దేశంలో నెల రోజుల్లో సాధారణ ఎన్నికలు జరుగబోతున్నాయి. రాజకీయ పార్టీలన్నీ సమర సన్నాహాల్లో మునిగి ఉన్నాయి. తమ మంద, ధన, కండ బలంతో ఓట్లను దండుకునేందుకు ఎత్తులకు పైఎత్తులు వేస్తున్నాయి. వాగ్దానాలకు పదునుపెట్టి ప్రజలపై వదులుతున్నాయి. ఆ క్రమంలోనే జాతీయ పార్టీలుగా చెప్పుకొంటున్న బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు పోటాపోటీగా హామీలు గుప్పిస్తూ ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు తంటాలు పడుతున్నాయి.
వికసిత్ భారత్ పేరుతో, ఫిర్ ఏక్ బార్ మోదీ పేరుతో ప్రజలను ఏమార్చేందుకు బీజేపీ విశ్వ ప్రయత్నాలు చేస్తున్నది. సమర్థ నాయకత్వం చేతిలోనే దేశం భద్రంగా పటిష్టంగా ఉంటుందని చెప్తూ, ఆ అర్థంలో మోదీకి ఎదురేలేదని ఆర్ఎస్ఎస్, సంఘ్పరివార్ శ్రేణులు నమ్మబలుకుతున్నాయి. గత పదేండ్లుగా అధికారంలో ఉన్న మోదీ ఏం సాధించారో, దేశ ప్రజలకు ఉన్న మౌలిక సమస్యలను వేటిని పరిష్కరించారో చెప్పటం లేదు. వికసిత్ భారత్ పేరుతో ప్రజలను మరో మారు వంచించటానికి ముందుకు వస్తున్నారు.
ఈ పదేండ్ల మోదీ పాలన ‘వికసిత భారత్’లో నిరుద్యోగం భయంకర స్థాయికి చేరుకున్నది. ఇది ఎవరో పాలకపక్షాన్ని విమర్శిస్తూ విపక్షం అన్న మాట కాదు. ఈ చేదు నిజం కేంద్ర ప్రభుత్వానికి చెందిన స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ మంత్రిత్వశాఖ తాజాగా వెల్లడించిన పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే (పీఎల్ఎఫ్ఎస్)లో బహిర్గతమైంది. ఆ అధ్యయనం ప్రకారం.. దేశంలో 15 ఏండ్లు, అంతకంటే ఎక్కువ వయసు కలిగిన గ్రాడ్యుయేట్లలో 13.4 శాతం మంది నిరుద్యోగంలో మగ్గుతున్నారు. ఈ సర్వే ఫీల్డ్ వర్క్ జూన్ 2022 నుంచి జులై 2023 మధ్య జరిగింది.
BRS | పదేండ్ల మోదీ ఏలుబడిలో దేశం నిరుద్యోగ భారతాన్ని ఆవిష్కరించిందనడానికి ఇంతకంటే వేరే సాక్ష్యాధారాలు అవసరం లేదు. ఈ కాలంలో నిరుద్యోగ సమస్య ఆందోళనకర స్థాయికి చేరిందని పలు అధ్యయనాలు ఘోషిస్తున్నాయి. కార్పొరేట్ దిగ్గజాల్లో ఒకరైన అజీం ప్రేమ్జీ విశ్వవిద్యాలయం ఈ మధ్య విడుదల చేసిన సర్వే ప్రకారం.. దేశంలో 25 ఏండ్ల లోపు గ్రాడ్యుయేట్లలో 42.3 శాతం నిరుద్యోగులేనని తేల్చింది. ఉన్నత, మాధ్యమిక విద్య పూర్తి చేసిన వారిలో 21.4 శాతం మంది నిరుద్యోగులే. ప్రపంచ ఆర్థిక మాంద్యం వచ్చిన 2008 నుంచి చూసుకుంటే కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక నిరుద్యోగిత రేటు పెరిగిందని నేషనల్ శాంపిల్ సర్వే కుండబద్దలు కొట్టింది. 2023 అక్టోబర్లో నిరుద్యోగిత రేటు 10.05 శాతానికి చేరింది. ఇదీ బీజేపీ పాలనలో దేశం వెలిగిపోతున్న తీరు!
