాది రాష్ర్టాలు బతుకుతున్నాయి. ఇంకా మోదీకే అధికారమిస్తే ఆంధ్రా పాలకుల కంటే ఎక్కువగా అనగా సింగరేణిని అదానీకి, పంటపొలాలను అంబానీకి కట్టబెడతారు.
ప్రతి ఎన్నిక సమయంలో మోదీ ఎన్ని అబద్ధాలు చెప్పారో గుర్తు తెచ్చుకోండి. ‘అచ్చేదిన్, కాస్తా ‘చచ్చేదిన్’ అయిపోయింది. రెట్టింపు చేస్తానన్న రైతు ఆదాయం సగం కంటే తక్కువైంది. ‘బేటీ పడావో’ మాట మారి ‘బేటీ చిడావ్’ అయింది. బలాత్కారాలు, హత్యలు చేసినవాళ్లు కాలరేగసుకొని బయట తిరుగుతున్నారు. వారికి సన్మానాలు జరుగుతుంటే.. వారి పిల్లలకు ఎన్నికల్లో టికెట్లు దొరుకుతున్నాయి. పాల మీద, పాఠశాల పుస్తకాల మీద కూడా పన్నులేసి మోదీ తన స్నేహితులకు కట్టబెడుతున్నారు. విదేశీ పత్రికలన్నీ ప్రస్తుతం భారత్ నియంత పాలన కింద ఉందని రాస్తున్నాయి. రాజకీయంగా నేరస్థులను ప్రోత్సహిస్తూ, ఆర్థికంగా సామాన్యులను కుంగదీస్తూ, సామాజికంగా మతమౌఢ్యంతో ప్రజలను విడదీస్తూ, విద్యాపరంగా దేశాన్ని నాశనం చేస్తూ, ఆరోగ్యపరంగా వైద్య వృత్తిని కుంగదీస్తూ.. నరేంద్ర మోదీ దేశానికి చేసిందేముంది?
నాలుగేండ్లు రాముడి గుడి అని అయోధ్య జపం చేసి, చివరికి ప్రపంచానికి ఆదర్శమైన జంట విగ్రహాలైనా పెట్టకుండా బాలరాముడి విగ్రహాన్ని ప్రతిష్ఠించారక్కడ. సీత, రాముడు, లక్ష్మణుడు, హనుమంతుడి విగ్రహాలు ఉంటేనే ఎవరైనా సరే రామ పట్టాభిషేకం అని పూజిస్తారు. చెప్పుకొంటే సిగ్గుచేటు. ఇట్లాంటి వాళ్లను వదిలేసి చదువు, తెలివి, వివేకం, లోకజ్ఞానం ఉన్నవారిని నాయకులుగా ఎన్నుకున్నప్పుడే రాష్ర్టాలయినా, దేశాలయినా బాగుపడతాయి. తెలంగాణ ప్రజలారా! గత తొమ్మిదేండ్లు ఎట్లా బతికామో గుర్తు తెచ్చుకోని ఓటు వేయండి!
కనకదుర్గ దంటు
89772 43484