కుర్చీ చాలా చిత్రమైనది. అది రా రమ్మని పిలుస్తుంది. ఒకసారి కుర్చీకెక్కిన తర్వాత తాను అందరికంటే ఉన్నతమనే భ్రమను కలిగిస్తుంది. తాను గొప్పవాడినని, మిగిలినవాళ్లంతా తనకంటే చిన్నవాళ్లనే ఆలోచన రగిలిస్తుంది. ఇక రాజకీయ నాయకుడినైతే కుర్చీ సూదంటు రాయిలా ఆకర్షిస్తుంది. ప్రతిపక్షంలో ఉన్నవాళ్లకైనా, అధికారంలో ఉన్నవాళ్లకైనా దృష్టంతా కుర్చీపైనే ఉంటుంది! ఎక్కిన తర్వాత కుర్చీలోని మెత్తదనం సౌఖ్యంగా మారి లేవాలనిపించదు. దానికితోడు ఎవరైనా గుంజుకుంటరేమోననే భయం మొదలవుతుంది. ఆ వెరపుతో కుర్చీని మరింత గట్టిగా పట్టుకుంటరు. చివరికి దృష్టి లక్ష్యం నుంచి మారి కుర్చీని కాపాడుకోవడమే అసలు లక్ష్యమవుతుంది. ప్రజల మీది ప్రేమ కుర్చీ మీది ప్రేమగా మారిపోతుంది! ఫలితం.. పరిపాలన కుంటుపడుతుంది.
తెలంగాణలో కాంగ్రెస్ పరిపాలన 50 రోజులకు చేరువవుతున్నది. అంటే హామీల అమలుకు ఆ పార్టీ పెట్టుకున్న గడువులో సగం పూర్తవుతున్నదన్నమాట. ‘గాలికి పోయే పేలపిండి కృష్ణార్పణం’ అన్నట్టు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం వల్ల ప్రభుత్వంపై తక్షణమే భారీగా భారమేమీ పడదు గనుక దాన్ని అమలు చేసారు. మిగతావి చేస్తామంటారే తప్ప ఎప్పణ్నుంచనేది చెప్పరు. కాంగ్రెస్ గ్యారెంటీలు అందరికీ వర్తింపజేయడం అసాధ్యమనేది నిజం. కొందరికి ఇస్తే రానివాళ్లకు కోపం ఖాయం. లోక్సభ ఎన్నికల ముందు ఈ లొల్లి ఎందుకని వాయిదా వేస్తున్నారా? లేక ఎన్నికల ముందైతే అడ్వాంటేజ్ ఎక్కువ వస్తుందని ఆపుతున్నరా? వేచి చూస్తేగానీ తెల్వదు. ప్రస్తుతానికి ఫీల్గుడ్ ఫ్యాక్టర్తో బండి నడిపే ప్రయత్నం జరుగుతున్నది. ఉద్యోగులకు మొదటివారంలో జీతాలు ఇచ్చామనిపించుకోవడం కోసం మిగతా చెల్లింపులన్నీ నిలిపేసారు. రాహుల్గాంధీ ‘న్యాయ యాత్ర’కు ఏసీ బస్సును కూడా తెలంగాణ నుంచే సమకూర్చాల్సి వచ్చిన తరుణంలో, లోక్సభ ఎన్నికల ముంగిట బిల్లుల నిలిపివేత వెనుక ఇంకేదైనా మతలబు ఉందేమో తెల్వదు.
తెలంగాణ రైతులు, ప్రజలు విశాల హృదయులు కనుక, ‘మొన్ననే వచ్చిండు కదా.. చూద్దాం ఏం చేస్తడో’ అని రైతు బంధు పడకున్నా, ఇతరత్రా సమస్యలు తలెత్తుతున్నా ప్రస్తుతానికి సహిస్తున్నరు గానీ, అక్కడక్కడా చురకలైతే వినిపిస్తున్నయి. ఇంట్లో కరెంటు పోయి ప్యాను ఆగగానే, ‘అగో చూసింరా.. మార్పు మొదలైంది’ అనే సెటైర్ స్పాంటేనియస్గా పడుతున్నది. పేరు మెయింటెనెన్సే అయినా కరెంటు కట్ అవుతున్నది. అక్కడో ఇక్కడో అయినా ఎరువుల కోసం క్యూలు కనిపిస్తున్నయి. నీళ్ల కోసం జిలెటిన్ స్టిక్స్తో చెక్డ్యాములు బద్దలు కొట్టాలనే ఆలోచనలు పుడుతున్నాయి. నీటి నిర్వహణను ఎవరు చూస్తున్నరో తెల్వదు గానీ, ఇప్పటికే చెరువులు, చెక్డ్యాములు నింపి ఉండాల్సింది. కేసీఆర్ ప్రభుత్వం ఈ పాటికే నింపి పెట్టిన మల్లన్నసాగర్, కొండ పోచమ్మ సాగర్ల నుంచి నీటి విడుదలకు ఆదేశించి ఉండాల్సింది. కానీ, అదేమీ జరగలేదు. చివరికి హరీశ్రావు లేఖ రాస్తే గానీ అనంతసాగర్ నుంచి రంగనాయకసాగర్కు నీళ్లు రాలేదు.
