ఎన్నికల్లో గెలిచేందుకు ఏ పార్టీకైనా ఒక వ్యూహం ఉంటుంది. కానీ బీఆర్ఎస్కు అంతకు మించి ఒక థియరీ (సిద్ధాంతం) ఉంది. ఇతర పార్టీలు తమ వ్యూహాలను ఎన్నికల సమయంలో అమలు చేస్తాయి. బీఆర్ఎస్ థియరీ మొత్తం అయిదేండ్ల పాటు నిరంతరం అమలు జరుగుతూనే ఉంటుంది. ఆ థియరీలో అయిదు అంశాలు ఉండటాన్ని గమనించవచ్చు.
ఈ మొత్తం అయిదు అంశాల్లోనూ బీఆర్ఎస్కు మాత్రమే ప్రత్యేకమైన, నిజమైన థియరీ, ఫిలాసఫీ ఇక్కడ ఉన్నది. ఓపెన్ మైండ్తో, కళ్లు తెరిచి, సినిసిజం లేకుండా ఆలోచించగల వారికి ఇవి అన్నీ ఎదురుగా కనిపిస్తున్నవే. ఇదంతా ఎన్నికలకు పరిమితమైన వ్యూహమో, ఎత్తుగడో కాదు.
ఒకటి: ఫలానా రంగం, ఫలానా తరగతి అంటూ గాక అన్ని రంగాలకు, అన్ని తరగతులకు వర్తించేటట్లు జరిగే సాధారణ అభివృద్ధి, రెండు: నిర్దిష్టంగా అవసరమైన వివిధ సామాజిక వర్గాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి. ఇందులోకి అగ్ర వర్ణాలకు చెందిన పేదలు కూడా వస్తారు. అదే విధంగా సంక్షేమం-అభివృద్ధి అనేవి విడివిడిగా కాక కలిసిపోయి ఉంటాయి. రెండింటిని కలిపి ఒకే యూనిట్గా చూడాలి. ఎందుకోసమన్నది తర్వాత విచారిద్దాం. మూడు: తెలంగాణ ప్రాంతీయ సంస్కృతిని, దాని వెనువెంట వివిధ సామాజిక తరగతులన్నింటి ప్రత్యేక సంస్కృతులను కూడా పరిరక్షించి ప్రోత్సహించడం. నాలుగు: భారతదేశ నిర్మాణంలో, స్వభావంలో ప్రతిఫలించే చారిత్రక లక్షణమైన వైవిధ్యత పరిరక్షణ కోసం, రాజ్యాంగం హామీ ఇచ్చిన ఫెడరలిజం కోసం గట్టిగా నిలబడటం. అయిదు: బీఆర్ఎస్ నిన్నటి వరకు ప్రాంతీయ పార్టీగా ఉన్నప్పుడు కూడా దేశ ప్రయోజనాలను అన్ని విధాలుగా గుర్తెరిగి వ్యవహరించడం. ఇందులో మొదటిది, చివరిది తప్ప తక్కిన మూడు బీఆర్ఎస్కు ప్రత్యేకమైనవి. ఆ మూడింటిలో ఫెడరలిజం ఇతర ప్రాంతీయ పార్టీలకు వర్తించేది కదా అని ఎవరైనా అనవచ్చు. అట్లా ఇతర రాష్ర్టాలకు వెళితే తిరిగి చర్చ మరో రూపం తీసుకుంటుంది. కనుక ప్రస్తుత చర్చను తెలంగాణకు పరిమితం చేసి చూద్దాము.
అట్లా ఈ అయిదు అంశాలు కలిసి ఒక థియరీ అవుతున్నాయి. ఎన్నికల వ్యూహం అనేది కేవలం ఎన్నికల కాలానికి పరిమితమయ్యేది. తక్కిన కాలానికి సంబంధించి ఇతర పార్టీలు కూడా తమ విధానాలు అంటూ తమ తమ పత్రాలను రూపొందించటం నిజమే. కానీ తాము అధికారంలో ఉన్నప్పుడు వాటిని అమలు చేయనందు వల్లనే ఓడిపోయి, ఎన్నికల సమయంలో ఒక ఎత్తుగడగా మరిన్ని హామీలతో వ్యూహాలు రచిస్తుంటాయి. అదొకటి కాగా, అంతకన్నా ముఖ్యంగా ప్రస్తుత చర్చలో చెప్పేది ఒకటున్నది. పైన పేర్కొన్న అయిదు అంశాల్లో మొదటిది, చివరిది తప్ప మిగిలిన మూడూ బీఆర్ఎస్కు ప్రత్యేకమైనవి. అవి తమ మౌలికమైన ఫిలాసఫీలో భాగమైనవి. అధికారంలో ఉండటం, ఉండకపోవటం అనే దానితో నిమిత్తం లేకుండా వాటిని ఒక విశ్వాసంగా చేసుకుని మాట్లాడేవి. అందుకే వీటికి తక్కిన రెండింటితో కలిపి థియరీ, ఫిలాసఫీ అనే ఉన్నతమైన స్థానాన్ని ఇస్తున్నాయి.