ప్రధాని అభ్యర్థిగా 2014 ఎన్నికల్లో యువతకు మోదీ ఇచ్చిన హామీ ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు. కానీ, తొమ్మిదిన్నరేండ్లలో ఉద్యోగాల భర్తీ ఊసే లేదు. కాకపోగా ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేటుపరం చేయటం, పెట్టుబడుల ఉపసంహరణ పేరుతో ఉన్న ఉద్యోగాలనే ఊడబెరికారు. ఈ పదేండ్ల మోదీ పాలనలో రెండు కోట్ల ఉద్యోగాలు పోయాయి. స్టార్టప్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా, డిజిటల్ ఇండియా నినాదాలు గాలిలో కలిసిపోయాయి. చివరికి ఎక్కడిదాకా వచ్చిందంటే, విధిలేక వీధుల వెంట పకోడీలు అమ్ముకునే పని కూడా ఉపాధి, ఉద్యోగం కిందికే వస్తుందనే స్థాయికి బీజేపీ పెద్దలు భాష్యాలు చెప్తున్నారు.
ఇది నిరుద్యోగులను అపహాస్యం చేయడమే. ఇప్పటివరకు రైతుల, వ్యవసాయ కార్మికుల ఆత్మహత్యల గురించే విన్నాం. ప్రస్తుతం నిరుద్యోగుల ఆత్మహత్యలూ సంభవిస్తున్నాయని నేషనల్ క్రైం రికార్డ్స్ బ్యూరో గణాంకాలు తెలుపుతున్నాయి. దేశాన్ని ముందుకు నడిపించాల్సిన యువత ఉపాధి లేక నిరాశ నిస్పృహలతో బలవన్మరణాలకు పాల్పడటం సమాజానికి చేటు. దేశ జనాభాలో 35 ఏండ్ల లోపు యువత 66 శాతం ఉంటుందని ఒక అంచనా. కోట్లాదిగా ఉన్న వీరికి ఉద్యోగ, ఉపాధి అవకాశాల్లేవు. బీజేపీ ప్రచారం చేసుకుంటున్న ‘అచ్చేదిన్’ అంటే ఇదేనా?
మరోవైపు మోదీ, బీజేపీ నేతలు డబుల్ ఇంజిన్ సర్కార్ అంటూ గప్పాలు పలుకుతారు. అంటే కేంద్రంలో, రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వాలే ఉంటే అభివృద్ధి శరవేగంగా జరుగుతుందని చెప్తున్నారు. ఆ పేరుతో ప్రజలను వంచించి ఇప్పటికే అనేక రాష్ర్టాల్లో ప్రభుత్వాలను ఏర్పాటుచేశారు. ప్రాంతీయ పార్టీల ఏలుబడిలో ఉన్న రాష్ర్టాల్లో అధికారం చేజిక్కించుకునేందుకు డబుల్ ఇంజిన్ సర్కార్ అనే దాన్నే ప్రధాన నినాదంగా చేసి బీజేపీ పబ్బం గడుపుకొంటున్నది. నిజానికి డబుల్ ఇంజిన్ సర్కార్ పేరుతో బీజేపీ, మోదీ చేసిన, చేస్తున్న అభివృద్ధి చూస్తే బీజేపీ నేతలు చేస్తున్న ప్రచారం ఎంత బూటకమో తేట తెల్లమవుతుంది.
