రాష్ట్రంలోని మేధావులు, ఆలోచనాపరులు ఊహించినట్లుగానే బీజేపీ తన పనితీరును కనబరుస్తున్నది. కుట్రలను నమ్ముకొని ఎగబాకడం అలవాటైన బీజేపీకి దిగజారడంలో ఎంత లోతుల్లోకైనా వెళ్లగలదనడానికి ప్రశ్న పత్రాల లీకేజీ ఉదంతానికి మించిన ఉదాహరణ మరొకటి ఉండదు. ఎన్ని ప్రయత్నాలు జేసినా, అంతులేని ఆపసోపాలు పడ్డా, కషాయం జెండా మోయడానికి తెలంగాణ ప్రజలు ముందుకురాలేకపోయారు. దీంతో విస్తుపోయిన బీజేపీ నేతలు వికృతాలకు శ్రీకారం చుట్టడం మొదలుపెట్టారు.
పిల్లలు, వాళ్ల చదువుల కోసమే కోట్లాదిమంది తల్లిదండ్రులు రాత్రీ పగలూ చెమటోడు స్తుంటారు. కన్నబిడ్డల భవిత కోసమే నానా తంటాలు పడుతూ బతుకులీడుస్తుంటారు. పరీక్షా పేపర్లలో ఉన్నవి ప్రశ్నలు మాత్రమే కాదు, అందమైన జీవితాలు. వాటిని అడ్డు పెట్టుకొని ప్రభుత్వంపై కుట్రలు చేయాలనే పైశాచికత్వం సైకోలకు మాత్రమే సాధ్యం అవుతుంది. ఇంతలా దిగజారి సర్కార్ను ఇరుకున పెట్టాలని చూడటం దేనికి? ఎందుకింత పగ కేసీఆర్ ప్రజా ప్రభుత్వంపైన? నిజంగా ప్రగతి కాముకుల గుండెలు మండుతున్నాయి.
కేంద్ర దర్యాప్తు సంస్థల బెదిరింపులు, విద్వేష రాజకీయ ఎజెండా కార్యక్రమాలు బెడిసికొట్టడంతో బీజేపీ భీతిల్లింది. దిక్కుతోచని స్థితిలో దారుణాతి దారుణమైన ఎత్తుగడలను ఎత్తుకున్నది. రాచరికాల కాలంలో జరిగే యుద్ధంలో కూడా అన్నిపక్షాలు కొన్ని కట్టుబాట్లను పాటించేవి. చివరికి అమానవీయ ఫ్యాక్షనిజంలో సైతం పిల్లలు, మహిళలకు దాడుల నుంచి మినహాయింపులిచ్చేవారు. కానీ ఇంత దారుణంగా, బరితెగించిన బీజేపీని ఏంజేసినా పాపం లేదని ప్రజలంతా ఈసడించుకుంటున్నారు.
కమలం పార్టీ నేతల అడ్డగోలు అరుపులు, విషం చిమ్మే ఉన్మాదపు చేష్టలు చూసి ఇప్పటికే తెలంగాణ సమాజం అసహ్యించుకుంటున్నది. దీనికితోడు పిల్లల భవితవ్యంతో చెలగాటమాడే పైశాచిక రాజకీయ కుట్రలను తెలంగాణ సహిస్తుందా? యువతరం ఆశలు, ఆశయాలపై వికారపు కుయుక్తులను ఎవ్వరైనా బరించగలరా? స్వయంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడైన బండి సంజయ్ కుట్రదారుడిగా మారి, పదో తరగతి ప్రశ్న పత్రాల లీకేజీకి తెగబడ్డాడనే విషయం బట్టబయలు కావడంతో యావత్ రాష్ట్రం ఉలిక్కిపడ్డది. ఇటీవలి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పోటీ పరీక్షల ప్రశ్నాపత్రాల లీకేజీ నిందితుడైన రాజశేఖర్ సైతం బీజేపీ నేతలకు ఆత్మీయ అనుచరుడే కావడం చూస్తుంటే కాషాయ పార్టీ కర్కశత్వానికి ప్రతీక అన్నది తేటతెల్లమైంది. తెలివిగా తన బతుకును గెలుచుకున్న తెలంగాణ రాష్ట్రంపై ఇంత భయంకరమైన కుట్రలా?
