ఉమ్మడి ఏపీలో నాలుగు దశాబ్దాలకు పైగా అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ తెలంగాణను దగా చేసింది. అందులోనూ పాలమూరును కరవుసీమగా మార్చిన ఘనత ఆ పార్టీదే. 2004 నుంచి 2014 వరకు వరుసగా పదేండ్లపాటు అధికారంలో ఉన్న హస్తం పార్టీ కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును గాలికొదిలేసి పాలమూరు రైతుల నోట్లో మట్టి కొట్టింది. స్వరాష్ట్రం సిద్ధించాక బీఆర్ఎస్ ప్రభుత్వం ఆ ప్రాజెక్టును పూర్తి చేసి కల్వకుర్తికి నీరు ఇచ్చి పాలమూరును రతనాల సీమగా మార్చింది.
వెనుకబడిన ఉమ్మడి పాలమూరు జిల్లాను నిండా ముంచింది కాంగ్రెస్ పార్టీయే. పోతిరెడ్డిపాడు ద్వారా ఏపీ నీళ్లు తీసుకుపోతున్నా పదవుల కోసం పాకులాడారే తప్ప కనీసం ప్రతిఘటించలేదు నాటి కాంగ్రెస్ నేతలు, మంత్రులు. ఒక్క కల్వకుర్తి అనే కాదు, ఉమ్మడి పాలనలో తలపెట్టిన ఏ ఒక్క ప్రాజెక్టు కూడా కాంగ్రెస్ సకాలంలో పూర్తి చేయలేదు. అసంపూర్తిగా వదిలేసింది. వాటిని పూర్తి చేసి బీఆర్ఎస్ సర్కార్ రైతులకు నీళ్లు ఇచ్చిందే తప్ప ఏనాడూ ప్రాజెక్టుల పేర్లు మార్చే ప్రయత్నం చేయలేదు.
ఉమ్మడి ఏపీలో దగా చేసింది సరిపోదన్నట్టు.. రాష్ట్ర విభజన సమయంలోనూ తెలంగాణకు కాంగ్రెస్ అన్యాయం చేసింది. రెండు రాష్ర్టాలకు కృష్ణా జలాల పంపకాలు చేపట్టకుండానే రాష్ర్టాన్ని విభజించి నీటి పంచాయితీ పెట్టిందే కాంగ్రెస్. ఆనాడు కేంద్రంలో, రాష్ట్రంలో అధికారంలో ఉన్నప్పటికీ తెలంగాణకు రావాల్సిన న్యాయమైన నీటి వాటాలను తేల్చకపోవడంతోనే నేటికీ ఆ పంచాయితీ తెగడం లేదు. మరి ఈ పాపమెవరిది?
‘రాష్ట్రం మేమే ఇచ్చాం’ అని గప్పాలు కొట్టే కాంగ్రెస్.. ఎన్నడూ విభజన హామీల కోసం పోరాడలేదు. ఆనాడు చేసిన మోసం చాలదన్నట్టు.. కేంద్ర ప్రభుత్వం గత పదేండ్లుగా కృష్ణా జలాల వాటా తేల్చకుండా కాలయాపన చేస్తున్నా కాంగ్రెస్ ఎంపీలు ఏనాడూ నోరు మెదపలేదు. నాడు ఎంపీలుగా ఉన్న ప్రస్తుత ముఖ్యమంత్రి గానీ, మంత్రులు గానీ, ఏఐసీసీ నాయకులు గానీ రాష్ట్ర ప్రయోజనాల కోసం ఒక్కసారి కూడా పార్లమెంట్లో కేంద్రాన్ని ప్రశ్నించలేదు. ఇది మీ చేతగానితనానికి నిదర్శనం కాదా? పాలమూరుపై వల్లమాలిన ప్రేమ ఒలకబోస్తున్న కాంగ్రెస్ నేతలు.. అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లోనే పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా కోసం పోరాడకుండా ఎందుకు చేతులెత్తేశారు? 2004లో అటు కేంద్రంలో, ఇటు రాష్ట్రంలో అధికారంలో ఉండి కూడా జాతీయ హోదా ఎందుకు తీసుకురాలేదు? అది కాంగ్రెస్ నేతల చేతగానితనం కాదా? ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టును ప్రతిపాదించి పదేండ్లలో తట్టెడు మన్ను కూడా తీయకుండా కాంట్రాక్టర్లకు మొబిలైజేషన్ అడ్వాన్సులు ఇచ్చింది కాంగ్రెస్ కాదా?