కేంద్ర ప్రభుత్వ పరిధిలోని నీతి ఆయోగ్ చేపట్టిన మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ (ఎంపీఐ) అధ్యయనం ప్రకారం… డబుల్ ఇంజిన్ సర్కార్ పేరుతో వరుస విజయాలు సాధిస్తున్న బీజేపీ పాలనలోని ఉత్తరప్రదేశ్ అన్ని రంగాల్లో దిగజారింది. పేదరికంలో దేశంలోనే కడు పేద రాష్ర్టాల్లో మూడో స్థానంలో నిలిచింది. మొదటి స్థానంలో బీహార్, రెండో స్థానంలో జార్ఖండ్ ఉన్నది. అంతేకాదు, పోషకాహార లోపంలోనూ, గర్భిణీ స్త్రీలకు ఆరోగ్య సేవలు అందటంలోనూ బీజేపీ పాలనలోని డబుల్ ఇంజిన్ ప్రభుత్వాలు కడు దయనీయ స్థితిలో ఉన్నాయి. అంతెందుకు దేశానికే రోల్ మోడల్ అని ప్రగల్భాలు పలుకుతున్న గుజరాత్లో ప్రాథమిక విద్య ఎంత అధ్వాన్న స్థితిలో ఉన్నదో ఇటీవలి పదో తరగతి ఫలితాలు వెల్లడి చేశాయి.
గుజరాత్లో 157 పాఠశాలల్లో పదో తరగతిలో జీరో శాతం రిజల్ట్ వచ్చింది! ఇదీ మోదీజీ ఆదర్శ రాష్ట్రంలోని విద్యా ప్రగతి. ఇలా చెప్పుకొంటూపోతే.. బీజేపీ పాలిత రాష్ర్టాలు మిగతా రాష్ర్టాలతో పోలిస్తే అట్టడుగున ఉన్నాయి. అలాగే దేశం విషయానికి వస్తే.. మోదీ అసమర్థ, అవినీతి పాలన గురించి ఎంత తక్కువ చెప్పుకొంటే అంత మంచిది.
దేశం వెలిగిపోతున్నదనీ, అందరికి అభివృద్ధి-అందరికి వికాసం అని చెప్తున్న మోదీ పాలనలో ప్రభుత్వ లెక్కల ప్రకారమే పేదరికం, నిరుద్యోగం పెరిగిపోయింది. తన పాలనలో 20 కోట్ల మందిని పేదరికం నుంచి బయటకు తెచ్చామని మోదీ చెప్తున్నా… మరోవైపు 80 కోట్ల మందికి ఆహారభద్రత కార్డులతో ఆహారం అందిస్తున్నారనే నిజాన్ని దాస్తున్నారు. అంటే దేశ జనాభాలో సగానికంటే ఎక్కువ మంది దారిద్య్రరేఖకు దిగువన ఉన్నారని ప్రభుత్వం చెప్పకనే చెప్తున్నది. ఇలాంటి పరిస్థితుల్లో ‘వికసిత భారత్’ ఎలా అవుతుందో మోదీ భజనపరులే చెప్పాలె. అంతేకాదు, దేశం మునుపెన్నడూ లేని స్థాయిలో అప్పుల కుప్ప అయ్యింది. 2014 దాకా దేశాన్నేలిన 14 మంది ప్రధానులు చేసిన అప్పు రూ.50 లక్షల కోట్లు అయితే, మోదీ పదేండ్ల కాలంలో అది రూ.150 లక్షల కోట్లు దాటింది.
ఇదిలా ఉంటే.. మోదీ పాలనలో కోటీశ్వరులు మరింత కుబేరులై పోతే, పేదలు మరింతగా కడు పేదరికంలోకి దిగజారిపోతున్నారు. మోదీ చెప్తున్న ‘వికసిత్ భారత్’ అంటే అంబానీ, అదానీల భారత్ అని అర్థమేమో బీజేపీ నేతలే చెప్పాలి. దేశ సంపదను, సహజ వనరులను కొద్దిమంది అంబానీ, అదానీ లాంటి కోటీశ్వరుల పరం చేయటం, ప్రభుత్వరంగ సంస్థలను కార్పొరేట్ కంపెనీలకు ధారాదత్తం చేయటమే వికసిత్ భారత్. ఓడరేవులను, విమానాశ్రయాలను సైతం ప్రైవేటు కంపెనీలకు అప్పజెప్పటం లాంటి చర్యలతో మోదీ దేశాన్ని బడా కార్పొరేట్ కంపెనీలకు అమ్మేస్తున్నారు. ఈ నేపథ్యంలో చూస్తే… దేశంలో మోదీది విధ్వంస పాలన, విద్రోహ పాలన. ఆ అర్థంలో మోదీ పెద్ద మోసగాడు. ఈ నేపథ్యంలో బీజేపీకి గానీ, మోదీకి గానీ దేశ ప్రజల ముందుకు వచ్చి ఓట్లు అడిగే నైతిక హక్కు లేనే లేదు.
