కోల్కతా: నకిలీ మిత్రుల పట్ల జాగ్రత్తగా ఉండాలని బీజేపీ నేత ఆ పార్టీని హెచ్చరించారు.
రాజకీయ ఆశ్రయం కోసం బీజేపీ వైపు చూస్తున్న తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) ఫిరాయింపుదారులను పార్టీలో చేర్చుకునే విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. (Swapan Dasgupta) టీఎంసీలో ముదురుతున్న రాజకీయ సంక్షోభంపై బీజేపీ ఎమ్మెల్యే స్వపన్ దాస్గుప్తా బుధవారం స్పందించారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత ఆ ప్రాంతీయ పార్టీలో నెలకొన్న అంతర్గత అలజడి నేపథ్యంలో రాజకీయ ఆశ్రయం కోసం అసంతృప్త టీఎంసీ నేతలు బీజేపీ వైపు చూస్తున్నారని తెలిపారు. అయితే కేవలం రాజకీయ పునరుద్ధరణ కోసమే బీజేపీని ఒక వేదికగా వాడుకోవాలని చూస్తున్న అవకాశవాద ఫిరాయింపుదారులను పార్టీ అనుమతించకూడదని ఆయన స్పష్టం చేశారు.
కాగా, టీఎంసీ అంతర్గత సమస్యల పట్ల తనకు పెద్దగా సానుభూతి లేదని స్వపన్ దాస్గుప్తా తెలిపారు. ప్రస్తుత పరిణామాలన్నీ ఆ పార్టీ సొంత రాజకీయ సంస్కృతి ఫలితమేనని అన్నారు. అయితే బెంగాల్ రాజకీయాల్లో మార్పుల నేపథ్యంలో పార్టీ మారాలని చూస్తున్న టీఎంసీ నేతలతో వ్యవహరించేటప్పుడు బీజేపీ అత్యంత అప్రమత్తంగా ఉండాలని ఆయన నొక్కి చెప్పారు.
మరోవైపు మాజీ టీఎంసీ నాయకులను ఎలాంటి పరిశీలన లేకుండా స్వాగతించడం వల్ల ఆ పార్టీలో పాతుకుపోయిన హింస, అవినీతి, రాజకీయ బెదిరింపుల సంస్కృతి బీజేపీలోకి దిగుమతి అయ్యే ప్రమాదం ఉందని స్వపన్ దాస్గుప్తా హెచ్చరించారు. ‘తమ గత పాపాలను కడుక్కోవాలనే ఉద్దేశంతో ఈ రోజు మనకు దగ్గరవుతున్న నకిలీ మిత్రుల పట్ల బీజేపీలోని మనం ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలి’ అని ట్వీట్ చేశారు.
అయితే పశ్చిమ బెంగాల్లో ‘రాజకీయ ప్రక్షాళన’ జరుగాలని స్వపన్ దాస్గుప్తా పిలుపునిచ్చారు. స్వల్పకాలిక రాజకీయ ప్రయోజనాల కంటే సైద్ధాంతిక నిబద్ధతకు, సంస్థాగత సమగ్రతకు బీజేపీ ప్రాధాన్యత ఇవ్వాలని తెలిపారు. బెంగాల్లో పార్టీకి లభించిన ఈ భారీ విజయం, దాని సూత్రాలతో రాజీ పడటం ద్వారా రాలేదని ఆయన స్పష్టం చేశారు.