ప్రస్తుతానికి బోర్లు పోస్తున్నాయి కనుక రైతులు నార్లు పోసారు గానీ, పంట పొట్టకొచ్చేనాటికి పరిస్థితి ఏమిటో తెల్వదు. అనేక ప్రాజెక్టుల కింద యాసంగి క్రాప్ హాలీడే ప్రకటించడం, రేపటి కరువుకు తొలి సూచిక. తెలిసో తెల్వకో మనం ఓడిస్తే ఓడించి ఉండవచ్చు గానీ, సకాలంలో రైతుబంధు పడకపోవడం, ఎరువుల కోసం క్యూలు, క్రాప్ హాలీడేలు, కరెంటు కట్, కాల్వలు ఎండి పోవడాలు కేసీఆర్ పాలనలో మనం చూడలేదన్నది కాదనలేని వాస్తవం. కేసీఆర్ ప్రభుత్వం, మంత్రులు ఎంత మనసు పెట్టి పనిచేస్తే, ఈ సమస్యలు రాకుండా ఉన్నాయన్నది ఇప్పుడన్నా గుర్తించాలి. ‘అలికి పూసిన ఇంట్ల గువ్వొచ్చి గుడ్డు పెట్టినట్టు’ అన్నీ సిద్ధం చేసి ఉంచిన రాష్ట్రంలోనే, కాంగ్రెస్ ప్రభుత్వం సమస్యలు రాకుండా చూడలేకుంటే, దిక్కూ దివానం తెల్వని కొత్త రాష్ర్టాన్ని కేసీఆర్ ఎట్ల ఒక రీతిన పెట్టిండన్నది ఎవరికి వారు అర్థం చేసుకోవల్సిందే! అంతో ఇంతో కలిగిన, ఒడిదుడుకులు తట్టుకోగలిగిన (దేశంలోనే అత్యధిక వేతనాలు పొందే) ఉద్యోగులకు ఫస్టు తారీఖుకు జీతాలివ్వడమా? లేక పేద రైతుకు సకాలంలో పెట్టుబడి సాయం అందివ్వడమా? ఏది ముఖ్యమన్న దానిలో, కేసీఆర్ పేద రైతును ఎంచుకుంటే, రేవంత్ ఉద్యోగులను ఎంచుకున్నడు. ఎవరి ఆలోచన తీరు ఏమిటో తెలుసుకోవడానికి ఇదొక్కటి చాలు. సరే, మనకై మనం కోరి ఎన్నుకున్నం కనుక అన్నం ఉడికే దాకా వేచి చూడటం తప్ప చేసేదేమీ లేదు.
