భారత రాష్ట్ర సమితి ఆవిర్భావం తరువాత తొలిసారిగా నిర్వహించిన ఖమ్మం బహిరంగ సభ విజయవంతం కావడం జాతీయ రాజకీయాలలో పెను మార్పునకు సూచిక. బీఆర్ఎస్కు కావలసిన సైద్ధాంతిక బలం, కార్యాచరణ విషయంలో కేసీఆర్కు స్పష్టత ఉన్నదనేది ఈ సభ వల్ల మరోసారి తెలిసిపోయింది. ఖమ్మం సభలో రెండు స్పష్టమైన సంకేతాలు కనిపించాయి. ఒకటి- దేశంలోని విభిన్న రాజకీయ శక్తులు బీఆర్ఎస్ ప్రాధాన్యాన్ని గుర్తించాయని సభకు వచ్చిన విశిష్ట అతిథులను బట్టి తెలిసిపోయింది. కొందరు ప్రముఖులు ఇంకా ముందే, బీఆర్ఎస్ అవతరణ సభకే రావడం విస్మరించలేనిది. రెండు- బీఆర్ఎస్ స్వభావాన్ని, విధానాలను కేసీఆర్ సంక్షిప్తంగానైనా దేశ ప్రజలకు వెల్లడించారు. తెలంగాణ నమూనాను చూసిన వారికి ఇవి సాధారణమే అనిపించినా, దేశవ్యాప్తంగా చర్చనీయాంశం కావడం ఖాయం.
కేసీఆర్ జాతీయ రాజకీయాలలో ప్రవేశించడం హఠాత్ పరిణామం కాదు. గత ఎన్నికల నాటి నుంచే ఆయన వివిధ నాయకులను కలుస్తూనే వ్యూహ రచన సాగిస్తున్నారు. ప్రతిపక్షాల బలాలు, బలహీనతలు అర్థమయ్యాయి కనుకనే, బీజేపీయేతర జాతీయ పక్ష ఆవశ్యకతను గుర్తించి, ఆ శూన్యాన్ని భర్తీ చేయాలని నిశ్చయించుకున్నారు. దీంతోపాటు దేశవ్యాప్తంగా ఉన్న ప్రగతిశీల, సామాజిక న్యాయ శక్తులను, రైతులను ఏక తాటిపైకి తెచ్చే కార్యక్రమాన్ని ఎంచుకున్నట్టు కనిపిస్తున్నది. ఉత్తర ప్రదేశ్, బీహార్ రాష్ర్టాలలోని సామాజిక న్యాయశక్తులు రాజకీయంగా బలోపేతం అయ్యాయి. 1960 దశకంలో వాటిని కాంగ్రెస్ పార్టీ అణగదొక్కినా సరే, అంతరించి పోకుండా మళ్ళా తమ సత్తా చాటుకుంటున్నాయి. గతంలో తేజస్వి యాదవ్, ఖమ్మం సభకు అఖిలేశ్ యాదవ్ రాక ఈ కోణంలో ఎంతో ప్రాధాన్యం గలది. కేరళ ముఖ్యమంత్రి విజయన్, సీపీఐ నాయకుడు డి. రాజా హాజరు కావడానికీ అంతే ప్రాధాన్యం ఉన్నది. ఇప్పుడు కొత్త రాజకీయ శక్తి ఆప్ ప్రకటించిన సంఘీభావాన్ని తక్కువగా అంచనా వేయలేము.
ఖమ్మం సభకన్నా చాలాకాలం ముందు నుంచే కేసీఆర్ తన జాతీయ అజెండాను తరచు వెల్లడిస్తూనే ఉన్నారు. నాటి స్వాతంత్య్ర యోధులు, రాజ్యాంగ నిర్మాతలు ఆశించిన నవభారతాన్ని నిర్మించడమే కేసీఆర్ అజెండా అనేది ఖమ్మం సభలో మరోసారి వెల్లడైంది. పబ్లిక్ రంగాన్ని కాపాడుకోవడం, సంక్షేమ పథకాలను అమలు చేయడం ఈ కోవకు చెందినవే. అగ్నిపథ్ రద్దు, మహిళా రిజర్వేషన్, రైతులకు ఉచిత విద్యుత్ వంటి విధానాలను ప్రకటించడం కేసీఆర్ సాహసోపేత మనస్తత్వానికి నిదర్శనం. 2014లో పోలింగ్ ముగిసి ఫలితాలు రాకముందే, తాము ఎలాగూ గెలుస్తామనే ధీమాతో కేసీఆర్ తెలంగాణ అభివృద్ధి కోసం కార్యాచరణ ప్రారంభించారు. నవభారత నిర్మాణానికి ప్రణాళికా రచనను కూడా ఇప్పటికే చేపట్టి ఉంటారు. భవిష్యత్తులో అలవోకగా అమలు చేసి తీరుతారు.