మొన్నటికి మొన్న మోదీ నిషేదించిన బీబీసీ డాక్యుమెంటరీలో గుజరాత్ కోసం ఎన్ని పాపాలు చేశారో దేశమే చూసింది. కశ్మీర్ నుంచి కర్ణాటక దాక కనికరమన్నదే లేకుండా విద్యాసంస్థల్లో సైతం హిజాబ్, హలాల్ వివాదాలను రెచ్చగొట్టిన బీజేపీ నాయకులు, నవతరాన్ని కలుషితం చేయడానికి నిర్లజ్జపు కుట్రలకెలా పాల్పడ్డారో దేశంలోని అన్నివర్గాలూ చూశాయి. పురిటితో వచ్చిన బుద్ధి పుడకలతో కానీ పోదన్నట్టుగా బీజేపీ నైజం కూడా మారదు. నెత్తుటి భాష, కుత్తుకలు తెగనరికే కార్యాచరణ తప్ప ప్రజా బలగంతో మమేకమై ఎదిగే దోరణి బీజేపీ నాయకుల నుంచి ఆశించనేలేమన్నది మరోసారి తేలిపోయింది. 10వ తరగతి పసి మనుసుల కలలను చిదిమేయాలనే పాపపు తలంపు వచ్చినవారిని నయవంచకులనగలం గానీ నాయకులనగలమా? 10వ తరగతి ప్రశ్నాపత్రాల లీకేజీ నిందితుడు ప్రశాంత్తో బండి సంజయ్ ఫోన్కాల్స్, ఛాటింగ్లు బయటికి వచ్చాక కూడా బీజేపీ బుకాయింపులు బుద్ధి జీవులందరికీ అసహ్యం కలిగిస్తున్నాయి.
గుడులు, బడులు, మసీదులు ఏదీ మా నీచ రాజకీయాలకు అనర్హం కాదన్నట్లుగా కమలం పార్టీ నాయకులు ప్రవర్తిస్తున్నారు. అసలు బండి సంజయ్, అరవింద్ లాంటివారు లోక్సభ సభ్యులైన తర్వాత పార్లమెంట్ పరిస్థితి ఊహించడానికే ఎబ్బెట్టుగా మారింది. మాటల్లో మలినం, చేతల్లో వెగటుతనంతో రాష్ట్ర జనానికి తలవంపులుగా మారారు. మోదీ, అమిత్ షాలకు డూడూ బసవన్నల్లా మారిపోయి తెలంగాణ రాష్ట్రంలో కుయుక్తుల క్రీడలాడుతున్నారు. గతంలో గుజరాత్ నుంచి అమిత్ షాను బహిష్కరించినట్లుగానే, తెలంగాణ రాష్ట్రం కూడా కుట్రాజకీయంతో అశాంతికి తెరలేపుతున్న వారిని వదిలించుకోవాలి.
కేసీఆర్ చెయ్యందుకొని గండాలెన్నో దాటిన తెలంగాణ, పచ్చబడి పదిమందికి ఆదెరువుగా మారడమే పాపమా? అన్నిరంగాల్లో అవార్డులకు అడ్డాగా చరిత్ర సృష్టించడమే నేరమా? వెలుగుల రాష్ట్రంపై గుడ్లగూబల్లా పడి పొడవడం దారుణం కాదా? లీకేజీలు, కుంభకోణాలు, దాడులు, దోపిడీలకు నిలయం బీజేపీ పాలిత రాష్ర్టాలు. అసలు భారతదేశాన్నే ఆదానీ కోసం అంగడి సరుకుగా మార్చేశారు. ఈ దుర్నీతికి తలవంచక, అడ్డుగా నిలబడి నిలదీయడమే ముఖ్యమంత్రి కేసీఆర్ చేస్తున్న నేరమా? కేసీఆర్కు తెలంగాణ సకలజనులకు మధ్య ఉన్న బంధాన్ని విడదీయాలని, నీచాతి నీచమైన పనులకు తెగపడటం దేశాన్నేలుతున్న జాతీయ పార్టీ నాయకులు చేయదగినవేనా?
కేసీఆర్ను పగ పట్టడమంటే, తెలంగాణకు శత్రువు గా మారడమే. వారిని దింపడానికి రావడమంటే, తెలంగాణను తగలబెట్టాలనుకోవడమే. ఈ దుష్ట పన్నాగాలు ఎన్నటికీ ఫలితాలనివ్వవు. ఇప్పుడు తెలంగాణ సమాజం బరితెగించిన బీజేపీ నేతలకు కఠిన శిక్షలు పడాలని కోరుకుంటున్నది. రాజకీయాల్లో పోటీతత్వం ఉండాలి కానీ, ఫ్యాక్షనత్వం ఉండరాదు. ఈ ధోరణిని వదిలిపెడితే, మానవ సమూహాన్నే కుంపట్లోకి తోస్తుంది. అందుకే ఇలాంటి రాజకీయ వికృత నాయకత్వాలను వదిలించుకోక తప్పదు.
(వ్యాసకర్త: రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ చైర్మన్)
-డాక్టర్ ఆంజనేయగౌడ్
98853 52242