జనవరి 3వ తేదీన నేను రాసిన కాలమ్లో నెల రోజులు గడిచినా, అధికారులు ఇప్పటికీ కొలువు దీరలేదని పేర్కొన్న మరుసటి రోజు ముఖ్యమంత్రి రేవంత్, బ్యురాక్రసీ పునర్వ్యవస్థీకరణ చేపట్టారు. నిజాయతీపరులుగా పేరున్న కొందరు అధికారులకు మంచి పోస్టులు ఇచ్చారన్న మాట అందరిలోనూ వినిపించింది. ఇది జరిగి దాదాపు 15 రోజులు గడిచినా పరిపాలన ఇప్పటికీ గాడిన పడ్డట్టు కనిపించడం లేదు. సమస్య తలెత్తినప్పుడు స్పందించడమే తప్ప, రాష్ట్రంలో ప్రభుత్వం ఒకటి పని చేస్తున్నదన్న అభిప్రాయం ఇంకా కలగడం లేదు. రేవంతే అంగీకరించినట్టు, బహుశా కాంగ్రెస్ నేతలకు తాము అధికారంలోకి వచ్చామని, మంత్రులమయ్యామని నమ్మకం కలగడం లేదేమో! ఇప్పటికీ మంత్రులకు బ్యాక్ ఆఫీసులు ఏర్పడలేదు. పీఆర్వోలతో కూడిన ఫ్రంట్ ఆఫీసులు సిద్ధం కాలేదు. అపాయింట్మెంట్స్ సిస్టమ్ లేదు. ‘పరుగెత్తేందుకు గుర్రాలు సిద్ధంగా ఉన్నాయి. కానీ వాటికి డైరెక్షన్ ఇచ్చే రౌతులే లేరు’ అని ఈ పరిస్థితిని విశ్లేషించారు ఒక రిటైర్డ్ ఐపీఎస్. ప్రభుత్వం ఏకోన్ముఖంగా, ఏక నాయకత్వంలో నడుస్తున్న సంకేతాలు వెలువడటం లేదనీ, పరస్పర అనుమానాలు, ఆధిపత్య భావనల కారణంగా అడ్మినిస్ట్రేషన్ ప్రజెన్స్ లోపిస్తున్నదని ఆయన ఆక్షేపించారు.
‘రేవంత్ కన్నా మేమే సీనియర్లం, అనుభవజ్ఞులం’ అని భావిస్తున్న కొందరు మంత్రులు స్వతంత్రంగా వ్యవహరించడానికి ప్రయత్నిస్తుంటే, వారు చేయిదాటి పోకుండా చూసే పనిలో సీఎం లాబీ ఉన్నట్టు ప్రచారం సాగుతున్నది. సీఎం తర్వాత తానే అని డిప్యూటీ సీఎం భావిస్తుంటే, అత్యంత కీలకమైన రెవెన్యూ శాఖను నిర్వహిస్తున్నందున ముఖ్యమంత్రి తర్వాతి స్థానం తనదేనని మంత్రి పొంగులేటి బహిరంగంగానే చెప్తున్నారు. ముఖ్యమంత్రి దావోస్ పర్యటన నేపథ్యంలో బడ్జెట్పై సమీక్షలు నిర్వహిస్తున్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కేవలం బడ్జెట్కే పరిమితం కాకుండా, ఆయా శాఖల పాలసీ మేకింగ్ గురించీ మాట్లాడుతూ తనను తాను ఎస్టాబ్లిష్ చేసుకునే ప్రయత్నాల్లో పడ్డారు. ఇక సీఎం ఎంపిక సమయంలో సీఎల్పీలో అధిష్ఠానం ముందు గట్టిగా గొంతెత్తిన ఉత్తర తెలంగాణకు చెందిన ఒక మంత్రికి, ముఖ్యమంత్రికి మధ్య దాదాపు ప్రచ్ఛన్న యుద్ధమే సాగుతున్నదని పార్టీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. తన శాఖకు సంబంధించి ముఖ్యమంత్రి నిర్వహించిన సమీక్షలకు ఆయన హాజరుకాకపోవడం చర్చనీయాంశమైంది.
ఉత్తర తెలంగాణలో ఒక పోలీసు కమిషనర్ను మార్చాలని ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకొని ఉత్తర్వులు కూడా జారీచేస్తే, నా జిల్లా వ్యవహారాల్లో మీరెట్లా వేలు పెడతారని ఆ మంత్రి అడ్డం తిరిగారట. ఉత్తర్వులు జారీ అయి 15 రోజులు గడిచినా, బదిలీ ఇప్పటికీ అమలుకు నోచుకోకపోవడానికి కారణం ఇదేనంటున్నారు. ఆ మంత్రికి ముకుతాడు వేయడానికి ఆయనకు అత్యంత సన్నిహితులైన ఒక ఐఏఎస్ను టార్గెట్ చేసే అవకాశం ఉందని కారిడార్ కబుర్లు సాగుతున్నాయి. మరోవైపు బడుగు వర్గాలకు చెందిన తనకు దక్కాల్సినంత ప్రాధాన్యం లభించడం లేదని మరో మంత్రి అలకబూని కూర్చున్నారట. ఇక ఖమ్మం జిల్లా మంత్రుల వ్యవహారశైలి మరింత ఆసక్తికరంగా మారింది. ఆ జిల్లాలో కేసీఆర్ ప్రభుత్వం మొదలుపెట్టిన సీతారామ ప్రాజెక్టుపై, ముగ్గురు మంత్రులూ నాలుగుసార్లు విడివిడిగా (డిసెంబరు 18, జనవరి 3, జనవరి 6, జనవరి 11 తేదీల్లో) సమీక్షలు నిర్వహించడం ఆధిపత్య పోరుకు సంకేతం. వీటన్నింటినీ చాపకింద దాచి తాను అందరినీ కలుపుకొని పోతున్నట్టు కలర్ ఇవ్వడానికి సీఎం ప్రయత్నిస్తున్నారు.
