సకల వనరుల సుభిక్ష తెలంగాణ కల సాకారమయ్యే వేళ లక్షల మంది నిరుద్యోగుల భవిష్యత్తుపై నీలి నీడలు ముసురుకున్నాయి. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ ఉదంతం నేడు తెలంగాణ యావత్ ప్రజానీకాన్ని నిరాశలోకి నెట్టివేసింది. ఈ నిరాసక్తత నుంచి తెలంగాణ ప్రజలను, యువతను, నిరుద్యోగ అభ్యర్థులను బయటికి తీసుకురావడానికి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు తెలంగాణ ప్రజానీకానికి ఒక గొప్ప సందేశాన్ని ఇచ్చారు.
ఈ సందేశ సారాంశాన్ని పరిశీలిస్తే తెలంగాణ ప్రజల పట్ల బీఆర్ఎస్ పార్టీకి, కేసీఆర్కు ఉన్న చిత్తశుద్ధి అర్థమవుతుంది. కాంగ్రెస్, బీజేపీ ఇతర రాజకీయ ప్రతినిధులు పేపర్ లీకేజీ లాంటి సంక్షుభిత సందర్భంలో సమాజం ఉన్నప్పుడు సద్విమర్శ చేస్తూనే సమాజాన్ని నిరాశ నిస్పృహల నుంచి జాగృతం చేయాల్సిన బాధ్యతను తలకెత్తుకోవలసి ఉన్నది. ఆ బాధ్యతను విస్మరించి ప్రభుత్వంపై, టీఎస్పీఎస్సీపై ఆక్రోశాన్ని వెళ్లగక్కడం వారి వ్యవహారశైలిని తెలియజేస్తున్నది.
దేశంలోనే తెలంగాణ రాష్ట్రం అనేక రంగాల్లో పురోగమిస్తున్నది. అభివృద్ధి వైపు పరుగులు పెడుతున్నది. ఇది కేంద్రంలోని బీజేపీకి కంటగింపుగా మారింది. ఎలాగైనా రాష్ట్ర ప్రభుత్వంపై తమ ఆధిపత్యాన్ని చెలాయించాల న్న దురుద్దేశంతో అనేక ఆటంకాలను సృష్టిస్తూ రాష్ట్ర ప్రభుత్వ పాలనను అస్థిరపరిచే కుట్రలు కొనసాగిస్తున్నది. ఇదే సందర్భంలో టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ ఘటన వారికి ఒక ఆయుధంగా మారింది. టీఎస్పీఎస్సీ తొలి చైర్మన్ ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి ఆధ్వర్యంలో ఐదేండ్లపాటు టీఎస్పీఎస్సీ తన పనితీరుతో దేశంలోనే అగ్రగామి సంస్థగా తనదైన ముద్రను వేసుకున్నది. తర్వాత ఐఏఎస్ ఆఫీసర్ అయిన జనార్దన్రెడ్డి కూడా సమర్థవంతంగా పనిచేస్తూ అన్నిరకాల పోటీ పరీక్షలకు నోటిఫికేషన్లు ఇస్తూ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ఇద్దరు వ్యక్తులు చేసిన తప్పు వల్ల జరిగిన ఈ పేపర్ లీకేజీ సంఘటన లక్షల మంది నిరుద్యోగ యువతను నిరాశలోకి నెట్టిందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఏండ్ల తరబడి అర్ధాకలితో, అరకొర వసతులతో, ఆర్థిక ఇబ్బందులను భరిస్తూ, నిరంతరం లైబ్రరీ నాలుగు గోడల మధ్య పుస్తకాలతో పోటీ పడుతున్నారు యువతీ యువకులు.
ఉద్యమ ఫలితంగా ఏర్పడిన తెలంగాణలో రాష్ట్ర ప్రభుత్వం యువత ఇబ్బందులను అర్థం చేసుకొని వారి భవిష్యత్తుకు పునాదులు వేసే అన్ని రకాల చర్యలకు పూనుకుంటున్నది. ఈ సందర్భంగా కేసీఆర్ మాటలను మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. ‘అన్నం తినో, అటుకులు తినో, ఉపవాసాలు ఉండి అహర్నిశలు తెలంగాణ నినాదమే శ్వాసగా పద్నాలుగేండ్లు కొట్లాడి తెలంగాణ స్వరాష్ట్ర కలను సాకారం చేసుకున్నాం. ఇప్పుడు కపట ప్రతిపక్ష పార్టీల మాటలను పట్టించుకోకుండా తెలంగాణ అభివృద్ధి కోసం నడుం బిగించా’లన్నారు. తెలంగాణ కోసం చావు నోట్లో తలకాయ పెట్టి కొట్లాడిన పెద్దమనిషి ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆయన పేపర్ లీకేజీ వెనుక ఉన్న కుట్రలను, వ్యక్తులను తప్పనిసరిగా బయటికి తీసి శిక్షిస్తారనేది జగమెరిగిన సత్యం. సంఘటన జరిగిన వెంటనే స్పందించి పేపర్ లీకేజీ నేరస్థులను అరెస్టు చేసి సమగ్రమైన విచారణను సిట్ ఆధ్వర్యంలో కొనసాగిస్తున్నారు. ఇది ప్రభుత్వానికి తెలంగాణ యువతపై ఉన్న చిత్తశుద్ధికి నిదర్శనం. కానీ ఈ ఘటనను ఒక బూచిగా చూపెట్టి రాష్ట్ర ప్రభుత్వాన్ని కేసీఆర్, కేటీఆర్ల నాయకత్వంపై అభాండాలు వేసే దుశ్చర్యను ముక్తకంఠంతో అందరూ వ్యతిరేకించాల్సిందే.
ఇవాళ తెలంగాణ నిరుద్యోగ అభ్యర్థులకు, యువతకు గుండె ధైర్యాన్ని నూరిపోయాల్సిన అవసరం రాష్ట్రంలోని అన్ని రాజకీయపార్టీల, ప్రజాసంఘాల పైన ఉన్నది. అంతకంటే గురుతర బాధ్యతను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొని పనిచేస్తున్నది. ఇలాంటి సందర్భంలో తల్లిదండ్రులకు, నిరుద్యోగులకు మానసిక నిబ్బరతను, భావి జీవితంపై ఆశను నిలబెట్టాల్సిన బాధ్యత తెలంగాణ సమాజంపై ఉన్నది. విమర్శలకే పరిమితమైతే తెలంగాణ సగటు మనిషిగా మన చైతన్యాన్ని మనమే కోల్పోయినట్లు. తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగాల విషయంలో నిజాయితీతో, నిష్పక్షపాతంగా వ్యవహరిస్తున్నది. నిరుద్యోగ యువత ఒకసారి ఆలోచన చేయాలని విజ్ఞప్తి.
(వ్యాసకర్త: రాష్ట్ర దివ్యాంగుల సహకార కార్పొరేషన్ చైర్మన్)
-డాక్టర్ కేతిరెడ్డి వాసుదేవ రెడ్డి
95530 86666