హస్తం పార్టీ అసంపూర్తిగా వదిలేసిన ప్రాజెక్టులను పూర్తి చేసి, ఆయకట్టును స్థిరీకరించిన ఘనత కేసీఆర్ సర్కారుది. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు 90 శాతం పనులు పూర్తి చేసిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానిది. మిగిలిన ఆ 10 శాతం పనులు పూర్తి చేస్తే గతంలో చేసిన పాపాలకు కొంతైనా ప్రాయశ్చిత్తం కలుగుతుంది. రేవంత్ సర్కార్ చేసిన అతిపెద్ద మోసపూరిత చర్య కృష్ణా ప్రాజెక్టులను కేంద్రానికి అప్పగించడం. వారు చేసిన తప్పులను ప్రజల ముందుంచి.. ‘ప్రాజెక్టులను కేంద్రానికి అప్పగించబోం’ అని వారితోనే అసెంబ్లీలో తీర్మానం చేయించిన ఘనత బీఆర్ఎస్ పార్టీది. ప్రాజెక్టులను అప్పగించలేదని బుకాయిస్తూనే.. తాగునీరు కోసం లేఖ రాసింది నిజం కాదా? కృష్ణా నీళ్లు ఎవరి ఆధీనంలో ఉన్నట్టు?
పల్లెపల్లెనా పల్లెర్లు మొలిచే నా పాలమూరులోన కాడి నుంచి మిషన్కాకతీయతో చెరువుల్లో పూడిక తీసి, పాడుబడ్డ చెరువులను పునరుద్ధరించి, ప్రాజెక్టులను పూర్తి చేసి, వందల సంఖ్యలో చెక్డ్యాంలు నిర్మించి, కొత్త ఆయకట్టును సాగులోకి తెచ్చి, పడావుపడ్డ భూములను బంగారు తునకలుగా మార్చి, రైతన్నలు బంగారం పండించే దాకా తెచ్చింది ఎవరు? బీఆర్ఎస్ కాదా? కేసీఆర్ పాలనలో పాలమూరు ఆకుపచ్చ పైట కప్పుకొన్నదని గర్వంగా చెప్పుకొన్నం. సంతోషపడ్డం. ఉమ్మడి ఏపీలో బోరు, బాయి నీళ్లే మా పాలమూరుకు తాగునీరు. మిషన్ భగీరథతో పాలమూరు దూప తీర్చి, మంచి నీరు రుచి చూపిందే కేసీఆర్. ఈ తంతులో నీళ్ల నిరంజనుడిగా పేరొందిన సింగిరెడ్డి నిరంజన్రెడ్డి కృషి వెలకట్టలేనిది.
అంతటి పునర్నిర్మాణాన్ని మార్పు పేరుతో ధ్వంసం చేస్తున్నది కాంగ్రెస్ సర్కారు. ఉమ్మడి పాలనలో దర్శనమిచ్చిన నెర్రెలు బారిన భూములు, ఎండిన చెరువులు, మత్తళ్లు లేని చెక్డ్యాంలు, తాగునీటి కటకటలు చూస్తుంటే మళ్లా పాత రోజులు వచ్చినట్టే అనిపిస్తున్నది. గొంతు తడారుతున్నది. భవిష్యత్తును తల్చుకుంటేనే భయమేస్తున్నది.
మేడిపల్లి వెంకటేశ్వర్రెడ్డి