పదవులు, పనుల కోసం ఎవరైనా కలిసినప్పుడు ఆయన వారిని ఆయా మంత్రుల వద్దకు రీ డైరెక్ట్ చేస్తున్నారు. ముఖ్యమంత్రిగా రేవంత్ క్యాబినెట్కు నాయకత్వం వహించకుండా ఓవర్ జనరస్గా, అవసరానికి మించి లొంగి ఉంటున్నారని, డైరెక్షన్ లోపానికి ఇదే ప్రధాన కారణమనే మాటా వినిపిస్తున్నది. ఉదాహరణకు ఢిల్లీ పర్యటన ముగిసాక జరిపే విలేకరుల సమావేశంలో సీఎం మాట్లాడటం, మంత్రులు పక్కన నిలబడటం లాంఛనం. ఇందుకు భిన్నంగా సీఎం పక్కన నిలబడి మంత్రులతో విలేకరుల సమావేశం జరిపించడం ఎబ్బెట్టుగా కనిపించిందని అధికారులే అభిప్రాయపడ్డారు. ‘ఇందులో మంత్రులకు ప్రాధాన్యం ఇస్తున్నట్టు సంకేతమివ్వడం ఒక కోణం. రెండో కోణం ఏమిటంటే ముఖ్యమంత్రికి ఇంకా సబ్జెక్టులపై పూర్తిగా పట్టు చిక్కలేదు. ఆయన రాజకీయ అంశాలపై ఎదురులేకుండా, బెదరగొట్టేలా ఎడాపెడా మాట్లాడగలరు. కానీ పరిపాలనా పరమైన అంశాలపైనే ఆయన ఇంకా బాగా అవగాహన తెచ్చుకోవాల్సి ఉంది’ అని ఒక సీనియర్ పాత్రికేయుడు సూచించారు. ఢిల్లీలో సీఎం టూర్ను నిశితంగా గమనించే ఆయన ఒక సన్నివేశాన్ని ఇలా వివరించారు. ‘ఢిల్లీ పర్యటనలో సీఎం కేంద్ర ఆర్థికమంత్రిని కలిసారు. ఆ సందర్భంగా ఏపీ-తెలంగాణ మధ్య విద్యుత్తు బకాయిల వివాదం ప్రస్తావనకు వచ్చింది. దీని సంగతేమిటని నిర్మలా సీతారామన్ సీఎంను అడిగారు. ఆయన సీఎస్ వైపు చూసారు.
