కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం విపక్షాలను భూస్థాపితం చేయాలనుకుంటున్నది. ఈ దురుద్దేశంతోనే దర్యాప్తు సంస్థలైన సీబీఐ, ఈడీ, ఐటీలను జేబు సంస్థలుగా వాడుకుంటున్నది. జాతీయ స్థాయిలో తమకు ప్రత్యామ్నాయంగా ఎదుగుతున్న భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్), ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్)లను విచారణ పేరుతో అడ్డుకోవటం గర్హనీయం.
బీజేపీ పాలన పట్ల ఏవగింపుతో ఉన్న దేశప్రజలు బీఆర్ఎస్, ఆప్ల పట్ల ఆసక్తిగా ఉన్నారు. ఇది రుచించుకోలేని కేంద్ర ప్రభుత్వం ఆ పార్టీలపై కుట్రలు పన్నుతూ ఢిల్లీ మద్యం కుంభకోణం కేసును తిరగతోడుతున్నది. ఢిల్లీ మద్యం నూతన పాలసీపై వచ్చిన ఫిర్యాదుల మూలంగా కొత్త విధానాన్ని రద్దు చేస్తున్నామని, పాత మద్యం విధానమే అమలుచేస్తామని కేజ్రీవాల్ ప్రభుత్వం గతంలోనే ప్రకటించింది. అయినా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం విచారణ పేరుతో పాశవికంగా వ్యవహరిస్తున్నది. ఇందులో భాగంగానే డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాను అరెస్టు చేయడం అత్యంత ఖండనీయం.
కేజ్రీవాల్, కేసీఆర్ జాతీయ రాజకీయాలు చేస్తే తమకు పుట్టగతులుండవని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం బ్లాక్ మెయిల్ రాజకీయాలకు పాల్పడుతున్నది. ఇందులో భాగంగానే ప్రమేయం లేకున్నా చార్జిషీట్లో ఎమ్మెల్సీ కవిత, ఆప్ అధినేత కేజ్రీవాల్ పేర్లను ముందస్తుగా తన జేబు సంస్థలతో ప్రస్తావింపజేసింది. ‘ఒకే దేశం-ఒకే పార్టీ’ ఉండాలన్న బీజేపీ ప్రభుత్వం ప్రశ్నించే పార్టీలను నిర్వీర్యం చేయాలనే కంకణం కట్టుకున్నది. మా తీర్థం పుచ్చుకుంటే వేధింపులు ఉండవని నిర్మొహమాటంగా నీతి వచనాలు చెప్తుండటం బీజేపీకే చెల్లుబాటవుతుంది. రూ.12 లక్షల కోట్ల సంపదను ఆవిరి చేసిన, చీకటి వ్యాపారవేత్త అయిన అదానీపై పార్లమెంట్లో కనీసం చర్చ కూడా చేయలేదు. మోదీ భజన చేసేవారు, కాషాయం జెండా కప్పుకొనే వారు దర్యాప్తు సంస్థలకు నీతిమంతులుగా, సత్యహరిశంద్రులుగా కన్పించడం విడ్డూరం.
మోదీని ‘ఢీ’ కొట్టడం భారత్ వంటి పెద్ద దేశంలో కష్టమేం కాదు. సంకీర్ణ ప్రభుత్వ ఏర్పాటుతో అది సాధ్యమవుతుంది. అయితే సిద్ధాంత వైరుధ్యాలున్న పార్టీలు కలిసికట్టుగా ప్రభుత్వాన్ని కొనసాగించడమూ సులభం కాదు. ప్రజలు నమ్మేంతవరకు వాస్తవాలను వక్రీకరించి అబద్ధాలను ప్రచారం చేస్తూనే ఉండాలని బీజేపీ నిర్ధారించుకున్నది. ఇందులో భాగంగానే నిరంతరాయంగా అబద్ధాల కోసం ప్రచారం కొనసాగిస్తూనే ఉన్నది. రాజకీయ మనుగడ కోసం ఎత్తుగడలను పుట్టుక నుంచే ఆచరణలో పెడుతున్నది కమలం పార్టీ. ఇలాంటి ఆటవిక రాజకీయ ధోరణిలోనే ప్రాంతీయపార్టీల సారథ్యంలోని రాష్ట్ర ప్రభుత్వాలపై హేయమైన ప్రచారాన్ని కొనసాగిస్తున్నది. రాష్ర్టాలకు ప్రధాన శత్రువుగా మారిన బీజేపీ, ప్రచారకులతో సమాజంలో విష సంస్కృతిని వ్యాప్తి చేస్తున్నది. కేసీఆర్ సారథ్యంలోని బీఆర్ఎస్ ప్రభుత్వంతో పాటు పలు రాష్ర్టాల్లోని బీజేపీయేతర ప్రభుత్వాలపైనా అసత్యాలను ప్రచారం చేస్తూ కూలదోసే కుట్రలను ప్రోత్సహిస్తున్నది. ప్రముఖ తత్వవేత్త చెప్పినట్లుగా… ఒక చర్యను ప్రతీకారంతో ప్రేరేపించాలా వద్దా? అని ప్రకటించడానికి ఎటువంటి లక్ష్య ప్రమాణం లేదు. ప్రతీకారం అనేది ఒక లేబుల్ చర్య కోసం గ్రహీతల గుణగణాల ఆధారంగా ఆపాదించబడింది. అధికారం కోసం ఎప్పటికప్పుడు సిద్ధాంతాలకు తిలోదకాలిచ్చే పార్టీలతో ఏర్పడే కూటములు ఎంతోకాలం నిలబడలేవు. ఎనిమిదేండ్లలో ఇలాంటివి ఎన్నో సాక్షాత్కరించాయి.