ఈ థియరీ బీఆర్ఎస్ పార్టీకి కేవలం ఎన్నికలతో సంబంధం లేకుండా మొత్తంగా తన రాజకీయ ధర్మానికి, పరిపాలనా దృక్పథానికి వర్తించేది. అది పైన పేర్కొన్న అయిదు అంశాల రూపంలో నిరంతరం ప్రతిఫలించేది. కేసీఆర్ ఆధ్వర్యాన గత తొమ్మిదేండ్లకు పైగా సాగుతున్న పరిపాలనను ఈ అయిదు కోణాలలోకి వర్గీకరించి పరిశీలించినట్లయితే, ఈ మాటలు ఎంత వాస్తవమో ఎవరైనా గ్రహించగలరు. ఈ విషయాన్ని సాధారణ ప్రజలు ఇంత విచక్షణాయుతంగా గమనించకపోవచ్చు. కానీ వాటన్నింటినీ వారు సామూహికంగానో, తమ తమ పరిధులలోనో అనుభవిస్తున్నవారే, ఆలోచనలు చేస్తున్నవారే.
ఇప్పుడు పైన ప్రస్తావించిన అయిదు అంశాలను కొద్ది వివరంగా చెప్పుకుందాం.
మొదటిది: అన్ని రంగాలకు, అన్ని వర్గాలకు వర్తించే అభివృద్ధి అన్న మాటకు ప్రత్యేకంగా నిర్వచనం అక్కరలేదు. ఈ విధమైన అభివృద్ధితో రాష్ట్రంలో అన్ని రంగాలు మెరుగు పడుతూ, అన్ని తరగతుల వారు కూడా ప్రత్యక్షంగానో, పరోక్షంగానో లాభపడతారు. ఈ అభివృద్ధి వాస్తవంగా జరుగుతున్నదనేందుకు రాష్ట్ర స్థాయి నుంచి జాతీయ, అంతర్జాతీయ స్థాయిల వరకు తరచూ వెలువడుతున్న నివేదికలు, బీజేపీ ప్రభుత్వం సైతం పార్లమెంటులో చేస్తున్న ప్రకటనలు, కుప్పతెప్పలుగా వస్తున్న పెట్టుబడులు, అవార్డులే తార్కాణం. క్షేత్ర స్థాయి విచారణలు చేస్తున్న వారితో సాధారణ ప్రజలు చెప్తున్న మాటలు తిరుగులేని రుజువు.
రెండవది: మొదటి నుంచి వెనుకబడిన సామాజిక వర్గాలతో పాటు, అగ్ర వర్ణాలలో సామాజికంగా కాకున్నా ఆర్థికంగా, విద్యాపరంగా వెనుకబడినవారు, అట్లాగే అల్ప సంఖ్యాక వర్గాల అభివృద్ధి, సంక్షేమాలు. ఇందులో సంక్షేమం అన్నది తిండి, బట్ట, ఇల్లు, కనీస అక్షరాస్యత, ప్రాథమిక చికిత్సలు మాత్రమేననే పరిమిత నిర్వచనం ఒకటి మొదటి నుంచి ఉంది. అవి సమకూర్చి ఆ వర్గాలను బతికించి ఉంచటం, వారు ధనిక వర్గాల కోసం పనులు చేయగలిగేటట్లు చూడటం, ఈ అవసరాలు గడవని వారు తిరుగుబాట్లు చేయకుండా ఇటువంటివి సమకూర్చి జాగ్రత్త పడటం అన్నది ఒక థియరీ. కనీసం ఆ విధమైన థియరీని, తమ హామీలనైనా సరిగా అమలు పరచటంలో విఫలమై ఇతర పార్టీలు ప్రజల నమ్మకాన్ని పోగొట్టుకున్నాయి. కానీ కేసీఆర్ వీటిని అమలు పరచటమే గాక ఆయన థియరీలో ఇందుకు ఒక కొత్త నిర్వచనం ఉంది. ఈ వర్గాలను కేవలం బతికించి ఉంచటం కాదు, వారికి తమ కాళ్లపై తాము నిలబడే స్వయం పోషకావకాశాలు, ఆర్థిక సాధికారత కల్పించి, సామాజిక బానిసత్వం నుంచి బయట పడేటట్లు కూడా చేసి, తమ పిల్లలను కేవలం కనీస అక్షరాస్యతకు పరిమితమయ్యేటట్లు కాకుండా మంచి విద్యాబుద్ధులతో జీవితంలో ఉన్నత స్థాయికి ఎదిగేటట్లు చేయటం.