ఆమెకూ సబ్జెక్ట్పై అవగాహన కరువవడంతో, కమ్యూనికేషన్ గ్యాప్ అని సర్దిచెప్పే ప్రయత్నం చేసారు. పరిస్థితి ఇబ్బందికరంగా మారుతున్నదని గమనించిన సీఎంవో ప్రిన్సిపల్ సెక్రటరీ శేషాద్రి జోక్యం చేసుకొని, అప్పటికప్పుడు సమాచారం సేకరించి, ఏపీయే తెలంగాణకు 12 వేల కోట్ల డబ్బులు ఇవ్వాల్సి ఉందని లెక్కలతో సహా క్లారిటీ ఇచ్చారట. కేంద్ర ఆర్థికమంత్రి ముందుకు వెళ్లేటప్పుడు ఇంత అన్ ప్రిపేర్డ్గా వెళ్తే ఎట్లా?’ అన్నారా జర్నలిస్టు. నిజానికి పదవి చేపట్టిన వెంటనే అధికారులను సమూలంగా మార్చాలని సీఎం నిర్ణయం తీసుకున్నారు. కానీ, ఎక్కణ్నుంచి ఏం ఒత్తిళ్లు వస్తున్నాయో తెల్వదు గానీ, ప్రస్తుతం ఎవరు ఏది అడిగినా, చూద్దాం, చేద్దాం, ప్రస్తుతానికి ఉన్నదున్నట్టు ఉండనీ అని దాటవేస్తున్నారట. ఇది ముఖ్యమంత్రికి పూర్తి స్వేచ్ఛ లేదనే అభిప్రాయాన్ని కలిగిస్తున్నది. దీన్ని గమనించే కేసీఆర్ సర్కారులో పరిశ్రమల శాఖలో కీలకంగా పనిచేసిన ఒక అధికారితో పాటు మరికొందరు సీనియర్లు కేంద్రానికి వెళ్లే ప్రయత్నాల్లో పడ్డారు. రేవంత్ పైకి కనిపించినంత అమాయకంగా ఏమీ లేరనీ, సబ్కా సున్ నా, అప్నా కర్నా అన్నట్టు వ్యవహరిస్తున్నారని కూడా చెప్తున్నారు. కేసీఆర్ ప్రభుత్వం, కేటీఆర్ తమ హయాంలో రాష్ర్టానికి పరిశ్రమలను రప్పించేందుకు తీవ్రంగా కృషిచేశారు.
అవి ఫలించి అనేక పరిశ్రమలతో ఒప్పందాలు చివరి దశకు చేరాయి. ఈ లోగా ప్రభుత్వం మారింది. ‘గత ప్రభుత్వ హయాంలో 30 దాకా పరిశ్రమలను లైన్లో పెట్టినం. మీరు సరేనంటే దావోస్ సదస్సులో వీటి మీద ఒప్పందాలు కుదుర్చుకోవచ్చు’ అని పరిశ్రమల మంత్రికి సదరు శాఖ సీనియర్ అధికారి ఒకరు నివేదించారట. దీని ద్వారా క్రెడిట్ తీసుకోవచ్చని భావించిన సదరు మంత్రి, ఇదే విషయాన్ని సీఎంకు తెలియజేశారట. విషయం వినగానే సీఎం, అట్లయితే దావోస్కు నేనే వస్తా అన్నారట. ఈ ఉదంతం ఇద్దరి మధ్య కొంత గ్యాప్కు కారణమైందని, దావోస్లో పరిశ్రమల మంత్రిని కావాలని సైడ్లైన్ చేసారని ఆ శాఖ అధికారులు గుసగుసలాడుకుంటున్నారు. కేటీఆర్ లేకున్నా రాష్ర్టానికి పరిశ్రమలు వస్తయి అని నిరూపించడానికి, తనను తాను కేటీఆర్తో ఈక్వేట్ చేసుకోవడానికి ముఖ్యమంత్రి ఎత్తుగడ వేశారని, కానీ ప్రజెంటేషన్ ఫెయిల్యూర్ వల్ల అది అంతగా ఫలించలేదనే అభిప్రాయం వినిపిస్తున్నది. ‘సీఎంవో గ్రూపులో ఏ పోస్టు పెట్టాలో, ఏది పెట్టకూడదో కూడా వారికి తెల్వడం లేదు. దావోస్లో సీఎం టూరు ట్రోల్ కావడానికి కారణం ఇదే. కేసీఆర్ను తిట్టే అధికారులైతే తనకు లాయల్గా ఉంటరని సీఎం అనుకుంటున్నరు. దీన్ని గుర్తించిన కొందరు, గత ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించినవారు కూడా, సీఎం దగ్గర కేసీఆర్ను తిట్టి మంచి పోస్టుల్లో కొనసాగుతున్నరు. ఈ టెక్నిక్ను గుర్తించడంలో సీఎం విఫలమవుతున్నరు’ అని సీనియర్ అధికారి ఒకరు విశ్లేషించారు.
