ప్యాంగ్యాంగ్, జూన్ 7: ఉత్తర కొరియాను అణ్వాయుధ రహిత దేశంగా మారుస్తామంటూ అమెరికా చేసిన ప్రకటనపై కిమ్ జోంగ్ ఉన్ సోదరి కిమ్ యో జోంగ్ ఘాటుగా స్పందించారు. ‘అమెరికాలో కొందరు అధికారులు వాస్తవాలకు దూరమైన, కాలం చెల్లిన తమ కలల నుండి బయటపడలేకపోయారు’ అని ఆమె అన్నారు. ఉత్తర కొరియా తన అణ్వాయుధ కార్యక్రమాన్ని మరింత విస్తరిస్తుందని ఆదివారం ఆమె స్పష్టం చేశారు. అమెరికా ప్రకటనను తప్పుడు సమాచారంగా పేర్కొన్నారు. చైనా అధ్యక్షుడు జిన్పింగ్ ఉత్తర కొరియా పర్యటనకు ఒక రోజు ముందు ఆమె నుంచి ఈ ప్రకటన వెలువడటం గమనార్హం. గత నెలలో చైనా పర్యటనలో డొనాల్డ్ ట్రంప్, జిన్పింగ్..ఉత్తర కొరియా అణు నిరాయుధీకరణపై అంగీకారానికి వచ్చారన్న అంశాన్ని నిర్ధారిస్తూ..యూఎస్ ఒక ప్రకటన విడుదల చేసింది. దీనిని తప్పుడు సమాచారంగా కిమ్ యో జోంగ్ కొట్టిపారేశారు.