ఇందుకు రెండు గొప్ప ఉదాహరణలు రైతు బంధు, దళిత బంధు. రైతు బంధుతో పాటు అనేక ఇతర వ్యవసాయ సంబంధ పథకాల ద్వారా లక్షలాది చిన్న రైతులను, దళిత బంధు ద్వారా వేలకు వేల దళిత కుటుంబాలను మొత్తం దేశ చరిత్రలోనే కమ్యూనిస్టులతో సహా ఏ పార్టీ ప్రభుత్వం కూడా చేయని విధంగా నిలబెడుతుండటం. ఈ రెండవ అంశానికి సంబంధించిన ఇటువంటి ఉదాహరణలు మరెన్నయినా చెప్పవచ్చు.
మూడవది: చాలామంది అభివృద్ధి వాదులు, అభ్యుదయ వాదులు గ్రహించనిది ఏమంటే, సమాజంలోని వివిధ తరగతుల వారికి స్థానికమైన, కులపరమైన, తెగపరమైన ప్రత్యేక దేవతలు, విశ్వాసాలు, సంస్కృతులు ఉంటాయి. వారికి తమ అభివృద్ధి ఎంత ముఖ్యమో ఈ విశ్వాసాలు, దేవతలు కూడా అంత ముఖ్యం. అంతే కాదు, క్లిష్ట పరిస్థితులు ఎదురైతే అభివృద్ధినైనా వదులుకుంటారు గానీ తమ దేవతలను, విశ్వాసాలను వదులుకోరు. కనుక నాయకుని థియరీలో మొత్తం తెలంగాణకు సంబంధించి ప్రాంతీయ సంస్కృతికి ఎంతటి స్థానం ఉంటుందో, ఈ బహుళ సంస్కృతులకు కూడా అటువంటి స్థానం ఉండాలి. గుర్తింపు, ప్రోత్సాహాలు ఇవ్వాలి. అది ఒక ప్రాంతీయ సంస్కృతిని వికేంద్రీకృత ప్రజాస్వామిక దృష్టితో చూసి, అంతే వికేంద్రీకృతమైన ప్రజా సంస్కృతికి సముచిత స్థానం కల్పించటమవుతుంది. అందువల్ల తెలంగాణ భావనకు సమగ్ర స్వరూప స్వభావాలు ఏర్పడి పునాదులు బలపడతాయి. గత తొమ్మిదేండ్లుగా కేసీఆర్ థియరీ ఇందుకు అనుగుణంగా పలు చర్యలు తీసుకుంటున్నది కూడా. ఇంకొకవైపు తెలంగాణ సంస్కృతితో ఫెడరల్ భావనలు చెక్కు చెదరకుండా నిలుస్తాయి.
నాల్గవది : ఫెడరలిజం విషయమై కేసీఆర్ వాదనలు, కృషి గురించి కొత్తగా రాయవలసిందేమీ లేదు. టీఆర్ఎస్ జాతీయ పార్టీగా మారిన తర్వాత కూడా ఇందులో మార్పేమీ లేదు. ఇది మౌలికంగా మన రాజ్యాంగం చెప్పిన విషయం. బలమైన రాష్ర్టాలు, బలమైన కేంద్రం అన్నదే మొదటి నుంచి ఆయన విధానం. జాతీయ పార్టీలని చెప్పుకునేవి ఈ రాజ్యాంగ ప్రవచనానికి విరుద్ధంగా కేంద్రాధికారాలను పెంచుకుంటూ, రాష్ర్టాల అధికారాలను హరించుతుండటం వల్లనే మొదటి నుంచి సమస్య వస్తున్నది. కనుక ఈ పరిస్థితి మారాలన్నది కేసీఆర్ థియరీలో ఒక ముఖ్యమైన భాగం.
అయిదవది: జాతీయవాదం, జాతీయ ప్రయోజనాలన్నవి ఏ పార్టీకి అయినా సహజమైన వైఖరి అవుతాయి. బీఆర్ఎస్ విషయంలో అది అందుకు అనుగుణంగానే ఉంటున్నది. మొత్తం మీద మనం ఈ చర్చ చేసిన మీదట, ఇతర పార్టీలకు, బీఆర్ఎస్కు గల మౌలికమైన తేడాలు ఎటువంటివో, అది ఏ విధమైన థియరీయో లేక ప్రజల కోసం, తెలంగాణ కోసం కట్టుబడిన ఫిలాసఫీయో అర్థం కావటం కష్టం కాదు.
-టంకశాల అశోక్