అధికారిక వ్యవహారాలు ఇలా సాగుతుంటే పార్టీ వ్యవహారాలు మరింత రసవత్తరంగా సాగుతున్నాయి. రెండు మూడు నెలల్లో జరిగే లోక్సభ ఎన్నికలను ఎదుర్కొనడానికి, కాంగ్రెస్కు అండగా మిగిలింది మూడు రాష్ర్టాలు.. కర్ణాటక, తెలంగాణ, హిమాచల్! హిమాచల్లో మంచు తప్ప మరేం లేదు గనుక, ‘వనరుల’ కోసం హైకమాండ్ ఆధారపడుతున్నది కర్ణాటక, తెలంగాణ మీదే! ఈ విషయంలో ఎవరెంత సమకూర్చాలో హైకమాండ్ నుంచి ఇప్పటికే సంకేతాలు అందాయనీ, ముఖ్యనేతలు సమీకరణలో పడ్డారని చెప్పుకొంటున్నారు. ‘కాంగ్రెస్ ముక్త్ భారత్, అవినీతి రహిత భారత్’ అని చెప్పే ప్రధాని మోదీ దీన్ని ఎంతవరకు అడ్డుకుంటారో చూడాలి. తెలంగాణలో ఇప్పటికే మంజూరైన టెండర్ల రద్దులో నిధుల సమీకరణ కోణం దాగి ఉండొచ్చనే మాట వినిపిస్తున్నది.
జాతీయపార్టీలకు అధికారం అప్పగిస్తే ఢిల్లీకి తెలంగాణ కప్పం కట్టుకోక తప్పదని నెత్తీ నోరూ మొత్తుకున్నా ప్రజలకు ఎక్కలేదు. గ్రహచారం బాగా లేకుంటే ఇటువంటివే జరుగుతాయి. తెలంగాణ సహా ఐదు రాష్ర్టాల ఎన్నికలకు కర్ణాటక నుంచి మొన్నమొన్ననే కొంత పిండినందున ఇప్పుడు ప్రధాన భారం తెలంగాణపైనే పడే ప్రమాదం ఉన్నది. తెలంగాణలోని ఇద్దరు ముఖ్య నేతలకు ఈ పని అప్పగించారని, వారి మధ్య ఆధిపత్య పోరుకు ఇది కూడా ఒక కారణమని చెప్తున్నారు. ఏనాటికైనా తెలంగాణకు సీఎం అయ్యే అవకాశం, అధికారం తనకే ఉన్నాయని, అధిష్ఠానం అండదండలు కూడా తనకున్నాయని రెండో నేత సన్నిహితులతో అంటున్నారట. వనరుల సమీకరణలో భాగంగా ఆయన ఏకంగా పది పన్నెండు మంది న్యాయవాదులతో, రిటైర్డ్ రెవెన్యూ అధికారులతో ఒక ప్రైవేటు టీమ్ ఏర్పాటుచేసుకొని భూముల వ్యవహారాలు పరిశీలిస్తున్నారని జోరుగా ప్రచారం సాగుతున్నది. మరోవైపు రియల్టర్ల దగ్గరినుంచి చదరపు అడుగుకు ఇంత అనే లెక్క కూడా సాగుతున్నదని రియల్టీ వర్గాలు చెప్పుకొంటున్నాయి. ఇదిట్లా ఉంటే ఆర్థికంగా బలమైన ఈ రెండు గ్రూపులను కంట్రోల్ చేయడానికి దళిత కోణంలో మరో వర్గం చాపకింద నీరులా ప్రయత్నాలు చేస్తున్నది.
తన భర్తను ముఖ్యమంత్రి చేసి ఉండాల్సిందని, ఆయనకు అన్యాయం చేసారని మల్లు భట్టి విక్రమార్క భార్య ఇప్పటికే అన్నారు. ఢిల్లీ కాంగ్రెస్లో అత్యంత కీలక పదవుల్లో ఉన్న ఒక దళిత నేత, దళితుడైన మరో మాజీ ఐఏఎస్ అధికారి తెలంగాణలో సమాంతర అధికారాన్ని చలాయించడానికి ప్రయత్నిస్తున్నారని, పోస్టింగుల విషయంలోనూ వారి మాటే చెల్లుబాటవుతున్నదని అంటున్నారు. తనకు రాహుల్గాంధీ నుంచి సంపూర్ణ ఆశీస్సులున్నాయని రేవంత్ ఎంత చెప్పుకొంటున్నప్పటికీ కాంగ్రెస్ రాజకీయాల్లో ఎప్పుడు ఏమవుతుందో దేవుడికి కూడా తెల్వదు. రాహుల్కు అత్యంత సన్నిహితులుగా, కోటరీగా పేరువడ్డ జ్యోతిరాదిత్య సింధియా, జితిన్ ప్రసాద, మిలింద్ దేవరా, ఆర్పీఎన్ సింగ్, సచిన్ పైలట్లలో ఒక్క సచిన్ మాత్రమే ఇప్పుడు కాంగ్రెస్లో ఉన్నారు. సచిన్కు కూడా అశోక్ గెహ్లాట్ పొమ్మనలేక పొగబెట్టినా, రాజస్థాన్లో కాంగ్రెస్ అధికారం కోల్పోవడంతో పిట్టపోరు పిట్టపోరు బీజేపీ తీర్చినట్టయింది. ఇటీవలి కాలంలో మూడుసార్లు రేవంత్ అధికారికంగా ఢిల్లీ పర్యటనకు, కేంద్రంతో సమావేశాలకు వెళ్లగా, హై కమాండ్ ఏ ఒక్కసారీ ఆయన్ను ఒంటరిగా పంపకపోవడం మీద రాజకీయ వర్గాల్లో ఇప్పటికే ఆసక్తికర చర్చ సాగుతున్నది.
