పాకిస్థాన్కు సంబంధించిన విషయాలనైతే గోరంతలు కొండంతలుగా చెప్పుకొని, ఎన్నికల్లో కూడా లబ్ధి పొందే కేంద్రంలోని మోదీ ప్రభుత్వానికి చైనా ప్రస్తావన వస్తే చాలు నోరు మూత పడుతుంది. నాటి గల్వాన్ ఘర్షణ కావచ్చు, నేటి తవాంగ్ గొడవ కావచ్చు. వాస్తవాలను చెప్పటానికి కేంద్రం సంకోచిస్తుంది. ప్రస్తుత ఘటనలో మన జవాన్లకు పెద్దగా గాయాలేమీ కాలేదని రక్షణమంత్రి రాజ్నాథ్సింగ్ ప్రకటిస్తే.. మాజీ సైనికాధికారులు మాత్రం 35 మంది గాయపడ్డారని, వీరిలో ఏడుగురి పరిస్థితి విషమమని చెబుతున్నారు. దీనిపై ప్రభుత్వం నుంచి స్పష్టత లేదు గానీ, కేంద్ర హోంమంత్రి అమిత్షా కాంగ్రెస్ హయాం లో చైనాతో జరిగిన ఘర్షణలను ప్రస్తావిస్తూ ఈ అంశాన్నీ రాజకీయం చేసే ప్రయత్నం చేశారు. జనం దృష్టిని మళ్లించటానికా అన్నట్లుగా.. చైనా జవాన్లను లాఠీలతో వీరోచితంగా ఎదుర్కొంటున్న భారతీయ సైనికుల దృశ్యాలతో కూడిన గత ఏడాది వీడియో ఒకటి తాజాగా మీడియాలో విడుదలైంది.
మోదీ హయాంలో మారిన మన విదేశాంగ విధానానికి ఇదొక మచ్చుతునక. సర్వమూ మోదీ చుట్టే తిరుగుతున్నందున ఆయన వ్యక్తిగత ఇమేజీని పెంచేవి మాత్రమే ప్రజల దాకా వస్తున్నాయి. ఆయన ఇమేజీకి నష్టం చేసేవి మరుగున పడుతున్నాయి. గత లోక్సభ ఎన్నికలకు కేవలం రెండు నెలల ముందు పాకిస్థాన్తో జరిగిన బాలాకోట్ ఘర్షణకు ఎనలేని ప్రచారం లభించింది. మన యుద్ధవిమానాలు పాకిస్థాన్లోకి వెళ్లి అక్కడి ఉగ్ర శిబిరాలను ఎలా ధ్వంసం చేశాయో కథలు కథలుగా మీడియాలో వచ్చింది. ఎన్నికల్లో బీజేపీ లబ్ధి పొంది, మోదీ మరోసారి ప్రధాని పదవి చేపట్టారు. కానీ, చైనా భారత భూభాగాన్ని ఆక్రమిస్తున్నదని, అరుణాచల్ ప్రదేశ్లో ఏకంగా గ్రామాలనే నిర్మిస్తున్నదని జాతీయ, అంతర్జాతీయ మీడియా ఉపగ్రహ ఛాయాచిత్రాల సాయంతో వెల్లడిస్తున్నా కేంద్రం నోరు మెదపదు. 2017లో డోక్లాంలో తీవ్ర ప్రతిష్టంభన ఏర్పడినా, ఆ తర్వాత 2020లో గల్వాన్లో ఘర్షణలు తలెత్తి, 20 మంది భారతీయ సైనికులు అమరులైనా కేంద్రం తన వైఖరిని మార్చుకోలేదు.
భారతదేశం అంటే 140 కోట్ల జనాభా అని, వీరి శ్రేయస్సుకు సంబంధించి తాను ఎంతో బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సి ఉంటుందని కేంద్రం భావించటం లేదు. రాత్రికిరాత్రి నోట్లరద్దును ప్రకటించినట్లుగా, ఉన్నపళంగా లాక్డౌన్ విధించినట్లుగా.. రక్షణరంగంలోనూ తనకు తోచిన విధంగా వెళ్తున్నట్టు కనిపిస్తున్నది. గతంలో ప్రభుత్వాలు అనుసరించిన విధానాలనుగానీ, నిపుణుల సలహాలు తీసుకోవటంగానీ, ప్రతిపక్షాలతో ఏకాభిప్రాయ సాధనకు ప్రయత్నించటంగానీ ఏ కసరత్తూ జరగటం లేదు. పైగా గతంలో ఎన్నడూ లేని విధంగా సర్జికల్ స్ట్రైక్స్ వంటి సైన్యానికి సంబంధించిన వీడియోలు విడుదల కావటం అనే కొత్త సంప్రదాయం మొదలైంది. ప్రజలను ఏదో విధంగా ఆకర్షించి, మభ్యపెట్టటానికి ఇది సినిమా కాదు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం భారత్. ఎంతో బాధ్యతాయుతంగా మెలగాల్సిన అవసరాన్ని కేంద్రం ఇకనైనా గుర్తించాలి.