దేశ సాంస్కృతిక, సాంఘిక జీవితాన్ని శాసించేందుకు బీజేపీ ప్రభుత్వం అప్రజాస్వామికంగా ప్రభుత్వాలను కూలకొడుతున్నది. ఈ దుర్ఘటనలు చూసి కూడా విపక్షాలు అనుసరిస్తున్న పేలవమైన సైద్ధాంతిక ప్రచారాన్ని, వారి బలహీనతలను బీజేపీ సొమ్ము చేసుకుంటున్నది. అందుకే ఎన్నికల్లో మత విద్వేషాలను రెచ్చగొట్టి హిందూ మత పరిరక్షణ మాటున సాగుతున్న ఓటు బ్యాంకు రాజకీయాలను ఇకనైనా అర్థం చేసుకోవాలి. సమాఖ్య స్ఫూర్తిని దెబ్బతీసి, అడ్డదారిలో అధికారం చేపట్టేందుకు లౌకిక గణతంత్ర, ప్రజాతంత్ర భారతదేశంలో విద్వేష దాడులు జరుగుతుండటం అమానవీయం. ఎనిమిదేండ్ల ఎన్డీయే పాలనలో ఈడీ, సీబీఐ కేసుల్లో 95 శాతం విపక్షనేతలే ఉండటం గమనార్హం. ప్రతిపక్షాలను వేధించేందుకు కేంద్రంలోని మోదీ సర్కార్ రాజ్యాంగసంస్థలను ఈడీని ఏ స్థాయిలో ఉపయోగించుకుంటున్నదో 2022, ఆగస్టు 21న బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడు దిలీప్ ఘోష్ చేసిన వ్యాఖ్యలే నిదర్శనం.
దేశ చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా టీఎం సీ నేతలుగా ఉన్న సువేందు అధికారి, ముకుల్ రాయ్పై ఈడీ కేసులు నమోదు చేసింది. నార ద స్టింగ్ ఆపరేషన్ కేసు పేరిట వేధింపులకు గురిచేసింది. బ్యాంకు రుణాల ఎగవేతకేసులో టీడీపీ ఎంపీ సుజనా చౌదరి, సీఎం రమేశ్లకు సీబీఐ నోటీసులు జారీ చేసింది నిజం కాదా? మహారాష్ట్ర కాంగ్రెస్ నేత, మాజీ సీఎం నారాయణ రాణేపై మనీ లాండరింగ్ కేసు, మధ్యప్రదేశ్ కాంగ్రెస్ నేత జ్యోతిరాదిత్య సింథియాపై ఫోర్జరీ కేసు వారు బీజేపీలో చేరాక నిర్వీర్యం అయ్యాయి.
హిమంత్ బిశ్వా 2015లో కాంగ్రెస్లో ఉన్నప్పుడు శారద చిట్ఫండ్ అక్రమాలపై ఆయనపై ఈడీ కేసు నమోదు చేసింది. సీబీఐ కూడా ఆయన ఇంట్లో సోదాలు నిర్వహించింది. బీజేపీ తీర్థం పుచ్చుకోగానే ఆ కేసులన్నీ మటుమాయం కావడం విడ్డూరం. ఢిల్లీ కార్పొరేషన్ ‘మేయర్’ పీఠం దక్కించుకోవడం కోసం మనీశ్ సిసోడియా సహకరించలేదు. దీనికి ప్రతీకారంగానే ఆయనను అప్రజాస్వామికంగా అరెస్టు చేసిందనే విమర్శలు వస్తున్నాయి.
జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పుతానని కరాఖండిగా చెప్పిన కేసీఆర్ను రాష్ర్టానికే పరిమితం చేయాలనీ, తెలంగాణలో అగ్గి రాజేయాలనే ప్రయత్నాలను బీజేపీ ప్రభుత్వం ముమ్మరం చేస్తున్నది. లక్షల కోట్లు దోచుకున్న చీకటి వ్యాపారులను విడిచిపెట్టి, నీతికి నిజాయితీకి మారుపేరైన సిసోడియా వంటి నాయకుల అరెస్టుతో బీజేపీకి ఇక నూకలు చెల్లినట్టేనని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
(వ్యాసకర్త: విభాగాధిపతి, జర్నలిజం శాఖ, కేయూ)
డాక్టర్ సంగని మల్లేశ్వర్
98662 55355