ఇట్లుంటే సందట్లో సడేమియాలాగా ఎన్నికల సమయంలో కాంగ్రెస్కు సహకరించామంటూ అనేకమంది తమ వాటా ప్రాజెక్టుల కోసం, పనుల కోసం, పదవుల కోసం ప్రతిపాదనలు, పైరవీలు చేస్తున్నారు. ఇప్పటికే వలసినంత లబ్ధి పొందిన ఇద్దరు ఐఏఎస్ అధికారులు ఉమ్మడిగా విదేశాల్లో ఏకంగా హోటల్నే కొనుగోలు చేసినట్టు అధికారులు చెవులు కొరుక్కుంటున్నారు. ఇవన్నీ గమనించే కావచ్చు… లోక్సభ ఎన్నికల దాకా ఎవరూ ఎలాంటి ‘దూకుడు’ చర్యలకూ, అప్రతిష్ఠ చేసే పనులకూ దిగవద్దని చేయవద్దని ముఖ్యమంత్రి తన సన్నిహితులను పిలిచి మరీ గట్టిగా హెచ్చరించారట. అయినా ఆకలి, అధికారం హెచ్చరికలతో ఆగుతయా? ప్రస్తుతానికి ఎవరి లొల్లి వారిది. అసెంబ్లీ ఎన్నికలు సెమీ ఫైనల్ అయితే లోక్సభ ఎన్నికలు ఫైనల్ లాంటివి! తెలంగాణలో ఎవరి అసలు రంగేమిటో, ఏ పార్టీ భవిష్యత్తేమిటో బయటపడేది లోక్సభ ఎన్నికల తర్వాతే!
చివరాఖరు
తెలంగాణ ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించడం వల్ల రాష్ట్ర ప్రయోజనాలకు పెను విఘాతం కలుగుతుందని మాజీ మంత్రి హరీశ్రావు సోదాహరణంగా వివరించారు. దీనిపై ఏం చేద్దామని సాగునీటి శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్రెడ్డి ఇంగ్లండ్లో ఉన్న ముఖ్యమంత్రిని అడిగారట! దానికి సీఎం ఈ విషయంలో కేసీఆర్ ప్రభుత్వం కేంద్రంతో జరిపిన ఉత్తర ప్రత్యుత్తరాలన్నింటినీ బయటకు తీసి ఎదురుదాడికి రంగం సిద్ధం చేయాలని సూచించారట. ఇదంతా చూస్తుంటే కాంగ్రెస్ ఇంకా ప్రతిపక్ష పాత్రనుంచి ప్రభుత్వ పాత్రలోకి మారినట్టుగా కనిపించడంలేదు. ఎదురుదాడే అన్నింటికీ పరిష్కారం కాదు. బీఆర్ఎస్ బోనులో నిలబెట్టి తమ తప్పును ఒప్పుచేసుకోలేమని, రాష్ట్ర ప్రయోజనాల విషయంలోనైనా కలిసిపనిచేస్తే మంచిదని కాంగ్రెస్ ఇప్పటికైనా గ్రహించాలి.