ఇక కాంగ్రెస్ విషయానికి వస్తే.. తగదునమ్మా అంటూ మోదీ విధ్వంసక, విభజన రాజకీయాలను విమర్శిస్తూ కాంగ్రెస్ ముందుకు వస్తున్నది. రాహుల్ గాంధీ ‘భారత్ జోడో యాత్ర’ చేస్తూ.. సమాజాన్ని కులం, మతం పేరిట విభజన రాజకీయలు చేసే విషపూరిత భావజాలమని బీజేపీని విమర్శించారు. ప్రేమను పంచుతూ.., ప్రజలను ఏకం చేసే పార్టీ కాంగ్రెస్ అని చెప్పుకొంటున్నారు. గత ఆరున్నర దశాబ్దాలుగా దేశాన్ని అన్నివిధాలా నాశనం చేసిన పార్టీగా కాంగ్రెస్ పాపాన్ని మూటగట్టుకున్నది. తాజాగా ఇప్పుడు తామేదో చెస్తామని చెప్పటం ప్రజలను మాయమాటలతో ప్రలోభ పెట్టడమే. దేశానికి ఐదు గ్యారెంటీలు, విషయ, సమస్యపరంగా 25 గ్యారెంటీలతో కాంగ్రెస్ అలవికాని హామీలతో ప్రజల ఓట్లను కొల్లగొట్టేందుకు తంటాలు పడుతున్నది. కానీ గత చరిత్రను చూసిన ప్రజలు కాంగ్రెస్ను నమ్మి మరోసారి మోసపోవద్దని సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నాను.
ప్రధానంగా జాతీయ పార్టీలుగా చెప్పుకొంటూ ప్రజల ముందుకువస్తున్న బీజేపీ, కాంగ్రెస్ రెండూ ప్రజా వ్యతిరేక పార్టీలే. దేశ ప్రజల మౌలిక సమస్యల పరిష్కారం పట్ల చిత్తశుద్ధి లేని పార్టీలే. కాబట్టి తెలంగాణ ప్రజలు సుదీర్ఘ పోరాటాలతో, అనన్య త్యాగాలతో రాష్ర్టాన్ని సాధించిన ఉద్యమ పార్టీ బీఆర్ఎస్ వైపే చూస్తున్నారు. గత పదేండ్లలో రాష్ట్ర అవతరణ తర్వాత రాష్ట్రంలో తాగు, సాగునీటి సమస్యలు మొదలు అనేక మౌలిక సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ ఎంతటి విప్లవాత్మక నిర్ణయాలతో, ఆచరణతో ముందుకు పోయిందో అందరికీ అనుభవమే. అన్నింటా దేశంలోనే తెలంగాణను అగ్రభాగాన నిలిపిన బీఆర్ఎస్ మాత్రమే తెలంగాణ ప్రజల ఆశలు, ఆకాంక్షలు నెరవేర్చే పార్టీగా ప్రజలు గుర్తిస్తున్నారు, ఆదరిస్తున్నారు. ఈ నేపథ్యంలో… రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో తెలంగాణలోని అన్ని పార్లమెంటరీ స్థానాల్లో బీఆర్ఎస్కే ఓటు వేసి గెలిపించి తెలంగాణ అస్తిత్వ చైతన్యాన్ని చాటాలని మిమ్మల్ని కోరుతున్నాను.
(వ్యాసకర్త: మాజీ ఎంపీ, రాష్ట్ర ప్రణాళికా సంఘం మాజీ ఉపాధ్యక్షులు)
– బోయినపల్లి వినోద్ కుమార్