ఉమ్మడి రాష్ట్రంలోని కాంగ్రెస్ పాలనలో తెలంగాణ ప్రాంతమంతా ‘హస్త’వ్యస్తమే. కానీ, తెలంగాణ సిద్ధించిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో తెలంగాణ ప్రజల బతుకుచిత్రం మారింది. ఉద్యమ నేత కేసీఆర్ పగ్గాలు చేపట్టింది మొదలు ప్రగతి రథచక్రాలు పరుగులు పెడుతున్నాయి. సంక్షేమ ఫలాలు ప్రజలకు చేరువయ్యాయి. సాగునీటికి ప్రాధాన్యం ఇవ్వడంతో దుర్భర పరిస్థితులు దూరమయ్యాయి. సంక్షేమ పథకాల అమలుతో పేదల కష్టాలు తొలగిపోయాయి. సమైక్య పాలన నుంచి విముక్తి లభించినాక స్వరాష్ట్ర ఆకాంక్షలను తెలంగాణ సమాజం ఆస్వాదిస్తున్నదనడంలో ఏ మాత్రం సందేహం లేదు.
నవంబర్ 30న జరుగనున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ విజయభేరి మోగించడం ఖాయమని ఇప్పటికే పలు సర్వేలు జోస్యం చెప్తున్నాయి. విపక్షాలకు చెందిన అగ్రనేతలు కూడా ఈసారి మళ్లీ కేసీఆర్ సర్కారే అని బహిరంగంగానే అంగీకరిస్తున్నారు. దక్షిణాదిలో నిరంతరాయంగా సుదీర్ఘకాలం సీఎంగా కొనసాగిన చరిత్ర తమిళనాడు అగ్రనేత కామరాజ్ నాడార్ పేరిట ఉన్నది. 1954 ఏప్రిల్ 13 నుంచి, 1963, అక్టోబర్ 2 దాకా తొమ్మిదేండ్ల 5 నెలల పాటు ఆయన మద్రాస్ రాష్ట్ర సీఎంగా ఉన్నారు. అయితే ఇక యావత్ దక్షిణాదిలో ఏకబిగిన సుదీర్ఘకాలం ముఖ్యమంత్రిగా కేసీఆర్ రికార్డు సృష్టించనున్నారు.
కేంద్రంలో బీజేపీ పాలన, రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన ప్రజలకు తెలిసిందే. అందుకే మరోసారి కేసీఆర్ ప్రభుత్వమే రావాలని ప్రజలు ఆకాంక్షిస్తున్నారు. కేసీఆర్ పదేండ్ల పాలన అనేక సంక్షేమ పథకాలతో తమ జీవన విధానంలో మార్పుకు కారణమైందని ప్రజల నమ్మకం. అలాంటి కేసీఆర్ను కాదని కాంగ్రెస్, బీజేపీలకు అవకాశం ఇస్తే గోసపడతామనే భయం జనాన్ని వెంటాడుతున్నది. అందుకే ప్రజలు నవంబర్ 30 కోసం ఆత్రంగా ఎదురుచూస్తున్నారు. ఎప్పుడెప్పుడు కారు గుర్తుపై ఓటు నొక్కుదామా అని ఉత్సాహంగా ఉన్నారు. నాడు ఉద్యమాన్ని విజయతీరం చేర్చిన నాయకుడిగా, నేడు స్వరాష్ర్టాన్ని ప్రగతిపథంలో నడిపిస్తున్న పరిపాలనాదక్షుడిగా కేసీఆర్ స్థానం చరిత్రలో పదిలమై ఉన్నది. నవంబర్ 30న జరగబోయే ఎన్నికల్లో గులాబీ పవనాలు బలంగా వీస్తాయనడంలో అనుమానం లేదు. ఎక్కడ చూసినా కారు స్పీడే, గులాబీ హోరే కనిపిస్తున్నది. కేసీఆర్పై ప్రజల నమ్మకానికి ప్రజాభిమానానికి ఈ ఎన్నికలు చిహ్నంగా నిలుస్తాయి. ‘ది లీడర్ లెజండరీ’కి తెలంగాణ ప్రజలు ఇచ్చే అపూర్వ కానుక హ్యాట్రిక్ విజయం కానున్నది.
కోలేటి దామోదర్, 98491 44406
(వ్యాసకర్త: రాష్ట్ర పోలీస్శాఖ హౌజింగ్ కార్పొరేషన్ చైర్మన్)