కేసీఆర్ ప్రభుత్వం ఈ పాటికే నింపి పెట్టిన మల్లన్నసాగర్, కొండ పోచమ్మ సాగర్ల నుంచి నీటి విడుదలకు ఆదేశించి ఉండాల్సింది. కానీ, అదేమీ జరగలేదు. చివరికి హరీశ్రావు లేఖ రాస్తే గానీ అనంతసాగర్ నుంచి రంగనాయకసాగర్కు నీళ్లు రాలేదు. ప్రస్తుతానికి బోర్లు పోస్తున్నాయి కనుక రైతులు నార్లు పోసారు గానీ, పంట పొట్టకొచ్చేనాటికి పరిస్థితి ఏమిటో తెల్వదు.అనేక ప్రాజెక్టుల కింద యాసంగి క్రాప్ హాలీడే ప్రకటించడం, రేపటి కరువుకు తొలి సూచిక. తెలిసో తెల్వకో మనం ఓడిస్తే ఓడించి ఉండవచ్చు గానీ, సకాలంలో రైతుబంధు పడకపోవడం, ఎరువుల కోసం క్యూలు, క్రాప్ హాలీడేలు, కరెంటు కట్, కాల్వలు ఎండి పోవడాలు కేసీఆర్ పాలనలో మనం చూడలేదన్నది కాదనలేని వాస్తవం.
జనవరి 3వ తేదీన నేను రాసిన కాలమ్లో నెల రోజులు గడిచినా, అధికారులు ఇప్పటికీ కొలువు దీరలేదని పేర్కొన్న మరుసటి రోజు ముఖ్యమంత్రి రేవంత్, బ్యురాక్రసీ పునర్వ్యవస్థీకరణ చేపట్టారు. నిజాయతీపరులుగా పేరున్న కొందరు అధికారులకు మంచి పోస్టులు ఇచ్చారన్న మాట అందరిలోనూ వినిపించింది. ఇది జరిగి దాదాపు 15 రోజులు గడిచినా పరిపాలన ఇప్పటికీ గాడిన పడ్డట్టు కనిపించడం లేదు. సమస్య తలెత్తినప్పుడు స్పందించడమే తప్ప, రాష్ట్రంలో ప్రభుత్వం ఒకటి పని చేస్తున్నదన్న అభిప్రాయం ఇంకా కలగడం లేదు.
‘అలికి పూసిన ఇంట్ల గువ్వొచ్చి గుడ్డు పెట్టినట్టు’ అన్నీ సిద్ధం చేసి ఉంచిన రాష్ట్రంలోనే, కాంగ్రెస్ ప్రభుత్వం సమస్యలు రాకుండా చూడలేకుంటే, దిక్కూ దివానం తెల్వని కొత్త రాష్ర్టాన్ని కేసీఆర్ ఎట్ల ఒక రీతిన పెట్టిండన్నది ఎవరికి వారు అర్థం చేసుకోవల్సిందే! అంతో ఇంతో కలిగిన, ఒడిదుడుకులు తట్టుకోగలిగిన (దేశంలోనే అత్యధిక వేతనాలు పొందే) ఉద్యోగులకు ఫస్టు తారీఖుకు జీతాలివ్వడమా? లేక పేద రైతుకు సకాలంలో పెట్టుబడి సాయం అందివ్వడమా? ఏది ముఖ్యమన్న దానిలో, కేసీఆర్ పేద రైతును ఎంచుకుంటే, రేవంత్ ఉద్యోగులను ఎంచుకున్నడు. ఎవరి ఆలోచన తీరు ఏమిటో తెలుసుకోవడానికి ఇదొక్కటి చాలు.
తెలంగాణ రైతులు, ప్రజలు విశాల హృదయులు కనుక, ‘మొన్ననే వచ్చిండు కదా.. చూద్దాం ఏం చేస్తడో’ అని రైతు బంధు పడకున్నా, ఇతరత్రా సమస్యలు తలెత్తుతున్నా ప్రస్తుతానికి సహిస్తున్నరు గానీ, అక్కడక్కడా చురకలైతే వినిపిస్తున్నయి. ఇంట్లో కరెంటు పోయి ప్యాను ఆగగానే, ‘అగో చూసింరా.. మార్పు మొదలైంది’ అనే సెటైర్ స్పాంటేనియస్గా పడుతున్నది. పేరు మెయింటెనెన్సే అయినా కరెంటు కట్ అవుతున్నది. అక్కడో ఇక్కడో అయినా ఎరువుల కోసం క్యూలు కనిపిస్తున్నయి.
– తిగుళ్ల కృష్ణమూర్తి