‘ఇంటగెలిచి రచ్చ గెలవాల’ంటారు. కానీ, రెండుచోట్ల ఒకేసారి గెలిస్తే..! దాన్ని సుసాధ్యం చేశారు ముఖ్యమంత్రి కేసీఆర్. రాష్ట్ర సాధకుడిగా ప్రశంసలందుకున్న ఆయన ఇప్పుడు భారతదేశానికి మార్గనిర్దేశకుడిలా మారారు. తెలంగాణ జనం మెచ్చిన నేత.. ఉప ఎన్నిక గెలుపుతో జాతీయ విజేతగా మారిపోయారు! ఆయన సారథ్యంలోని బీఆర్ఎస్ దేశానికి దిక్సూచిలా మారనున్నది.
అన్ని పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్ఎస్ గెలిచింది. భారత్ రాష్ట్ర సమితిగా అధికారిక ఆవిర్భావానికి ముందే రెండు జాతీయ పార్టీలపై టీఆర్ఎస్ ఘన విజయం సాధించింది. ఒకే దెబ్బకు రెండు పిట్టలు అన్నట్లుగా 137 ఏండ్ల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీతోపాటు, 42 సంవత్సరాల్లోనే దేశంలో అతిపెద్ద పార్టీగా అవతరించిన బీజేపీని అథః పాతాళానికి తొక్కేసి దేశానికి ఆశా కిరణంగా మారింది.
పందెం కోడిలా మారి…
‘రోజూ బాదం, పిస్తా, కోడిగుడ్లు, మటన్ కీమా బాగా తిన్న పందెం కోడి.. పోటీల్లో ప్రత్యర్థి కోడిని ఓడించి యజమానికి ఎక్కడ లేని ఆనందం ఇస్తుంది. ఇంక నాకు తిరుగేముంది అనుకున్న ఆ కోడి.. ఎక్కడికెళ్లినా విజయం నాదే కదా అనుకుంది. నాకు నేనే సాటి.. నాకు లేదు పోటీ అని విర్రవీగుతూ ఏకంగా చికెన్ సెంటర్ ముందుకే వచ్చేసింది. తనకున్న అధికార దర్పంతో తల ఎగరేసింది. ఇంకేముంది.. సీన్ కట్ చేస్తే.. ఆ పందెం కోడి కాస్తా.. ఓ ఇంట్లో పలావ్ అయిపోయింది.’
తొడ కొడితే పడగొట్టారు
అచ్చం ఆ పందెం కోడిలాగే వ్యవహరించింది భారతీయ జనతా పార్టీ. తమకు అధికారం లేని రాష్ర్టాల్లో ప్రభుత్వాలను కూల్చడం కోసం ప్రత్యేకంగా ఒక టీమ్నే సమకూర్చుకోవడం కేవలం బీజేపీకే చెల్లింది. చాలా రాష్ర్టాల్లో ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి మరీ అధికారం చేజిక్కించుకుంది. అదే రీతిలో తెలంగాణపై సైతం కుట్రలు పన్నింది క్యాషాయ దండు. కానీ.. అభివృద్ధిలో దేశానికే ఆదర్శంగా ఉన్న తెలంగాణ సర్కారును కూల్చేందుకు పన్నిన కుట్రను ముఖ్యమంత్రి కేసీఆర్ సమర్థవంతంగా తిప్పికొట్టారు. అలా తెలంగాణలోనూ తొడ కొట్టాలని చూసిన క్యాషాయ దండును.. టీఆర్ఎస్ పార్టీయే పడగొట్టింది.
అడ్డంగా దొరికినా బుకాయింపే..
తెలంగాణలో నలుగురు ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి ప్రభుత్వాన్ని కూల్చే కుట్రలు చేసినా.. బీజేపీ నేతలు మాత్రం తప్పును కప్పిపుచ్చుకునే కుట్రలు ఆపలేదు. తొలి నుంచీ ఈ కేసును సీబీఐకి అప్పగించి సిట్టింగ్ జడ్జితో విచారణ చేపట్టాలని బీజేపీ డిమాండ్ చేసింది. పోలీసులు కేసు నమోదు చేయకముందే.. హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. అంతేకాదు.. ఈ కేసు దృష్టి మళ్లించేందుకు రాష్ట్రంలో ఈడీ, ఐటీ దాడులు మొదలు పెట్టించింది. తెలంగాణలోని మంత్రులు, ఎంపీలు, వారి బంధువుల ఇండ్లల్లో తనిఖీలు చేయిస్తోంది. తమ కుట్రలు ఫలించలేదన్న అక్కసుతో ఆధారాల్లేని ఆరోపణలు చేస్తున్నది.
నిలిచి గెలిచిన తెలంగాణ
చేసిన తప్పును కప్పిపుచ్చుకునేందుకు న్యాయస్థానం చుట్టూ తిరిగి, తడి బట్టలతో ప్రమాణాలు చేసిన బీజేపీ నేతలకు చుక్కెదురైంది. న్యాయం తెలంగాణ రాష్ట్రం పక్షానే నిలిచింది. సీబీఐ విచారణతోపాటు సిట్టింగ్ జడ్జి పర్యవేక్షణలో సిట్ విచారణ సాగాలన్న బీజేపీ పిటిషన్ను న్యాయస్థానం కొట్టేసింది. అంతేకాదు.. ఈ కేసులో పట్టుబడ్డ నిందితులకు బెయిల్ ఇచ్చేందుకు సైతం కోర్టు అంగీకరించలేదు. ఇక సిట్ దర్యాప్తు నిరాటంకంగా కొనసాగేందుకు అవసరమైన అన్ని చర్యలకు ఆదేశించింది.
తెలంగాణ రాష్ట్ర సమితి.. భారత్ రాష్ట్ర సమితిగా ఆవిర్భవించింది. అధికారికంగా బీఆర్ఎస్గా మారడానికి ముందే మునుగోడు ఉప ఎన్నిక వచ్చింది. ఈ ఎన్నికలో ఎలాగైనా గెలవాలని క్యాషాయం పార్టీ ఎన్నో కుట్రలు పన్నింది. నోట్ల కట్టలు పంచేందుకు డబ్బు సంచులు దింపింది. అయినా సరే.. తెలంగాణ ఓటర్లు ఇంటి పార్టీ టీఆర్ఎస్కే పట్టం కట్టారు. మునుగోడు ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్లకు కర్రు కాల్చి వాత పెట్టారు. గులాబీ పార్టీకి ఘన విజయం అందించి రెండు జాతీయ పార్టీలకు బుద్ధి చెప్పారు. సీటుకు నోటును తెరపైకి తెచ్చిన బీజేపీకి వేటు వేస్తే.. అధికారం కోసం జోడో యాత్ర చేస్తున్న రాహుల్గాంధీకి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారు. ఇలా మునుగోడు ఎన్నికతో ఇంట గెలిచిన టీఆర్ఎస్.. బీఆర్ఎస్గా పూర్తిగా ఆవిర్భవించకముందే ఎన్నో ఏండ్ల చరిత్ర కలిగిన రెండు జాతీయ పార్టీలకు గట్టి షాక్ ఇచ్చింది. జాతీయ రాజకీయాల్లోకి రాకముందే రెండు ప్రధాన పార్టీలకు ముచ్చెమటలు పట్టించింది. సవ్యసాచి అయిన సీఎం కేసీఆర్.. వచ్చే ఎన్నికల్లో ఇటు రాష్ట్రంలో, అటు దేశంలో తెలంగాణ సత్తా చాటేందుకు సిద్ధమయ్యారు.
-గాజుల నాగార్జున